నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే  దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం   ప్రయోజనాలను నాశనం చేస్తుంది.  ఏదో అప్పుడప్పుడు  నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధికంగా చక్కెర కలపడం  ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

నిమ్మరసం..

భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి,  తేమతో కూడిన  రోజులలో మంచి  ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని,  రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు.  నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

చక్కర కలిపితే..

నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.  అందుకే  నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు.

నారింజ రసం కూడా..

నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు  అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

రుచి మెరుగవ్వాలంటే..

నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం  పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని  అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది.   చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా  ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

                        *రూపశ్రీ