ఏరువాక పున్నమి

 

- రచన యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

 

“ ఏరువాక సాగారో రన్నో చిన్ననా...

నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...”

ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ పాటలో “ ఏరువాక” అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు...

“ఏరు” అంటే... ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి.

 “ ఏరువాక”... అంటే దుక్కి దున్నుట ప్రారంభం.  అంటే వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు.. ఇక్కడి రైతాంగం. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత. అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా , బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా! అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, భూపూజ చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే ఈ “ఏరువాక పున్నమి ” పండుగ....

 

 

తొలిసారిగా భూక్షేత్రం లో నాగలిని  కదల్చడానికి ముందు భూ పూజ చేయాలనీ ఋగ్వేదం  వివరిస్తుంది. ఆ భూపూజ కూడా,  " జ్యేష్ట పౌర్ణమి"  నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే  జ్యేష్ట పౌర్ణమిని “ ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికీ పండుగ రైతన్నల పండుగే అయినా, అందరి ఆకలి తీర్చే పండుగ కనుక “ ఏరువాక పున్నమి “ అందరికీ పండుగే. ప్రాచీన సాహిత్యంలో “ ఏరువాక పున్నమి “ని “వప్పమంగల దివసం” గా రైతాంగం జరుపుకునే వారిని, పాళీ, ప్రాకృత భాషలలోని జాతక కధల ద్వారా వెల్లడవుతుంది.

 

 

పండుగ సందడి :

 

 

ఈ రోజు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు , కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు. తరువాత , పొలం పనులకు ఉపయోగించే “ “ కాడి” నాగలిని కడిగి  రంగులతో, రంగురంగుల పువ్వులతో అలంకరించి  ఎడ్లకు నాగలికి , భూమాతకు  పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఎడ్లలకు పొంగలిని  ఆహారంగా పెడతారు. ఆ తర్వాత “ కాడి” నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాత  కు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు.  “ ఏరువాక పున్నమి” నాడు  ఇలా చేయడం వల్ల ఆ సంవత్సర మంతా పంటలు సమృద్దిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరి కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునారతో చేసిన “ తోరం “ కడతారు. రైతులందరూ అక్కడికి చేరి “ చెర్నాకోల “ తో ఆ  “ తోరాన్ని “ కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకు వెళ్లి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోను కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని రైతుల విశ్వాసం.


More Vyasalu