రాజధాని పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా?

రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చింది. ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది? తదితర వివరాలు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము, రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

 

బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి? ఎక్కడ ఆగిపోయాయి? ఎంత వ్యవయం చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి? వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా?.. ఆ నష్టం ఎవరు భరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.