సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితాల్లోని కష్టసుఖాలను, వారికి సంబంధించిన భావోద్వేగ అంశాలను ఉత్కంఠభరితంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం 'జెట్టి'. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించారు. ఈ సినిమా కథ గురించి తెలుసుకొని, ఆసక్తికరంగా ఉందంటూ టీమ్ను అభినందించి, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. 'భీమ్లా నాయక్' షూటింగ్ లొకేషన్లో ఈ పోస్టర్ లాంచ్ జరిగింది.
త్రివిక్రమ్ మాట్లాడుతూ, ‘‘సముద్రం బ్యాక్డ్రాప్లో కథలు ఎంచుకోవడం చాలా సాహసంతో కూడుకున్నది. వీరి మేకింగ్ లో చాలా ప్యాషన్ కనపడింది. వీరు ఎంచుకున్న నేపథ్యం కచ్చితంగా తెలుగు తెరకు కొత్తది. సుబ్రమణ్యం పిచ్చుక తనదైన ముద్రతో వస్తున్నాడు. నిర్మాత వేణుమాధవ్ గారికి, 'జెట్టి'లో నటించిన నందిత శ్వేతకు, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు’’ అన్నారు.
దర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, త్రివిక్రమ్ తమ 'జెట్టి' మూవీ పోస్టర్ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. "త్రివిక్రమ్ గారిని కలవడం ఇదే మొదటి సారి. ఆయన మా టీంతో పంచుకున్న మాటలు మాకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మా టీం అందరం ఆయనకు రుణ పడి ఉంటాం. సముద్రం నేపథ్యంలో ఇప్పటివరకూ రాని సరికొత్త కథతో ఈ సినిమా రూపొందించాం. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న గంగపుత్రుల కథ ఇది. కొన్ని కథలు ఆ ప్రాంతపు హద్దులను దాటవు, వారి బాధలు ఆ కుటుంబాల గడపలు దాటవు. అలాంటి కథను 'జెట్టి'తో ప్రెజెంట్ చేస్తున్నాం" అన్నారాయన.
నిర్మాత వేణుమాధవ్ మాట్లాడుతూ, "ఇప్పటి వరకూ తెలుగు తెరపై కనిపించని కథను 'జెట్టి' మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం. అక్టోబర్ మొదటి వారంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్.యస్. చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి డైలాగ్స్: శశిధర్, మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: వీరమణి, ఎడిటింగ్: శ్రీనివాస్ తోట, ఆర్ట్: ఉపేంద్రరెడ్డి, స్టంట్స్: దేవరాజ్ నూనె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పండ్రాజు శంకర్రావు, నిర్మాత: వేణుమాధవ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక.