Home » Baby Care » పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు పెట్టండి చాలు!
పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు పెట్టండి చాలు..!

పిల్లల రోగనిరోధక వ్యవస్థ పెద్దల కంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణంగా వాతావరణం మారేటప్పుడు తొందరగా ఇన్పెక్షన్ లు పిల్లలకు ఎదురవుతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ కేవలం మందుల ద్వారా మాత్రమే కాదు, చిన్నతనం నుండి సరైన ఆహారం వల్లే ఏర్పడుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల ఆహారంలో సహజంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే పోషకాలు ఉండాలి. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు ఏ ఆహారాలు ఇవ్వాలో తెలుసుకుంటే..
సిట్రస్ పండ్లు..
నారింజ, నిమ్మకాయలు, ఆమ్లా వంటి సిట్రస్ పండ్లు పిల్లల రోగనిరోధక శక్తికి చాలా అవసరం. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. వీటిని పిల్లలకు పండ్లుగా లేదా తాజా రసంగా ఇవ్వవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా గాయం మానడానికి, ఐరన్ శోషణకు కూడా సహాయపడుతుంది.
బాదం, వాల్ నట్స్..
బాదం, వాల్నట్స్లో విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ అనేది కణాలను దెబ్బతినకుండా రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 3-4 నానబెట్టిన బాదంపప్పులు తినిపించాలి. వాటిని రాత్రిపూట నానబెట్టడం వల్ల వాటి పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి. జ్ఞాపకశక్తి, శారీరక బలాన్ని మెరుగుపరుస్తాయి.
పెరుగు, ప్రోబయోటిక్స్..
మన శరీరంలోని 70% రోగనిరోధక శక్తి మన కడుపు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి పిల్లలకు ప్రతిరోజూ పెరుగు ఇవ్వాలి. పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పెరుగును చేర్చడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ సజావుగా నడుస్తుంది. వారి శరీరంలో హానికరమైన క్రిములు పెరగకుండా నిరోధిస్తుంది. పెరుగులో పండ్లను జోడించి ఫ్రూట్ కర్డ్ పేరుతో ఇవ్వడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.
పసుపు పాలు, సమతుల్య ఆహారం..
ఆయుర్వేదంలో పసుపును "సహజ యాంటీబయాటిక్"గా పరిగణిస్తారు. నిద్రవేళకు ముందు పిల్లలకు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు ఇవ్వడం వల్ల అంతర్గత మంట తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సరైన ఆహారంతో పాటు తగినంత శారీరక శ్రమ, 9-10 గంటల నిద్ర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
*రూపశ్రీ
