శృతిహాసన్‌ను పీవీపీ బ్లాక్ మెయిల్ చేశారు

 

విజయవాడ లోక్ సభ స్థానం నుంచి.. టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, వైసీపీ తరపున నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘కమల్‌హాసన్ గారి అమ్మాయి శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి ఇతను. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరోనూ ఇతను మోసం చేశాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతనంటే అసహ్యం పుట్టింది. ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదు. హీరోయిన్లను ఏడిపించాడు.. డైరెక్టర్లను ఏడిపించాడు. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడు. ఇతను ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు. ఇతను ఒక క్రిమినల్.. ఇతనొక మోసగాడు.కెనరాబ్యాంక్‌కు ఇతను రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్న నోటీసులు ఇచ్చారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేస్తే ఏడు కోట్లు కూడా రాలేదు. మిగతా 130 కోట్లు ఎవరు కడతారు?. అలాగే ఇంకా చాలా స్కాములు చేశాడు. బొగ్గు స్కాము, జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీల్యాండరింగ్, హవాలా ఇలా చాలా కేసులు ఉన్నాయి.’ అని కేశినేని నాని ఆరోపణలు చేశారు.