“అజ్ఞాత కులశీలస్య..” 40వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 40వ భాగం కపిలేంద్రుడు రధము మీద పయనమవుతున్నంత సేపూ ఆలోచిస్తూనే ఉన్నాడు.     అంతవరకూ ఎన్నో యుద్ధములకు ఉత్సాహంగా వెళ్లాడు. కానీ ఇంతటి నిర్వేదం ఎన్నడూ కలగలేదు.    కం.     అరివీర భయంకరుడై              అరుల గడగడమనిపించ యల్పమయిననూ              సరమమెరుగని కపిలుడే              కొరగానక చనగనేమి కుందుని మహిమన్.    మహారాజు గారి నిరుత్సాహం చూసి, సేనలు కూడా నెమ్మదిగా నడుస్తున్నాయి.    తన సువిశాల సామ్రాజ్యం లోంచి వెళ్తుంటే కపిలేంద్ర దేవుని హృదయం అంత వ్యాకులిత స్థితిలోనూ ఉప్పొంగుతోంది.    కనులారా కాంచుతూ ముందుకు సాగుతున్నాడు.    ఒక్కొక్క దేశం వెనక్కి వెళ్తుంటే, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంత సమరం జరిపాడో, ఎందరు ప్రాణాలు కోల్పోయారో.. ఎంత మంది గాయపడ్డారో గుర్తుకొచ్చింది.    అదంతా అవసరమా? తన రాజ్య పరి రక్షణకై చేశాడంటే అర్ధం ఉంది. దండయాత్రలు చేసి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడం అక్రమం కాదా?    కానే కాదు.. అశ్వమేధయాగం పేరుతో దండయాత్రలు చేసి రాజ్యాలను కలుపుకోవడం పురాణ కాలం నుంచీ ఉంది. తను చేసింది తప్పే కాదు.    మరి ఇప్పుడెందుకీ ఆందోళన?    అంతే మరి తన దాకా వస్తే కానీ తెలియదు.    ఇప్పుడు తన కుటుంబంలోనే చిచ్చు రగులుతోంది. పురుషోత్తముడిని రాజును చెయ్యడం అనుచితమేమో! కానీ.. అతడే సరైన వారసుడని తన అంతరాత్మ చెప్తోంది. ఏమైతే అది అవనీ. అంతా విధి లిఖితం.    విధి.. కపిలేంద్ర దేవుడు భయపడినట్లే రాసి నట్లుంది.    “స్వాగతం తండ్రీ! మీ రాకతో మా గృహం పావన మయింది.” హంవీరుడు స్వాగతం పలికాడు కృష్ణాతీరాన కొండపల్లి వద్ద.    అలిగి వచ్చేసినా, తండ్రికి బహమనీ సుల్తానుల దాడిని తిప్పికొట్టడంలో సహాయ పడ్డాడు హంవీరుడు. ఆ సమరం సమసిన వెంటనే కృష్ణా తీరానికి వచ్చేశాడు.    వచ్చేసినవాడు వెంటనే తన భవిష్యత్ ప్రణాలికలు వేసుకుంటున్నాడు.    మహారాజు రాక మునుపే, పురుషోత్తమునికి జరిగిన పట్టాభిషేకం గురించి విన్నాడు. విని కూడా, చలించక తండ్రికి స్వాగతం పలికాడు.    హంవీరుని చూడగానే ఒక్క సారి పుత్రప్రేమ పెల్లుబికింది కపిలేంద్రునిలో. తప్పుచేశానా అనుకున్నాడు. కానీ.. హంవీరునిలో ఉన్న ఆవేశం పరిపాలనకి సహకరించదని సర్ది చెప్పుకున్నాడు.    హంవీరుని సరసన కూర్చుండ బెట్టుకుని, సంగతులన్నీ వివరించాడు. సామ్రాజ్య పరిరక్షణ చేయగల నైపుణ్యం హంవీర రాకుమారుని కున్నదనీ, పరిపాలనా సామర్ధ్యం పురుషోత్తమునకున్నదనీ, సంయమనంతో అన్నదమ్ములందరూ గజపతుల వంశ ప్రతిష్ఠ నిలపాలనీ.. కొన్ని తరాలు తమ వంశీయులు ఏలికలై చరిత్ర కెక్కాలని కోరాడు.    “తప్పక చేసెదము తండ్రీ! మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.” కపిలేంద్రుని అతిథి మందిరానికి పంపి, తాను ఆంతరంగికులతో సమావేశ మయ్యాడు.                    “సీ.    భగ్గుమనే హృది భగభగ మండగా                              బలమునంతయును సేకరణ సేయ                     గడగడ మనుచును హడలుచు నిలచిరి                          హంవీర మంత్రాంగ యంత్ర మంత                     జనకుడయిన నేమి జతనము లేకనే                          న్యాయము సేయక నడచునాడు                     భువనమందంతయు భోగ భాగ్యము లేక                          భయభ్రాంతులన్ నిండి భంగపడదె                                  ఆ.వె.  చూచి గమ్మునుండ శోటీర్యమే లేద                       చేవ లేక నేను చితికి చితికి                       హీను డనయి బతుకు యీడ్వ లేను నిజము                       తళ్లు జరిపి గెలువ తరుణ మిదియె.”                         హంవీరుని ఆగ్రహానికి సభాస్థలి వణికినట్లయి పోయింది.    “బహమనీ సుల్తానుల, దేవగిరి రాజులు సహకారం తీసుకుని మనం కటకం మీదికి దండెత్తుదాము. ఆ కపట సోదరుని గద్దె దించే వరకూ నాకు విశ్రాంతి లేదు.”    “వారు మన చేతిలో ఓటమి చెందిన వారు ప్రభూ!” సైన్యాధిపతి అన్నాడు.    “అందుకే. మన మాట వింటారు. పత్రాలు వ్రాయించండి. చారులను పంపుదాము. అంతే కాదు, గాంగేయుల సంతతి, వారి బంధువులు ఎచటనైన నున్న వారిని కూడ వెతకండి. శతృవులనందరినీ సమ కూర్చి నలువైపులా దండెత్తుదాము.” హంవీరుడు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుని, తన మందిరానికి వెళ్లి పోయాడు.        సమావేశ నిర్ణయాలు వేగుల ద్వారా విన్న కపిలేంద్రుడు విలవిల లాడుతూ అప స్మారకం లోనికి వెళ్లి, నాలుగు రోజుల అనంతరం మరణించాడు.    గంగా తీరం నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని విస్తరించిన గజపతి సామ్రాజ్య ఆది పురుషుడు నేల కూలాడు. ఎంత వారయినా చేర వలసినది నేల మీదికే.        సీ.    మణుల హారములన్ని మాలలుగ మెడలో                         మాణిక్య మకుటముల్ మస్తకమున               చీనాంబరములెన్నొ చెలువము ధరియించి                         దర్పమునొలికిస్తు తరల నెపుడు               పంచభక్ష్య ములన్ని ప్రతిరోజు భక్షించి                         తేనుపు లెన్నియో తేర్చగాను               మందిరము లనెంతొ సుందరముగ కట్టి                         ఆడంబరమునందు అధివసించి                   ఆ.వె.    రాచరికపు హొయలు రవళింప నంతనూ               ఎదురు లేదు యనుచు ఎన్నటికిని               మదిని తలచి యెంత మదియించి యున్ననూ               అవని యొడికె చేర యదియె విధిగ.                హుటాహుటీ వార్త కటకానికి చేరవేశారు హంవీర, దక్షిణ కపిలేంద్రులు. అన్నదమ్ములందరికీ, పరీక్షలుగా ఉన్న వారి సామంత రాజ్యాలకి కబురందించారు.    పురుషోత్తమునికి వార్త చేరే సరికి వారం గడిచి పోయింది. ఇప్పుడు వెళ్లినా లాభం ఉండదు. మహానది ఒడ్డునకు తల్లితో సహా వెళ్లి కర్మ కాండలు చేశాడు.    కటకానికి తిరిగి వచ్చిన మరునాడు..    తెలతెల వారుతుండగా, మాధవుడు పరుగున వచ్చాడు, తటాకం వద్ద అర్ఘ్యమిడుస్తున్న పురుషోత్తముని వద్దకు.    “వేగులు వార్త తెచ్చారు మహరాజా! హంవీరుడు, రాజులందరినీ కూడగట్టుకుని దండెత్తి వస్తున్నాడట. కృష్ణా, గోదావరీ, నాగావళీ తీరాలన్నీ పర రాజుల పాలు చేసి. కళింగ సింహాసనమాక్రమించడమే అతడి ధ్యేయమట.”    పురుషోత్తముడు, ఒడ్డునకు వచ్చి, పొడి వస్త్రములు ధరించి, చెట్టు నీడను గట్టు మీద కూర్చున్నాడు.    “సమయం లేదు మహారాజా! వారందరూ వస్తే ప్రాణాలకే ప్రమాదం. మనం తప్పించుకోవడమే సమంజసం. నమ్మకమైన వారిని తీసుకుని మనం పక్క దారులవెంట దక్షిణ దిశగా వెళ్దాం. అక్కడ మనకి మిత్రులున్నారు కృష్ణా తీరాన.” మాధవుడు ఆందోళనగా రెట్టించాడు.    “అంతేనా మాధవా?”    “అవును మహారాజా! జగన్నాధ బలభద్రులు ఆదుకుంటే గెలవ గలమేమో కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందిరాలన్నీ ఖాళీ చేసి, వెళ్ల పోదాం. అనువు గాని చోట ఆధిపత్యం పనికి రాదు. మనకు ప్రజల అండ ఉంది. సైన్యాలను సమకూర్చుకుని, తిరిగి వచ్చి, సింహాసనం చేజిక్కించుకుందాం. కపిలేంద్ర దేవుల వారి ఆశ నెర వేరుద్దాం.”    “దారిలో ఎదురు పడితే..” పురుషోత్తమునికి హంవీరుని శక్తి బాగుగా తెలుసు.    “చాలా ప్రదేశాలలో రహస్య మార్గాలు చేయించాను. అక్కడక్కడ ఎవరైనా ఎదురైనా మనం ఎదుర్కోవచ్చును. వారికి మన పయనం ఊహాతీతమే కదా? హంవీర కుమారుడు, తనయునితో కలిసి ఉత్తర దిక్కున విడిది చేశారు. విష్ణు కుండినులు, శిలా వంశీయులు, మత్సర వంశీయులందరినీ కూడగట్టి తిరుగు బాటు చెయ్యాలని ప్రణాలిక వేస్తున్నారు. అందుకని దక్షిణ దిక్కున వారి నుంచి మనకు భయం లేదు. ఇంకెవరైనా దాడి చేసినా మన సైన్యం సామర్ధ్యం తక్కువేమీ కాదు.”    “సరే.. అదే విధంగా చేద్దాము. అనుకూల పరిస్థితులు ఆసన్న మయే వరకూ అజ్ఞాత వాసం చేద్దాము.” పురుషోత్తముడు లేచాడు.    “పారిపోవడం పిరికి వారి లక్షణమే.. అయిననూ సముద్రంలో అలల వలే, వెనక్కి తగ్గుట విజృంభించుటకే మహారాజా! మనం మళ్లీ తళ్లు కొనసాగించి సింహాసనం దక్కించు కుందాము.” వ్యాకులిత మనస్కుడైన పురుషోత్తమునికి ధైర్యం చెప్పాడు మాధవుడు.    అనుకున్నట్లుగానే, మార్గ మధ్యమున శతృదాడి తప్పలేదు.                           సుశిక్షితులైన సైనికుల సహాయంతో, దాడిని తిప్పి కొట్టి తాము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు, పురుషోత్తమ మాధవులు భార్యా బిడ్డలతో, బంధుమిత్ర సపరివారంగా.        హంవీరుడు నిరాటంకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు.    కానీ.. ప్రజలు సంతృప్తిగా కాలం గడపటం లేదు. మహారాజు దృష్టి అంతా రాజ్యాన్ని రక్షించుకోవడం తో, విస్తరించు కోవడం తోనే గడిచి పోతోంది.    కపిలేంద్ర వర్మ దండయాత్రలకు వెళ్లినప్పుడు, పురుషోత్తముడు ప్రజాపాలన చేసే వాడు. ఇప్పుడు మొత్తం మంత్రుల ఆధీనంలో సాగుతోంది.    ఒకరి మాట మీద ఒకరికి గౌరవం లేదు. ఒకరు చెప్పినది ఇంకొకరు కాదంటారు. రాజులేని రాజ్యంలాగ.       కపిలేంద్రుడు సమరాలు తగ్గించి, పాలన మీద దృష్టి పెట్టిన రోజుల్లోనే, కృష్ణా తీరంలో కొండల వెనుక ఒక పట్టణాన్ని మాధవుడు ముందుచూపుతో కట్టించి, జనావాస కేంద్రం కింద చేశాడు.    దక్షిణాన ఉన్న గజపతుల రాజ్యాలన్నింటికీ మధ్యలో..  అది కొండవీడా, రాయల రాజ్యమా, గుంటూరా అనే సందిగ్ధంలో ఉండే ప్రాంతం. అన్ని సదుపాయాలతో రాచ మందిరం దగ్గరనుంచీ కట్టించి ఉంచాడు.    కపిలేంద్ర గజపతి కొండపల్లి, కొండవీడు మొదలైన కృష్ణా తీర ప్రాంతాలన్నీ ఆక్రమించినప్పటి నుంచే ఆ ప్రయత్నం మొదలు పెట్టాడు, భవిష్యత్తుని ఊహించి.    హంవీరుని ఏలుబడి కిందనే ఉన్ననూ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందని ప్రాంతంగా ఉండి పోయింది.           దక్షిణాన ఉన్న రాజ్యాలన్నింటినీ సామంతరాజుల, పరీక్షల పర్యవేక్షణకి పూర్తిగా వదిలెయ్యడంతో అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది.    ప్రజలవద్ద నుండి సుంకాలు వసూలు చెయ్యడంలో నున్న శ్రద్ధ, పాడిపంటల అభివృద్ధిలో కనబర్చుటలేదెవ్వరూ. అతివృష్టి అనావృష్టిలతో అల్లకల్లోలం అయిపోతున్నారు ప్రజలంతా.    అరాచకం ప్రబలిపోతోంది.    పురుషోత్తముడు ఒక పద్ధతిలో తన సైన్యాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. యువకులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతున్నారు. నెమ్మదిగా కోరుకొండ వరకూ పురుషోత్తముడే రాజు కావాలని ప్రజ అనుకునేట్లు ప్రచారం సాగిస్తున్నాడు. అధిక సుంకాల బారి నుంచి అతడే తమని కాపాడుతాడని అందరూ భావించేలాగ జనంలో ప్రాచుర్యం తీసుకొచ్చాడు.    తాము ఏలవలసినది ఏదీ లేకపోవడంతో పూర్తిగా సంచారము మీదనే దృష్టి కేంద్రీకరించి అశ్వ, గజ, సైన్య సమీకరణలో ప్రతీ క్షణం గడుపుతున్నారు పురుషోత్తమ మాధవులు. కలిసి కొన్ని సార్లు, విడి విడిగా ఇరు దిక్కులా కొన్ని సార్లు.    అటువంటి యాత్రలోనే, కొంత సైన్యంతో కృష్ణా తీరంలోని ఒక పట్టణ వీధుల్లో మాధవుని కంట పడింది.. ఒక హృదయ విదారకమైన దృశ్యం.    ఆ ప్రాంతం ఆ సమయంలో ఎవరి అధికారంలో ఉందో అయోమయమే! బహమనీ సుల్తానులా, దేవరకొండ ప్రభువులా, విజయనగరం రాయలా, హంవీర గజపతా!                                        ………………………….         ......మంథాభానుమతి

“అజ్ఞాత కులశీలస్య..” 39వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 39వ భాగం                                                         కపిలేంద్ర దేవుడి రాజ్యపాలనలో అధిక భాగం రాజ్య విస్తరణ, సరిహద్దుల్లో శత్రువులని ఆణచడంలో గడిచి పోతోంది.   కపిలేంద్ర గజపతి మహారాజు దండయాత్రలు తెరలు తెరలుగా, సముద్రంలో అలలవలే సాగుతుండడంతో వాటిని గజపతుల తళ్లు అని పిలువ సాగారు. సూర్య వంశీయుడైన కపిలేంద్రుడు, గజపతిగా పేరు పొందాడు.. గజబలంతో యుద్ధవిజయాలు దక్కుతుండడంతో. అతని వంశమే గజపతుల వంశంగా పేరు పొందింది.   గజపతుల తళ్ళు సాగినంతకాలం, దేశం యుద్ధవాతావరణం లోనే ఉంది. ఆలయాలలో అర్చనలు సైతం ఆగిపోయాయి, ప్రజలు అల్లల్లాడి పోయారు.   కళింగంలో పురుషోత్తమదేవుడు, మాధవుడు మాత్రం రాజ్యాన్ని ప్రజారంజితంగా పాలిస్తున్నారు.. అంతః కలహాలు లేనందు వల్ల.   కపిలేంద్ర దేవుడు గంగానది నుంచి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించి సార్వభౌముడయ్యాడు. “గజపతి గాడేశ్వ నవకోటి కర్ణాట, కలుబరుగేశ్వర” అను బిరుదులు సంపాదించాడు.   అన్ని దేశాలలోనూ, తగు వారిని పరీక్షలుగా నిలబెట్టి, కటకానికి వచ్చి, సుస్థిర పాలన కొనసాగిస్తున్నాడు.   కపిలేంద్రుడు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు. అతని పాలనలో పూరి జగన్నాధుని ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో, భక్త జన సందోహంతో కళకళలాడ సాగింది.   జగన్నాధ రథయాత్ర వైభవాన్ని గురించి చెప్పనే అక్కరలేదు. పద్మావతీ, పురుషోత్తముల వివాహ సందర్భంగా లోక విదితం ఆయింది.   కళింగ సామ్రాజ్యం, సంగీత, నాట్య సాహిత్యాలకి కేంద్రంగా విలసిల్లింది. ఒడిస్సి నాట్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది.   ఉత్తరాన ఢిల్లీ సుల్తానులు, ఈశాన్యాన జానుపూర్ సుల్తాను, దక్షిణాన బహమనీ సుల్తానుల దండయాత్రలు, మతమార్పిడి బెదిరింపుల మధ్య మహారాజు వైదిక మత ఉద్ధరణకై కృషి చేస్తున్నాడు.   వైష్ణవ మతాచరణ చేస్తున్నప్పటికీ, భువనేశ్వర్‍లో కపిలేశ్వరుని ఆలయం నిర్మించాడు.   శైవులను కూడా సమానంగా గౌరవిస్తున్నాడు.   అంతే కాదు..   సాహిత్య గోష్ఠులను జరుపుతూ కవులకు ప్రోత్సాహం ఇస్తున్నాడు.   ఈ సాహిత్య గోష్ఠులు మాధవుని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.     “మాధవ మంత్రీ! ఈ రోజు మన కవితా గోష్టిలో రెండు విశేషాలున్నాయి.” కపిలేంద్ర దేవుడు, సభ ప్రారంభిస్తూ అన్నాడు!”   “అవశ్యం ప్రభూ!” సభ నిర్వహిస్తున్న మాధవుడు మహారాజుకి అభివాదం చేశాడు.   భోజరాజు సభని తలపింప చేస్తున్న గజపతుల సాహిత్య గోష్ఠి కన్నుల పండువగా, వీనుల విందుగా సాగుతోంది.   “మన సభకి సరళ దాసుగారు వస్తున్నారు. వారు మహా భారతం ఒడియా భాషలో రచించారు. వారిని సత్కరిస్తున్నాము.”   “ఇంకోక విశేషమేమి ప్రభూ?”   “నేను ‘పరశురామ విజయం’ అను గ్రంధాన్ని సంస్కృతంలో రాశాను.. ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది వారి చేత ఆవిష్కరింప చేద్దామని..”   “ప్రభూ! నిజమా? తమరికి సమయం ఉండేదే అతి తక్కువ, ఇన్ని పోరుల మధ్య ఈ విధమైన సాహిత్య సేవ ఎంతో ఎన్న దగినది ప్రభూ! చాలా ఆనందంగా ఉంది.” మాధవుడు సంతోషంగా ఏర్పాట్లు చేయ సాగాడు.   “అంతే కాదు మాధవ మంత్రీ.. సరస్వతీ వరప్రసాదులైన మహాకవి సరళదాసుగారిచే ఆవిష్కరింపబడటం కూడా నా కావ్యానికి దక్కిన అదృష్టం.”   “నిజమే ప్రభూ! దాసుగారు మహాభారతాన్ని ఒడియాలో రాశారని తెలుసు.. కవిత్రయం తెలుగులోనూ, పంపకవి కన్నడంలోనూ రాసినట్లుగా.. ఇతిహాసాన్ని రచించారనే కదా సరస్వతీ వరప్రసాది అంటున్నారు?” మాధవుడు అడిగాడు.   “సభికులందరికీ తెలియవలసిన విశేషమొకటి ఉంది, కవీశ్వరుల జీవితంలో.”   “ఏమది ప్రభూ?” సభలోని కవి ఒకరు లేచి అడిగాడు.   “సరళ దాసు కవి, ఒక రైతు బిడ్డడు. ఏ గురువు వద్దా చదువు నేర్చుకోలేదు. అతడి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధేశ్వర పరిదుడు. పొలంలో దున్ను కుంటూ., తనకి వచ్చిన గేయాలేవో పాడుకుంటూ పనులు చేసుకుంటున్నాడు. ఆ పాటలను సరస్వతీ దేవి స్వయంగా విని, సిద్ధేశ్వరుడికి వరం ఇచ్చింది.. పద్యాలు రాయగల శక్తినిచ్చింది. కాళిదాసు కవికి కాళికాదేవి ప్రత్యక్ష్మై ఇచ్చినట్లుగానే. అప్పటి నుంచీ వారికి కవితాఝరి వరప్రసాద మయింది. యుక్త వయసులో ఆ మహాకవి మన సైన్యంలో సైనికాధికారిగా కూడా ఉన్నారు. సరళా దేవి వరప్రసాది కనుకనే అతడిని సరళ దాసు అని పిలుస్తున్నారు.”   తన సైన్యంలో పని చేసిన వాడయినా, తక్కువ కులం వాడయినా.. అతడి విద్వత్తును గుర్తించి తగిన గౌరవాన్ని అందిస్తున్నాడు కపిలేంద్ర దేవుడు.                                        సభ లోని వారంతా లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేస్తుండగా సరళ దాసుని తీసుకుని వచ్చారు ద్వారపాలకులు.   కవిగారికి సముచిత స్థానాన్నిచ్చి, సత్కరించారు మాధవుడు, యువరాజు పురుషోత్తమ దేవుడు.   సరళ మైన భాషలో గ్రామీణ ప్రజలకి కూడా అర్ధమయేలా సరళ దాసు కావ్యాలు నడుస్తాయని, సభలోని పండితులు వివరించారు.   కపిలేంద్ర దేవుని కావ్యం, పురుషోత్తమ దేవుని అభినవ గీత గోవిందం కూడా ఆవిష్కరించి, సాహిత్య సభకి నిండుతనం చేకూర్చాడు, సరళ దాస కవి.   సభ లో నర్తకీమణులు వచ్చి ఒడిస్సీ నృత్యంలో సరళదాస భారతంలోని ఒక ఘట్టాన్ని కన్నుల విందుగా ప్రదర్శించారు.   సరస్వతీ దేవి అణువణువునా ప్రత్యక్షమయిందక్కడ.   సభ అనంతరం ఆంతరంగికులతో మహారాజు సమావేశమయ్యారు.   మాధవుడు, పురుషోత్తముడు, మహామంత్రి గోవింద మహాపాత్రుడు దేశ పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.                            కం.    అంతా బాగేనంటే                                  వింతే కాదా, రవంత విధి తన యునికిన్                                  సుంతైనా చూపవలెన్                                  సంతాపము నొసగ తాను జవముగ రాగా.     “ప్రభూ! కృష్ణా తీరం నుంచి వేగులు వచ్చారు. మిమ్ములను అత్యవసరంగా కలువవలెనట.”   అనుమతి తీసుకుని సమావేశంలో ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చారు ద్వార పాలకులు.      “ప్రభూ! హంవీర కుమారులు తిరుగుబాటుకి ప్రణాలికలు వేస్తున్నారని నమ్మకంగా తెలిసింది. వారి కుమారుడు దక్షిణ కపిలేశ్వరునితో కలిసి కృష్ణా తీరాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబోతారుట.” వేగులు భయపడుతూనే చెప్పారు. మహారాజు గారికి కుమారులాయె మరి. కోపం వస్తే.. కొరడా దెబ్బలే.   ఉలిక్కిపడి చూశారు పురుషోత్తమ మాధవులు.   కపిలేంద్ర దేవుడు మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోయాడు.   ఎప్పుడో ఈ విధంగా జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఇంత త్వరితంగా అనుకోలేదు. కనీసం కొన్ని సంవత్సరాలైనా జీవితంలో ప్రశాంతంగా గడప వచ్చని అనుకున్నాడు.   “సమయానికి వచ్చి హెచ్చరికలు చేసినందుకు ధన్యవాదాలు.” వేగులని పంపి వేశాడు.   “ప్రభూ! ఏమి చేయ దలచుకున్నారు?” మాధవుడు సన్నగా అడిగాడు.   ఒక్క సారిగా వయోవృద్ధుడై పోయినట్లు, నీరసంగా నిస్సహాయంగా చూశాడు మహారాజు.                                                                                                                 “ఏదోఒకటి చేయవలెను మంత్రీ.. అదే ఆలోచిస్తున్నా.”                                                                           “ఏదయినా ఇంక యుద్ధము వలదు మహారాజా! తమరు నిరంతర రణములతో డస్సి పోయి యున్నారు. సామరస్యమున పరిష్కారం ఆలోచించండి ప్రభూ! అన్నదమ్ముల మధ్య ఆ ముష్కురుల వలే మనం కూడనూ..” ఆపేశాడు మాధవుడు.                               అంతటి మహరాజుకి తాను సలహా ఇవ్వటమా!   ఒక నిశ్చయమునకు వచ్చి, సింహాసనము మీదినుంచి లేచాడు కపిలేంద్రుడు.   “పురోహితుల వారికి కబురు చెయ్యండి. అత్యవసరంగా మమ్మల్ని కలవమని.” తన మందిరానికి వెళ్లి పోయాడు. మరొక్క మాట చెప్పకుండా.     కపిలేంద్ర దేవుడు, పురుషోత్తముని తల్లి, పార్వతీ దేవి మందిరంలో సమావేశమయ్యాడు.   “అతి త్వరలో పురుషోత్తమునికి రాజ్యం అప్పగించి కృష్ణాతీరానికి పయనమవుతాను. అచ్చట హంవీర రాకుమారునితో అన్ని విషయాలూ విశదంగా చర్చించి వచ్చెదను.”   పార్వతీ దేవి చిరకాల వాంచ నెరవేర బోతోంది. ఆవిడ సంతోషానికి అవధు ల్లేవు.   “అన్ని విద్యలయందు నిష్ణాతుడు, స్థిర చిత్తుడు, తొందరపాటు లేని వాడు, కవి, పండితుడు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకునేవాడు అయిన పురుషోత్తముడే ఓఢ్ర చక్రవర్తి.”   “ప్రభూ! ఈ వయసులో మీరు ప్రయాణం చెయ్యడం అంత అవసరమా? హంవీర రాకుమారుడు ఇచ్చటకి రానున్నారు కదా! అప్పుడు విడమరచి చెప్ప వచ్చునేమో ఆలోచించండి.” మాధవుడు అనునయించ బోయాడు.   “అంత వ్యవధిలేదు మాధవా! పురుషోత్తమ చక్రవర్తికి మీరే అండగా ఉండాలి. భవిష్యత్తు ఊహాతీతమే. నేను చెయ్యగలిగినది చేస్తాను. ఏది ఏమయినా, నా తరువాత పురుషోత్తముడే రాజ్యపాలన సాగించవలె. ఆ పిదప, ప్రతాపరుద్రుడు చక్రవర్తి కావాలి. అదే నా కోరిక. అందుకే ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను.” పురోహితుని పట్టాభిషేకానికి ప్రయత్నాలు చెయ్యమని చెప్పి, కపిలేంద్రుడు నిష్క్రమించాడు.   పురుషోత్తముడు మౌనంగా ఉండిపోయాడు.   మాధవునికి మనసంతా గుబులుగానే ఉంది.   తురగవల్గన రగడః-      అన్నదమ్ము లైన కాని అవని కొరకు పోరు టేను                                 చిన్న సరుదు బాటు కూడ సేయ వలను కాద యేని                                 ఎన్న యమాయకులు జనులు ఎప్పటికిని వగచగాను                                 పన్నుగాను యోచనంత బాగ సేయ లేక గాని                                 ఇలను యిందుకేన సృష్టి ఇంత చేసె దైవమదే                                 కలగ మారి కరిగి పోగ కనుల ముందు సర్వమదే                                 అలసి సొలసి ఉస్సు రనుచు యంత రొష్టు పడను కదే                                 కలసి మెలసి కలత లేక గడప రాద రోజులదే!   మాధవుడు చింతిస్తూ ఇంటికి సాగాడు.   సరిగ్గా వారం నాటికి పురుషోత్తముడిని రాజును చేసి కపిలేంద్ర దేవుడు కృష్ణా తీరానికి తరలి వెళ్లాడు, తగినంత సైనిక బలంతో.                                      ………………….   ......మంథాభానుమతి

“అజ్ఞాత కులశీలస్య..” 38వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 38వ భాగం     పురుషోత్తమదేవుని తల్లి, పార్వతీదేవి మోము పున్నమి చంద్రుని లా వెలిగి పోయింది.    మిగిలిన భార్యలు మ్లాన వదనాలతో లేచి నిలబడ్డారు.    హంవీర దేవుడు, అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుడు నిశ్శబ్దంగా నిష్క్రమించారు.    రాజ్యం లో ప్రజలందరూ పురుషొత్తమ దేవుని సాక్షాత్తు జగన్నాధుని అవతారంగా భావించి అతడే తమ భావి చక్రవర్తి అని అనుకుంటున్నా, అతని అన్నదమ్ములకీ విషయం అవగాహన అవలేదు.     కపిలేంద్ర దేవుని కుమారులందరూ, మహారాజు తో సహా, దండయాత్రలు సాగించడంలో నిమగ్నమై ఉండగా పురుషోత్తమ దేవుని కళింగ రాజ్యంలోనే ఉంచి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతూ, ప్రజలు సుఖ శాంతులతో జీవించేటట్లు పాలన సాగించేట్లు చూశాడు కపిలేంద్రుడు.    కపిలేంద్రుని కుమారులు అందరు.. పురుషోత్తముడు తప్ప, కాబోయే చక్రవర్తి హంవీరదేవుడనే ఆనుకున్నారు.    రాజ్యం సుస్థిర పడడానికి హంవీరుని పరాక్రమం తోడ్పడిందనడం లో సందేహం లేదెవరికీ. కానీ.. కుమారులలో కొందరు పురుషోత్తముని కూడా ఆహ్వానిస్తూ.. మహారాజు ప్రకటనకి సంతోషిస్తున్నట్లే కనిపిస్తోంది.    మందిరం బయటికి రాగానే, హంవీరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.    “లోకంలో ఎక్కడైనా ఇంతటి అన్యాయం కనగలమా? పట్టపురాణీ కొడుకుని నేను. మహరాజు ఆవిడగారిని పెండ్లి కూడా ఆడలేదు. ఆవిడకి పుట్టినవాడు వారసుడా? కాబోయే చక్రవర్తా? ఈ రాజ్యం నిలవడానికి సరిహద్దుల్లో మనం రణం సలుపుక పోతే కటకం ఒక్కటే ఉండేది కళింగంలో.” నిప్పులు చెరుగుతూ హంవీరుడు తన మందిరానికి వెళ్లాడు. అతని వెనుకే అతని పరివారమంతా..    అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుని దగ్గరగా పిలిచాడు.    “రేపే మనం బయలుదేరుతున్నాం. సూర్యోదయాత్పూర్వమే.. అశ్వశాలకీ, గజ శాలకీ వెళ్లి ఏర్పాట్లు చేయించు. కొండవీడుకి వెళ్లి, ఆక్కడ ఆలోచన సాగిద్దాం. జగన్నాధుని అవతారమట.. చూద్దాం!”      ప్రకటన చేశాడే కానీ కపిలేంద్రుడు, ఆ రాత్రంతా అసహనంగా పచార్లు చేస్తూనే ఉన్నాడు. మిగిలిన కుమారులు మౌనంగా తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని తెలుసు. హంవీరుడు హర్షించడనీ తెలుసు. కానీ తనకి చెప్పకుండా, వీడ్కోలు లేకుండా, మందిరం నుండి నిష్క్రమించడం ఆవేదన కలిగిస్తోంది.    తను చేసిన పని ఎంత వరకు సక్రమమైనది?    తన ప్రియసఖికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికేనా పురుషోత్తముని తన వారసునిగా ఎన్నుకున్నది? అటువంటి ప్రలోభాలకి లొంగుతే తన వివేచనకి విలువేముంది?    అది మాత్రమే కారణం కానే కాదు.    నిజమే.. హంవీరుడు పరాక్రమవంతుడే. ఎన్నో యుద్ధములలో గెలిచి అవలీలగా ఆ రాజ్యాలను ఆక్రమించి, సామ్రాజ్య విస్తరణకి తోడ్పడ్డాడు.    కానీ ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని ఏలగల సామర్ధ్యం అతనికి ఉందా?     పరిపాలనకి పరాక్రమం ఒకటే సరిపోదు.    సమన్వయం, సరైన సమయంలో తీసుకోవలసిన నిర్ణయం, వివేకం, విచక్షణ, శాంతం.. ఎన్నో లక్షణాలు కావాలి. తళ్ళు సాగిస్తూ, రాజ్యం పెంచుకుంటూ పోతుంటే ప్రజల కష్ట సుఖాలు చూడగలవారెవరు?    పురుషోత్తముడు సౌమ్యుడు. అవసరమైనప్పుడు తన పరాక్రమాన్ని చూపగల ధీరుడు. అతనికి దైవకృప కూడా ఉందని కాంచీపురం రణంలోనే నిరూపించబడింది. తన వద్ద పొరపాటున్నపుడు, ఆవేశంతో తప్పు చేయబోయినప్పుడు వెనుకడుగు వేసి, పెద్దల మాట వినగలవాడని, పద్మావతి పరిణయం సమయాన తెలిసింది.    పైగా తనకి తోడు నీడగా మాధవ మంత్రి ఉండనే ఉన్నాడు.    తన నిర్ణయం ముమ్మాటికీ సమంజసమైనదే.    ఆ ఆలోచన వచ్చాక.. తనని తాను సమర్ధించుకున్నాక, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక కాస్త నిద్ర పట్టింది కపిలేంద్ర దేవునికి.    “ప్రభూ!” ఎవరో పిలుస్తున్నట్లు లీలగా వినిపిస్తోంది. కలలోనా ఇలలోనా..    కను రెప్పలు తెరిచాడు కపిలేంద్ర దేవుడు. తలంతా భారంగా.. కనురెప్పలు బరువుగా అనిపించాయి. గవాక్షాలకున్న తెరలు తొలగించారెవరో. సూర్యకిరణాలు తీక్షణంగా పలుకరించాయి.    ఎందుకు లేపాలి? కాస్త విశ్రాంతి తీసుకోనియ్యరా? కోపంగా అటూ ఇటూ చూశాడు.    పరిచారకుడు.. చేతులు కట్టుకుని నిలుచున్నాడు, వినయంగా. ప్రభువు ఆగ్రహానికి గురి కావలెనా అనుకుంటూ..    భృకుటి ముడిచి చూశాడు మహారాజు.    “యువరాజు పురుషోత్తమ దేవుడు, మాధవ మంత్రి తమ దర్శనార్ధమై వేచి ఉన్నారు ప్రభూ.. మూడు ఘడియలు దాటింది.”    ఇరువురి మిత్రుల, ఇటువంటి ఆగమనం ఇదే ప్రధమం. ఏదో అనూహ్యమైన విశేషమే జరిగి ఉంటుంది.    మహారాజు త్వరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెలుపలికి వచ్చారు.     పురుషోత్తముడు ఎదురేగి తండ్రిగారిని తోడ్కొని వెళ్ళి ఆసీనులని చేశాడు.    మాధవుడు అభివాదం చేశాడు. అతని కళ్లలో ఏదో వ్యాకులత.    కపిలేంద్రుడు ఇరువురినీ మార్చి మార్చి చూశాడు.. మౌనంగా.    “ప్రభూ! యువరాజు హంవీర దేవుడు, తమ బలగాన్ని తీసుకుని వెడలి పోయారు. గజములు, అశ్వములు, పదాతి దళం..”                                 మాధవుడు వర్ణించాడు.. ఏమేమి తీసుకుని వెళ్లారో..    తల పంకించాడు కపిలేంద్రుడు. హంవీరకుమారుని వెంట వెళ్లడం అలవాటే కనుక మారు మాటాడక తరలి ఉంటారు సేనానులు.    “ఎటు పక్కగా వెళ్లారో తెలిసిందా?”    “దక్షిణ దిక్కుగా ప్రభూ!”    “కొండవీటి స్థావరానికి వెళ్లి ఉంటారు. ఫరవాలేదు. నేను త్వరలో వెళ్లి  కుమారుని ఊరడించి సర్ది చెప్పి వచ్చెదను. మీరు నిశ్చింతగా ఉండండి.”    “సేనాధిపతి దామెర తిమ్మభూపతి తమ దర్శనార్ధం వచ్చారు ప్రభూ!” కొలువు తీరి ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చి చెప్పాడు సేవకుడు.    హంవీరుడు అలిగి వెళ్లిపోయి పది దినములయింది. సైన్యంలో కొంత భాగమును.. రాత్రికి రాత్రి సేకరించగలిగినంత మందిని తోడ్కొని వెళ్లాడు. కృష్ణాష్టమి సంబరాలలో ఉన్నారు కనుక ఎక్కువ మందిని.. సేకరించలేక పోయాడు.    కపిలేంద్రుడు పెద్ద కుమారుని వద్దకు వెళ్లుటకు సంసిద్ధమవుతున్నాడు.    పురుషోత్తమునికి, కోట పరిరక్షణ బాధ్యత అప్పగించి, సభలో అందరికీ వారి వారి పనులను నిర్దేశించడానికి సభనేర్పాటు చేశాడు.    సేనాధిపతుల నందరినీ ఆప్రమత్తులై ఉండాలని ఆదేశమిచ్చాడు.     “తిమ్మనాయకుల వారిని లోనికి తోడ్కొని రండి.” ఆనతిచ్చాడు ప్రభువు.    దామెర తిమ్మనాయకుడు తెలుగు వాడు.    కపిలేంద్ర గజపతికి, హం వీరుని వలెనే యుద్ధములయందు కుడి భుజమై విజయానికి కారకుడైన వాడు.    తెనుగు కవులు అతడి మీద చాటువులు కూడా అల్లారు.. అతని పరాక్రమమును  వర్ణిస్తూ..    “ప్రభూ! బహమనీ సుల్తానులను ఓడించడానికిదే మంచి సమయం. అచ్చట కరవు తో ప్రజలు అల్లల్లాడి పోతున్నారనీ, సైనిక బలం తగ్గిందనీ, బలహీనంగా ఉందనీ వార్తలు వచ్చాయి. హంవీర కుమారుడు దక్షిణానికి సైన్యాన్ని తీసుకుని వెళ్లినా మన దగ్గర గజ బలం, అశ్వబలం బాగా ఉంది.”    కపిలేంద్రుడు నిమేష మాత్రం ఆలోచించాడు.    తిమ్మనాయకుడు ఇంతవరకూ మంచి సలహాలే ఇచ్చాడు.    గోదావరీ, కృష్ణాతీరాలను స్వాధీన పరచుకున్నాము కదా.. తెలంగాణా కూడా మన ఏలుబడిలోకి రావాలి. అవశ్యం మనం బహమనీ సుల్తానుల మీదికి తళ్లు సాగిద్దాం. ఈ విషయం ఎక్కడా పొక్కనీయ వద్దు. దక్షిణ దిశకే, తీరానికే వెళ్తున్నామనే చెప్పండి.”    “మరి.. హంవీర కుమారుడు అలిగి వెళ్లి పోయారు కదా.. ఏ ఉపద్రవం వస్తుందో! మీరొక్కమారు వెళ్లి వస్తే బాగుంటుందేమో ప్రభూ!” మాధవుడు నెమ్మదిగా అన్నాడు.    “ఫరవాలేదు మాధవ మంత్రీ.. ఇంకా చాలా సమయముంది. కుమారుని కూడా మాకు తోడుగా యుద్ధానికి రమ్మని కబురు చేద్దాము.. మా మాట కాదనరు. . వాయు వేగంతో వెళ్లగలిగే అశ్వాలని తీసుకుని ఇరువురు చారులను, కుమారునికి పత్రం రాసి పంపుతాను.  బహమనీ సుల్తానుల మదమణచి, మన రాజ్యం స్థాపించాలి అక్కడ. తిమ్మనాయకుల సలహా తీసుకుందాము.”    తండ్రిగారి లేఖనందుకున్న హంవీరుడు తన సైన్యాలని తీసుకుని మధ్య మార్గమున తండ్రిగారితో చేరాడు.     స్వభావ సిద్ధంగా అతనికి రణమందున్న అభిలాష, సింహాసనం సంగతి చూసుకోవడాని కింకా సమయముందిలే అన్న ధీమా.. హంవీరుని బహమనీలపై యుద్ధానికి సన్నద్ధం చేశాయి.    కపిలేంద్రదేవుని సైన్యం వాయవ్య దిశగా సాగింది.    తిమ్మ భూపతి సేకరించిన వార్త నిజమే.. బహమనీ సుల్తాను అహమద్ షా అస్తవ్యస్త స్థితిలో ఉన్నాడు. తాత ఫిరోజ్ షా వేల సంఖ్యలో హిందువులని హతమార్చాడు. దాంతో సైనికులు గణనీయంగా తగ్గి పోయారు. దానికి తోడు కరవు.. ప్రజలు తిండిలేక కొట్టుకుంటున్నారు.    అదే సమయంలో రాజధాని గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చారు.    బహమనీ సుల్తానుతో స్నేహంగా ఉంటున్న దేవరకొండ రాజు, ఓరుగల్లు వెలమ దొరలు ఓఢ్ర దేశాధీశునికి సహాయ పడ్డారు.    ఇంతటి గందరగోళంలో బహమనీ సుల్తాన్ లొంగిపోయి కప్పం కట్టటానికి ఒప్పుకున్నాడు.    విజయోత్సాహంతో దేవరకొండ, ఓరుగల్లు రాజ్యాలను కూడా కలుపుకుని, ఓఢ్ర జండా నెగుర వేశాడు కపిలేంద్ర గజపతి.        విజయాలన్నిటిలో తిమ్మ భూపతి పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.    గజపతులు సంపాదించిన రాజ్యాలన్నింటిలోనూ అతని ప్రాధాన్యతను గుర్తించిన కవులెవరో చాటువులల్లి, అగ్రహారాలు తాము సంపాదించుకున్నారు.     తిమ్మభూపతిని ప్రస్తుతించినా ఆ చాటువుల్లో గజపతుల తళ్లన్నీ వివరించారు.                      * సీ.  కటకంబు లోపలి గజవాడ బెజవాడ                                   యొద్ది బండారల్లు యోరుగల్లు                            తోటకూరంగళ్ళు తొండమారయగుళ్ళు                                     పెరటి బచ్చలితోట బెడదకోట                            వీర పుంగవులకు వేటలు మాడెలు                                   మణికి విహారంబు మాహురంబు                            గజయూధముల గట్టు గంబాలు గంబాలు                                    పట్టణంబు గుర్రాల పల్లె ఢిల్లి                   తే.గీ.    ఇట్టి గజరాజు శౌర్యంబు లెన్ని చూడ                              కొలది మీరిన దేవర కొండ కొండ                              నీదు కోర్గంటి సింహంబు నిఖిల బిరుదు                              దిశలముల సూపు దామెర తిమ్మ భూప.               *(అజ్ఞాత కవి విరచితము)    ఆ విజయ పరంపర ఒక దశాబ్దం పాటు కొన సాగుతూనే ఉంది.    తెలంగాణా తరువాత, విజయనగరం నరపతులు కూడా దాసోహ మన్నారు. కపిలేంద్ర దేవుని ప్రశస్తి ఢిల్లీ వరకూ పాకింది. హంప (రాయలసీమ), ధారా(కర్ణాటక), కలుబరుగ (మహారాష్ట్ర), ఢిల్లీ లను వణికించేశారు గజపతులు.    ఈ విజయాలన్నింటినీ కపిలేశ్వరుని తామ్రశాసనంలో నిక్షిప్త పరచారు పురుషోత్తమ మాధవులు.    కపిలేశ్వరునికి “నవకోటి కర్ణాటేశ్వరా” అను బిరుదు, “కలుబరుగేశ్వరా”కి కలిసింది.    తన ఘన విజయాలకి కారకుడైన మనుమడు, హంవీరుని కుమారుడు నైన దక్షిణ కపిలేశ్వర కుమార మహాపాత్రుని, దక్షిణాన జయించిన ప్రాంతాలకి పరీక్షగా నియమించాడు కపిలేంద్రుడు.    అప్పటికి హంవీరుడు, దక్షిణ కపిలేశ్వరుడు సంతుష్టి చెందినట్లే..                                      ......మంథాభానుమతి    

