వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ టీజర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది.
"నన్నే చూస్తావు, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో" అంటూ కేతిక చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. 'ఖుషి' సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య ఇగో ఉన్నట్లుగానే.. ఇందులో వైష్ణవ్, కేతిక మధ్య ఇగో ఉన్నట్లుగా చూపించాడు దర్శకుడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.. కానీ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటారు అన్నట్లుగా ఆసక్తికరంగా టీజర్ ని కట్ చేశారు. మొత్తానికి ప్రేమ, చిన్న చిన్న అలకలు, నవ్వులతో 'రంగ రంగ వైభవంగా' వైభవంగా టీజర్ ఆకట్టుకుంటోంది. శాందత్ సాయినుద్దీన్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైష్ణవ్, కేతిక ఇద్దరికీ 'రంగ రంగ వైభవంగా' మూడో సినిమానే కావడం విశేషం. 'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ రెండో సినిమా 'కొండపొలం'తో నిరాశపరిచాడు. 'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేతిక యూత్ కి దగ్గరైంది కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. రెండో సినిమా 'లక్ష్య'తోనూ హిట్ అందుకోలేకపోయిన ఈ బ్యూటీ.. 'రంగ రంగ వైభవంగా'తో ఫస్ట్ హిట్ అందుకోవాలని చూస్తోంది.