ఇక్కడ ఒకలా.. ఢిల్లీకి మరోలా! కొవాగ్జిన్ పై జగన్ డబుల్ గేమ్
posted on May 12, 2021 12:00PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించిన విషయాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. దీని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. కొవాగ్జిన్ పై ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కల్లోల సమయంలోనూ దరిద్రపు కులాలు, చుట్టరికాలను లింకు కలుపుతూ మాట్లాడం వివాదాస్పదమైంది. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏంఆర్ తో భాగస్వామ్యం లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను కొంత మంది వ్యక్తులకు ఆపాదించి అత్యంత చౌకబారు విమర్శలు జగన్ రెడ్డి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ సీఎం వ్యాఖ్యలు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దిగజార్చడమేననే విమర్శలు వస్తున్నాయి.
కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. కొవాగ్జీన్ టీకాను భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ కలిసి ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేశాయి. ఒప్పందం ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ తమ నికర అమ్మకాల పై 5% రాయల్టీ ఐసీఏంఆర్ కు చెల్లించాలి. వ్యాక్సిన్ తయారి మేధోసంపత్తి హక్కులు భారత్ బయోటెక్, ఐసీఏంఆర్ లు సంయుక్తంగా పంచుకునే విధంగా ఉభయ సంస్థల మధ్య ముందస్తు అంగీకరం ఉంది. అయితే భారత్ బయోటెక్ కి ఐసీఏంఆర్ నిధులు సమకూర్చలేదు. కాని 22 చోట్ల మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ 28500 మంది పై జరపడానికి నిధులు ఇచ్చింది. కొవాగ్జీన్ మరియు కోవిషీల్డ్ పై వివిధ పరిశోధనల కోసం ఐసీఏంఆర్ 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది
ప్రధాని మోడీకి రాసిన లేఖలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ఐసీఏంఆర్ ద్వారా మేధోసంపత్తి సహకారంతో సాధ్యమైనంత ఏక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని కోరారు. ఇదే మంచిదే కాని కొంత మంది సంబంధం లేని వ్యక్తులకు భారత్ బయోటెక్ ని ఆపాదించి ఎందుకు ప్రకటనలు చేశారన్నది ఆయన తెలపాల్సి ఉంది. జగన్ లేఖ రాసేటప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవాగ్జీన్ ఉత్పత్తి పెంచడానికి సాంకేతికంగా అనుభవం ఉన్న ృ The Department of Biotechnology (DBT) సహకారంతో ఇప్పటికే పని మొదలు పెట్టింది, హైదరాబాద్ లోని శాంత బయోటెక్ తో కూడా ఇప్పటికే భారత్ బయోటెక్ టీకాల ఉత్పత్తి పెంచడానికి కలిసి ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఇవన్ని తెలిసి కూడా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై ప్రధానికి జగన్ లేఖ రాశారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు మీడియా ముందు మీరు ఒకలా మాట్లాడుతూ.. ఇంగ్లీషు లేఖలు మరియ ట్వీట్లు మరోలా చేస్తూ ఢిల్లీకి ఇంకో రకంగా లేఖలు రాస్తూ జగన్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారనే టాక్ వస్తోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీకాలు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు గ్లోబల్ టెండర్లు వెళతామని సీఎం చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే గ్లోబల్ టెండర్లకి ఎలా వెళతారో ఎవరికీ అర్ధం కావడం లేదు. 45 ఏండ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రా వాట నిష్పత్తి ప్రకారం టీకాలు ఇస్తుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు నేరుగా కంపెనీల టీకాల మొత్తం ఉత్పత్తిలో 50% కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే డబ్బున్న రాష్ట్రాలు ముందు చూపుతో అధిక టీకాలు కొనుగోలు చేస్తే, ముందు చూపు లేని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అక్కడి ప్రజలకు శాపం కాకుడదని కేంద్ర ప్రభుత్వం 18 - 44 సంవత్సరాల వయస్సు దేశంలో ఉన్న ప్రజల ఆయా రాష్ట్రం నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు వాటా కల్పించినది. ఇప్పుడు డబ్బు చెల్లించి టీకాలు కంపెనీల ఉత్పత్తి లో మన వాటా తెచ్చుకోవాలి. అయితే తమకు వాటాకు సంబంధించిన వ్యాక్సిన్ కోసం ముందస్తుగా ఆర్డరు చేయలేకపోయింది జగన్ రెడ్డి సర్కార్. అడ్వాన్స్ చెల్లింపులు ద్వారా టీకాల డెలివరీ షెడ్యూల్ కోసం అగ్రిమెంట్ చేసుకోకుండా కాలయాపన చేసి, ఇప్పుడు అటొక రాయి - ఇటొక రాయి వేసి ఇంకా సమయం వృధా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ చెల్లింపులు ఎక్కడ అని విపక్షాలు ప్రశ్నించడంతో.. జగన్ సర్కార్ అడ్డంగా బుక్కై పోయింది. దీంతో తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. పదే పదే పాడిందే పాటరా పాసిపల్ల దాసరి అన్నట్లుగా.. కులాల కుంపటి రాజేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. తన దిగజారుడు చర్యలతో అచేతన ముఖ్యమంత్రి గా జగన్మోహనరెడ్డి మిగిలారనే ప్రచారం జరుగుతోంది.