పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే కేంద్ర నిధులు! సంజయ్ సంచలన వ్యాఖ్యలు
posted on Nov 21, 2020 4:33PM
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. కేంద్ర నిధులపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే ప్రభుత్వానికి కేంద్రం నిధులిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్. బీజేపీని సమర్థిస్తున్న యువకులను చాలాన్ల పేర్లతో హింసిస్తున్నారని మండిపడ్డారు. వరద సాయం ఆపాలని తానే లేఖ రాశానని అసత్య ప్రచారం చేశారని చెప్పారు. వరద సాయం నిలిపివేయాలంటూ నాయకుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని ఎస్ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. నిజంగా తానే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం తమపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు బండి. బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదు.. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటుందని బండి సంజయ్ కామెంట్ చేశారు.
సమాజంలో 80 శాతం ఉన్న హిందువుల మనోభావాలే బీజేపీకి ముఖ్యమన్నారు సంజయ్. భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేఖపై ఏ దేవాలయం దగ్గరైనా సీఎం కేసీఆర్తో చర్చకు సిద్దమని చెప్పారు. నిజమైన హిందువు కాదు కాబట్టి.. కేసీఆర్ మక్కా మసీదుకైనా వస్తారని భావించానన్నారు. పేదలకు అందాల్సిన రైతుబంధును పొందుతోన్న కేసీఆర్, కేటీఆర్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతామని చెప్పారు. ఓట్ల కోసమే 40 వేల మంది రోహింగ్యాలను, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.