భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది. కొందరు  భోజనాన్ని పెరుగుతో ముగిస్తారు. మరికొందరు రైతా చేసుకుంటారు.  ఇంకొందరు  తీపి పెరుగును ఇష్టపడతారు. వేసవిలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుందని చెబుతారు. కానీ పెరుగును శీతాకాలంలో తక్కువ తినమని చెబుతారు.  మరికొందరు శీతాకాలంలో పెరుగు వాడటం ఆపేయమని చెబుతారు.  పెరుగు చుట్టూ చాలా అపోహలు,  నమ్మకాలు ఉన్నాయి, పెరుగు తినడం వల్ల జలుబు వస్తుందని కొందరు, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు భారంగా ఉంటుందని, పెరుగు తింటే వాతం చేస్తుందని.. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. పెరుగు గురించి చాలామందిలో అపోహలు,  వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే..


పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రోటీన్, కాల్షియం,  మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా  పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా  సరైన మొత్తంలో తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.


పెరుగు చాలా మందికి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా పేగులలో మంచి,  చెడు బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

పెరుగు తింటే జలుబు వస్తుందనేది చాలామంది నమ్మకం. కానీ ఇది అందరికీ నిజం కాదు. చాలా మందికి పెరుగు వల్ల జలుబు రాదు. అయితే, ఎవరైనా జలుబుకు సెన్సిటివ్ గా  ఉంటే లేదా ఇప్పటికే జలుబుతో ఇబ్బంది పడుతుంటే.. ఆ తరువాత పెరుగు తినడం వల్ల ఇబ్బంది కలగవచ్చు అంతే.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల  ఎలాంటి సమస్యలు లేకపోతే పెరుగు తినవచ్చు. అయితే రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినకూడదు.  7 గంటల లోపు భోజనం చేస్తే అప్పుడు పెరుగు తీసుకుంటే ఏమీ కాదు.

చాలా మందికి, పాలు కంటే పెరుగు జీర్ణం కావడం సులభం. పెరుగులోని బ్యాక్టీరియా పాలలోని లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో తేలికగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ పరంగా పెరుగు పాల కంటే మంచిదని చెబుతారు.

ఒక సాధారణ వ్యక్తికి రోజుకు ఒక కప్పు పెరుగు సరిపోతుంది. ఎక్కువ పరిమాణంలో అవసరం లేదు. పెరుగును బాలెన్స్ గా తీసుకున్నప్పుడే అది మంచి ఫలితాలు ఇస్తుంది.

 షుగర్ వ్యాధిగ్రస్తులు సాదా పెరుగు తినవచ్చు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. అయితే స్వీట్  పెరుగును నివారించాలి.


చాలా మందికి పెరుగు వల్ల కడుపు ఉబ్బరం కలగదు. కానీ లాక్టోస్ అసహనం ఉన్నవారికి కొంత గ్యాస్ లేదా ఉబ్బరం కలగవచ్చు.

శరీరం పాల ఉత్పత్తులను సులభంగా జీర్ణం చేసుకోగలిగితే ప్రతిరోజూ పెరుగు తినడం సురక్షితం.

 పెరుగును చేపలు, చికెన్ లేదా మటన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తినవచ్చు. దీని చుట్టూ ఉన్న భయం,  గందరగోళానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది కేవలం జీర్ణ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది.

                                   *రూపశ్రీ.