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 37వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 37వ భాగం    “ఏ జన్మలోనో ఇక్కడ విహరించినట్లుగా అనిపించింది హుస్సేన్ గారూ.  కళింగ దేశీయుడిని, ఈ ప్రాంతమునకు రావడం ఇదే కదా! చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి ఇచ్చట”    మాధవుని బుద్ధి హెచ్చరించింది.. ప్రమాదంలో పడవద్దని.    “ఏమయినా.. మీ పద్యం వింటుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చింది మంత్రిగారూ! మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్లతో కూడి ఆ విధంగానే ఆటలాడే వాళ్లం. ఆ ఆనంద మంతా చెల్లా చెదురై పోయింది.. విధి విలాసం.” ఆజమ్ హుస్సేన్ విచారంగా అన్నాడు.    “అయితే.. మీ కుటుంబం అంతా..” మాధవుడు ఆగిపోయాడు. కంఠం నొక్కుకు పోయినట్లు అనిపించగా.    “చెల్లా చెదరై పోయింది. మునుపటి రాజుగారికి దగ్గరి బంధువులం మేము. గణేశ వంశస్తులం. కత్తికొక కండగా నరికిన వారిని నరకగా మిగిలిన వాళ్లం.” చిన్నా భిన్నం అయిన తన కుటుంబాన్ని తలచుకుని, కళ్ల నిండా నీళ్లతో అన్నాడు ఆజమ్ హుస్సేన్.    “అవును విన్నాను. గణేశుల వంశం వారినందరినీ బలవంతంగా మతం మార్పించేశారని.”    “అంతే కాదు.. ఇష్టం లేని వారిని మా కళ్ల ముందే చంపేశారు. మా పిన్నిగారు కొడుకుని తీసుకుని పారి పోయారు. వారి జాడ తెలియలేదు. అందరం కలసి మెలసి ఆడుకుంటూండే వాళ్లం. మీ పద్యం వింటూ ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తుకొచ్చాయి.” హుస్సేన్ విచారంగా అన్నాడు.    ఒక్క నిమేషం ఆలోచించాడు మాధవుడు.    తనెవరో చెప్పాలా అని.    చెప్తే.. తన కుటుంబాన్ని కలుసు కోవచ్చును. కానీ వివేకం వద్దని హెచ్చరించింది. అమ్మ మాటని పాటించమంది.                                                   కం.    గతమంత చరిత్ర యెగా                               వెతకల్గిన చేయునంత విధములు లేవే                               గతి లేదు విధియె రాసెను                               కతలుగ చెప్పుకొన తప్ప కాలము గడవన్.    “అంతే హుస్సేన్ సాబ్. పాత సంగతులు తలచుకొనుట తప్ప చేయ గలిగిందేమీ లేదు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ దేశం.. కాదు కాదు.. మన దేశం సస్య శ్యామలంగా ఉంది. కలకాలం ఆ విధంగా ఉండాలని ఆ దుర్గా మాతని కోరుతున్నాను. మహరాజు గారి ఆనతి అయింది. మేము రేపే బయలు దేరుతున్నాము.” మాధవుడు వీడ్కోలు చెప్పి తన విడిదికి బయల్దేరాడు.    ఒకే ఒక్క సారి హుస్సేన్ గారి ఇంటికి తీసుకెళ్లమని అడగాలన్న కోరికని అదిమి పట్టి, ముందుకి నడిచాడు.    ఆజమ్ హుస్సేన్ కూడా అర్ధ మనస్కుడై అచ్చటి నుంచి కదిలాడు..    రక్త బంధం వెనక్కి, రాజకీయం ముందుకి నడవ మన్నాయి. రాజకీయమే గెలిచింది.    మాధవుని జీవితంలో వంగ దేశంలో గతమనే అధ్యాయానికి తెర పడి పోయింది.    విజయోత్సాహంతో కటకం ప్రవేశించారు కళింగ సైనికులు.    కోటలోనికి ప్రవేశిస్తూనే మాధవుడు తన గృహమునకు సాగి పోయాడు. సంధ్య వేళ దాటి ఘడియ అయింది.    కోటంతా దీప తోరణాలతో అలంకరించారు.    మాధవుడు అన్య మనస్కంగానే కోటలో తన అశ్వాన్ని నడుపుతున్నాడు.    అన్న గారు కలిస్తే, కనీసం.. తన వారు ఎవరెవరు ఉన్నారో కూడా అడగ లేక పోయాడు.    వంగ దేశానికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది. అంతా భ్రమ కానీ, వెళ్లడం వెళ్లకపోవడం తన చేతిలో ఏముంది?    రాజుగారి ఆనతిని కాదన గలడా?    తన ఇంటిని సమీపిస్తూ ఉండగానే, అతడి కన్నులు విచ్చుకున్నాయి.    అది తన గృహమేనా?    ఏమా అలంకరణ..                                                                             ద్వారమందే ఎదురేగి, హారతి ఇచ్చింది ధర్మపత్ని. ఆ వెనుకే నిలిచి ఆనందం నిండిన కన్నులతో ప్రియ పుత్రుడిని చూసుకుంటున్నారు నంద, గౌతమిలు.    సీతమ్మ అస్వస్థత కారణంగా ఎక్కువ సమయం తన కక్ష్య లోనే గడుపుతోంది.    “ఇదీ నా ఇల్లు. వీరంతా నా వాళ్లు. గతాన్ని తలచుకొని వగచడం మానివేయాలింక” మాధవుడు మనసు దిటవు పరచుకుని ధృడ నిశ్చయంతో, చిరు నవ్వుతో అందరినీ పలుక రించాడు.    కపిలేంద్ర దేవుని కుమారులందరూ రాజ్య విస్తరణ జరుపుతుండగా, పురుషోత్తమ దేవుడు, కళింగ రాజ్యానికి కాపలాగా ఉన్నాడు, తండ్రి యానతి మేరకు.    పురుషోత్తమ దేవునికి గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కాలం గడుపు తున్నాడు మాధవుడు.    చెరువులు తవ్వించడం, కాలువలు తీయించడం.. పాడి పంటలకు లోటు లేకుండా పాలన సాగుతోంది. గజపతుల పాలనలో సామాన్య ప్రజానీకం లోటు లేకుండా జీవిస్తున్నారని ఇతర దేశాలలో అనుకుంటున్నారు.    నంద గౌతమిలకు వృద్ధాప్యపు ఛాయలు సోకుతున్నాయి. సీతమ్మ స్వర్గారోహణ చేసింది. మాధవుడే శాస్త్రోక్తంగా కర్మ కాండలు చేశాడు.    వివాహమైన ఏడు సంవత్సరాలకి, కాదంబరీ దేవి శుభవార్త మాధవుని చెవిన వేసింది. నందుని గృహమంతా ఆనంద డోలికలలో ఊగి పోయింది. ఇంటిలోనికి పసిపాప రాబోతుంటే.. ఇంకేం కావాలి?    అదే సమయంలో పురుషోత్తమ దేవుని భార్య పద్మావతీ దేవి కూడా శుభవార్త చెప్పింది.    అంత కన్న సంతోషమేముంటుంది..    మహారాజు కపిలేంద్ర వర్మ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. రాజమండ్రీ తో పాటుగా కృష్ణా తీరం కూడా గజపతుల కైవశ మయింది. గజపతుల తళ్లు సాగుతూనే ఉన్నాయి. రాజకుమారుడు హంవీరుడు, వాని పుత్రుడు, మిగిలిన అన్న దమ్ముల సహకారంతో అదే పని మీద ఉన్నారు.    గంగా నది నుంచీ కావేరి వరకూ విస్తరించింది గజపతుల సామ్రాజ్యం.    ఒక శుభ ముహుర్తాన కాదంబరీ దేవి అమ్మాయిని, పద్మావతీ దేవి అబ్బాయిని ప్రసవించారు.    మాధవుడు తన కుమార్తెకు కాత్యాయని అని పేరు పెట్టాడు.. కాదంబరీదేవికి కూడా చాలా నచ్చింది ఆ పేరు. నందుని ఆనందమునకైతే అంతే లేదు. గౌతమికి ఎప్పుడూ చిన్నారి కాత్యాయని ధ్యాసే.    మాధవుని ఇంటనే కాదు.. కోటలోని తోటలన్నీ కిలకిలా రావములతో నిండి పోతున్నాయి.    అప్పటి వరకూ తాము ఎంతటి ఆనందాన్ని కోల్పోయారో.. పాపాయి కాత్యాయని ముద్దు మాటలతో తెలియ వచ్చింది. ఆట్టి ఆనందానికి నోచుకున్నందుకు జగన్నాధునికి సర్వదా కృతజ్ఞతలు తలుపుకుంటాడు నందుడు.    మాధవుని రాక తమ జీవితాలనే మార్చి వేసిందంటుంది గౌతమి.    ఆ రోజు కృష్ణాష్టమి.    కాత్యాయనిని చిన్ని కృష్ణునిలాగ అలంకరించి సాయం కాలం భవనం ముంగిట తోట లోనికి తీసుకు వచ్చారు. అప్పుడే మహరాజు కూడా వన విహారానికి వచ్చి, మాధవుని ఇంటికి వచ్చారు. మనుమరాలు బుడిబుడి అడుగులతో తాత కెదురేగి స్వాగతం పలికింది.    కాలి మువ్వలు మంజీర నాదాన్ని పలికాయి.    “చిన్ని కృష్ణుడు వచ్చేశాడే నా వద్దకు.” తాత సంబరంగా, మీసాలు దువ్వు కుంటూ దగ్గరగా తీసుకుని ఎత్తుకున్నారు. ఎన్ని రాజ్యాలు జయించినా కలుగని ఆనందం కపిలేంద్ర దేవుని మోమున.    “అవును ప్రభూ! మనందరికీ ఆనందం కలిగిస్తూ వచ్చేశాడు.        “మ.     మరియా మంజుల నాదమున్ మురిసెనా మాయిల్లు, ముచ్చట్లతో                    మురిపాలన్ మునిగేముగా, మిసిమితో మోగేటి మువ్వల్సడిన్                    సిరినిం బోలు వరాల పాప తన బోసిన్నవ్వులన్ జల్లగా                    హరి రాడా మరి సంబరాల కిపుడే హాయౌ కదా సందడిన్.”        “ఎంత చక్కని పద్యం అల్లావయ్యా. సెభాష్.” మెళ్లో ఉన్నముత్యాల హారం తీసి అల్లుడి మెడలో వేశాడు కపిలేంద్రుడు.    కాదంబరీ దేవి పరుగు పరుగున వచ్చి తండ్రిగారికి పాదాభివందనం చేసింది.    “దీర్ఘాయుష్మాన్ భవ. బాగున్నావా తల్లీ?” ఒకే కోటలో ఉన్నా తండ్రీ కూతుళ్లు కలుసు కోవడం ఎప్పుడో కానీ పడదు.    “బాగా ఉన్నాను తండ్రీ. అంతా మీ ఆదరణ, ఆశీర్వచనముల ప్రభావము.                    సీ.       అత్తమామలు నన్ను యాదరించుచు నెంతొ                                     కన్న కూతురివలె కాచు కొనగ                               అనురాగ జలధిని యలరించి హర్షమున్                                     పతియె చెంతనె యుండి పలుకరించ                               ముద్దులొలుకు పాప మురిపించి యొడిచేర                                      మాతృత్వ మధురిమ మనసు నిండ                               మా మంచి గృహమిదే మది సంతసమునుంచు                                       కనరాదు యెందునా కలత యెపుడు                                     ఆ.వె.   చదువులమ్మ యిచట సంగీత సాహిత్య                                   రూపు దాల్చి నిలిచె యెపుడు తాను                                   నెమ్మి యిచట సతము కమ్మగా వడ్డించు                                   వచ్చి పోవు వారి కిచ్చకముగ.”    తియ్యని కంఠస్వరముతో, రాగయుక్తంగా వీనుల విందుగా తన సంసారాన్ని వర్ణించిన ప్రియ పుత్రికని హత్తుకుని, నుదుటి మీద చుంబించి, మెడలోని నవరత్న హారాన్ని కుమార్తెకి అలంకరించాడు మహా రాజు.    “ఇదంతా పతి సాంగత్య మహిమే! అంతియే కాదు.. మీ సోదరుడు పురుషోత్తమ దేవుడు కూడా మంచి కవే. గ్రంధ రచన సాగిస్తున్నాడు సుమా! మాధవ మంత్రి గారికి తెలిసియే యుండును. మనము తెలుగు నాడు నందలి రాజ్యాలనేలుతున్న సమయంలో కమ్మనైన తెలుగులో మీరు కవిత లల్లుతుంటే అవధిలేని ఆనందం కలుగుతోంది మాకు. మా జన్మ సార్ధక మైనట్లే మంత్రీ!”    “మహారాజా! మా గృహం పావనం చేయరా?” కపిలేంద్ర దేవుడు వచ్చిన వార్త విని పరుగున అచ్చటికి వచ్చిన నందుడు అర్ధించాడు.    “మరొక్క మారు తప్పక వచ్చెదము మహా పాత్రా! మిమ్మందరినీ కృష్ణాష్టమి వేడుకలకి మా మందిరాని ఆహ్వానించాలని వచ్చాము.”  ఆప్యాయంగా నందుడిని ఆలింగనం చేసుకుని అన్నాడు.    “మీరు రావాలా మహారాజా! ఎవరితో నైనా..”    “ఇది మహారాజు ఆహ్వానం కాదు మిత్రమా! వియ్యాలవారి పిలుపు. మీ కోసం ఎదురు చూస్తుంటాము.” కపిలేంద్రుడు తన మందిరానికి పయనమయ్యాడు.    రాచ మందిరం ముందే.. కృష్ణుని రాసలీల అలంకరణ చేశారు. చిన్నారి కాత్యాయని బొమ్మల దగ్గరగా పరుగెత్తుకుని వెళ్లి అన్నీ సుతారంగా పట్టుకుని ఆనందిస్తోంది.. తన చిరు గజ్జలు సవ్వడి చేస్తుండగా.          ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 36వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 36వ భాగం   వంగ దేశంలో కొలువు తీరి ఉన్నాడు కపిలేంద్ర దేవుడు.   హృదయం ఉప్పొంగుతుండగా.. మాధవుడు అన్నిటా తానై నిలిచి నిర్వహిస్తున్నాడు. గణేశుల పాలన అనంతరం హిందూ రాజు రాజ్యం చేపట్ట బోతున్నాడు.   కొలువులో అత్యధిక శాతం ముస్లిములే..   చాలా మంది బలవంతంగా మత మార్పిడి గావింప బడ్డవారే. అందుకే వారికి ముసల్మాను రాజైనా, హిందూ రాజైనా ఒకటే. రాజు నిర్దేశించినట్లు నడుచుకోవలసిందే.   ఒక్క సారి సభంతా కలయజూశాడు మాధవుడు.   ఇరుపక్కలా వరుసగా అమర్చి ఉన్న ఆసనాలలో.. నాల్గవ వ్యక్తి మీద అతడి దృష్టి నిలిచింది.   తన తండ్రిగారి పోలికలు చాలా కనిపించాయి.   చిన్నాన్న.. నరసింహ గణేశ్. ఇప్పుడే పేరుతో పిలుస్తున్నారో!   కళ్లలో చమరుస్తున్న నీటిని వెనక్కి తోసేశాడు. దేశం వదిలి వెళ్లినప్పుడు మాధవుని వయసు పది సంవత్సరాలకి అటూ ఇటూ ఐనా.. అనుభవాలు అతడికి అంతకంటే ఎక్కువ ఏళ్లని ఇచ్చాయి, మానసికంగా.   అతడు ఎక్కడ గుర్తుపడ్తాడో అని వెంటనే తల తిప్పి సభలో మిగిలిన వారిని పరికించాడు.   సగం మంది పైగా తన తండ్రికి తెలిసిన వారే.   కానీ.. ఎవరూ తనని గుర్తించినట్లు లేదు.   చనిపోయాడని అనుకుంటున్నారు. పైగా వేష భాషలు ఓఢ్ర యువకుని వలెనే ఉన్నాయి.   కానీ.. సభలో ఉన్నవారి అహార్యాదులన్నీ ముసల్మానులవే.   వాళ్లందరూ స్వచ్ఛందంగానే ఆవిధంగా తయారయ్యారా?   సందేహమే.. ముమ్మాటికీ కాదు.   అందరి మొహాల్లో ఒక రకమైన విరక్తి భావం. ఇప్పుడు కొత్త రాజెలా ఉంటాడో అనే ఆసక్తి కూడా కనిపించలేదు.   ఏదేమైనా.. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు నిలుస్తుందో తెలియదు.. కానీ, హిందూ రాజ్యం ఏర్పడింది వంగ దేశంలో.   ఢిల్లీ సుల్తానులెలాగా కాచుకునుంటారు.. వంగ దేశాన్ని కబళించడానికి.   అందరూ కలుస్తే ఒక్క హిందూ రాజుని తరమడం ఏమంత కష్టం?   అదంతా తరువాత..   ప్రస్తుతం వరించిన విజయాన్ని.. సంబరాలతో జరుపుకోవడమే సమంజసం.   ఎంతగా సర్ది చెప్పుకుందామనుకున్నా.. కన్నీరు ఆపుకో లేక పోయాడు మాధవుడు. కళ్లలో చిప్పిల్లుతున్న నీటిని, చూపుడు వేలితో విదిల్చాడు, తన పక్కకి తిప్పి.   ఎవరూ చూడలేదనే అనుకున్నాడు.   కానీ చూడ కూడని వారే చూశారు..   “ఏమది మాధవ మంత్రీ! ఎందుకా ఆందోళన?” సింహాసనం మీద ఆసీనుడైన కపిలేంద్రుడు అడిగాడు.   “ఏం లేదు ప్రభూ.. ఇవి ఆనంద భాష్పాలు. ఇంతటి వైభవం చూస్తుంటే సంతోషంతో..” నదరక బెదరక, ధీమాగా అన్నాడు, చిరు నవ్వుతో.   మహారాజు కూడా మందహాసం చేశాడు.   సభనంతా మాధవుడే నిర్వహిస్తున్నాడు. వంగ భాష వచ్చీరానట్లుగా మాట్లాడుతూ.. మధ్యలో సంస్కృత పదాలని ఉపయోగిస్తూ.. వంగ భాషలోనే మాట్లాడాలనే ఉత్సాహాన్ని అదిమి పట్టి.                                  పాండువా, జానుపూర్ సుల్తానుల వద్ద నుంచి సామంతులుగా ఉంటామని అంగీకార పత్రాలు తీసుకున్నాడు.   అంతే కాదు..   కప్పం కట్టించుకుని, ప్రతీ వత్సరమూ శ్రావణ మాసం లోగా కప్పం కట్టాలనీ, అది, ఆరు నూర్ల అశ్వాలతో పంపాలనీ ఒప్పందం చేసుకున్నాడు.. అది ఎంత కాలం సాగుతుందో అని మనసులో చింతిస్తూనే..   వెంటనే ఒక శాసనం తయారు చేయించాడు..   వంగ దేశాన్ని గౌడ దేశం అని కూడా అంటారు.   గౌడ దేశాన్ని జయించిన మహారాజు కపిలేంద్ర వర్మకి “గౌడేశ్వర” అనే బిరుదునిచ్చినట్లుగా ఆ శాసనంలో రాయించాడు మాధవుడు.   సభంతా కరతాళ ధ్వనులతో మారు మోగి పోయింది.   సభికులంతా ఒక్కొక్కరే వచ్చి తమ పరిచయం చేసుకుని, మహారాజు గారికి అభివాదం చేసి వెళ్తున్నారు.   మాధవుని పినతండ్రి వచ్చాడు. కుతూహలంగా చూశాడు మాధవుడు. అప్పటికి తన భావ కల్లోలాన్ని అదిమి పట్టగలిగాడు.   “నా పేరు ‘నయీమ్ హస్సేన్’ సాబ్. ఇక్కడ కొత్వాల్ గా పనిచేస్తున్నాను.” ఉర్దూలో పరిచయం చేసుకుని.. మాధవుని వంక కూడా చూసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు నయీమ్ గా మారిన నరసింహుడు.   మహరాజు తరువాత వచ్చిన కోశాధికారితో మాట్లాడుతుండగా, పక్కకి తిరిగి పై వస్త్రంతో మొహం తుడుచుకున్నట్లుగా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు మాధవుడు.   చిన్నా భిన్నమై పోయిన తన కుటుంబం..   చిన్నాన్న గారి పిల్లలు ఎలా ఉన్నారో.. ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఉండాలి.   నయీమ్ మాత్రం మాధవుని గుర్తించలేదని తెలుస్తోంది.                సీ.    చిందర వందరై చెదరి పోయినవయ్య                             చక్కనైన కుటుంబ సంవిధములు                      కొందరి మత మౌఢ్య కుత్సిస యుక్తిచే                              కొందరి యత్యాశ కోరికలకు                      నలిగి నాశనమైన నామరూపము లేని                              నడిచేటి శవములై నలుగు వారు                      ఎందరెందరిచట ఈ సభ యందున                              కలరో యెవరయిన కనుగొనగను               తే.గీ.  మానవుని మనుగడ కేమి మనన కేమి                      కొఱత లేకుండుటకు నేమి కోర వలెను                      మారణములేలనో మరి మతములేల                      శాంతి సౌఖ్యము కల్గిన చాలు గాద.      (సంవిధము= జీవిక, బ్రతుకు తెరువు, మనన= ఆయువు)     మాధవుని ఆలోచనలు, మనసులో ఛెళ్లుమని కొట్టిన చర్నాకోల దెబ్బకి ఆగిపోయాయి.   మరి తాము చేస్తున్నదేమిటి?   మారణ హోమమే కదా!   ఎంతమందిని చంపాడో లెక్కేమైనా ఉందా?   కానీ.. తన చేతిలో ఏముంది? రాజు సేవకునికి వేరే దారి ఉండునా? చెప్పిన పని చేయుటే కదా! రాజు అనుగ్రహం ఉన్నంత కాలము ఏ సమస్యా రాదు. ఆగ్రహం వస్తే ఏమగునో తెలియదు.   యాంత్రికంగా ఒక్కొక్కరినీ మహరాజు వద్దకు తీసుకొచ్చి పరిచయమయ్యాక వారి ఆసనమునకు పంపుతున్నాడు.   చిన్నాన్నని కలిసి మాట్లాడుదునా.. అనేదే అతడి సమస్య.   కలిసి తమవారి యోగక్షేమాలు అడగాలని ఉంది. అయితే.. చారులు అందరి కదలికల మీద కన్నేసి ఉంచుతారు. తాను ఏదో కుట్ర పన్నుతున్నాడని అనుమానం వచ్చినా ఆశ్చర్యము లేదు.   మౌనంగా ఉండుటయే ఉత్తమం.   మనసు చిక్క బర్చుకుని నిర్వికారంగా అచ్చటి నుండి కదిలాడు మాధవుడు సభ అయిన పిదప.     కపిలేంద్రుడు తిరుగు ప్రయాణమునకు ఆనతి నిచ్చాడు.   వంగదేశ విజయం.. అందులోని సామంతరాజులనీ, ఉద్యోగులనీ కలవడం మొదలైన పనులన్నీ సమాప్త మయ్యాయి.   ఒక పక్షం రోజులయ్యాయి. అచ్చటి సుల్తానుకే రాజ్యం వప్పజెప్పి కదిలారు ఓఢ్ర సైనికులందరూ కళింగ రాజ్యానికి.   పదిహేను రోజులు.. వ్యవధి దొరికినప్పుడు తను బాల్యంలో తిరుగాడిన ప్రదేశాలన్నీ తిరిగాడు మాధవుడు. ఆ సెలయేళ్లు, ఆ వనాలు, భవనాలు, తటాకాలు.. ఎచ్చటి కేగినా, చేయి పట్టుకుని నడిపించిన కన్న తల్లే కనిపించింది.                                  పల్లె పల్లె తిరిగాడు. అచ్చటి నావల్లో బాల బాలికలతో కలిసి కేరింతలు కొడుతూ విహరించాడు. సస్య శ్యామలమైన దేశం వంగ దేశం.   చెరువుల్లో చేపలు పట్టాడు. తను పట్టిన చేపల్ని పల్లె వనితల చేత వండించుకుని కడుపార తిన్నాడు. వంటలోని అచ్చమైన వంగ రుచులు చిన్నప్పటి కోటలోని చవులను జ్ఞప్తికి తెచ్చాయి.                                 ఆ.వె.    ఎక్కడెక్కడైన ఎంత తిరిగిననూ                           నిక్కము కనడుగ మనిషి యునికినె                           తనదు మాతృ దేశ దర్శనమ్మొసగుగా                           ఎంత తృప్తి నైన ఎన్న గాను.     ఎక్కడ తిరుగుతున్నా తన బంధువుల కోసం వెదకుతూనే ఉన్నాడు.   ఏమో.. దాయాది అన్నదమ్ములు కనిపిస్తారేమో!   కనిపించినా గుర్తు పట్టగలడా? వారి ఆహార్యమంతా ముసల్మానుల వలే ఉంటుంది కదా! అయినా.. ఎక్కడో చిరు ఆశ..   అదే నిజమయింది..   ఒకరోజు.. తాము చిన్నప్పుడు తరచుగా విహరించే వనానికి వెళ్లాడు మాధవుడు. అది తమ కుటుంబానికే పరిమిత మయింది ఒకప్పుడు. మారిన పరిస్థితులలో ఆ వనం రాజుగారి కోటలోకి చేరి పోయింది.   ఆ వనంలోని తటాకంలో కొద్ది సేపు ఈత కొట్టి, తాను చిన్నప్పుడు సేద తీర్చుకునే వటవృక్షం నీడని కూర్చున్నాడు మాధవుడు.   అనుకోకుండా నోటివెంట పలికిందొక విషాద కవిత.                   సీ.     ఇచ్చోటనే గద ఏ యరమరికలు                                లేక చిట్టి చిలకలె దరి చేరె                         తరుముతు తరుముచూ దాగుడు మూతలు                                యాడిన పొదలన్ని యవియె కాద                          చిన్నారి పొన్నారి చిరుత కథలు యెన్నొ                                పాడిగ యత్తలు పలుకగాను                          ఈ నీడ నిదురించి ఎన్నగా నెన్నెన్ని                                కనిన కలలు యన్ని కల్లలాయె                 ఆ.వె.  అమ్మ యొడిన నిచట యలసి నిదురపోగ                         అన్నదమ్ములదిగొ యాట లేప                         సోదరి యిట కేగి సొలసినఁ దమ్ముని                         యొడిని చేర్చు కొనగ యూరడిల్లె.     చాటువు చెవిని పడగానే, అటుపక్క గుర్రంమీద వెళ్తూ ఆగి విన్న ఒక యువకుడు మాధవుని చెంతకు వచ్చాడు.   అతడే తన చిన్నాన్న నరసింహుని సుతుడే అయుండచ్చు నని అనిపించింది మాధవునికి. మాధవుని కన్న రెండు సంవత్సరాలు పెద్ద వాడు.   “చాలా బాగా చెప్పారే.. మీకు ఈ పరిసరాలు తెలుసా మంత్రీ?”   అక్కడ ఎవరికీ తెలుగు రాదులే అని తన ప్రజ్ఞ చూపబోయిన మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.   “మీరు..”   “కొత్వాల్ నయీమ్ హుస్సేన్ గారి కొడుకును, ఆజమ్ హుస్సేన్. నాలుగు వత్సరములు బీజాపూర్ బహమనీ సుల్తాను వద్ద సైన్యంలో ఉన్నాను, మా రాజు గారి ఆజ్ఞతో. అందుకే తెలుగు వచ్చు బాగా. మీ భావం అర్ధమయింది. ఈ ప్రాంతాన మీరు బాగుగా తిరిగినట్లున్నారే..”   