
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి, డయాబెటిస్, బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది. కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుంటే..
ఊబకాయం..
సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు. దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు. ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు. కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది. అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.
అదిక బరువు సమస్యలు..
అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
పరిష్కారం..
ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి. ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది.
ఎముకల బలం..
ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు. అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం, విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి.
సిట్టింగ్ పొజిషన్..
నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే. ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి.
ఆహారం..
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి. అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.
*రూపశ్రీ.




