
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి, దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా, వేసవి నుండి ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది. చాలా మంది కూలర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దీనివల్ల సౌకర్యం చేకూరకపోగా ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కూలర్ వాడేవారు చేసే ఒకే ఒక తప్పు కుటుంబ సభ్యులకు మొత్తం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదేంటో.. ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుంటే..
కూలర్ ప్యాడ్లు..
కూలర్ ప్యాడ్ల మీద చాలా తొందరగా దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. చాలామంది వేసవి అవ్వగానే కూలర్ ను అలా ఒకమూల పెట్టేయడం, తిరిగి వేసవి రాగానే దాన్ని మళ్లీ వాడటం మొదలుపెడతారు. అంతేకానీ కూలర్ ప్యాడ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరు. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్లు దుమ్ము, బ్యాక్టీరియా , ఫంగస్కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కలుషితమైన గాలి గది అంతటా వ్యాపించినప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ఎవరికి ప్రమాదమంటే..
కూలర్ ప్యాడ్ లు ఇలా మురికిగా మారడం ముఖ్యంగా పిల్లలకు , వృద్ధులకు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, వేసవి కాలంలో కూలర్లను సరిగ్గా శుభ్రపరచడం , వాటి నిర్వహణ అత్యంత ముఖ్యం.
కూలర్ ప్యాడ్ లు మురికిగా మారితే కలిగే ప్రమాదాలు..
శ్వాసకోశ సమస్యలు..
మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్లపై దుమ్ము, ధూళి , బ్యాక్టీరియా పేరుకుపోతాయి, ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించగలవు. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరగవచ్చు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడవచ్చు.
అలెర్జీల ప్రమాదం..
మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్లపై త్వరగా బూజు, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది చర్మం , కంటిలో చికాకు, దురద , అలెర్జీ రియాక్షన్స్ వంటి వాటికి కారణం అవుతాయి. ఇప్పటికే అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.
దుర్వాసన, గాలి కాలుష్యం..
కూలర్ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే, దాని నుండి వచ్చే గాలిలో ఒక వింత వాసన వస్తుంది. ఈ వాసన గది వాతావరణాన్ని అనారోగ్యకరంగా మార్చడమే కాకుండా, తలనొప్పి లేదా ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు.
ఇన్పెక్షన్..
మురికి నీరు , కలుషితమైన ప్యాడ్ల వల్ల కూలర్లో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి, దీంతో జ్వరం , ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం..
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన పిల్లలు , వృద్ధులు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు మురికిగా ఉండే చల్లని గాలి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనివల్ల వారికి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి గదిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
*రూపశ్రీ.




