వర్షాకాలంలో ఈ పప్పుధాన్యాలను తినకూడదు..!

వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, కానీ ఆహారం , పానీయాల విషయంలో మరింత  జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పెరిగిన తేమ కారణంగా, బ్యాక్టీరియా , ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.  పప్పుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ , అనేక పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అయితే  అన్ని రకాల పప్పుధాన్యాలు అన్ని కాలాల్లోనూ సులభంగా జీర్ణం కావు. వర్షాకాలంలో కొన్ని పప్పుధాన్యాలు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం , జీర్ణ సమస్యలను పెంచుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఏ పప్పుధాన్యాలను తినకూడదో , మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే..

నల్ల మినుములు..

మినుములను ఉద్దిపప్పు అని కూడా అంటారు. ఇవి చాలా పోషకమైనవి,  ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉన్నవి.  అయినప్పటికీ మినుములు శరీరానికి భారంగా అనిపిస్తాయి. చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి.  వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల, చాలా మంది జీర్ణవ్యవస్థ సాధారణం కంటే బలహీనపడుతుంది. అందువల్ల, మినుములను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , భారంగా అనిపించడం వంటి కడుపు సమస్యలు వస్తాయి.  ఒకవేళ వీటిని తినాలనుకుంటే, బాగా నానబెట్టి, తినే ముందు ఉడికించుకోవాలి. ఇంగువ, జీలకర్ర , అల్లం వంటి పదార్థాలను ఉపయోగించడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.

శనగలు..

శనగలు ప్రోటీన్ , ఫైబర్‌కు మంచి మూలం, కానీ వాటిని అధిక పరిమాణంలో తినడం వల్ల కొంతమందికి సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. శనగలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం , కడుపులో బరువుగా అనిపించడం వంటివి కలగవచ్చు. ముందు నుంచే గ్యాస్ లేదా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  శనగలను తినడానికి కొన్ని గంటల ముందు నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించుకోవడం మంచిది. అంతేకాదు.. శనగలను  తేలికపాటి మసాలాలతో వండటం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులను  తగ్గించుకోవచ్చు.

రాజ్మా బీన్స్..

రాజ్మా బీన్స్ చాలా మందికి ఇష్టమైన వంటకం . ఇవి ప్రోటీన్, ఐరన్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, రాజ్మా బీన్స్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. రాజ్మా బీన్స్‌ను ఎప్పుడూ తొందరగా వండెయ్యాలని, తక్కువ సమయం నానబెట్టడం, సరిగ్గా ఉడికించకుండా వండటం వంటివి చేయకూడదు.  వాటిని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని రాజ్మా  బీన్స్‌ సరిగ్గా అరకపోవడం,  కడుపు  నొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి.

వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు జాగ్రత్తలు..

 పప్పులను తినే ముందు శుభ్రంగా కడగాలి,  పప్పు ధాన్యాలను తగినంత సమయం పాటు నానబెట్టి ఉడికించాలి.  మసాలాలు, నూనె ఎక్కువగా వాడకూడదు.  ఇది జీర్ణ ప్రక్రియను ఇబ్బంది పెడుతుంది.  తాజాగా వండిన పప్పు ధాన్యాలను  మాత్రమే తినాలి, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వాటిని  తినకూడదు.  పప్పు ధాన్యాలను వండేటప్పుడు అల్లం, జీలకర్ర, ఇంగువ వంటి మసాలాలను కలుపుకోవచ్చు, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.

                                       *రూపశ్రీ.