![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో శక్తితో పాటు సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం వంటి చిత్రాలతో పాటు పలు హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో చేసి మెప్పించిన హీరోయిన్ మంజరి ఫడ్నిస్. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసింది. సదరు వీడియోలో తాను ప్రాణంగా చూసుకునే శునకాన్ని ఎవరో ఐరన్ రాడ్తో దారుణంగా కొట్టి చంపేశారంటూ బోరున ఏడుస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 సంవత్సరంలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కని మంజరి ఉంటున్న అపార్ట్మెంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆ కుక్కని అపార్ట్మెంట్లోని సొసైటీ సభ్యులంతా చేరదీశారు. ఎంతో ముద్దుగా 'మైకీ' అని పేరు పెట్టుకున్నారు. గత 6 నుండి 7 ఏళ్లుగా అంటే 2019-20 కాలం నుండి ఆ కుక్క ఆ అపార్ట్మెంట్లోనే నివసిస్తూ అందరికీ ఎంతో ఇష్టమైనదిగా మారిపోయింది. ఎంతో సాధువైన మైకీకి నటి మంజరి స్వయంగా స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం, ఆహారం తినిపించడం లాంటివి చేస్తూ తన సొంత కుటుంబ సభ్యునిలా చూసుకునేవారు. మైకీ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టేది కాదని, సొసైటీలో అందరితో ఎంతో ప్రేమగా ఉండేది.
అయితే, కొన్ని రోజుల క్రితం మైకీ హఠాత్తుగా అపార్ట్మెంట్ నుండి కనిపించకుండా పోయింది. దాంతో ఆందోళన చెందిన మంజరి, మిగిలిన సొసైటీ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. మైకీ ఫొటోలతో కూడిన మిస్సింగ్ పోస్టర్లని సైతం ముద్రించి వీధుల్లో అంటించారు. అంతా వెతికినా మైకీ ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాతే వారికి అసలు విషయం తెలిసింది. ఒకరోజు బేస్మెంట్ ఏరియాలో మైకీ నిద్రపోతున్న సమయంలో, ఆ అపార్ట్మెంట్ సొసైటీకి చెందిన ఒక వ్యక్తి లోహపు రాడ్తో (ఐరన్ రాడ్) మైకీపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకి తాళలేక ఆ మూగజీవం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అంతటితో ఆగకుండా, చనిపోయిన మైకీ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో (బోరి) మూటగట్టి, ఎవరికీ తెలియకుండా ఒక ఖాళీ ప్రదేశంలో లేదా ఒక కాలువలో (ఖాడీ) పారేసినట్లు ఘోరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మైకీ భౌతికకాయం కూడా లభించలేదని రోదిస్తూ పేర్కొంది.
Also read: Drishyam 3: ఓటిటిలోకి దృశ్యం 3 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
మన సమాజంలో జంతువులపై జరుగుతున్న ఇలాంటి అమానవీయ దాడులని అరికట్టడానికి జంతు క్రూరత్వ నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జంతువులని హింసించాలంటేనే నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టేలా కఠినమైన శిక్షలు అమలు చేయాలని కూడా సదరు వీడియోలో పేర్కొంది. మంజరి వీడియో చూసిన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి వంటి హీరోయిన్లు మైకీకి న్యాయం జరగాలంటూ, ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. మంజరికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |