వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
posted on Mar 19, 2025 11:09AM
.webp)
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా బయటకు వెళ్లి పోతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి బుధవారం (మార్చి 19) రాజీనామా చేశారు. మర్రి రాజశేఖరరెడ్డి రాజీనామాతో వైసీపీని వీడిన ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. గతంలోనే పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ వైసీపీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా 2004లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి పరాజయం పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010లో వైసిపిలో చేరాడు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి 2018లో వైఎస్జగన్ చేసిన పాదయాత్రలో కీలకంగా పనిచేశాడు. 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్సీ హామీతో సర్దుకుని పార్టీలో కొనసాగారు. ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.