కాలు నొప్పి:

 

1. హఠాత్తుగా కాలి కండరాల్లో నొప్పి మొదలయ్యిందా?

కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్)

2. నొప్పి కాలు వెనుక భాగంలో ఉంటూ, ముందుకు వంగినప్పుడు ఎక్కువవుతుందా?

తుంటి నొప్పి / గృద్రసీవాతం (సయాటికా)

3. కాలునోప్పితో పాటు మోకాళ్ల నొప్పులు కూడా ఉన్నాయా?

మోకాళ్ళు అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్)

4. కాళ్ళలో సిరలు ఉబ్బెత్తుగా, మెలికలు తిరిగి కనిపిస్తున్నాయా?

సిరలు ఉబ్బతం (వేరికోస్ వీన్స్)

5. ధూమపానం చేస్తారా? మీరు స్త్రీ అయితే - సంతాన నిరోధక మాత్రలను వాడుతున్నారా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం (త్రాంబోసిస్)

6. వ్యాయామం చేస్తున్నప్పుడు కాలినొప్పి వస్తుందా?

రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోస్క్లిరోసిస్)

7. కాళ్లలో మంటలు ఉంటాయా?

పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్)

8. కాలినొప్పి క్రమక్రమంగా పెరుగుతుందా?

నరాల సమస్యలు

 

శరీరంలో ఇతర భాగాల మాదిరిగా కాలిలో నొప్పికూడా ఒక నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రావచ్చు. లేదా ఇతర భాగాల నుంచి జనించి కాలిలో ప్రస్ఫుటమవ్వచ్చు. నొప్పి ఎక్కడ నుంచి మొదలవుతుందనేది స్పష్టంగా చెప్పలేనప్పుడు లేదా స్పష్టమైన గాయంగాని, దేబ్బగాని లేనప్పుడు లక్షణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే కారణాలు భోదపడతాయి. కాలు నొప్పికి స్పష్టమైన కారణమంటూ తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స తీసుకోడానికి వీలవుతుంది.

1. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

కాలి కండరాల్లో హఠాత్తుగా నొప్పి మొదలైనప్పుడు దానిని, 'మజిల్ క్రాంప్స్' అంటారు. ఆయుర్వేద పరిభాషలో ఈ నొప్పికి 'పిండకోద్వేష్టనం' అని పేరు. సాధారణంగా ఈ తరహా నొప్పి కాలి పిక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల కనిజాలు, లవణాలు - ముఖ్యంగా కాల్షియం, పొటాషియం వంటివి తగ్గినప్పుడు క్రాంప్స్ ఏర్పడతాయి. ఈ కారణం చేతనే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న తరువాతగాని, విరేచనాలు అయిన తరువాత గాని కాళ్ల పిక్కల్లో నొప్పులు వస్తుంటాయి. అలాగే అలవాటు లేకుండా శారీరక శ్రమ చేసిన తరువాత గాని, ఎక్కువదూరాలు నడిచిన తరువాత గాని చాలా మందికి కాళ్ల నొప్పులు వస్తాయి, శారీరక శ్రమ చేసేటప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునే సమయంలో నొప్పులు వస్తాయి కాబట్టి వీటిని రెస్ట్ పెయిన్స్ అంటారు. దీనికి పరిష్కారంగా, నొప్పి వచ్చినప్పుడు కాలి వేళ్ళను పైవైపుకు వంచి, పిక్కలపైన మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలవాటు లేని వ్యాయామాలను, శారీరక శ్రమలనూ చేయకూడదు. సరైన వార్మప్ లేకుండా వ్యాయామాలను మొదలెట్టకూడదు, కాఫీ, టీలను తగ్గించాలి. క్యాల్షియంనూ (పాల పదార్థాలు, పాలకూర, టమాట, గుడ్డు మొదలైనవి), పొటాషియంను (అరటి, కమలా, టమాటా తదితరలు) ఎక్కువగా తీసుకోవాలి.

ఔషధాలు: సింహ నాదగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, మహాయోగరాజు గుగ్గులు.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం.

2. తుంటి నొప్పి / గృద్రసీవాతం (సయాటికా):

సయాటికా నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలు దేరి పిరుదులు, తొడ పక్క భాగం, పిక్కలు మొదలైన ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ అరికాలు వరకూ వ్యాపిస్తుంది. సయాటిక్ నరం వాపునకు గురైనప్పుడు, ఇది ప్రయానించినంత మేరా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి సాధరణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పిరావటం, నడిచినప్పుడు నొప్పిరావటం, కాలులో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు క్షీణించుకుపోవడం, పట్టుకోల్పోవడం వంటివి జరుగుతుంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు అర్థం. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి, స్నేహకర్మ, స్వేదకర్మ, వస్తి కర్మ అనే ఆయుర్వేద చికిత్సా పద్దతులతో నొప్పిని సమూలంగా తగ్గించవచ్చు. స్నేహకర్మలో ఔషధతైలాలను పైపూతగా ప్రయోగించడంతోపాటు, కడుపులోనికి తీసుకునే విధంగా ఉపయోగించడం జరుగుతుంది. తైలాలతో శరీరం మార్దవంగా తయారైన తరువాత స్వదకర్మతో నరం చుట్టూ పక్కల కండరాల్లోని జడత్వాన్ని తగ్గించాల్సి ఉంటుంది. చివరగా చేసే వస్తికర్మ వల్ల నడుము ప్రాంతంలో ఏర్పడిన వాతావరోధం తొలగిపోయి నొప్పికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి. 2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి. 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరాపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాతగజాంకుశరసం.

