అరుణాచల క్షేత్ర విశిష్టత తెలుసా!
అరుణాచలం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన శైవ క్షేత్రం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు, శైవ భక్తులకు అరుణాచల క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి అరుణాచలంలో శివుడు వెలసి ఉన్నాడని తెలుసు. కానీ ఆ క్షేత్ర విశిష్టత తెలసిన వారు మాత్రం కొందరే ఉంటారు. అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడి అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు. అదే విధంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉంది. ఇంతకీ అరుణాచల చరిత్ర ఏంటి? ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే..
శివుడు పంచభూతాలను ఆవరించుకుని ఉంటాడు. దీనికి తగ్గట్టే పంచభూతాలలో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో చోట శివ లింగాలు వెలసాయి. ఇవి కూడా స్వయంభూ లింగాలే. పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం. అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని పురణాలు చెబుతున్నాయి. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తూ దైవస్వరూపంగా భావిస్తారు.
అరుణగిరి ప్రదక్షిణ చేస్తే..
అరుణాచలం దర్మించే చాలా మంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అని చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మజన్మల పాపాలను కడిగేస్తుందట. చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకుని మరీ ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు.
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాల దర్శనం జరుగుతుంది. వీటిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమ లింగం, నైఋతి లింగం,వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం అనే ఎనిమిది లింగాలతో పాటు అనేక ఇతర దేవాలయాలను, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. సిద్దులు.. (అంటే అష్టసిద్దులు పొందిన వారు, దైవిక శక్తులు సాధించిన వారు), యతీశ్వరులు..(అంటే ముల్లోకాలను జయించిన వారట. ముల్లోకాలు అంటే భూలోకం, స్వర్గలోకం, భువనం. ఈ మూడు లోకాలలో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు, కఠిన సాధన చేసే వారు యతీశ్వరులుగా పిలవబడతారని పురాణ కథనాలు చెబుతున్నాయి.) అరుణగిరి ప్రదక్షిణకు, దర్శనానికి వస్తారని చెబుతుంటారు. అరుణాచల దర్శనం చేసుకోలేక పోతున్నామని బాధపడేవారు.. కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు. ఆ అరుణాచల పరమేశ్వరుడిని అరుణాచల శివ, అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మజన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు. జీవితంలో ఒక్కసారి అయినా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా అంటారు.
*రూపశ్రీ.
