![]() |
![]() |

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సీతారామం'. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని క్లాసిక్ హిట్ గా నిలిచింది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. అయితే తాజాగా ఆయన 'సీతారామం' సీక్వెల్ చేస్తే బాగుంటుందని చెప్పడమే కాకుండా.. మీడియా సాక్షిగా నిర్మాత స్వప్న దత్ కి స్టోరీ లైన్ చెప్పి ఆశ్చర్యపరిచారు.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'అన్నీ మంచి శకునములే' సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా స్వప్న సినిమా బ్యానర్ లోనే రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి తాజాగా 'చెయ్యి చెయ్యి కలిపేద్దాం' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సీతారామం సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వప్న దత్ తో ఆయన మాట్లాడుతూ.. "స్వప్న సినిమాలో వచ్చిన 'సీతారామం'ను మర్చిపోలేను. దాని తర్వాత వస్తున్న 'అన్నీ మంచి శకునములే' మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సీతారామం విషయంలో ఒకటే బాధ నాకు.. ఆ సీత ఏమైంది?. సీత జీవితం అలా నాశనం చేయడం నాకు బాధగా ఉంది. నేనొక ఐడియా చెప్తాను.. మీ డైరెక్టర్ కి చెప్పు. సీత బాగా బాధపడి, ఒక గన్ తీసుకొని విలన్ దగ్గరకు వెళ్లి కాల్చబోతే.. అతను భయంతో ఒక గుహలోకి తీసుకెళ్లి రామ్ బతికే ఉన్నాడని చూపిస్తాడు. అక్కడి నుంచి సీత, రామ్ తప్పించుకోగా.. మళ్ళీ వాళ్ళని ఫ్యామిలీ విలన్స్ ఎలా ఛేజ్ చేశారని చూపించాలి. పాపం ఆ అమ్మాయిని అలాగే ఉంచొద్దు. ఇప్పుడు తలచుకున్నా కూడా నాకు కళ్ళ వెంట నీళ్లొస్తాయి" అన్నారు. రాఘవేంద్రరావు చెప్పిన ఐడియాకి ఓకే చెప్పిన స్వప్న.. "అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ గురించి కూడా ఆలోచించండి" అని అడిగింది. దీంతో రాఘవేంద్రరావు "ఆ సీక్వెల్ ని నాగ్ అశ్విన్ తో చేయించండి" అని సలహా ఇచ్చారు. మరి ఈ రెండు సినిమాల సీక్వెల్స్ కార్యరూపం దాల్చుతాయో లేదో చూడాలి.
![]() |
![]() |