మాధవుని మనసులో వేవేల ధ్వనులు.. ఒక్కసారి అన్నని ఆలింగనం చేసుకో గలుగుతే.. ముందుకు రాబోయాడు..   అమ్మ మాట గుర్తుకొచ్చింది.. ‘అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో న కస్యచిత్’ ఎవరికీ నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియ నియ్యకు..”   బుద్ధి, మనసు వివాదంలో పడ్డాయి, మాధవునిలో..                                      ……………………. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 35వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 35వ భాగం     కళింగ సైన్యాలు వెను తిరిగాయి.   “మన పయనం వేగంగా సాగాలి. సుల్తాన్ సైన్యం వంగ సరిహద్దులు దాటి ఈవలకు రాకుండా మనం అచ్చటికి చేరుకోవాలి.” కపిలేంద్రదేవుడు ఆదేశాలనిచ్చాడు.   “ఒక చిన్న మనవి ప్రభూ!”   “ఏమది మాధవా?”   “మార్గ మధ్యంలో అరసవిల్లి అని సూర్యదేవుని క్షేత్రముంది. కొచెం దారి పక్కకి తిప్పుతే మనం ఆ ప్రత్యక్షనారాయణుని సేవ చేసుకొన వచ్చును. అందునా, మనం వెళ్తున్నది రణానికి. ఇటు దక్షిణాన యుద్ధం మాని మరీ వెళ్తున్నాము. ఆలనాడు రామ రావణ యుద్ధంలో రామునికి రణ మధ్యంలో చింత కలుగుతే అగస్త్య మహామునియే అతనిచే ఆదిత్యునికి సేవ చేయించారు.                            కం.  కలతను రణమున రాముడు                                 యలసి సొలసినంతనె ముని, యర్కుని భక్తిన్                                 కొలువమనగ యినకులజుడు                                 గెలువము కోరగ నొసగెను క్షేమము జయమున్.”      మాధవుడు ఆపేశాడు.. మహారాజు ఏమంటారో అని సందేహ పడుతూ.   “అవును. మనం కళింగులం కూడా ఆదిత్యుని భక్తులమే కదా! మేము కూడా రఘురాముని వలెనే సూర్య వంశీయులమే. అవశ్యం వెళ్లెదము. సూర్య దేవుని అర్చించి, యుద్ధానికి వలసిన ధైర్య స్థైర్యాలని సమ కూర్చుకునివెళ్లెదము.” కపిలేంద్ర దేవుడు, సేనాధిపతికి ఆదేశ మిచ్చాడు.   అరసవిల్లి.. ఏడవ శతాబ్దంలో ప్రభాకరునికి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో సూర్యుని పాదాల మీదికి, సంవత్సరానికి రెండు సార్లు ఉదయ సూర్యకిరణాలు పడి, గర్భాలయం అంతా రంగురంగుల కాంతులతో నిండి పోతుందని చెప్తారు.   మాధవునికి మహదానందంగా ఉంది.                                                                                 ఈ మారు మహారాజు కపిలేంద్ర దేవులు విచ్చేస్తున్నారని వర్తమానం పంపించారు వార్తా హరులచే.   కోరుకొండ వద్ద ప్రతీక్షగా నున్న సామంతుడు ఎదురేగి, సకల మర్యాదలూ చేశాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి, నాగావళీ నదిలో స్నానం, అర్ఘ్య సమర్పణ ముగించి, అరసవిల్లి చేరారు, కపిలేంద్రుడు, మాధవుడు, ప్రధాన సేనాని.   శాస్త్రోక్తంగా పూజలు చేసుకుని, భోజనాదులయ్యాక, సైన్యాన్ని ముందుకురికించారు కపిలేంద్ర, మాధవులు.     తినడానికి, విశ్రమించడానికీ తప్ప ఇంక దేనికీ ఆగకుండా కళింగ, వంగ సరిహద్దులని చేరారు.   మాధవునికి బాలవ్వ గుర్తుకొచ్చింది.   “ప్రభూ! ఇచ్చటనే మా పినతండ్రిగారి వసతి గృహముంది. ఈ రోజునకు అచ్చట ఆగుదామా? సరిగ్గా మన బాటకి ఆనుకునే ఉంది.”   “అంత కన్న ఇంకేమి కావాలి మాధవా? ఎక్కడైనా ఆగ వలసినదేగా. మీ గృహానికే వెళ్లెదము.”   మాధవుడు మహదానందంతో సైన్యాలని మరలించాడు తనని ఆదుకుని, జీవిత మిచ్చిన పూటకూళ్ల ఇంటికి.   దూరం నుంచే సైన్యాన్ని చూసిన జగన్నాధ మహాపాత్రుడు వంటలు చేసే వారికి ఆదేశ మిచ్చాడు. సాధారణంగా సైనికులు వారి సంభారాలని వారే తెచ్చుకుంటారు. పూటకూళ్ల ఇంటివారి పని వండి వడ్డించడమే.   “చిన్నాన్నా!” వంటకాలు ఏమిచెయ్యాలో ఆదేశ మిస్తున్న జగన్నాధుడు, మాధవుని పిలుపు విని వెనక్కి తిరిగాడు. ఆప్యాయంగా హత్తుకుని కుశలమడిగాడు.   “సైన్యంలో నువ్వున్నావని ఊహించనేలేదు సుమా! చాలా ఆనందంగా ఉంది మాధవా! నిన్ను దండయాత్రలో పాల్గొనమన్నారా రాజుగారు..” ఆశ్చర్యంగా అడిగాడు.   “రాకుమారులంతా తలొక దిక్కుకూ యుద్ధానికి వెళ్లారు. నేనే మిగిలాను. రాకుమారుడు పురుషోత్తమ దేవుని కోటలో ఉంచి.. నన్ను రమ్మని ఆదేశించారు. చిన్నమ్మా! కుశలమా? తమ్ముడు గురుకులంలో ఉన్నాడా? విద్యలుబాగా నేరుస్తున్నాడా?” జగన్నాధునికి ఒక కుమారుడు. పది సంవత్సరాలు నిండాయి. గురుకులానికి పంపారు.   “అంతా క్షేమమే కుమారా! మీ వారినందరినీ చెరువు వద్దకు తీసుకెళ్లి రండి. ఈలోగా భోజనాలు తయారవుతాయి.”   మాధవుడు మహరాజుని అర్ఘ్య సమర్పణకి చెరువు వద్దకి తీసుకుని వెళ్లాడు. తనకి ఉత్కళ దేశంలో ఆశ్రయమిచ్చి ఆదరించిన ఊరు. ఆప్యాయంగా బంధువులని పలుకరించాడు. మర్రిచెట్టు వద్ద ఆగి ఊడలన్నింటినీ తడిమి పలుకరించాడు.   అంతటి మహరాజు, మాధవుని బాల్య చేష్టలని చూసి తను కూడా చిన్న పిల్లడైపోయాడు.   రాబోయే సంగ్రామం సృహే లేదెవరికీ.   మనసుకీ, శరీరానికీ ఆ మాత్రం ఆటవిడుపు కావాలి.   చెరువులో అలసి పోయే వరకూ ఈత కొట్టారు. కపిలేంద్రదేవులు తాను ఎవరో చెప్పవద్దన్నారు.   ఒక్కొక్క స్థలమహిమ.. ఒక్కొక్క కాల మహత్యం.   ఉ.    మానవుడెంత యెత్తు ఘనమై నెదిగేనుగ యప్పుడప్పుడున్        చీనపు బాల్యమే తలచు చేష్టల చేయుచు పాపడౌనుగా        మానము చేయునా ప్రభువు మానసమున్ చెలగేటి కోర్కెలన్        స్యోనముగాను మాధవుని చూసియు నాడుకొనంగ వేడుకన్.   (చీనపు= బంగారపు, మానము= మన్నించు, స్యోనముగా= సుఖముగా)     మరునాడు, ప్రాతఃకాలముననే స్నాన అర్ఘ్య పానాదులు ముగించుకుని, బాలేశ్వర్ నుంచి బయలుదేరారు, కపిలేంద్ర దేవుడు, మాధవుడు..తమ సైన్యాన్నంతా సమాయత్తం చేసుకుని.   సరిహద్దు దాటాక, వంగ దేశం లోనికి ప్రవేశించగానే ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యాడు మాధవుడు.   మధ్యాహ్నానికి, దుర్గాదేవితో కలిసి తాను ఆగిన చోటికి చేరుకున్నారు.   మరి కొన్ని వృక్షములు పెరిగాయి కానీ పెద్ద మార్పులేమీ లేవు.   తాము తెచ్చుకున్న స్వల్ప ఫలహారాలను, సైనికులు అడవిలో సేకరించిన ఫలాలతో కలిపి ఆరగించి ఒకింత విశ్రాంతికి ఉపక్రమించారు, మహరాజు, అతడి సైన్యం.   మాధవుడు మాత్రం.. తన హయం మీద ఆ ప్రాంతమంతా ఒక సారి కలియదిరిగాడు.. తన తల్లి ఆనమాళ్లు ఏమైనా అగుపించునేమోనని.   మానవ హృదయపు బలహీనత..   ఒకటిన్నర దశాబ్దపు నాటి గుర్తులు కనిపిస్తాయా? వెర్రితనం కాకపోతే..   ఏది ఏమైనా కన్న తల్లిని తలచుకొని, మనసులో దుఃఖాన్ని అక్కడే అణచి వేస్తూ తిరుగుతుంటే, కనిపించింది..   అదీ.. కళ్యాణి ఒక వటవృక్షం దగ్గర ఆగి పోయి, కదలనని మొరాయిస్తుంటే!   మాధవుడు గుర్రం దిగి వటవృక్షం చుట్టూ.. జాగ్రత్తగా అడుగులు వేస్తూ తిరిగాడు.   దొరికింది.. చెట్టు మొదట్లో, ఇంచు మించుగా.. అది కూడా ఒక వేరేమో అనిపిస్తూ.. ఒక కత్తి పిడి. వంగి, చూస్తూ.. తన దుస్తుల్లో ఉన్న చిన్న బల్లెం వంటిదాన్ని తీసి, మట్టిని తవ్వ సాగాడు.   కొద్ది సేపట్లోనే బైట పడింది..   కొద్దిగా మొన వద్ద బండగా అయిన కత్తి. తుప్పు పట్టినా.. పదును అలాగే ఉంది. దాని మీద దుర్గాదేవి పేరు చెక్కి ఉంది. ఆ కత్తిని చూడగానే జలజలా రాలాయి మాధవుని కనుల వెంట నీళ్లు.   అక్కడే నేల మీద కూలబడి, కత్తిని ఒడిలోనికి తీసుకుని, వెక్కి వెక్కి ఏడవసాగాడు.   మహరాజు, పరివారం శబ్దానికి అందనంత దూరంలో ఉన్నారు.             సీ.     కాలమెంతెంతైన కాలుని మహిమనే                         కన్నతల్లిని తనే కానడాయె                    ఆ తల్లి కైపట్టి అరుల దునిమినట్టి                        కరవాలమును చూడ కనులు వెఱవ                    చిన్ననాటి స్మృతులె చిత్తమునమెదల                         చేష్టలుడిగె నంత చితికె హృదియె                    మింటినే కాంచగ మెదలె మాతృ కరము                         చాచిదీవెన లంత చల్లగ నిడ         ఆ.వె.     మాధవు మదియంత మైమరచి మురిసె                    అమ్మ తనని బిగిని హత్తు కొనెనొ                    ఆకశమున నిలిచి ఆదరముగనెంతొ                    కత్తినిచ్చి నట్టు కలను కనగ.                     చేతిలో నున్న కత్తిని ఆప్యాయంగా తడిమాడు. అమ్మ స్పర్శ జ్ఞప్తికొచ్చింది.   తన పై వస్త్రంతో శుభ్రంగా తుడిచాడు.   తనకి కత్తిని ఎలా తిప్పాలో నేర్పించిన కత్తి. అమ్మ చేతిలో అత్యంత వేగంగా మెరుపులా తిరిగిన కత్తి. తనను రక్షించడానికి శతృవులకొందరిని దునిమిన కత్తి.   ఇదే కత్తితో తమ గతి మార్చిన వారిని శిక్షిస్తాడు. మంచికో చెడుకో తన దేశం మీదికే దండెత్తే అవకాశం వచ్చింది. సర్వ శక్తులూ ఒడ్డి ముష్కురులను దండించడానికి తోడ్పడతాడు. ఎక్కడి నుంచో తమ దేశానికి వచ్చి తమ దేశస్థులని చంపుతూ.. తమ దేవుళ్లని బద్దలు కొడ్తూ, తమ సంపదలని కొల్ల గొడ్తూ..   ఎవరిచ్చారు వారికి అధికారం?     సైనికుల కలకలం వినిపించి.. తన ఆలోచనల నుంచి బైటికొచ్చాడు మాధవుడు. అమ్మ కత్తిని అంగవస్త్రంలో దాచి, కళ్యాణి జీను కింద దాచాడు. అది శరీరానికి తాకగానే కళ్యాణిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.   గట్టిగా సకిలించి.. మాధవుడు ఎక్కగానే ముందుకురికింది.   “ఎచ్చటికెళ్లారు మాధవ మంత్రీ? మేము కించిత్ ఆందోళనకు గురయ్యాము.” కపిలేంద్రుడు అడిగాడు.   సైన్యం అంతా తయారుగా ఉన్నారు. మాధవుని కొరకే వేచి ఉన్నట్లు అనిపించింది.   “క్షమించాలి మహారాజా! చుట్టు ప్రక్కల ఏమైనా ఫలములు దొరకునేమో అనీ..” మాధవుడు తనకు సంబంధించిన వస్తువులను గుర్రానికి కట్టి, తను కూడా ఎక్కి, రాజు పక్కకి వెళ్లాడు.   మనసులో ఏమనుకున్నా మోములో కనిపించ నీయకుండా కపిలేంద్రుడు గుర్రాన్ని అదిలించాడు.   బాలేశ్వర్ వద్దనుంచి అక్కడ తాము నిర్వహిస్తున్న గజశాల నున్న ఏనుగులు కూడా కలిశాయి. సైన్యంలో రధాలు కూడా ఉన్నాయి. మహారాజు, ఎప్పుడేది కావలిస్తే అది అధిరోహించ వచ్చు.   అక్కడికి దగ్గరలోనే నసీరుద్దీన్ షా సైన్యాలు ఎదురు రాబోతాయని చారులు సూచనలిచ్చారు.   కపిలేంద్రుడు గజం అధిరోహించి ముందుకు కదిలాడు. మాధవుడు అవసరాన్ని బట్టి మారడానికి అనుకూలంగా అమర్చుకున్నాడు.    మధ్యాక్కర.    కదలె గజపతుల సేన కదముతొక్కుతు వేగముగనె                     అదరెగ నవనియె నంత హయముల సవ్వడి వలనె                     బెదరగ నడవిని యన్ని పికములు మెకముల్ పురుగులు                     ఛదము చాటున దాగి యుండ సడి లేక చలనము లేక. (ఛదము= కప్పు, ఆకు)            చారుల సమాచారమును బట్టి, ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా నసీరుద్దీన్ షా సైన్యాలు.. లేదా వారు గుడారాలు ఎదురు పడే అవకాశం ఉంది.   అందుకే.. కళింగ సైన్యం అప్రమత్తతతో సాగుతోంది. విశ్రాంతికై ఎక్కడ ఆగిన గానీ.. పరిసరాలన్నీ ముందుగా పరికించి మరీ విడిది చేస్తున్నారు.   జానూపూర్ దగ్గర పడుతుండగానే.. వంగ సైన్యాలు ఎదురు పడ్డాయి.   అప్పటికే ఢిల్లీ పాదుషా దండయాత్రల నెదుర్కొని అలసి ఉన్న వంగ సైనికులు కళింగుల ధాటి ఎదుర్కొనలేక పోయారు.   మాధవుడు, అరివీర భయంకరుడై.. కనిపించిన వంగ సైనికులను.. ముఖ్యంగా ముసల్మానులను ఊచకోత కోస్తున్నాడు.                                 చివరికి వంగ సైనికులకు లొంగిపోక తప్పలేదు.   పాండువా కోటలోకి విజయోత్సాహంతో అడుగు పెట్టారు కళింగులు.   మాధవుడు కోటంతా తిరిగి తల్లి దండ్రులని స్మరించుకున్నాడు.   కోటలోపలి సైనికులంతా కూడా లొంగి పోయారు. ఆడవారిని, పిల్లల్నీ ఏమీ చెయ్యద్దని అందరికీ ఆదేశాలు వెళ్లిపోయాయి.   వంగరాజ్యం కళింగుల వశమయింది. కళింగ సైనికులు విజయోత్సాహంతో పండుగ చేసుకున్నారు.   కపిలేంద్రదేవుడు కళింగ, వంగ రాజ్యాలకి చక్రవర్తి అయ్యాడు.                                       ……………….. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 34వ భాగం

                                                                 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 34వ భాగం క్రీ.శ. 1445.                                      “గజపతుల తళ్లు”     మాధవీలతా మంటపంలో కూర్చుని ఉన్నారు మాధవుడు, కాదంబరీ దేవి. వివాహమై రెండు సంవత్సరములు దాటినా, ఇంకా నవ దంపతుల వలెనే జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు.   చెలులు వచ్చి దీపాలంకరణ చేసి వెడలి పోయారు.   సంధ్య కాంతులు మెల్లి మెల్లిగా శార్వరీ మిళితమవుతున్నాయి. చారల్లా కనిపిస్తున్న కెంజాయ సొగసులు సువర్ణ వర్ణంలో కలిసి పోయి మంటంపమంతా తీగలతో అల్లిన రంగవల్లులని తీర్చి దిద్దుతున్నాయి.   మిశ్రమ కాంతుల పరావర్తనంలో కాదంబరీ దేవి వింత సొగసుతో వెలిగి పోతోంది.                                    అనుకోకుండా మాధవుని కంఠం ఒక చాటువుని పలికింది, కాదంబరిని చూస్తుంటే..                                         “సీ. మకరధ్వజుని కొంప యొకచెంప కనుపింప                                 జీర కట్టినదయా చిగురు బోణి                          యుభయకక్షములందు నురు దీర్ఘతరములౌ                                 నెరులు పెంచినదయా నీలవేణి                          పసుపు తావులు గ్రమ్ము పైటచేలము లెస్స                                 ముసుగు వెట్టినదయా ముద్దుగుమ్మ                          పూర్ణ చంద్రునిబోలె బొసగ సిందూరపు                                 బొట్టు పెట్టినదయా పొలతి నుదుట                       తే.గీ.  యెమ్మె మీరగ నిత్తడి సొమ్ములలర                             నోర చూపుల గుల్కు సింగార మొల్క                             గల్కి ఏతెంచె మరుని రాచిల్క యనగ                             వలపులకుచేటి యొక వడ్డెకుల వధూటి.”     గంభీరమైన కంఠస్వరంతోమంద్ర స్తాయిలో సమ్మోహనంగా పాడుతున్న మాధవుని చూసి నును సిగ్గుల మొగ్గైంది కాదంబరి, పద్య అర్ధం కాకపోయినా భావం అర్ధమయింది.   “ఒక వంక మన్మధునే సవాలు చేస్తూ, నాభి కిందికి పాదాలు తాకే చీర కట్టు, రెండు చేతుల ప్రక్క నుండి సాగిన దీర్ఘమైన, పిరుదులు దాటిన కేశ సంపద, నుదుటిన పూర్ణ చంద్రుని పోలిన సింధూరపు బొట్టు, పచ్చని కాంతులు వెదజల్లుతున్న మేలి ముసుగులోని ఓఢ్ర వనిత, సొగసు మీర సొమ్ములు పెట్టి మరుని రాచిలుక వలె సింగార మొలుకు తోంది.”   వివరించాడు మాధవుడు.   “అబ్బ.. ఎంత సొగసైన పద్యమో! ఇంత చక్కని భావంతో తెలుగులో మీరే చెప్పారా స్వామీ?” కాదంబరీ దేవి సంభ్రమంగా అంది.   “నేనా.. ఏదో రాస్తాను కానీ.. ఇంతటి పద సంపద నాకెక్కడిది? ఇది కవి సార్వభౌముడు శ్రీనాధ మహాకవి ఓఢ్ర వనితని వర్ణిస్తూ చెప్పిన పద్యం. ఎంత హృద్యంగా ఉందో కదా? ఇందలి వర్ణన నీకు సరిగ్గా సరి పోయింది.”   కాదంబరీ దేవి బుగ్గలు ఎర్ర మందారాలే అయ్యాయి.   “నేను ఓఢ్ర వనితని ఐతే.. తమరు వంగ యువకులా?” మేల మాడింది కాదంబరి.   నిమేష మాత్రం మాధవుని కంటి చూపులో తీక్ష్ణత కనిపించింది.   “నేను కూడా ఓఢ్ర యువకుడినే కదా!” సర్దుకుని సమాధాన మిచ్చాడు మాధవుడు.   వివాహమయ్యాక, మాధవుని నివాసం కోటలో, మహాపాత్రుల కోసం కట్టించిన కొత్త మందిరంలోనికి మారిపోయింది.   నందుడు, గౌతమీ, సీతమ్మ తమ వసతి గృహాన్ని వేరే వారికి అప్పగించి కోటలోని మాధవుని గృహానికి మారి పోయారు. కోటలోని వంటశాలలో సలహాలిమ్మని పురుషోత్తముడు కోరితే ప్రతీ రోజూ వంటవారికి ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తున్నారు.. వారి విద్యని మరచి పోకుండా.. రాజుగారి ఉద్యోగుల వలెనే వారికి కూడా భృతి అందుతోంది.   మాధవుని కుటుంబం వరకూ కాలం ప్రశాంతంగానే సాగి పోతోంది.      దేశంలో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.   ఆ రోజు..   సాయం సంధ్యా సమయం..   కపిలేంద్ర వర్మ మాధవమంత్రిని పిలువనంపాడు.   “మంత్రి వర్యా! ఈ దండయాత్రలో మీరు కూడా మా వెంట వస్తున్నారు మీరు. చాలా సుదీర్ఘ యాత్ర ఇది. సముద్ర తరంగాల వలే ఒకదాని తరవాత ఒకటి జరిపి.. కృష్ణా గోదావరీ తీరాలన్నింటినీ మన వశం చేసుకోవాలని యోచిస్తున్నాము. రాజమండ్రి రెడ్డి రాజ్యం మన దయింది. కొండవీడు, అద్దంకి, పాకనాడు, విజయనగరం.. తెలంగాణలో ఓరుగల్లు మీద మన పతాకం ఎగర వలెనని వాంఛిస్తున్నాము.”   “అటులనే మహారాజా! మరి ఇచ్చట కోట రక్షణ..”   “పురషోత్తముడు చూసుకొన గలడు. ఈ మారు మీ ప్రతిభని, ప్రజ్ఞా పాటవాలని మాకు అందజేయండి.”   “తమ ఆజ్ఞ ప్రభూ!” మాధవుడు ఇంటికి వెళ్లి వార్త అందించాడు.   “హూ.. గజపతుల తళ్లు మళ్లీ మొదలయ్యాయన్న మాట.” నందుడు విచారంగా అన్నాడు.   “అంటే..” గౌతమి అడిగింది.   “వరుస దండయాత్రలు. తమ రాజ్యం సుస్థిరం అయితే సరి పోదు. రాజ్య విస్థరణ కావాలి. సువిశాల సార్వభామాధికారం కావాలి. ఎంత జన నష్టం కలిగినా ఫరవాలేదు. అదే మన రాజుల ఆశయం. తెరలు తెరలుగా అలలు వస్తున్నట్లు దండయాత్రలు సాగించాలి..”   “యుద్ధానికి వెళ్లక తప్పదా?” కాదంబరి కళ్లనిండా నీళ్లతో అడిగింది.   “తప్పదు దేవీ! మీ తండ్రిగారు, అన్నదమ్ములు అందరూ రణ సన్నిద్ధులైనప్పుడు నేను పిరికి వాడి వలే ఉండలేను కదా! పైగా రాజాజ్ఞ మీరడం అసంభవం.”   “జయాపజయాలు..”   “దైవాధీనాలే.. కానీ ప్రయత్న లోపం లేకుండా పోరాడితే విజయం తధ్యం. ఇప్పుడు గజపతుల కాలం నడుస్తోంది. ఎక్కడికి వెళ్లినా విజయం వరిస్తోంది. మీరు అనవసరంగా ఆందోళన పడవద్దు రాకుమారీ!” మాధవుడు ఓదార్చాడు.   మాధవునికి దక్షిణ ప్రాంతాలకి వెళ్లడం మనసులో ఇష్టంగానే ఉంది. శ్రీనాధ మహాకవిని ఇంకొక్క మారు చూడగలుగుతే.. ఎందుకో వారంటే అమితమైన ఆరాధన మాధవునికి.   రెడ్డిరాజుల రాజ్యాలన్నీ గజపతులు ఆక్రమించుకుంటుంటే శ్రీనాధులవారు ఎక్కడుంటున్నారో? శ్రీశైలం లోనే ఉన్నారో.. ఏమయ్యారో?   మాధవుని మనసంతా కలతగా ఉంది. వారిని చూసి ఏమైనా చెయ్య గలుగుతే.. వారి చిరుగుల శాలువానే మెదలుతోంది కన్నుల ముందు.   “స్వామీ!” కాదంబరి పిలుపుకి కన్నులు తెరిచాడు మాధవుడు.   “ఎప్పుడు బయలు దేరుతారు?” స్థిరమైన కంఠస్వరంతోనే అడిగింది కాదంబరి. మొదట్లో ఉన్న సందేహం, భయం లేవు. అనుమతిస్తే తనుకూడా వచ్చి యుద్ధంలో పాల్గొనే దైర్యం.. కనిపిస్తోంది.   “ఏమిటో దేవీ! ఈ యుద్ధాలు ఎందుకో అర్ధం లేవనిపిస్తోంది. ఎంత ప్రాణ నష్టం.. ఈ ఖర్చులన్నీ సర్దుకోవడానికి సుంకాలు పెంచడం.. ఎక్కడా అంతులేదు. సంగీత సాహిత్యాలు ఆస్వాదిస్తూ విశ్రాంతిగా కాలం గడపగలరా ప్రజలెన్నటికైనా అనిపిస్తోంది.” విచారంగా అన్నాడు.                      “తే.గీ.  సృష్టి మొదలైన దాదినె సృకము బట్టి                        కక్ష కార్పణ్య ములతోను కలసి కూడి                        సూక్ష్మ జీవుల మొదలుగా సురభి యంత                        పోరు సలుపుటకే నిల పొడమి రేమొ!” (సృకము= బాణము)     “నిజమే ప్రభూ! మంచీ చెడూ కలిసే ఉంటాయెప్పుడూ. ఎవరూ తప్పించలేరు. ఊరికే కూర్చుని, ఎవరి జీవనం వారు సాగిస్తున్నా.. ఎదుటి వారు ఊరుకోరు కదా!”   కాదంబరి ఊరడించడానికి ప్రయత్నించింది.   మాధవుడు మాత్రం రాజుల రాజ్యకాంక్షని సమర్ధించలేక పోయాడు.   గంగ నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కోరికే లేకపోతే.. కపిలేంద్ర వర్మ హాయిగా ఉండి, తన ప్రజలకి సుఖ సంతోషాలనిచ్చే వాడు కదూ!   ఓడించిన రాజ్యం నుండి కన్నియని తెచ్చుకోవడం.. వివాహమాడ్డం. అందరు రాజులదీ అదే వ్యవహారం.   మాధవుని మనసులోని అల్ల కల్లోలాలెలా ఉన్నా, వారం రోజుల లోగా దక్షిణ దిశగా కదిలాయి గజపతుల సైన్యాలు.   రెడ్డిరాజ్యం పతనమయ్యాక, విజయనగరం దేవరాయల రాజ్యంలోని భాగమయిన రాజమండ్రీ.. అతని కుమారుడు మల్లిఖార్జునయ్య హయాంలో బలహీనమై పోయింది. కపిలేంద్రుని పుత్రుడైన హంవీర కుమారుడు రాజమండ్రీని జయించి కళింగంలో కలిపేశాడు. దానికి, రఘునాధ నరేంద్ర మహా పాత్రుని పరీక్షగా నియమించారు.   కోరుకొండ దాటి గోదావరి తీరం చేరారు, మాధవుని తో కళింగ సైన్యం. మహారాజు స్వయంగా సైన్యాన్ని నడిపిస్తుంటే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండ వలసిందే కదా!.   గోదావరి తీరం చేర బోతుండగానే, మాధవునికి, తాము కాంచీ పురానికి వెళ్లినప్పటి విశేషాలన్నీ వరుసగా జ్ఞప్తికి వచ్చాయి.   గోదావరీ తీరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. కపిలేంద్ర దేవుని సైన్యం. కానీ.. ఈ మారు మిత్రుడు పురుషోత్తముడు లేడు.   విశ్రాంతికని ఆగిన ఘడియలోపే.. డేరాల వద్ద కోలాహలం..   అనేక అశ్వాలు వస్తున్నట్లు, గిట్టల చప్పుళ్లు.   బైట కావలి ఉన్న వారే కాకుండా.. డేరాల లోనుంచి సైనికులందరూ అప్రమత్తులై బైటికొచ్చేశారు.. కత్తులు చేతులతో తిప్పుతూ.   మాధవుడు, మహారాజు మాత్రం చిరునవ్వుతో చూస్తున్నారు.   ముందుగా వస్తున్న గుర్రం మీద, రఘునాధ మహా పాత్రుడు.. అల్లంత దూరం నుంచే గుర్రం దిగి, నడిచి కపిలేంద్ర దేవుని దగ్గరికి వచ్చాడు.   “ప్రభూ! నాకు ముందుగా కబురు పంపి ఉంటే మీకు సర్వ సదుపాయాలూ చెయ్యక పోయే వాడినా!” అలుకగా అన్నాడు.    “మేము ఎవరికీ చెప్ప దలచుకోలేదు రఘునాధా! కృష్ణా తీరం వరకూ సాగుదామని అనుకుంటున్నాము. ఇక్కడ పాలన అంతా బాగా నడుస్తోందా?” కపిలేంద్రుడు అడిగాడు.   “చాలా బాగా నడుస్తోంది ప్రభూ. పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గోదావరి అద్దరిని, ఒక గ్రామానికి, కపిలేశ్వర పురం అని పేరు పెట్టుకున్నారు.” రఘునాధుడు చిరునవ్వుతో అన్నాడు.                               “కృష్ణా తీరంలో కూడా ఒక కపిలేశ్వరపురం రావాలి ప్రభూ.” మాధవుడు అన్నాడు.   “అదే కదా మన ప్రయత్నం. ఇంక విశ్రాంతి తీసుకుందాము. రేపు సూర్యోదయాత్పూర్వమే బయలు దేరాలి.” కపిలేంద్రుడు సెలవు ఇచ్చాడు.      “కొండవీడులో అంతః కలహాలతో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. అర్ధం పర్ధం లేని పన్నులతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. ఈ ప్రాంతమంతా విజయనగరం రాయల అధీనంలోనే ఉంది. దేవరాయల కుమారుడు మల్లికార్జునయ్య ఏలుబడిలోనే..  ఇదే మంచి తరుణం. మనం స్వాధీనం పరచు కోవడానికి.” కృష్ణాతీరం చేరుతూనే కపిలేంద్రుడు అన్నాడు.   కృష్ణాతీరం వద్ద శ్రీనాధులవారి సమాచారం సేకరించడానికి ప్రయత్నించాడు మాధవుడు.   కృష్ణాతీరం అంతా తిరుగుతూ ఉండే వేగులు రహస్యంగా రాజుల సమాచారాలు సేకరిస్తారు. కానీ.. ఒక కవి గురించి వారి కెందుకు?   “కొండవీడు, విజయనగరం అనతి కాలం లోనే స్వాధీన పరచుకుంటున్నారు కదా! మల్లిఖారుజనయ్య, తన తండ్రి దేవరాయలు వలే సమర్ధుడు కాదు. అప్పుడు శ్రీశైలం ప్రాంతం కూడా కటకం ప్రభువుల సామ్రాజ్యంలోనికే వస్తుంది. ఆ తరువాత మీరు చెప్పిన వ్యక్తిని పట్టుకోవచ్చును మంత్రీ!”   “పట్టుకోమనటం లేదు. క్షేమ సమాచారాలు మాత్రం తెలుసుకొమ్మంటున్నాం.” మాధవుడు వివరించాడు.   “అటులనే ప్రభూ! త్వరలో తెలుసుకుంటాము.” చారులలో ప్రధాని సెలవిచ్చాడు.   కానీ.. ఆ మరునాడే జరిగిందది..   సుల్తాన్ నసీరుద్దీన్ అబ్దుల్ ముజాఫర్ మొహమద్ షా.. వంగ దేశాధిపతి, కటకం మీదికి దండెత్తి వస్తున్నాడని.. అత్యంత వేగంగా పరుగు పెట్టే అశ్వాల నధిరోహించిన వేగులు వర్తమానం తీసుకుని వచ్చారు.   హంవీరుడు బహమనీ సుల్తానుల నెదుర్కొనడానికి వెళ్లాడు, ఇతర సోదరులతో కలిసి.   కొండవీడు, విజయనగరం ఎప్పుడైనా కలుపు కోవచ్చును. కొద్ది మాసములు ఆగినా ఏం మార్పుండదు.   ముందుగా వంగ సుల్తాను ఆక్రమణని ఆపాలి.   సైన్యాన్ని వెనుకకు మరలమని ఆదేశమిచ్చాడు మహరాజు.   “వంగదేశం మీదికి దండయాత్రా ప్రభూ!”   “అవును మాధవా! వంగ కళింగ దేశాలని ఏకం చెయ్యాలి. వంగదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. గణేశుల పాలన తదుపరి గజపతులు ఏలాలి. మత మార్పిడులని ఆపాలి. మీరు కూడా మాతో వస్తున్నారు. గంగా తీరం వరకూ గజపతి సామ్రాజ్యం విస్తరించాలి. జానూపురం స్వాధీనమయ్యాక కుమార హంవీరుని కూడా మనతో కలవమని ఆదేశం పంపుతున్నాను.” కపిలేంద్రుడు ఆవేశంగా అన్నాడు.   వంగ రాజ్యం..   లోపలి అలజడి పైకి కనిపించకుండా బింకంగా అన్నాడు మాధవుడు..   “తమ ఆజ్ఞ ప్రభూ! అటులనే వంగ సుల్తానుని ఓడిద్దాం.”                                      …………………… ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 33వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 33వ భాగం      పూరీ పట్టణం కన్నుల పండువగా అలంకరించారు.    స్వామి వారి రథయాత్ర అయాక కొన్ని రోజులు అక్కడే ఉంటారు భక్తులు. ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు.    రథయాత్ర అయిన మరునాడు..    మహారాజుగారి విడిదిలో సమావేశ మయ్యారు, ప్రధాన మంత్రి, పురుషోత్తమ దేవుడు, మాధవుడు.    నందుడుని కూడా పిలువనంపాడు పురుషోత్తముడు.    అటువంటి సమావేశానికి రావడం అదే ప్రధమం నందుడికి. అయినా ఏ మాత్రం తడబడకుండా వచ్చి, అభివాదం చేసి నిలుచున్నాడు. అందరినీ ఆశీనులు కమ్మని ఆనతి ఇచ్చి ప్రారంభించాడు కపిలేంద్ర వర్మ.    “మనకి, మన రాజ్యానికి శుభ సమయం ఆసన్నమయింది. దండయాత్రలు, రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడం, అంతర్ బహిర్శత్రువుల నణచడం.. వాటన్నిటి మధ్య, మానసికోల్లాసం కలిగే ఆశ కనపడుతోంది. అదే.. కుమార పురుషోత్తముని వివాహం. మన మిత్ర రాజ్యముల ప్రభువులందరికీ ఆహ్వానం పంపించాలి.”    “అవును ప్రభూ. ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా చెయ్యాలి.” ప్రధాన మంత్రి అన్నాడు.    “కాంచీ పుర రాజునకు వర్తమానం పంప వలెను కదా!” మాధవుడు సన్నగా అన్నాడు.    “ఏ మక్కర లేదు. వారి రాజ్యంతోనే, రాకుమారి పరి గ్రహణం కూడా ఐపోయింది. ఇంక వారికేమాత్రం సంబంధం లేదు.” పురుషోత్తముడు.. పౌరుషంగా అన్నాడు.    “అవుననుకోండి. రాకుమారి పద్మావతీ దేవి కూడా ఆ విధంగానే సెల విచ్చారు. కంచి రాజుగారు వారి రాజ్యానికి వెళ్లినప్పుడు అడిగాను.. రాకుమారి కూడా వెడలెద రేమోనని..”    “ఏమని సెలవిచ్చారు మాధవా?”    “ఇంక కాంచీపురం వెళ్లనని..”    పురుషోత్తముని మోము మరింత ప్రసన్నంగా అయింది.    “తన తండ్రిగారు చేసిన పని రాకుమారికి సుతరామూ నచ్చలేదు.” మాధవుడు సెలవిచ్చాడు.    “ఇన్ని రోజులూ పద్మావతీ దేవి ఎక్కడున్నారు? మీ బంధువులింటనా?”    “మా గృహమునందే ఉన్నారు రాకుమారా! మా ఇంటి ఆడపడుచు వలెనే చూసుకున్నాము.” నందుడు చటుక్కున అనేశాడు.. మాధవుడు వారించే లోపుగానే.    మాధవుడు తల కొద్దిగా వంచాడు, ఏమనాలో తోచక.    మహరాజు కపిలేంద్ర దేవుడు వినోదంగా చూస్తున్నారు.    పురుషోత్తముడు తన ఆసనం మీదినుంచి లేచి వచ్చి, మాధవుడిని ఆలింగనం చేసుకున్నాడు.    “ధన్యవాదములు మిత్రమా! నీ వంటి మిత్రుడున్న వారికి నిత్యం మహదానందమే. నిన్ను ఎంతగానో బాధించి ఉంటాను. ఏమనుకోకుమీ!”    మాధవుని మోము సంతోషంతో వెలిగి పోయింది.    వెంటనే అందుకున్నాడు..                                  “సీ.  హరికృప యరయగ యనయము, తొలగెగ                                                 అరటములు వెరగు పరచుచునవి                                        అరమరికలవెగ హరణమయె నటుల                                                 యరులు హితులయిరి యనగి పెనగి                                        కరములు కలియను, గడువులు తెలియగ                                                 కరిముఖు యనుమతి కలిగియిపుడు                                        వరములు నొసగగ పరిపరి విధముల                                                  ముదమలరగ కన మురిపమునను                                ఆ.వె    పదిలముగ మనమరగెదము, కటకమునె                                           సిరి హరి యిరువురు మిసిమిని కురియ                                           సురలు నభము నిలిచి సురతమున కనగ                                           పరిణయము జరుగును పరవశముగ.”             (అరటములు= కష్టములు, అనగి పెనగి= కలసి మెలసి)    ఉత్సాహంలో పద్యం పాడేశాడే కానీ.. మహరాజుగారేమంటారో అని సంకోచంగా చూశాడు మాధవుడు.    కపిలేంద్ర దేవులు చిరునవ్వుతో చూశారు.    “మాధవ మంత్రి మంచి కవి యని మాకు తెలియదే..”    “శ్రీనాధ మహాకవి ఏకలవ్య శిష్యుడు తండ్రీ. చక్కని కవిత్వం అల్లడమే కాదు, అద్భుతంగా గానం చేస్తారు కూడా..” పురుషోత్తముడు కించిత్ గర్వంగా చెప్పాడు.    “మనం వ్యవధి చిక్కినప్పుడు సాహిత్య సమావేశాలు కూడా చెయ్యాలి. వీనిలో ఉన్న ఉల్లాసము ఎక్కడా ఉండదు.” మహారాజు నిట్టూర్చి అన్నాడు. అతడికి రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడంలోనే సమయం గడిచి పోతోంది. ఇతరములేవీ మనసునకెక్కుట లేదు. పురుషోత్తముని వివాహ వార్త కాస్తంత ఆటవిడుపు.    “ఒక చిన్న సర్దుబాటు మాధవా.. చివరి పాదంలో ‘పరిణయములు జరుగు పరవశముగ’ అని దిద్దాలి.” సాభిప్రాయంగా జనకుని చూస్తూ అన్నాడు పురుషోత్తముడు.    మాధవుని బుగ్గలెర్రవడ్డాయి.    “ఇదేమి కొత్త వార్త కుమారా?”    “సోదరి కాదంబరీ దేవిని మాధవ మంత్రికి ఇచ్చి పరిణయం జరిపించాలని మా కోరిక మహరాజా. మాధవుడు, సోదరి కూడా సుముఖులేనని మాకు తోచుచున్నది. చిన్నతనం నుండీ నాకు తెలిసినవాడు.. మన ఎదుటనే మసలుతాడు. ఎవరో తెలియని వారికి ఇచ్చి దూర దేశాలకి పంపే కంటే ఇది మంచిదని మాకు తోచుచున్నది.” పురుషోత్తముని కేసి ఉలిక్కి పడి చూశారు, మాధవుడు, నందుడు.    రాకుమారి తన కోడలా? నందుడు ఆశ్చర్యంగా చూశాడు.    పురుషోత్తమునికి తన మనసే విధంగా తెలిసింది? అంతలా బయట పడిపోయాడా తను.. మాధవునికి కూడా ఆశ్చర్యమే..    మహారాజు మాత్రం ఆలోచనలో పడ్డారు.    మరీ పూటకూళ్ల వాని కొడుక్కి రాకుమారినిచ్చి..    నందుడు మహారాజు ఆంతర్యం గ్రహించాడు.    అటు చూస్తే మాధవుని బుగ్గలు మందారాలే అయ్యాయి. రాకుమారిని అతడు అభిమానిస్తున్నాడని తెలుస్తూనే ఉంది.    మాధవుడు తన ఇంటికి వచ్చిన కొత్తలో ఒక హస్త సాముద్రికుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది నందునికి. మత్తేభము.   మణి మాణిక్యముయే కదా యనుచు నా మారాజులే చెప్పియున్                    యణగిన్ యుండడు గాద యీతడవి యే హారీత కార్యాలనీ                    యణువంతైనను యోర్చుకోడు తన శౌర్యాంజస్సునే యడ్డుకున్                    ఫణిరాజై తన భోగముం బలిమి కాపాడున్ తనే యాపదన్.    ఆ సాముద్రికుడు, మాధవుడు ఏ కపటమైన కార్యాలనీ సాగనియ్యడని, తన శౌర్యాన్ని అడ్డుకుంటే అది ఎవరైనా ఓర్చుకోడనీ, నాగరాజు వలే తన భోగభాగ్యాలనీ, బలాన్నీ కాపాడుకుంటాడనీ చెప్పాడు. అతడుడు పెరుగుతుండగా అయిన, అవుతున్న అనుభవాలన్నీ ఆ మాటలు నిజమేనని చెపుతున్నాయి.    రాకుమారునితో స్నేహం, అతి పిన్న వయసులోనే మంత్రిపదవి లభ్యం..   ఈ లక్షణాలన్నీ మాధవుడు క్షత్రియ కుమారుడేనని చెపుతున్నాయి. ముఖ్యంగా ఆ మొహంలో ఉట్టిపడే రాచకళ..    మహరాజుకు, ఈ పేద బ్రాహ్మని కొడుక్కి కుమార్తె నిచ్చి వివాహం చేయుటకు మనసొప్పుతుందా? పురుషోత్తముడు మిత్రుని మీద నున్న అభిమానంతో ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటాడు.    తను నిజం చెప్పాలా? మాధవుని ఆంతర్యమేమిటో.. నందుడు ఎటూ తేల్చుకొనలేకున్నాడు. అతడి సందిగ్ధ స్థితిని మహరాజు గ్రహించాడు.    “నంద మహాపాత్రులు ఏమో చెప్పాలనుకుంటున్నారు.. కుల సమస్యా?”    అంటే.. మహారాజు సుముఖంగా ఉన్నారా? మాధవుడు ఉలిక్కి పడ్డాడు.    ఇంక నందునికి తప్పలేదు..    “మహారాజా! మాధవుడు మా కన్నబిడ్డ కాదు. శ్రీకృష్ణుడు నందునింట పెరిగినట్లే మాధవుడు మా ఇంట పెరిగాడు. ఎచట నుండి వచ్చాడో.. ఏ కులమో మాకు తెలియదు. కానీ శీల వంతుడు. అతడికి సాటి అతడే. అతడు ‘అజ్ఞాత కులశీలుడు’. వంగ దేశ సరిహద్దులలో ఉన్న మా అమ్మగారి ఇంటికి అతనికి సుమారు పది సంవత్సరముల వయసులో వచ్చాడు. మాకు పిల్లలు లేనందున మేము తెచ్చుకుని పెంచుకున్నాము. మా బిడ్డడే..”    చెప్పేశాడు నందుడు. మాధవుడు ఏమనుకొనెనో.. తనకి నచ్చినా నచ్చక పోయినా ఇంక వేరే దారి లేదు. మహరాజుకి వాస్తవం వెల్లడించ వలసిందే.    అక్కడ ఉన్న ముగ్గురూ ఏమి మాట్లాడాలో తెలియక కాసేపు అలా ఉండి పోయారు. అప్పుడే గుర్తుకొచ్చింది పురుషోత్తమునికి, కవి సార్వభౌముడు శ్రీనాధుడు మాధవుని చూడగానే, వంగదేశపు యువకునిలా ఉన్నాడే అన్న మాట.    ఇతడు వంగదేశపు రాకుమారుడా?    అచ్చటనున్న వారందరూ మాధవునే చూస్తున్నారు.. ఏం చెప్తాడా అని..    మాధవుడు లేచాడు..    “మహారాజుగారు మన్నించాలి. నేనెవరో.. నా పుట్టుక ఏదో.. ఎప్పుడో ఒకప్పుడు వివరించవలసిన ఆవశ్యకత వస్తుందని అనుకోలేదు. మా బంధువులలో.. లేదా.. మాకు సాటి అయిన సంబంధం వస్తే ఆ అవసరం వచ్చేది కాదేమో! నంద మహాపాత్రుని కుమారునిగా నడిచి పోయేది. ఇప్పుడు రాకుమారి ప్రసక్తి వచ్చింది కనుక అంతా వెలికి తీయవలసి వస్తోంది.” నిజమే అన్నట్లు తలూపారు మహారాజు.    “మరొక్కసారి మన్నించమని అడుగుతున్నాను.. నన్ను అజ్ఞాత కులశీలునిగానే ఉండిపొమ్మని నా కన్నతల్లి ఆదేశించింది. ఆవిడ మాట నేను జవదాటలేను. అయినా నేనిప్పుడు అజ్ఞాతకులశీలుడిని కాను. ఆ జగన్నాధుడు నాకు ఆత్మీయులైన తల్లిదండ్రులనొసగాడు. నేను గౌతమీ నందమహాపాత్రుల కుమారుడనే. ఏకన్నియని చేపట్టినా వారి పుత్రునిగానే.. నా ఈ అర్హతలతోనే పదవినిచ్చినా, పడతినిచ్చినా స్వీకరిస్తాను. వ్యక్తిగత సంస్కారం ఇదైతే.. నా విద్యల గురించి, నా తెలివితేటల గురించి రాకుమారునికి బాగుగా తెలుసు.. ఇంతకంటే నేను చేప్పగలిగినదేమీ లేదు. మీరే శిక్ష విధించినా ఆనందమే.”    అభివాదం చేసి కూర్చున్నాడు మాధవుడు.    నందుడు తన కుమారుని అనిర్వచనీయమైన భావంతో చూశాడు.  గర్వం, ప్రేమ, ఆప్యాయతలతో మనసంతా నిండి పోయింది. పెదవుల చాటున తన సంతోషాన్ని దాచి వేశాడు.    కపిలేంద్రుడు నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్న మయింది. మాధవుడు, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా మహారాజుకి అల్లుడు కావలసిన అర్హత సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పద్మావతీ దేవి విషయంలో అతను చూపించిన చొరవ ఎంతో ఎన్న దగింది.    ఇంక పూటకూళ్ల ఇల్లా.. అక్కడ రాకుమారి ఉండగలదా అనేదే ప్రశ్న. సౌకర్యాలన్నింటినీ తనే ఏర్పాటు చేస్తాడు. మాధవుని ప్రతీక్షగా కొత్తగా జయించిన రాజ్యానికి పంపే యోచన ఉండనే ఉంది.    క్షత్రియకన్య కోడలుగా రావడానికి నందుడు అంగీకరిస్తే..    అదే అడుగుతే నందుడు చిరునవ్వు నవ్వాడు.    “మహరాజా! కులం గోత్రం తెలియని పిల్లవాడిని మా కన్న బిడ్డవలే సాకాము. మాకేం అభ్యంతరం ఉంటుంది. మహలక్ష్మి మా ఇంటికి వస్తానంటే అంతకంటే కావలసినదేముంది?”    పురుషోత్తముడు లేచి వచ్చి మాధవుని భుజం తట్టి కరచాలనం చేశాడు.    “రాణీగారినీ, రాకుమారినీ సంప్రదించి వివాహ ప్రయత్నాలు చేద్దాము. రెండు వివాహాలూ ఒకే సారి.. వారం రోజుల లోగా చెయ్యాలి. ఆ తదుపరి, దక్షిణాన చక్కబెట్ట వలసిన కార్యాలున్నాయి.”    కోటలో పెళ్లి సంబరాలు.. కపిలేంద్ర దేవుడు అడిగిన వెంటనే కాదంబరీ దేవి సిగ్గుల మొగ్గై తల ఊపింది. కాదంబరి తల్లికి, అమ్మాయి ఉన్న ఊర్లోనే ఉంటుందని ఆనందం..    ఏ ఆటంకం లేకుండా కళ్యాణాలకి ముహుర్తాలు పెట్టేశారు.    కటకంలో ఉన్న అన్ని వనాల్లోనుండీ, రంగు రంగుల పూలు కోటకి బళ్లలో వస్తున్నాయి. నగరంలోని ఆడవారందరూ అలంకరణలో వారి ప్రతిభ చూపిస్తున్నారు.    పెళ్లికొడుకును, పెళ్లి కూతురిని చెయ్యడం.. ఇరు జంటలకూ కోటలోనే జరుగుతున్నాయి.    అయిదు రోజుల పెళ్లి శాస్త్రోక్తంగా ఆట పాటలతో జరుగుతోంది.    నందుని అన్నా,వదిన.. బంధువులు అందరూ కోటలోనే తమ విడిది గృహంలో ఉండి పెళ్లి వేడుకలలో పాలు పంచుకుంటున్నారు.    ఊయల సంబరం, బంతి ఆటలు.. కోటంతా కోలాహలమే.                             సీ.       పేరంటమును సేయ పెండ్లి సంబరములో                                        తూగుటుయ్యల యందు తోడు గాను                                   పిల్లలు పాపలు వెను వెంట యుండగా                                       వధువు వరుడు నూగె బాగు గాను                                   ముద్దు ముచ్చట్లతో మురిపించగా నంత                                       ముత్తైదువలు కూడి మోద మంద                                   పూలదండల బరువు తలల దించంగ                                        యొద్దికనిరువురూ యూగె నంత                       ఆ.వె    పెద్ద ముత్తయిదువ పేర్మితో వచ్చెగా                                  అక్షతలను వేయ యలసి యున్న                                  చేతులు కలిపేను చెలిమి నుండుడనుచు                                  రంజనముగ నెపుడు రాజిలగను.    కపిలేంద్ర దేవుని కుమారులందరూ వారి భార్యలతో వచ్చారు, వారికి నిర్వహించమని ఇచ్చిన రాజ్యాల నుంచి.. మహారాజు, తన రాణులందరితో కలిసి వైభవంగా కళ్యాణాలు జరిపిస్తున్నారు.    కంచిరాజుకి వర్తమానం పంపించారు.. కానీ అస్వస్థత కారణంగా రాలేనని తిరుగు వర్తమానం పంపాడతడు.    నంద, గౌతమిలు తమ అదృష్టంగా భావించి కుమారుని, కుమార్తెల వివాహాలు జరిపించారు. సముద్రం నుంచి నీటిని గ్రహించినా, ఆ నీటిని ఆకాశం వేరెక్కడో వెదజల్లుతుంది.. అదే న్యాయం అక్కడ కూడా జరిగింది. మాధవుడు, పద్మావతి పుట్టిన దెవరికో.. కానీ ఆనందం కలిగించేది వేరొకరికి. మాధవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, నక్షత్రాలతో ఊసులాడాడు.. తన యోగక్షేమాల గురించి అమ్మకి చెప్పమని.    తనని రక్షించి ప్రాణాలు కోల్పోయిన అమ్మ ఎప్పుడూ కనురెప్పల మాటునే ఉంటుంది మాధవునికి.                                          ----------------- ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 32వ భాగం

     ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 32వ భాగం   పూరీ నగరం రథోత్సవమునకు ముస్తాబవుతోంది.   కళింగంలోని వివిధ ప్రాంతాల నుండే కాక, దేశం నలు మూలల నుంచీ ప్రవాహంలా ప్రజలు వస్తూనే ఉన్నారు.   ఆలయ నిర్వాహకులతో సమంగా మాధవుని బృందం కూడా భక్తుల సదుపాయాలకై కృషి చేస్తోంది.   ఆలయంలోని వంటశాలలకు అదనంగా పెద్ద పెద్ద గాడి పొయ్యలు తవ్వించి, భోజన శాలలు కూడా, తాటాకు పందిళ్లలో ఏర్పాటు చేశారు.   నంద గౌతమిలు సీతమ్మతో సహా, సూర్యోదయం అవుతూనే, స్నానం, అర్ఘ్య పాదాదులు ముగించుకుని వచ్చేస్తున్నారు. వంటలకు వారి వంతు సేవ అందించడానికి. అదే విధంగా వంటకాల మీద పట్టున్న భక్తులు చాలా మంది వచ్చి చేస్తున్నారు. అందరకీ అధికారి ఆలయ వంటశాల నిర్వాహకుడు.   కటకం నుండి విడతలు విడతలుగా అరటాకులు వస్తూనే ఉన్నాయి బళ్ల మీద.   రాకుమారి పద్మావతి, కాదంబరి దేవితో కూడా వచ్చి కూరలు తరగడం, పూల మాలలు కట్టడం వంటి సేవలు చేస్తున్నారు.   రథయాత్ర ఆరంభమైన కొద్ది సేపటికి మహారాజు కపిలేంద్ర దేవుడు విచ్చేయనున్నారని వార్త వచ్చింది.   ఉత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ.. రెండు కళ్లూ చాలటం లేదని అనుకుంటున్న వారే! సంబరాలు హోరులు అంబరాన్నంటాయి.   ఆషాడ శుక్ల విదియ రానే వచ్చింది.   తెల్లవారక ముందే ఆలయం ముందున్న ప్రధాన రహదారి అంతా భక్తులతో నిండి పోయింది. ఎందరు వచ్చినా క్రమశిక్షణ మాత్రం తప్పదు. స్వామి రథయాత్రకి సానుకూల మయేటట్లుగానే నిలబడి ఉంటారందరూ.                       మూడు రధాల్లోనూ ముగ్గురు మూర్తులనీ ఆసనాల మీద కూర్చో పెట్టారు.   “మనీమా! మనీమా!” అనే కేకల మధ్య పురుషోత్తమ దేవుడు రథం అధిరోహించాడు. ఒక్క క్షణం.. క్రిందటి సంవత్సరం జరిగిన ఉత్సవం, ఆ తరువాతి పరిణామాలు గుర్తుకొచ్చాయి.   స్వామిని ఒక పరి పరికించాడు. జగన్నాధుని అవతారాలు కనుల ముందు నిలిచాయి. రథము మీద నీల మాధవుడు..                             సీ.    హరి యవతారమె అరుదెంచె నిలకును                                             అరి భంజనము లనె అరయ చేయ                                     నీరము నుండి విసార రూపముననె                                             నరభుజు సోమకు నరకగాను                                     కరువము కూర్మమై గరిమన నిడుకొని                                              సురులకు నమృతము సరిగ సరద                                     పరగ పరశురామ, వర రామ రూపమై                                              దరుమము నిలబెట్ట ధరణి యందు                            ఆ.వె.  కరములు కనరాని కరణపు జన్ములై                                      వరమొసగగ, రాజు బరువు గాను                                      పురము పూరి యందు పురుల ప్రతిష్టింప                                      తెరవు నీల ధవుడు యరదమెక్కె.       (కరణము= కారణము, అరదము= రథము)   కన్నులు మూసుకుని జగన్నాధుని మనసారా ప్రార్ధించి, బంగరు పిడి గల చీపురు అందుకుని శుభ్రం చేశాడు.   శుభ్రం చేశాక అటూ ఇటూ చూశాడు, మాధవుని కోసం. ఇంక స్వామి వారి రధం దిగి కొద్ది దూరం నడచి తన అశ్వాన్నెక్కి వెళ్లి పోవాలి. మహరాజుగారు వస్తానన్నారు. ఎక్కడికి వచ్చెదరో, ఎప్పుడు వచ్చెదరో.   చేతిలో చీపురు పట్టుకుని చూస్తున్నాడు పురుషోత్తముడు.   అంతలో తాళాలు తప్పెట్లు వినిపించాయి. ఆలయ పాండాలు పాటలు పాడటం మొదలు పెట్టారు, రథం చుట్టూ మూగి. తురగ వల్గన రగడ.                        కదలు తాయి కదలుతాయి కదలి సాగు తాయి ముందు                        కదలు తాయి  రథ చక్రాలు కదలి మెదలు తాయి ముందు                        కదలి పోతు పాపములను కదము తొక్కి తోసి ముందు                        కదలి కదలి జగము నేలు కంబమయ్య కలిసి ముందు.   మాధవ మంత్రి, పాండాలను పక్కకి తప్పించి రథం దగ్గరికి వచ్చాడు. ఒక్క ఉదుట్న రథం మీదికి ఎక్కాడు. అతడి వెనుకే, మేలి ముసుగులో ఉన్న రాకుమారి పద్మావతీ దేవిని, చెయ్యి పట్టుకుని ఎక్కించాడు.   పురుషోత్తమ దేవుని చేతిలో ఇంకా చీపురు అలాగే ఉంది.. రథం మీద ఉన్నఆలయ పూజారులు ఆ సమయంలో, హడావుడి చేస్తున్న పాండాలని క్రమశిక్షణలో పెట్టడంలో అటు తిరిగి కిందికి చూస్తున్నారు.   అంతా నిమేష మాత్రంలో జరిగి పోయింది.   మాధవుడు, చీపురు ఉన్న పురుషోత్తముని చేయి పట్టుకుని, వేరొక చేతిలో పద్మావతి చేతినుంచాడు.   “ప్రభూ! ఇంత కాలానికి పద్మావతీ దేవికి తగిన వరుడు, మలినాలను శుభ్రం చేసే వాడు దొరికాడు. అది మీరే.. స్వామి వారి వద్ద శుభ్రం చేశారు.. చేతిలో చీపురు ఇంకా అచటనే ఉంది. మా సోదరి పద్మావతీ దేవిని స్వీకరించి వివాహమాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ జగన్నాధుని సాక్షిగా జరిగిన దానికి ఈమె ఏ మాత్రం బాధ్యురాలు కాదు. మిమ్ములనే తన పతిగా మనసా వాచా కర్మణా భావిస్తోంది.”   పురుషోత్తమ దేవుడు ఊహించని సంఘటన ఇది.   మాధవుడు పురుషోత్తముని చేతిలో ఉన్న పొరక కట్టని తీసుకున్నాడు.. దానిని, కింద నిలుచుని ఉన్న ఆలయ ఉద్యోగికి అందజేసి, ఆ చేతిలో, పద్మావతి వేరొక చేతినుంచాడు.   రెండు కరములూ, తన విభుని చేతనుంచి, పద్మావతీ దేవి నును సిగ్గుతో.. మేలి ముసుగు లో నుండి ఓర కంట చూసింది.   పద్మావతిని చూసి పన్నెండు మాసములు పైనే అయింది. అప్పటి కంటే కాస్త చిక్కింది.. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుంది. మనసు నిండా నింపుకున్న చెలి.. విధి విలాసంతో, దట్టమైన మబ్బుల చాటున దాగిన చందమామ వలె ఉంది అన్ని రోజులూ..   జగన్నాధుని కృప.. మబ్బులు తొలగిన పున్నమి చంద్రునిలా కాంతులు వెదజల్లుతోంది తన చెలి..  ఆదిదేవుని కృపతో తన మనసునావరించి ఉన్న మబ్బులు కూడా తొలగి పోయాయి.     శివుని కోసం తపస్సు చేసిన పార్వతీదేవి పట్టుదల పద్మావతి లో కూడా ఉంది. అదే ఆవిడ సౌందర్యాన్ని పది రెట్లు పెంచింది. ఆవిడని ఆవరించి ఉన్న తేజము రథము లోనికి ఒక వింత వెలుగును తీసుకుని వచ్చింది. జగన్నాధుని మూర్తి కూడా చిరునవ్వుతో పరికిస్తున్నట్లు అనిపిస్తోంది. పాండాలు తక్కువ ధ్వనిలో తమ భజనలు సాగిస్తున్నారు.   పురుషోత్తముడు మారు మాటాడక, ప్రసన్న వదనంతో.. పద్మావతీ దేవిని పట్టుకుని, స్వామికి నమస్కారం చేశాడు. తేరు వద్దకి కొందరు ఆడవారిని కూడా తీసుకుని వచ్చాడు మాధవుడు, పద్మావతికి సహాయముగా! అందరూ కిందినుంచి చూస్తున్నారు.                               సీ.  హృదియందు నందరు ముదముతో నలరగా                                             ముదితలందరు కూడి మురియ గాను                                     కదిలెడి రథమందు పదిలముగ నిలిచి                                             పెదవి చాటున నవ్వు పొదలి పుచ్చ                                     మది నిలిచిన యతివదె నోర కన్నుల                                             కాంచ నతడి కుడి కన్నదరగ                                     అదిరి పడిన రాజు ఆ మీసముం దిప్ప                                             అతివ బుగ్గలవియే యరుణిమవగ                              ఆ.వె.  చెదరిన తన మదిన చింత తీరగనంత                                       మాధవుడు హితునికి వందనమిడె                                       ముదమున పురుషోత్తము కరచాలనమిడ                                       మిత్రులిదియె కూడి మిసిమి పంచె.   మాధవుడు ఆనందం పట్టలేక, కిందికి దిగి, పండాలతో సమానంగా తను కూడా నాట్యం చేయ సాగాడు.   “మహరాజుగారు వస్తున్నారు.. పక్కకి జరగండి..” రాజ భటులు త్రోవ చేయగా, కొద్ది దూరంలో కపిలేంద్ర దేవుడు, రాణులతో కూడి రథములో వచ్చి దిగి, నడిచి స్వామివారి తేరు వద్దకు వచ్చాడు.   నడచి వస్తున్న మహరాజు సాక్షాత్తు ఆది విష్ణువు వలెనే ఉన్నాడు. జగన్నాథ రథయాత్రకి మ్రోగిస్తున్న దుందుభిలు రాజుకు కూడా స్వాగతం పలుకుతున్నాయి.          సీ.  కపిలుని కనులను కరుణయె కురవగ                        అరుణ కిరణములె హలను మెరవ               కపిల ప్రభువు విజయ పథమున నరగ                        జయ నరడలవె మొరయ నచటనె               కలిసి జనులు కరములు కలిపి భజన                        సలుపుచు నడువగ సదమలముగ               అవని పులకరము లవి యనుభవములె                        అలవి నెరుగక నిహమును పరము        ఆ.వె.    జినుని రథ విహరణ మనుసరణముననె                   చనగ సహజ సహితమున హలధరు                   సకల జనులు రథమును కదిలి నడుపగ                   నగరి నడుమనె వెలసెగ సరకము. (కపిలుడు= విష్ణువు, హల= భూమి, కపిల ప్రభువు= కపిలేంద్రవర్మ, అరడ= దుందుభి, మొరయు = మోగ, జినుడు= జగన్నాధుడు, విహరణము= విహారము, సహజ= సోదరి, హలధరుడు= బలరాముడు, సరకము= స్వర్గము)   రాణీవాసపు స్త్రీలలో కాదంబరీ దేవి కూడా ఉంది. ఆమె మోము ఆనందంతో వెలిగి పోతోంది. పద్మావతితో తన సోదరుని పరిణయము.. సోదరులందరిలో పురుషోత్తమ దేవునివద్దే కాదంబరికి చనువు యెక్కువ. అతను దండయాత్రలకి ఎక్కుగా వెళ్లక పోవడం, కోటలోనే ఉండి రాజధాని రక్షణ చూడడం ప్రధాన కారణమైతే, స్వభావ సిద్ధంగా ఆప్యాయతని పంచడం ఇంకొక కారణం.        రాజ్యం గురించే కాక, కుటుంబం గురించి కూడా పట్టించుకోవడం పురుషోత్తముని ప్రత్యేకత. క్లుప్తంగా చెప్పాలంటే.. రాజ్యంలో, కోటలో.. అందరి అభిమానాన్నీ చూరగొన్నాడు పురుషోత్తమ దేవుడు.   తండ్రి రాకని గమనించిన పురుషోత్తముడు, రథం దిగి, పద్మావతి చేయి పట్టుకుని దింపి, మహరాజుకి పాదాభివందనం చేశాడు.   మహారాజు, తనయుడ్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు.   “తండ్రీ! మీ అనుమతి లేకుండా..”   చేయెత్తి ఆపేశాడు కుమారుడిని కపిలేంద్ర దేవుడు.   “మాధవునికి నేను అనుమతిచ్చాకే, నీ వద్దకు ఆ సమయంలో తీసుకుని వచ్చాడు రాకుమారిని. పద్మావతీ దేవి మా కోడలుగా మన కోటలోనికి ప్రవేశించడానికి అన్ని విధాలా తగిన కన్య. త్వరలో వివాహం జరిపించే ఏర్పాట్లు చేద్దాము.”   ఆ హడావుడిలో, గుంపులో.. ఏ విధంగా జరిగిందో కానీ, మాధవుడు, కాదంబరీ దేవీ పక్క పక్కకి వచ్చేసి నిలుచున్నారు. ఇరువురి మొహాలూ వేయి నక్షత్రాల కాంతితో వెలిగి పోతున్నాయి. ఇద్దరూ లక్ష్మీ నారాయణ స్వరూపాల్లా ఉన్నారు.   తాను అనుకున్నది జరిగిందని.. సంవత్సరమంతా పడిన తపన మాయమయిందని మాధవుడు సంతోషంగా ఉన్నాడు.   తనకి నచ్చిన చెలి సోదరునికి ఇల్లాలవుతోందని, ప్రతీరోజూ కలుసుకోవచ్చని కాదంబరీదేవి ఆనందంగా ఉంది.   “నా మీద ఇంకొక బాధ్యత ఉన్నది తండ్రీ!” పురుషోత్తముడు మహారాజుతో అన్నాడు.   “రథయాత్ర అయిన పిదప మాట్లాడుకుందాం. మీ బాధ్యత నాది కూడా.. తప్పక నెరవేరుద్దాము.” కపిలేంద్ర వర్మ.. రథం కదపడానికి సిద్ధ పడుతూ అన్నాడు.   కోలాహలం మొదలయింది.   మేళతాళాలతో జగన్నాధుని రథం కదిలింది.   బలభద్ర, సుభద్రల రథాలు కూడా వెనువెంట కదిలాయి.   రాచ కుటుంబ మంతా, కొద్ది దూరం నడచి, తమ తమ వాహనాల మీద వెళ్లి పోయారు వసతి గృహాలకి. సంధ్యా సమయానికి, గుండీచా ఆలయానికి చేరుకుంటారు.. అక్కడ తోట విడిదిలో జగన్నాధునికి జరుగబోయే పూజలను తిలకించడానికి.     రాకుమారి పద్మావతీ దేవి ఆనందానికి అవధుల్లేవు. విడిదికి రాగానే సీతమ్మని పట్టుకుని గిరగిరా తిప్పేసింది. సీతమ్మ, ఆగమని చెప్పి, ఉప్పు మిరపకాయలు తీసుకుని వచ్చి దిష్టి తీసింది.   గౌతమి దూరంగా నిలుచుని చూస్తోంది.. కన్నులు విప్పార్చి.   ఇన్ని రోజులు తమ ఇంట్లో తమ బిడ్డగా ఉన్నది రాకుమారా? సంకోచంగా దూరంగా జరుగుతోంది గౌతమి.   “అమ్మా! నేనెప్పుడు మీ కుమార్తెనే.. రాకుమారిని కాదు. మీరే నా వివాహం జరిపించాలి. చీరసారెలతో అత్తవారింటికి పంపాలి..” దగ్గరగా వచ్చి, గౌతమిని గట్టిగా కౌగలించుకుంది పద్మావతీ దేవి.   “అంతకంటే అదృష్టమేముంటుంది తల్లీ..” గౌతమి ఆప్యాయంగా వీపు నిమిరింది.                                       ……………………. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 31వ భాగం

                     ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 31వ భాగం   “మాధవా! జగన్నాధుని సేవకి సమయం ఆసన్నమవుతోంది. ఈ సారి మరింత ఘనంగా ఏర్పాట్లు చెయ్యమని తండ్రిగారు ఆదేశ మిచ్చారు. మొత్తం భారమంతా మన మీదనే.. ఇంక ఒక మాసము మాత్రమే ఉంది. ఈ లోగా, నీవు రెండు మారులు పూరీ పట్టణమునకు పోయి రావలెను.” పురుషోత్తమ దేవుడు, కొలనులో ఈత కొడ్తూ అన్నాడు.    గుర్రపు స్వారీ.. కత్తి యుద్ధం సాధనలయ్యాక మిత్రులిరువురూ వనములో కొలను వద్ద, స్నానం చేసి మంటపంలో కూర్చుని ఆ రోజు రాచకార్యాలను ముచ్చటిస్తారు.   “అలాగే రాకుమారా! ఈ మారు కూడా జగన్నాధుని సేవించుకునే అదృష్టం మిమ్ములను వరిస్తున్నట్లుంది. తప్పకుండా అన్ని ఏర్పాట్లనూ చేసెదను.” మాధవుడు కొలనులోనుండి బైటికి వచ్చి, అంగ వస్త్రముతో త్వర త్వరగా అద్దుకుని, మంటపం వెనుకకు వెళ్లి దుస్తులు ధరించి వచ్చాడు.   “ఏమాయె మాధవా? ఏమా తొందర? సభకి ఇంకా సమయమున్నది కదా!” మాధవుడు పలుక కుండా మంటపంలో ఆసనం మీద కూర్చున్నాడు.   అప్పుడు వినిపించింది, పురుషోత్తమునికి కలకలా రావం..   “ఓహో.. మా సోదరి వచ్చుచున్నదా? నిజమే.. ఇప్పుడు అంతఃపుర స్త్రీలు విహారం చేసే సమయం ఆసన్న మయింది కదా! మనం బయలు దేరుదాం.”   కాదంబరీ దేవి, కొలనులో దిగడానికి కావలసిన దుస్తులు ధరించి వచ్చింది చెలులతో. వెనుకే చెలులందరు అవసరమైన ఇతర సామగ్రి తో అనుసరిస్తూ వస్తున్నారు.   సోదరిని చూసినంతనే పురుషోత్తముని మోము మందహాసంతో విచ్చుకుంది. వనమంతా చిరు సవ్వడులు మొదలయ్యాయి. వాతావరణ మంతా ఆహ్లాదంగా తయారయింది.   మహా స్రగ్ధర.   అరుగో యా నెచ్చెలుల్ కాయగ నదె రయమున్ హాయిగా రాకుమారే                    యరుదెంచంగానె యా తోయముల యలల నా హాసముల్ యేమనేనో                    చిరు వయ్యారాలు చూపించి యుడుత లదె వేంచేసి యానంద మందే                    మురిపెం మెండైన నెంతో ముదము నిలిచెగా మోమునే మెచ్చగానే.     అన్నగారి పాదములంటి నమస్కారము చేసింది కాదంబరి.   “కుశలమేనా సోదరీ!” చిరునవ్వుతో విచారించి, స్నేహితుని వెదకుతూ పయనమయ్యాడు పురుషోత్తముడు.     మాధవుడు మహారాజుగారి ఆనతి మేరకు పూరీలో జరుగబోవు రథయాత్ర ఉత్సవానికి పర్యవేక్షణ జరుపుతున్నాడు. వారమునకొక మారు పూరీ వెళ్తున్నాడు.   కోటలో కొలువునకు ప్రతీ దినమూ వెళ్ల వలసిందే.   అప్పుడప్పుడు, చెలులతో నడయాడుతూ.. అరుదుగా ఏకాంతమును ఆస్వాదిస్తూ, వనములలో కాదంబరీ దేవి ఎదురు పడుతూనే ఉంది మాధవునికి.   ఒక సారి మాత్రము, సూటిగా కళ్లలోకి చూసి చిరు నవ్వు నవ్వింది.   హృదయం చిక్క బట్టుకుని పక్కకి తిరిగి వెళ్లి పోయాడు. అప్పటి నుండీ, గుండెలోనే తిష్ట వేసుకుని కూర్చుంది.   రాకుమారునికి చెప్తే..   తల విదిల్చాడు.. అసలే రాకుమారుడు పరిహాసం చేస్తుంటాడు. అది మహా రాజుగారికి తెలుస్తే.. తల తీసేసినా ఆశ్చర్యం లేదు. కోటలో రాకుమారికీ, పూటకూళ్ల మాధవునికీ పొంతనెక్కడ?   అత్యాశే.. అందుకే సాధ్యమయినంత వరకూ అణచి వేస్తున్నాడు.   ఒక వేళ, కోటలోని వారు ఆంగీకరించినా.. తన ఇంటిలోని వారు ఒప్పుకోవాలి కదా! వారి దృష్టిలో కుల సామరస్యం లేదాయె.   