3. మోకాళ్ళు అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్):

వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన 'సంధివాతం' గా అర్థం చేసుకోవాలి.

సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను వాడాటం, వృత్తిరీత్యా చేయాల్సిన పనుల్లో మార్పులూ చేర్పులను చేసుకోవడంతో ఈ సమస్యను తేలికగా అదుపులో పెట్టుకోవచ్చు.

4. సిరలు ఉబ్బటం (వేరికోస్ వీన్స్):

కాళ్లలో సిరలు నల్లగా, నీలం రంగులో మెలికలు తిరిగి ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, వాటిని 'వేరికోస్ వీన్స్' అంటారు. వీటి వల్ల కాలులో నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు రక్తం స్థానికంగా సంచితమై, చుట్టుపక్కల నిర్మాణాలపైన ఒత్తిడిని కలిగించి నొప్పికి కారణమవుతుంది. పాదాలకు ప్రసారిణి తైలం అనే ఔషధ నూనెను రాసుకోవటం, ఎలాస్టిక్ సాక్స్ లను ధరించడం, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్య సలహాను అనుసరించి చేయడం ద్వారా ఈ స్థితిని చక్కదిద్దుకోవచ్చు.

ఔషధాలు: వృద్ధివాదివటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, అర్శోఘ్నవటి, బోలపల్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం

5. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం (త్రాంబోసిస్):

ధూమపానంచేసే వారిలోను, సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళల్లోనూ, వ్యాయామరహిత జీవితం గడిపే వారిలోను సిరల్లో రక్తం గడ్డ కట్టి స్థానికంగా నొప్పికి, వాపునకూ కారణమవుతుంది. ఆయుర్వేదంలో ఈ స్థితిని 'ఖవైగుణ్యం' అంటారు. 'ఖ' అంటే స్రోతస్సులనీ లేదా మార్గాలనీ అర్థం.

రక్తం గడ్డకట్టడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో 'త్రాంబోసిస్' అంటారు. చర్మానికి దగ్గరగా ఉండే సిరలలో రక్తం గడ్డకట్టినప్పటికి పెద్దగా ప్రమాదం ఉండదుకాని, శరీరాంతర్గతంగా ఉండే సిరలలో కనుక రక్తం గడ్డ కడితే, గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన నిర్మాణాలలోకి రక్తపు గడ్డలు ప్రవేశించి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా మహిళల్లోనూ, వేరికోస్ వీన్స్ తో బాధపడేవారిలోనూ, శస్త్రచికిత్స అనంతరం కోలుకునే దశలో వున్న వారిలోనూ జరిగే అవకాశం ఉంది కాలిలో ఎరుపుదనం, తీవ్రమైన నొప్పి, వాపు మొదలైనవి కనిపిస్తున్నప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యసలహా తీసుకోవటం అవసరం. ఇవన్నీ సాధారణంగా డివిడి (డిప్ వీన్ త్రాంబోసిస్)లో కనిపిస్తాయి.

సూచనలు: ఈ వ్యాధిలో జలౌకావచరణం (జలగలతో రక్త మోక్షణం చేయడం)తో పాటు సమీరపన్నగ రస, లశునక్షీరపాకం వంటి శక్తివంతమైన మందులు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవడం (ఎథిరోస్క్లీరోసిస్):

రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉన్న వారిలోను, సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలోను ధమనుల లోపలి గోడలు పూడుకుపోయి కాలుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా కణజాలాలకు ప్రాణవాయువు సరైన మోతాదులో అందక నొప్పి బయల్దేరుతుంది. ఇలా ఎక్కువగా కాళ్లలో జరుగుతుంటుంది. ఈ స్థితిలో ఒకవేళశక్తికి మించి శ్రమ చేసినా, వ్యాయామం చేసినా, ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరిగి, డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో, తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. కాలువలలో రక్తనాళాలు (ధమనులు) పూడుకు పోయినప్పుడు చర్మంపై మార్పులు సంభవించడం, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పాలిపోయి కనిపించడం, చర్మాన్ని తాకితే స్పర్శకు చల్లగా తగలడం, పాదాల వేళ్ల సందుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. వెల్లుల్లిపాయలు (ఇది గ్రాములు) తీసుకొని పైపొర తోఅలగించి లోపలి గర్భాలను మజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్ర మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వదపోసుకుని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి. 2. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: లశునాదివటి, నవకగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, మేదోహరవిడంగాది లోహం.

7. పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్):

సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని వారిలో, బీ-కాంప్లెక్స్ లోపం ఏర్పడి కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్లు నొప్పులూ అనిపించే అవకాశం ఉంది. ఆకు కూరల్లోను, తవుడులోనూ బీ- కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలి.

8. నరాల సమస్యలు:

ఆల్కహాల్ తీసుకునే వారిలోను, మధుమేహం నియంత్రణలో లేని వారిలోనూ కాళ్ల లోపలుండే నరాలకు రక్తసరఫరా తగ్గి వాటిలోని న్యూరాన్ కణజాలాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరిగితే సూదులతో గుచ్చినట్లు నొప్పి మొదలై క్రమంగా పాదాలు మొద్దుబారటం, కండరాలు శక్తిని కోల్పోవడాలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా, మద్యపానాన్ని వదిలేయటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయటం, పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.

ఔషధాలు: క్షీరబలాతైలం (101 ఆవర్తాలు), మహావాత విధ్వంసినీ రసం, లశునక్షీరపాకం, వాతగజంకుశరసం, స్వర్ణసమీరపన్నగ రసం, వసంత కుసుమాకర ర