బెంగాల్ లో బీజేపీదే అధికారం! తేల్చేసిన పీపుల్స్ పల్స్ సర్వే 

దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సంచలనం జరగబోతుందా?  హ్యాట్రిక్ కోసం పోరాడుతున్న మమతా బెనర్జీకి షాక్ తగలనుందా? బెంగాల్ కోటలో కమలం వికసించబోతుందా? అంటే అవుననే చెబుతోంది ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే నివేదిక. బెంగాల్ ఎన్నికలపై ఆ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఇప్పటివరకు చేసిన సర్వేల్లో టీఎంసీకి లీడ్ కనిపించగా.. పీపుల్స్ పల్స్ సర్వేలో మాత్రం బీజేపీ స్పష్టమైన మెజార్టీ వస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా.. 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్‌ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని స్పష్టమైంది. 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి విజయావకాశాలు కన్పిస్తున్నాయి.   39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ-టీఎంసీ మధ్య హోరాహోరీ  పోటీ నెలకొంది.  5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య  గట్టి పోటీ ఉండగా.. మరో 7 సీట్లలో  టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. 

పశ్చిమ బెంగాల్ లో  ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. రీజియన్లు, మతాలు, కులాలు, వివిధ వర్గాల వారీగా సమగ్రంగా పీపుల్స్ పల్స్ సర్వే చేసింది. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు.  మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెప్పారు. దీదీ  ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముందన్నారు. బెంగాల్ లోని మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అబ్బాస్ సిద్దిఖీ కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. 

రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా  కనిపిస్తోంది. నార్త్ బెంగాల్ లోని డార్జిలింగ్, కాళింపోంగ్, జల్పాయిగురి, అలిపుర్దౌర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ స్థానాలుండగా..  వీటిలో ఏకంగా 22 స్థానాల్లో బీజేపీ జోరు కన్పిస్తోంది. మరో 5 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్‌ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్ లో  10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లుండగా.. వీరు కూడా అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతిపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నారని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. 

మైనారిటీ ఓటర్ల ఆధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే. ఇక్కడ మొత్తం  49 అసెంబ్లీ స్థానాలుండగా.. వీటిలో 17 స్థానాల్లో టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో లెఫ్ట్ కూటమికి అనుకూలత లభిస్తోంది. 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ, మరో 4 సీట్లలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా తీవ్రమైన పోటీ నెలకొంది. 2 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ, మరో స్థానంలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది.

సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలోని బిర్భుం, పశ్చిమ వర్దమాన్+పూర్వవర్ధమాన్, నాదియా జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రీజియన్ పరిధిలో 29 శాతం మంది ఎస్సీలు, 5 శాతానికిపైగా ఎస్టీలు ఉన్నారు. మతాల వారీగా విశ్లేషిస్తే 71 శాతానికైగా హిందువులు, 28 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతానికిపైగా బౌద్దులున్నారు.సెంట్రల్ బెంగాల్ పరిధిలోని 49 సీట్లకుగాను 30 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. టీఎంసీకి 11 స్థానాల్లో, లెఫ్ట్ కూటమికి 1 స్థానంలో అనుకూలత కన్పిస్తోంది.
 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జంగల్-మహల్ ప్రాంతంలోని పురూలియా, బంకురా, ఝారాగ్రాం, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 83 శాతానికిపైగా హిందువులు, 8 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతంలోపు బౌద్దులు ఉన్నారు.జంగల్-మహల్ ప్రాంతంలోని 42 అసెంబ్లీ స్థానాలకుగాను 33 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం కన్పిస్తోంది. టీఎంసీకి 5 స్థానాల్లో మాత్రమే అనుకూలత ఉండగా.. మిగిలిన 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

సౌత్ బెంగాల్ పరిధిలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని హుగ్లి, హౌరా, ఉత్తర 24 పరగణాలు, కోల్ కతా,  దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 16 శాతం మంది ఎస్సీలు, 1.5 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ ప్రాంతంలోని 126 అసెంబ్లీ స్థానాలకుగాను 65 స్థానాల్లో బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. 37 స్థానాల్లో టీఎంసీకి సానుకూలత ఉంది. మరో 19 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్ కూటమి, 4 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.సౌత్ బెంగాల్ ఇప్పటివరకు టీఎంసీకి గట్టి పట్టు ఉండగా.. ఈసారి మాత్రం కమలం ప్రభావం కనిపిస్తోంది.