ఒక మతాన్ని కించపరిచేలా పోస్టులు.. బెంగుళూరులో చెలరేగిన హింస.. ముగ్గురి మృతి 

ఫేస్ బుక్ లో ఒక మతాన్ని కించపరిచేలా పెట్టిన పోస్ట్ బెంగుళూరులో హింసకు దారి తీసింది. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ వల్ల ఈ హింస చోటుచేసుకుంది. పులకేశినగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బంధువు ఒకరు తన ఫేస్ బుక్ అకౌంట్ లో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్ట్ పెట్టినట్లు గా తెలిసింది. దీంతో బెంగళూరులోని DJ హళ్లి, KG హళ్లి, పులకేశి నగర్ ప్రాంతాల్లో దుమారం రేగి అది హింసకు దారి తీసింది. ముందుగా ఎమ్మెల్యే ఇంటి ముందు గుమికూడిన ఆందోళనకారులు ధర్నా చేసి తరువాత రాళ్లు విసిరారు. ఆ తరువాత కొన్ని వాహనాలను కూడా తగులబెట్టారు. ఇదే సందర్భంలో మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫెయిర్ ఇంజన్లను కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటి పక్కనే అయన కొత్తగా కట్టుకుంటున్న మరో ఇంటిని కూడా ధ్వంసం చేయడంతో హింస మరింత పెరిగింది.

 

అంతేకాకుండా డీజే హళ్లిలోని ఓ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేసినట్లు తెలిసింది. ఐతే ఆందోళనకారులు ఎమ్మెల్యే మేనల్లుడిపై కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన కారులు స్టేషన్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆందోళనకారులు స్టేషన్ఈ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నప్పటికీ స్టేషన్ లోకి చాలా సేపటి వరకు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దాడిలో డీసీపీ వాహనం కూడా ధ్వంసం అయిందని సమాచారం. ఐతే పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన హింసలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా గాయపడటంతో వారిని హాస్పిటల్ కు తరలించారు.

 

ఐతే ఎమ్మెల్యే బంధువు మాత్రం ఈ పోస్టుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తన ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి కుట్రపూరితంగా ఇలా చేసారని అంటున్నారు. అదే సమయంలో ప్రజలు శాంతంగా ఉండాలని ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి విజ్ఞప్తి చేసారు. ఈ ఘటన పై పూర్తీ స్థాయిలో దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ ఘటన పై దర్యాప్తు జరిపించి, చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా దాడులకు దిగడం సమస్యకు పరిష్కారం కాదని.. శాంతి భద్రతలను సరిదిద్దేందుకు అదనపు బలగాల్ని దింపినట్లుగా కూడా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అయన చెప్పారు.