ప్చ్.. ఈ స్పందనలనెందుకు పెట్టాడో ఆ భగవంతుడు?   ఇంట్లో సీతమ్మ, మనుమని పెండ్లి చేయాలని గొడవ.. ఇంకెందుకాలిశ్యం, మాధవుడు మంత్రి అయ్యాడు కదా అంటుంది. తనకి తెలిసిన మంచి సంబంధాలు చెప్తూంటుంది.   గౌతమీ నందులు కూడా అదే ఆలోచిస్తున్నారని తెలిసి పోతోంది.   అంతా ఆ జగన్నాధుని మీదనె భారం పెట్టి కాలంగడుపుతున్నాడు మాధవుడు.     అనుకున్న సమయం రానే వచ్చింది.   మాధవుడు వారం రోజులు ముందుగానే పద్మావతీ దేవిని, సీతమ్మని తోడుగా తీసుకుని పూరీలో దింపి వచ్చాడు. అక్కడ మంత్రిగా అతనికి సకల సదుపాయాలతో భవనం ఏర్పాటు చేసుకున్నాడు.   రథయాత్ర సమయంలో పద్మావతి జగన్నాధుని సేవ చేస్తానని మొక్కుకుందని సీతమ్మే గుర్తు చేసింది.   పద్మావతి ప్రతీరోజూ, ఆలయానికి వెళ్లి ప్రాంగణ మంతా శుభ్రం చేస్తోంది, మిగిలిన భక్తులతో కూడి.   ఆ సంవత్సరం మరింత వైభవంగా చేయాలని నిశ్చయించాడు కపిలేంద్ర వర్మ. కాంచీపుర విజయం ఒక ఎత్తైతే.. రాజ్యంలో సకాలంలో వానలు పడి సుభిక్షంగా ఉండడం మరొక కారణం.   రథయాత్ర ప్రారంభ సమయానికి వచ్చేస్తానని వాగ్దానం చేశాడు మాధవునికి. అంతవరకూ స్వామి సేవని పురుషోత్తముని చెయ్యమని ఆదేశించాడు.   రెండురోజులు ముందుగానే రాచ కుటుంబమంతా వచ్చేసింది.. వారితోనే నంద గౌతమిలు కూడా..   మార్గ మధ్యంలో విశ్రాంతి సమయంలో పరిచయమయింది, రాకుమారి కాదంబరీ దేవి వారికి. మాధవ మంత్రి తల్లిదండ్రులనగానే, సమీపానికి వచ్చి పలుకరించింది. ఇంక.. రాకుమారిని జన మధ్యంలో చూసిన వారు ఆమె సౌకుమార్యానికి, అందచందాలకు ఆశ్చర్య చకితులై ఉండిపోయారు.                  సీ.    దేవేంద్ర వనమునందే వెలసినయట్టి                                పారిజాత విరుల పసిమిగలిగి                        పున్నమి చంద్రుని పొలపము పొడచూప                                మేని ఛాయ పొసగు మిసిమి వెలుగు                        మల్లిరేకుల సుకుమారపు సొగసులు                                మోమునందు విరియ మురిపముగను                        సరస కొచ్చిననంత సంపంగి తావియె                                ఆహ్లాదముగ నెంతొ ఆవరించ          తే.గీ.         మీనముల పోలు కనుదోయి మెరుపులవియె                        అభినివేశము కలిగిన యలతి యనగ                        అణువునణువున కనబర్చ యణకువెంతొ                        అతిశయము కూడ కానగ యరుదుగాను.     అణకువతో, ఆదరముతో సంభాషించింది కాదంబరీ దేవి.   సీతమ్మ పాడుతున్న జానపద గేయాలతో సునాయాసంగా గడిచి పోయింది సమయ మంతా.        మధురగతి రగడ..         అరె చూతముగా ఆది పురుషునే                                    అరుగుచు నందరు ఆటల నాడను                                    కరివరదుడతడె, కలియుగముననూ                                    హరి హరి యన భవ హరమ్ము కల్గును.                                      జగన్నాధు డతడె జాడతెలియగను                                    జగముల నేలడ జలధిని నిల్చిని                                    ఖగవాహనుడే కాచగ జనులను                                    నగమెత్తినయా నారాయణుడును.     పాటలయ్యాక, భజన చేస్తూ పూరీ పట్టణం చేరారు అందరూ.   ఏటికేడు జగన్నాధ రధ యాత్రని వీక్షించడానికి భక్త సందోహం పెరిగి పోతోంది. భక్తులకి సదుపాయాలు చెయ్యడానికి ఆలయ నిర్వాహకులు కొత్త మార్గాలు వెతుకు తున్నారు.   రాచకుటుంబం వారి విడిది సమూహం వద్దనే మాధవుని కుటుంబం కూడా ఉన్నారు. సముద్రపు ఒడ్డుకి దగ్గరలోనే కట్టిన వసతి గృహాలు.. సూర్యోదయం చూడాలంటే సముద్రపు ఒడ్డునే చూడాలి.   ప్రతీ ఉదయం సముద్రపు ఒడ్డుకి వెళ్లడం కాదంబరీ దేవికి అలవాటయింది. చిన్నపిల్లలా ఒడ్డునున్న ఇసకలో గూళ్లు కట్టడం, రెండు చేతులతో పావడా ఎత్తి పట్టుకుని అటూ ఇటూ పరుగులు పెట్టడం.. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతోంది.                                                                 “నంద మహాపాత్రుల కుమార్తె నా మీరు?” పద్మావతిని చూసి అడిగింది కాదంబరి, సముద్ర పొడ్డున అలల్లో ఆడుకుంటూ.   “అవును రాకుమారీ. దత్త పుత్రిక.” పద్మావతి సమాధానం చెప్పే లోగా, అక్కడి కొచ్చిన సీతమ్మ అందుకుంది.   “చాలా సంతోషం. మీకు కత్తి యుద్ధం నేర్పిస్తాను. ఇక్కడున్న కాలమంతా. తరువాత కూడా మీరు మా కోటకి వస్తే మనం చాలా విద్యలు నేర్చుకొన వచ్చును.” కాదంబరీ దేవి, పద్మావతి దగ్గరగా వచ్చి అంది.   “కత్తి యద్ధం.. అమ్మాయిలు యుద్ధాలు చెయ్యడం ఎందుకు రాకుమారీ?” సీతమ్మ సందేహం.   “క్షత్రియ కన్యలకి యుద్ధ విద్యలన్నీ వచ్చి ఉండాలి అమ్మమ్మా? నేను రోజూ అభ్యాసం చేస్తుంటాను. పద్మావతీ దేవికి నేర్పిస్తాను.”   “యుద్ధ విద్యల సంగతి ఎలా ఉన్నా, మీ స్నేహం కలకాలం వర్ధిల్లాలని ఆ జగన్నాధుని ప్రార్ధిస్తాను.” సీతమ్మ అక్కడి నుంచి వెళ్లి పోయింది.     “రోజూ జగన్నాధుని సేవకి వెళ్తున్నారా మీరు పద్మావతీ?” ఎవరూ చెప్పక పోయినా, ఎందుకో పద్మావతిని ఇతర చెలుల్లాగా కాకుండా మన్నిస్తుంది కాదంబరీ దేవి.   “అవును. ఆలయం శుభ్రం చేయడంలో నా వంతు నేను సహాయం చేస్తున్నాను. దేవునికి పూల మాలలు కడ్తాను. వంట శాలలో కూడా చేయందిస్తున్నాను. ఉదయం స్నానాదికాలు పూర్తవగానే వెళ్లి సంధ్యా సమయానికి విడిదికి చేరుతాను.” పద్మావతి చెప్పింది.    మూడవరోజు రాత్రి భోజనాలయిన పిదప ఆరుబయట కూర్చున్నారందరూ. సముద్రపుగాలి ఆహ్లాదంగా వీస్తోంది. అక్కడక్కడ మేఘాలు కదలాడుతున్నా, ఆకాశంలో తారలు పలుకరిస్తున్నట్లుగా మిణుకు మిణుకు మంటున్నాయి.   “మీరు కటకం వచ్చి చాలా దినాలయిందా? ఇక్కడి వాతావరణం నచ్చిందా?” కాదంబరీ దేవి ప్రశ్నలకి అవునన్నట్లుగా నిలువుగా తలూపింది పద్మావతి.   రాకుమారి పద్మావతిలోని రాచఠీవి, ఆవిడ పూటకూళ్ల ఇంటికి చెందినది కాదని చెప్పకనే చెప్తోంది. కాదంబరికి కాంచీపురం దండయాత్ర గురించి కొంచెం తెలిసినా, పూర్తి వివరాలు తెలియవు. పద్ధెనిమిది మంది యువరాజులున్న కోటలో అంతఃపుర స్త్రీలు రాజకీయాలకి దూరంగానే ఉంటారు.   “నంద మహా పాత్రులు మాకు బాగా కావలసిన వారు. దక్షిణదేశంలో జరిగిన యుద్ధంలో మా కుటుంబం చెల్లా చెదురై పోయింది. సోదరుడు మాధవుడు వచ్చి నన్ను కటకం తీసుకొని వచ్చారు, శతృ సైనికుల బారిని పడకుండా.” పద్మావతి, కొంచెం వ్యవధి తీసుకుని చెప్పింది.   “అయ్యో.. అంత పని జరిగిందా! మేమంతా మీకు తోడుగా ఉంటాము పద్మావతీ దేవీ. మీరేమీ బెంగ పడకండి. జగన్నాధుని సేవలో ఏమైనా అంతరార్దం ఉందా?” చిరునవ్వు చిందిస్తూ అడిగింది కాదంబరి.   “ఊ..” సిగ్గుపడుతూ అంది పద్మావతి. మోము యెర్ర మందారమే..   “ఎవరా అదృష్ట వంతుడు?”   “ఎవరైనా ప్రస్తుతం నా మీద కినుక వహించారు. వారి అనురాగం పొందేలాగ అనుగ్రహించమనే నా వేడుకోలు.”   “జగన్నాధునికి సేవ చేస్తే కోరుకున్న వరుడు లభ్యమవుతాడా?” కాదంబరీ దేవి ఆశ్చర్యంగా అడిగింది.   “అనే అంటారు పెద్దలు. కావలసింది నమ్మకం. ఆది దేవుని మీద భారమంతా వేసి స్మరణ చేస్తుంటే తప్పక కోరిక నెరవేరుస్తాడు. మన తల్లిదండ్రులేనా కాదంటారేమో కానీ ఆ అంతర్యామి మాత్రం మనని కాచుకునే ఉంటాడు.”   సాలోచనగా చూస్తుండి పోయింది కాదంబరీ దేవి.   “ఏమి రాకుమారీ.. ఎవరైనా రాకుమారుడు మీ హృదయాన్ని దొంగిలించాడా? రేపు ఉషోదయం అయిన వెంటనే ఆలయ ప్రాంగణానికి వచ్చెయ్యండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది.” పద్మావతి, కాదంబరీ దేవి వద్దకు వచ్చి భుజం మీద చేయి వేసి అంది.   కాదంబరి తలకొద్దిగా వాల్చింది. మోములో కళ తగ్గింది.   చూపుడు వేలుతో తల కొద్దిగా పైకి లేపి కళ్లలోకి చూసింది పద్మావతి.   “ఏమయింది రాకుమారీ? ఎందుకా కలత?”   “అతను రాకుమారుడు కాదు. మామూలు వ్యక్తి. కానీ హృదయ స్పందనకి ఆ విశేషం అక్కర లేదు కదా!”   “ఆ సంగతి ఎవరికైనా అభ్యంతర పెట్ట వలసిన విషయం కాదనుకుంటాను.”   “అతడు క్షత్రియుడు కూడా కాదు. అసలు నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా తెలియదు. ఈ విషయం ఇప్పుడు ప్రధమంగా మీ వద్దనే బైట పెట్టాను.” కాదంబరీ దేవి లో గొంతుతో అంది.   పద్మావతికి అంతా అర్ధమవుతున్నా రాకుమారి నోటివెంటే చెప్పించాలని ఆగింది.   మాధవుని మనసు కూడా గ్రహించింది. ఇరువురికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు అడ్డు చెప్పడానికేమీ ఉండదనే అనిపించింది.   “మా ప్రాణాలు కాపాడిన మీ సోదరుడే పద్మావతీదేవీ..” రాకుమారి బిడియం వదిలి అనేసింది. ఎవరైనా తనకి సహాయం చెయ్య గలిగితే అది పద్మావతే అని గ్రహించిందామె.   పద్మావతికి కాదంబరీ దేవి మీద అవ్యాజ్యమైన అభిమానం కలిగింది.   దగ్గరగా తీసుకుని కౌగలించుకుని, నుదుటి మీద చిన్నగా ముద్దిచ్చింది.   “తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది రాకుమారీ!”   “మరి మీ మనసు దోచిన వీరుడెవరో నాకు చెప్పరా?” కాదంబరీ దేవి ప్రశ్నకి జవాబుగా చిరునవ్వు విసిరింది పద్మావతి.   “త్వరలో తెలుస్తుంది. అంత వరకూ వేచి ఉండాలి. తప్పదు.”   “నేనేమో మీతో అంతా చెప్పేశాను స్వేచ్ఛగా. మీరు మాత్రం..” బుంగమూతి పెట్టింది.   పద్మావతి కిలకిలా నవ్వింది.   “రాకుమారీ! మీ ప్రేమ ఫలిస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ నాది వేరు. అపార్ధాలు, అలుకలతో కూడి ఉంది. ముందు అవన్నీ తొలిగి పోవాలి. ఆ తరువాత మరుగున పడిన ప్రేమ బైటికి రావాలి. కాస్త సంక్లిష్టమయన ప్రేమ కథ నాది. అందుకనే సమయం వచ్చినప్పుడు చెప్తాను. మీ రంటే నాకు చాలా అభిమానం కలిగింది. మా సోదరునికి తోడైతే మనం బంధువులం కూడా అవుతాము. చాలా ఆనందంగా ఉంది.”   కాదంబరీదేవి కూడా ఆనందంగా నవ్వింది.   “నింగినున్న చందమామ కిందికి వచ్చినట్టుందే..”   పద్మావతి కించిత్ ఆశ్చర్యంగా అంది. వాతావరణం ఆహ్లాదంగా తయారయింది.                                           ……………….. ......మంథా భానుమతి  

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 30వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 30వ భాగం    మాధవుడు పట్టు వస్త్రములు ధరించి, జరీ తలపాగా పెట్టుకుని, మెడలో ముత్యాల హారం అలంకరించుకుని.. నుదుట సింధూర తిలకం దిద్దుకుని, అమ్మమ్మకీ, అమ్మకి, తండ్రిగారికీ నమస్కరించి.. పద్మావతిని ఎదురు రమ్మని బయలు దేరాడు.   తొలి సారిగా.. మహరాజుగారు కబురు పంపారు. ఉన్నంతలో తనని తాను ఆకర్షణీయంగా అలంకరించుకుని బయలు దేరాడు.. లోలోపల కొంత ఆందోళనగా ఉన్ననూ.. ఎందుకు రమ్మన్నారో..   ఒక రాజభటుడు కళ్యాణికి జీను అదీ తగిలించి, మాధవుని చూసి అలా నిలబడి పోయాడు.   సాగనంపడానికి వాకిలి వద్దకు వచ్చిన నందుడు, భటుని ఆరాధనా పూర్వక దృష్టిని కని, తాను కూడా ఒక సారి చూశాడు, కుమారుని వంక.   పుంసా మోహన రూపాయ.. అని శ్రీరాముడిని వర్ణించినట్లుగా అనిపించాడు నందుడికి.    సీ.   మోము మెరయనెంతొ ముచ్చట గొలుపుచూ                     తీరైన నాసిక తెలివి చూప           ధీర గంభీరమౌ దృక్కుల కన్నులు                     పదునైన తలపుల బాగ తెలుప           నిలువెల్ల నలరారు నేరిమి శౌర్యము                     శత్రుగుండెల నింపు శంక వెఱపు           ఆజాను బాహువై నాదాటు నిలిచిన                    ఆరీతి దోచదా అతివ మనసు      ఆ.వె.   నలువ నెమ్మి నెంతొ నాణ్యము నెలగొల్పె              చెలువ మందు మరియు శీల మందు              అతడి నడవడి యదె యందరి మోదమౌ              మాధవు డను నామ మంత పలుక.      ఏ రాచమందిరంలోనో తిరుగాడ వలసిన వాడు.. తన ఇంట. అచ్చు ఆ చిన్ని మాధవుని వలెనే.   ఆ ఆలోచన రాగానే నందునికి ఒక్క సారిగా దిగులు కమ్ముకుంది. అంటే ఆ కృష్ణయ్యలాగా, త్వరలో తన ఇంటి నుండి వెళ్లి పోయి.. కంటికి కనిపించడా! అదే జరుగుతే గౌతమి తట్టుకోగలదా? ఆ యశోదమ్మలా జీవన మంతా వేదనేనా?   మొహమంతా దిగులు కమ్ముకుంది.   వీడ్కోలు చెప్పుదామని వెను తిరిగిన మాధవుడు తండ్రి ఆవేదనని గ్రహించాడు.   “మహరాజుని కలుసుకోవడానికే వెళ్తున్నాను తండ్రీ. మరల తిరిగి వస్తా కదా! ఎందుకంత ఆందోళన?”   “తొలిసారి నిన్ను ప్రత్యేకంగా మహారాజుగారి పిలువనంపారు కదా.. ఏమి వార్త వినాలా అని కించిత్ సందేహం మాధవా! మరల ఏదైనా యుద్ధ ప్రతిపాదన వచ్చి మాకు దూరమవుతావేమోనని..” అంతలో గౌతమి కూడా వచ్చి పక్కన నిలిచింది కళ్లనిండా నీళ్లతో.   పద్మావతీ దేవి సంభ్రమంగా చూస్తోంది. ఇంతటి ఆప్యాయతలు తమ రాజమందిరాలలో కానరావేమి? రాజుగారిని కలవడానికి వెళ్తుంటే.. దేశాంతరం వెళ్తున్నట్లు వీడ్కోలు చెప్తున్నారెందుకో!   “నేను ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను.సరేనా? నిన్ను కూడా అమ్మమ్మా.” దూరంగా నిల్చుని చూస్తున్న సీతమ్మ దగ్గరగా వెళ్లి, భుజాలు పట్టుకుని చెప్పాడు.      “మామూలుగా కోటకి వెళ్తుంటే అంతటి కన్నీరెందుకమ్మా?”   “యుద్ధ వార్తలు విన వస్తున్నాయమ్మా! కాంచీపుర దండయాత్ర అయి ఇంకా ఆరేడు మాసములు గడవలేదు. రాజుగారు పిలువనంపారంటే బలమైన కారణం ఉంటుంది కదా! మా కున్నది ఒక్కగా నొక్కడు. ఇతడు మా వ్యాపారం మీద అంత ఆసక్తి కన పరచకుండా, గురుకులంలో చేరి, రాకుమారినితో సమముగా అన్ని విద్యల్లోనూ ఆరి తేరాడు. అదే మా వ్యాకులతకి కారణం.” పద్మావతి సందేహానికి సమాధానం చెప్పాడు నందుడు.   “ఇదేమీ దినచర్య కాదు. ఇదే మొదటి సారి ఇటువంటి పిలుపునందుకోవడం.” సీతమ్మ వివరించింది.   “ప్రతీ దినమూ కోటకి వెళ్లినా అది రాకుమారుని కలవడానికే తప్ప మహారాజు..” గౌతమి మాట్లాడలేక పోయింది.. గొంతులో ఏదో అడ్డు పడ్డట్లయి.   “ఏమీ అనుకోనిది జరగదమ్మా! సోదరుడు శుభవార్తతో వచ్చెదరు. చూస్తూ ఉండండి.” పద్మావతి ధైర్యం చెప్పింది.   “నీ నోటి ఫలం.. అంతకన్ననూ కావలసినదేమున్నది తల్లీ!” గౌతముడు కాస్త నెమ్మదించాడు.     కళ్యాణి నెమ్మదిగా నడుస్తోంది.. యజమాని అంతరంగం ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉంటుంది. మాధవుడు పైకి బింకంగా ఉన్నాడు కానీ.. లోలోపల బెదురుగానే ఉంది. ముందురోజు రాకుమారి ప్రాణాలు కాపాడేటప్పుడు.. అత్యవసర పరిస్థితులలో నోటిలో నోరు పెట్టి.. తప్పలేదు. ఆ సంగతి తెలిసి, శిక్షించడానికి పిలిచారా? తనకి శిరచ్చేదన తప్పదా?    మరణం అంటే ఏ మాత్రం భయం లేదు. తెలిసీ తెలియని వయసులోనే అతి దగ్గరగా, తడబడుతున్న అడుగులతో, తెర మరుగున దాగి, వణకుతున్న చేతులని కళ్లకి అడ్దు పెట్టుకుని, దడదడ మని కొట్టుకుంటున్న గుండెలతో.. అంతఃపుర స్త్రీలని, పసి వారిని, ముసలి వారిని.. అందరినీ నరికెయ్యడం చూశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లి వీపుకు ఆనుకుని, నిద్దర కాచుకుని పారిపోతున్నప్పుడే మరణం అనివార్యమని తెలుసుకున్నాడు.   కానీ తన మీదే ఆశలు, ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న పెంపుడు తల్లిదండ్రుల శోకం తలచుకుంటేనే మనసు వికలమవుతోంది.   అయితే.. రాసి పెట్టినదేదో జరగక తప్పదు.   గుండె దిటవు చేసుకుని కళ్యాణి కళ్లెం లాగాడు. అశ్వం వేగం పెంచింది.     మహరాజు కొలువు తీరి ఉన్నారు. మంత్రి సామంతాదులందరూ తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు.   లోలోపల బెదురుగా ఉన్నా, మాధవుడు బింకంగానే అడుగు పెట్టాడు సభలోకి.   ఠీవిగా.. తల కొద్దిగా వాల్చి మహారాజుకి అభివాదం చేశాడు.   ఇరువురు భటులు వచ్చి రాజుగారి వద్దకు తోడ్కొని వెళ్లారు.   మాధవుడు ఓరకంట పురుషోత్తమ దేవుని కోసం వెదికాడు. రాకుమారులందరూ, రాజుగారి సింహాసనం పక్కన వరుసగా ఆసీనులై ఉన్నారు. హంవీరకుమారుడు, అతని ఏక గర్భ సహోదరుడు తప్ప మిగిలిన పదహారు మందీ, ఆసీనులై ఉన్నారు.   ఇటువంటి సభలోనికి అడుగు పెట్టడం ఇదే ప్రధమం మాధవునికి. చిత్రంగా, లోలోన ఉన్న భయం అంతా మాయం ఐపోయింది. తాను ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నట్లుగా అనిపించింది. రాచకొలువు కొత్తగా లేదు. తన రక్తంలో జీర్ణించుకుని పోయినట్లుంది.   కపిలేంద్ర వర్మ, తన వద్దకు రమ్మని మాధవునికి సైగ చేశాడు. రాజ సింహాసనం వద్దకు వెళ్లగానే, లేచి ఆలింగనం చేసుకుని సభకి పరిచయం చేశాడు.   “ఈ రోజు మేమందరం ఈ విధంగా ఆనందంగా ఉన్నామంటే, ఈ యువకుడు ప్రాణాలకు తెగించి మా రాకుమారిని కాపాడిన వైనమే. మా ఒక్కగానొక్క కుమార్తెని కాపాడి, మమ్ములను ఋణగ్రస్తులను చేశాడు. అందుకే ఇతడికి మంత్రి పదవి ఇస్తున్నాను. అంతే కాదు.. మాకు ముఖ్య సలహా దారుగా కూడ ప్రత్యేక బాధ్యత అప్పగిస్తున్నాను.” సభ చప్పట్లతో మారు మోగి పోయింది.                                మాధవునికి తాను వింటున్నదేమో ఒక క్షణం అర్ధం అవలేదు. ఇదంతా కలా.. నిజమా!   రాకుమారిని తాకినందుకు శిక్షిస్తారేమో అనుకుంటే.. ఈ విధంగా సత్కరిస్తున్నారా! తాను అదృష్ట వంతుండే. పురుషోత్తమ దేవుని వంక తిరిగాడు.   చిరునవ్వుతో తన మిత్రుడు చెయ్యెత్తి కనుసన్నలతోనే పలుకరించాడు.   అధికారిక దుస్తులు తలపాగా అందిస్తూ.. అంగుళీయకం తొడిగాడు కపిలేంద్ర వర్మ.   “మాధవ మంత్రీ! ఈ అంగుళీయకం సహాయంతో మీరు నిరభ్యంతరంగా, కోట లోపలికి, కొలువునకు, మా రాజ మందిరానికీ వస్తూ వెళ్తుండ వచ్చు. ఈ రోజు సాయం కాలం, మా మందిరంలో నున్న తోట వద్దకు ఒకసారి రండి. మీతో ఆంతరంగికంగా మాట్లాడాలి.” మాధవునికి మాత్రమే వినిపించేట్లుగా అన్నాడు.   సభలోని వారందరినీ మాధవునికి పరిచయం చేశారు, ప్రధాన మంత్రి గోపీనాధ పాత్రుడు.   కొద్దిగా తలవంచి, వినయం ప్రదర్శిస్తూనే, తన అభిమానం నిలుపుకుంటూ ప్రతీ ఒక్కరినీ పలుకరించాడు మాధవుడు.   ప్రధమ పరిచయంలోనే ప్రముఖులందరికీ మాధవుని పట్ల సుహృద్భావం ఏర్పడింది.   చివరగా రాకుమారుల వద్దకు వచ్చారు.   “తన సోదరులని మీ మిత్రుడే పరిచయం చేస్తారు మాధవ మంత్రీ!” గోపీనాధ పాత్రుడు నవ్వుతూ పురుషోత్తమ దేవునికి అప్పగించారు.   పురుషోత్తముడు లేచి మిత్రుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.     “గౌతమీ! మన ఇంటికి బండేదో వస్తోంది, మాధవుని గుర్రం వెనుకగా!” సీతమ్మ సంభ్రమంగా అరిచింది.   హడావుడిగా లోపలినుంచి వచ్చారు నంద, గౌతమిలు.   మాధవుడు, ఇంటిముందు ఆగి, గుర్రం కట్టేసి వచ్చాడు. ఆ లోగా బండి మీద సంభారాలన్నీ కిందికి దింపారు భటులు.   ఇంట్లోని వారందరికీ పట్టు వస్త్రములు, ఆభరణాలు.. తినుబండారాలు. అన్నింటినీ లోపలికి చేరవేసి, వంగి వంగి నమస్కరిస్తూ వెళ్లిపోయారు, బోయీలు, భటులూ.   “ఇదంతా ఏమిటి నాయనా?” గౌతముడు అడిగాడు, ఆనందంతో.   “అనుకోకుండా చేసిన సహాయానికి ప్రతిఫలం తండ్రీ..” కిందటి రోజున వనంలో జరిగిన సంఘటన వివరించాడు మాధవుడు.   “రాకుమారిని తాకి, ఊపిరందించినందులకు శిక్షిస్తారేమోనని భయపడ్డానమ్మా! కానీ రాజుగారు దయార్ద్ర హృదయులు. మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. రోజూ కోటకి వెళ్లాలి. నాకు అప్పగించిన బాధ్యతలని నిర్వర్తించాలి.”   “చాలా సంతోషం కుమారా! మన బంధువైన గోపీనాధ పాత్రుల తరువాత మరల నీవకు అంతటి గౌరవం దక్కింది.” నందుడు ఆనందంగా వచ్చి కుమారుడిని కౌగలించుకున్నాడు.   “ఆగాగు.. లోపలికి రాకు. దిష్టి తియ్యాలి.” సీతమ్మ పరుగున ఇంట్లోకి వెళ్లింది.   కొద్దిగా నడుం వంచి వెళ్తున్న సీతమ్మని ఆందోళనగా చూశాడు మాధవుడు.   “వయసు ప్రభావం కుమారా! ఆవిడ ఆరోగ్యానికేమీ ఫరవాలేదు.” గౌతమి హామీ ఇచ్చింది.     సంధ్యా సమయానికి ఒక ఘడియ ముందుగానే తన అశ్వాన్నెక్కి బయలు దేరాడు మాధవుడు. ఈ సారి కళ్యాణి ఉత్సాహంగా కదం తొక్కుతోంది.   మంత్రి హోదాలో మాధవుడు కోటకి వెళ్తున్నాడు. మహారాజుగారు అందించిన అంగుళీయకాన్ని ధరించి.. అధికారిక దుస్తులతో.. ఠీవిగా!                       ఆ.వె.       దర్పమున హయమును ధాటిగా నదిలించి                         ఆధి పత్యమంత యరయ జూప                         కనుల నిండుగ కని కదలెను నందుడు                         కూర్మి కుమరు ప్రతిభ గుండె నిండ.     కోటలోనికి వెళ్తుంటే కూడా, అక్కడ నిలచి ఉన్న భటులందరి అభివాదములు గమనించి.. కొద్దిగా బిడియ పడ్డాడు మాధవుడు.   రోజూ వచ్చే కోటే.. కానీ ఏదో కనిపించని భేదం.. ఒడలంతా తెలియని ఉత్సాహం. పరిసరాలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి.   తనని మహారాజుగారెందుకు రమ్మన్నారో.. ఏ కార్యము నప్పగించెదరో!   ఒకటే ఆలోచన.. ఒకటే ధ్యేయం.   రాజుగారు అప్పగించబోయే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. మంత్రిగా మొట్ట మొదటి కార్యం.   ఏమయి ఉంటుంది?   తనను కూడా యుద్ధంలోనికి రమ్మనెదరా? కాంచీపుర దండయాత్రలో తన నైపుణ్యమును వినియే యుందురు కదా!   పరిపరి విధముల చింతించుచూ రాజ మందిరం వద్దకు చేరాడు మాధవుడు. అక్కడే నిలబడి యున్న భటుడు గుర్రాన్ని తీసుకుని వెళ్లి పోయాడు.   మాధవునికి ఏ ఆటంకమూ లేదు. రాచ ముద్రికను కూడా ఎవరూ అడగ లేదు. వార్తలు అనతి కాలం లోనే కోటలో వ్యాపించేస్తాయి.   నెమ్మదిగానే ఐనా, హుందాగా సోపానాలు అధిరోహించాడు మాధవుడు.   మహారాజు కపిలేంద్ర వర్మ ప్రధాన మంత్రితో ఏదో చర్చలో ఉన్నారు. మాధవుడు దూరంగా నిలబడి అభివాదం చేశాడు.   కూర్చోమన్నట్లు తల పంకించి, తన మాటలు కొనసాగించారు మహారాజు.   కొద్ది సేపయ్యాక, ప్రధాన మంత్రికి సెలవిచ్చి మాధవుడిని పిలిచారు కపిలేంద్ర వర్మ.   అంతా రాజుగారే మాట్లాడారు.. మధ్య మధ్య మాధవుని సందేహాలను తీరుస్తూ!   “మేము దక్షిణదిశగా, రాజమహేంద్రవరం, కొండవీడు రాజ్యాలను స్వాధీనం చేసుకోవడాని వెళ్తున్నాం. మీరు, రాకుమారుడు పురుషోత్తమ దేవుడు ఇంతకు మునుపు చేసినట్లే రాజ్య రక్షణ గావించాలి.”   “అలాగే ప్రభూ మీ ఆనతి.”   “అంతే కాదు.. మీ మీద మరొక గురుతరమైన బాధ్యత పెడుతున్నాను..”   మాధవుని మరింత దగ్గరగా రమ్మని, తన ఆదేశాన్ని నెమ్మదైన స్వరంతో అందజేశారు మహరాజు.. నమ్మలేనట్లు చూస్తున్న మాధవునికి, ఏం ఫరవాలేదన్నట్లుగా ధైర్యాన్ని తన చూపులతోనే ఇస్తూ.   సమావేశం అయ్యాక, నెమ్మదిగా మందిరం బయటికి వచ్చాడు మాధవుడు, ఆలోచనలతో నిండిన మదితో!      ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 29వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 29వ భాగం     చేతులు పైకెత్తి కొట్టుకుంటూ వడిగా పారుతున్న ఏటిలో కొట్టుకు పోతోంది రాకుమారి కాదంబరీ దేవి.   పురుషోత్తముడు చప్పట్లు కొట్టి, భటులను పిలవ బోతుండగానే, మాధవుడు పరుగున వెళ్లి సెలయేరులో దూకాడు.   చెలులు ఒడ్డున పరుగులు పెడుతున్నారు. ఒకటే కేకలు.. అంతా ఒక్క క్షణంలో గందరగోళం కింద తయారయింది. పురుషోత్తముడు, గజ ఈతగాళ్లని పిలవనంపాడు.   మాధవుడు పెద్ద పెద్ద బారలు తీస్తూ, రాకుమారిని చేరుకుని, జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాడు   అప్పుడు.. పరుగెత్తుకుంటూ వచ్చారు చెలికత్తెలు, పురుషోత్తమ దేవుడు, భటులూ.   మాధవుడు, ప్రాధమిక చికిత్స చేసి, రాకుమారి తాగేసిన నీళ్లన్నీ కక్కించాడు. నోట్లో నోరుపెట్టి ఊదటం వచ్చా అని అడిగాడు, అక్కడున్న చెలులని.   అడ్డంగా తల తిప్పారు అందరూ.   ఏంచేద్దామన్నట్లు పురుషోత్తముడి కేసి చూశాడు. అతడు తల నిలువుగా ఊపాడు తనకేసి తిరిగిన మాధవునికి, నువ్వే తగిన వాడివన్నట్లుగా..   వెటనే మాధవుడు, రాకుమారి నోటిలో నోరు పెట్టి గాలి ఊద సాగాడు. చుట్టూ మూగినవారందరూ రాకుమారుని చూసి దూరంగా కదిలారు. కాదంబరి వద్ద మాధవుడు, పురుషోత్తముడు మాత్రమే ఉన్నారు.   కొంచెం సేపటికి నెమ్మదిగా కన్నులు తెరిచింది రాకుమారి. ఆ లోగా కొందరు చెలికత్తెలు పరుగున వెళ్లి రాకుమారి వస్త్రములు తీసుకొని వచ్చారు.   పరిచారికలు సపర్యలు చేస్తుండగా, మిత్రులిద్దరూ, మండపం దగ్గరకు వెళ్లి, అక్కడున్న అరుగు మీద కూర్చోబోయారు. అప్పుడే మాధవునికి, పొడి అంగవస్త్రము, పంచ, అంగీ తీసుకొని వచ్చి ఇచ్చాడొక భటుడు. అతడు నీటిలోనికి దూకగానే, రాకుమారుని సైగ అందుకుని మాధవుని ఇంటికి వెళ్లి తీసుకొని వచ్చాడతడు.   మాధవుడు దుస్తులు మార్చుకోగానే, అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నారు మిత్రులు.   “ధన్యవాదాలు మిత్రమా! మా సోదరిని కాపాడినందుకు.”   “నాకంటే మీరు ఈతలో సమర్ధులు కదా! మరి అలా ఊరుకున్నారేమి రాకుమారా?” మాధవుడు సందేహంగా అడిగాడు.   “నాకంటే ముందు నువ్వు స్పందించావు మిత్రమా! ఇరువురమూ ఏటిలోనికి దూకి.. అక్కడ చేసేదేమీ లేదని ఊరకున్నాను.” పురుషోత్తముడు చిరునవ్వుతో అన్నాడు. కానీ మాధవునికి అనుమానంగానే ఉంది. కావాలనే తనకి అవకాశం ఇచ్చాడు రాకుమారుడని.   తన సంశయమును మనసునందే నిలిపి, రాకుమారునితో పద్మావతీ దేవి గురించి చెప్ప బోయాడు మాధవుడు. అంతలో..   రాకుమారి కాదంబరీ దేవి, నెమ్మదిగా, చెలుల ఆసరాతో వచ్చి పురుషోత్తముని ఎదురుగా నిలిచింది. మాధవునికి, గుండె ఒక క్షణం ఆగినట్లు అనిపించింది.   మోములో అలసట, శారీరక నిస్త్రాణ, మానసిక అలజడి..   అయినా రాకుమారి కన్నులు మాత్రం స్వచ్ఛమైన నీటిలో తిరుగుతున్న చేప పిల్లల లాగ అనిపించాయి మాధవునికి.     కం.      “మిలమిల మెరిసే చుక్కలు             అల నింగిన నిలువ లేక అవనికి వచ్చే             ఎల నెలత కన్నుల నిలిచె             కలనైన మరువగ లేను గాదిలి మీరన్.”     మనసులోనే తన భావాలని దాచుకుని, ఏదో పని ఉన్నట్లు లేచి వెళ్ల బోయాడు.   “మిత్రమా! ఎచ్చటికి? మా సోదరి నీకు కృతజ్ఞతలు తెలుపుకుందామని అనుకుంటుంటే.. పలాయన వాదం పనికిరాదు సుమా!” పురుషోత్తముడు వారించాడు.   మొహం, బుగ్గలు ఎఱ్ఱ వడుతుండగా మాధవుడు కూర్చున్నాడు.   పురుషోత్తముడు, మిత్రుని అవస్థ ఓరకంట చూసి నవ్వుకున్నాడు.   “ధన్యవాదాలు మాధవ మంత్రులకి. తమ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు. ఎన్నటికి మరువలేను. ఏమిచ్చిననూ ఋణము తీర్చుకొనలేను.” కాదంబరి వినమ్రంగా పలికింది.   “అంత మాటనవద్దు రాకుమారీ! అది నా ధర్మం.” అలవోకగా తనను చూస్తున్న కాదంబరి వాలు చూపులకు పరవశమౌతూ అన్నాడు మాధవుడు.   ఏమా సౌందర్యపు గుబాళింపులు.. అందని చందమామకై ఆరాట పడకూడదని ఎంత చెప్పినా వినదే ఈ పాడు మనసు.   వద్దు వద్దనుకుంటూనే కాదంబరీ దేవినే  చూస్తున్నాడు. బుద్ధెరిగాక ఒక మగువని, అదీ.. తన మనసు దోచిన వనితని ఇంత దగ్గరగా చూడడం ఇదే.. ఎంత మరలిద్దామనుకున్నా, బుద్ధి నిర్దేశిస్తున్నా, మనసు మాట వినడం లేదు.   పురుషోత్తముడు వినోదంగా పరికిస్తున్నాడు ఇరువురినీ. కాదంబరీ దేవి కూడా, మాధవుని అందానికి ఆకర్షితు రాలయినట్లే ఉందనుకున్నాడు.   తనని స్పృశించిన తొలి పురుషుడతడు.. ఎంత స్పృహ లేకున్నా, మొహంలో మొహం పెట్టి, పెదవులకి పెదవులానించి.. ఊపిరందించిన యువకుడు. తెలిసీ తెలియని స్థితిలో అందిన ఆ స్పర్శ వెంటాడుతూనే ఉంది.   “అలా ఆసీనులు కండి సోదరీ!”   చెలులు, మండపంలో నున్న పెద్ద బండని శుభ్ర పరచగా, సుకుమారి కాదంబరి, సున్నితంగా కూర్చుంది.   “కఠినమైన బండ మీద కూర్చుంటే కందిపోతుందేమో రాకుమారి మేను..” మాధవుడు మదిలో అనుకుంటూ అటూ ఇటూ చూశాడు ఏదయినా మెత్తని గడ్డి దొరుకుతుందేమోనని.   అంతలో చెలులు మాధవీలతా మంటపం లో దీపం వెలిగించారు. పగలైననూ, అక్కడ వృక్ష ఛాయలు చీకటిని వ్యాపింప చేస్తాయి.   ఒద్దికగా కూర్చుని ఉన్న కాదంబరీ దేవి, సృష్టికర్త శ్రద్ధగా కూర్చుని అమర్చినట్లుంది. మోమున కానపడు ప్రశాంతత ఎటువంటి కలతనైనా దూరం చేసేట్లుంది.                                కన్నులు తిప్పుకోడం కష్టంగా ఉంది మాధవునికి. పురుషోత్తమ దేవుడు మాత్రం అదేమీ గమనించనట్లు, కాదంబరి వద్దకు వెళ్లి, చెయ్యి పట్టుకుని నాడి చూశాడు.   “ఫరవాలేదు.. కొద్ది వేగంగా ఉంది కానీ, త్వరితంగానే సరై పోతుంది.”   అన్నగారి వాక్కులకి రాకుమారి మోము మరింత మందార ఛాయని దాల్చింది.                           కం.   అలతిగ తలవంచి యతివ                                   కలలుగనే కన్నుల వెలుగదె కాంచగనే                                   అల మందస్మిత వదనము                                   వెలయగ కను విందుగ నిల వేడుక గానే.      కాదంబరీ దేవి సౌకుమార్య సౌందర్యం మాధవుని మనస్సుని మరే పక్కకీ మరలింప నంటోంది. కానీ వివేకం వెనక్కి లాగుతోంది.   “మాధవ మంత్రులకి మా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.” కాదంబరి నమస్కరిస్తూ పలికింది.   “అది నా ధర్మము రాకుమారీ.” మాధవుడు గంభీరంగా అన్నాడు.   “రాకుమారిని మందిరానికి తీసుకుని వెళ్లండి.” పురుషోత్తముడు ఆనతిచ్చాడు.   నెమ్మదిగా అడుగులు వేస్తూ కాదంబరీ దేవి రాజమందిరం వయిపు సాగింది, చెలులు పట్టుకుని తీసుకుని వెళ్తుండగా.   మలుపు తిరిగేటప్పుడు వెను తిరిగి మాధవుని వైపు ఒక వాలు చూపు విసిరింది. అనుకోకుండా మాధవుడు చెయ్యి పైకెత్తాడు, అభివాదం చేస్తున్నట్లుగా.   పురుషోత్తముడు గమనించనట్లు, వనం లోనికి నడిచాడు.     మాధవుడు తేరుకుని పరిసరాలు గమనించే లోగా మిత్రుడు బ్రహ్మకమలం చెట్టు దగ్గరగా వెళ్లి ఆ పుష్పాల అందాలని పరికిస్తున్నాడు.   “ఫ్రభూ! రాకుమారి..”   “అవును మాధవా.. మా కుటుంబమంతా నీకు ఋణపడి ఉంటుంది, రాకుమారిని కాపాడినందుకు. ఆ ఋణం ఏ విధంగా తీర్చుకోవాలా అనేది తండ్రిగారితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను.”   “ఈ రాకుమారి గురించి కాదు దేవా నేను అడుగుతున్నది.. పద్మావతీ దేవి భవిష్యత్తు. తండ్రి చేసిన తప్పిదానికి బిడ్డని శిక్షించడం న్యాయమేనా? ధర్మ ప్రభువులు ఆలోచించాలి.” మాధవుడు     “మనసుకి గాయం చాలా లోతుగా తగిలింది మాధవా! చూద్దాం.. ఆ జగన్నాధుని నిర్ణయమేమిటో.”   అప్పటి వరకూ ఉన్న తీవ్రత రాకుమారుని కంఠంలో కనిపించక పోవడంతో మాధవుడు కాస్త ఉపశమనం పొందాడు. కొద్ది ధైర్యం వచ్చింది, పరిస్థితులు చక్కబడతాయని.     మాధవుడు తోటలో పచార్లు చేస్తున్నాడు అస్థిమితంగా. కుడి చెయ్యి పిడికిలి బిగించి ఎడం అరచేతిలో కొట్టుకుంటున్నాడు.   మధ్యలో తల అడ్డంగా తిప్పుతున్నాడు.   ఆ రోజు యాత్రికులు, బాటసారులు ఎక్కువ మంది రాలేదు. నందుడు, సీతమ్మ కలిసి వంటపనులు చేస్తున్నారు. గౌతమికి శిరోభారంగా ఉందని, వెనుక పంచలో చాప మీద పండుకుని కన్నులు మూసుకుని విశ్రాంతి తీసుకుంటోంది.   పద్మావతి అప్పుడే సీతమ్మకి కూరగాయలు తరిగి ఇచ్చి పున్నాగ చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చుని మాధవుడ్ని గమనిస్తోంది.   భృకుటి ముడిచి తీవ్రంగా మధన పడుతుంటే ఇంక ఆగలేకపోయింది.   “సోదరా! నీ వ్యాకులతకి కారణం నేనేనా? నా వలన మీకు అసౌకర్యం కలుగుతోందా? ఏదయినా ధర్మ సత్రం లోనికి..”   ఆందోళనగా అటు తిరిగాడు మాధవుడు.   “అయ్యో.. అది కాదమ్మా! జగన్నాధుని ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. నీ సమస్యకి పరిష్కారం చూపమని ఆ దేవ దేవుడ్ని వేడుకుంటున్నాను. ఆయన తప్పక కరుణిస్తాడు.. దారి చూపుతాడు. నీ వంటి సౌజన్యవతికి ఇటువంటి కష్టం రాకూడదు.”   “ఇది నేను కష్టం అనుకోవట్లేదు అన్నా! ఏది జరిగినా మన మంచికే అని నమ్ముతాను. ఇది లేకున్న మీ ఇంటి ఆడపడుచునయ్యే అదృష్టం నాకు కలిగేదా? ఆ రాజ బోగాలకంటే, ఈ స్వేచ్ఛా జీవనమే నాకు ఉల్లాసం కలిగిస్తోంది. పరిచారికలూ, ఆర్భాటాలూ లేకుండా.. ఏకాంతంలోని ఆనందాన్ని అనుభవించే భాగ్యం కలిగింది. నా జీవితంలో మరపురాని, మరువ లేని రోజులని గడుపుతున్నాను.” పద్మావతి మిలమిల మెరిసే కన్నులతో అంది.   నిజమే.. పద్మావతిలో చాలా మార్పు వచ్చింది.   అందని చందమామలా, అందరికీ ఆమడదూరంలో ఉండే రాకుమారి, సాధారణ యువతిలా మారిపోయింది. పరిసరాల మీద కొత్తగా కలిగిన ఆసక్తి, అనురక్తి.. సహజత్వం, వ్యక్తిత్వాన్ని మెరుగు పరచింది.   కాకి గూడులోనుంచి బైటికి నెట్టి వేయబడ్డ కోకిల పిల్లని చూసినా, ధాన్యం గింజలేరుకుంటున్న పిచ్చుకలని చూసినా, ఉట్టి మీద పెట్టడం మర్చి పోయిన పాలకుండలో మూతి పెట్టి మూతి నాక్కుంటూ వెళ్లే నల్ల పిల్లిని చూసినా.. ఏ సహజమైన ప్రక్రియని చూసినా స్పందిస్తోంది.   ఒక రోజు రెండు ఉడుతలు ఒక దాన్నొకటి తరుముకుంటూ వెళ్లే దృశ్యాన్ని కళ్లార్పకుండా చూస్తూ, ఆనందిస్తోన్న పద్మావతిని చూసి అడిగాడు.   “సోదరీ.. మా బంధువుల అమ్మాయిలని అప్పుడప్పుడు వస్తుండమని చెప్పేదా?”   “నేనెవరో చెప్పనని మాట ఇస్తేనే..” పద్మావతి షరతుకి ఒప్పుకున్నాడు.   అప్పటి నుంచీ ఇద్దరు కన్నియలు రెండు రోజులకొక మారు వచ్చి ఆటపాటలతో కాలం గడపుతున్నారు. పద్మావతి ఒరియా నాట్యం, తెలుగు పాటలు నేర్చుకుంటోంది వారి వద్ద.   “అన్నా.. ఏమా చింతన” పద్మావతి హెచ్చరికకి వర్తమానంలోకి వచ్చి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.   “నా గురించేనా లేక మా కాబోయే వదిన గారి గురించా ఆలోచనలు?”   ఉలిక్కి పడ్డాడు మాధవుడు.   ఇంటిలోని వారందరికీ తన మనస్థితి వ్యక్త మవుతోందా?   “కొంచె కొంచెంగా.. నడతలో అన్య మనస్కం, చూపులో శూన్యత, మాటలో తడబాటు అన్యాక్రాంతమైన మనసుని చెప్తున్నాయి సోదరా. నేనిలా అంటుంటే ఎర్రబడ్డ నీ మోము కూడా..” మాధవుని అంతరంగాన్ని విప్పిచెప్తున్న పద్మావతిని కినుకగా చూశాడు.   “ఎవరా అదృష్ట వంతురాలు అన్నా? నీ వంటి మంచిమనిషిని చేపట్టబోయే యువతిని నాకెప్పుడు చూపిస్తావు?”   “అందని పండు సోదరీ. ఆశ పడితే నిరాశే ప్రాప్తం. ముందుగా నీ సమస్య పరిష్కరించాకే నా వివాహం. అది, తల్లిదండ్రులు మెచ్చిన అమ్మాయి తోనే.”   “రాకుమారి కాదంబరీ దేవి కదా సోదరా? చూడ చక్కని వనిత. చాలా మంచి స్వభావం అని కూడా విన్నాను.”   మాధవుడు కంగారుగా అటూ ఇటూ చాశాడు. అసలు తమ ఇంట అటువంటి ప్రస్థావన రావడమే తప్పు. ఎవరికైనా తెలుస్తే తన తల తియ్యడం ఖాయం.   పద్మావతి ఎలా గ్రహించిందీ?   “రాకుమారుడు పురుషోత్తమునికి నీడలా తిరిగే నిన్ను ఆకర్షించగల వనిత ఆవిడే అయుంటుందని ఊహించా అన్నా. నా వద్ద ఆమె చిత్ర పటం కూడా ఉండేది. రాకుమారుని కుటుంబంలోని అందరి గురించీ మా చారులు వార్తలు సేకరించారు. అప్పటి రోజుల్లో.. తెలుసుకోవడం ఆవశ్యం అనిపించింది.”   “ఈ విషయం ఎవరి వద్దా..”   “అనను. కానీ మన ప్రయత్న లోపం ఉండకూడదు సోదరా! కనీసం రాకుమారి మనసు తెలుసుకునే అవకాశం కొరకు చూడాలి.” పద్మావతి అనునయంగా అంది.   “నా విషయానికి చాలా అవరోధాలున్నాయమ్మా! రాకుమారి వివాహం రాజకీయ ప్రయోజనాలను కలిగించాలని అనుకుంటారు. పైగా.. వారు క్షత్రియులు. కుల సమస్య ఉండనే ఉంది. ముందుగా నీ విషయం చూడాలి. మరల జగన్నాధుని రథయాత్ర ఆసన్న మవుతోంది. ఆ జగద్రక్షకుడే కాచుకోవాలి.”   వీధి వాకిట సందడి విని పిస్తే అటుగా వెళ్లాడు మాధవుడు.   ఇరువురు రాజ భటులు..   “మహారాజు కపిలేంద్ర వర్మల వారు మిమ్ములను అత్యవసరంగా రమ్మన్నారు ప్రభూ!” వార్త వినిపించాడు ఒకడు.                                          …………………. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 28వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 28వ భాగం  ఆ రోజు, తెల్లవారకుండానే, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్రాలను ధరించి, తన వద్దనున్న కొద్దిపాటి నగలను పెట్టుకుని వచ్చి, నంద గౌతమిలకు, సీతమ్మకి నమస్కరించింది పద్మావతీ దేవి. అప్పటికే వారు వంట ప్రయత్నంలో పడ్డారు.   “ఈ రోజు నా జన్మదినమమ్మా! ఆశీర్వదించండి.”   “దీర్ఘాయుష్మాన్ భవ. వచ్చే పుట్టినరోజుకి నీవు వుండవలసిన చోటికి చేరాలి తల్లీ!” నందుడు ఆశీర్వదించాడు.   అప్పుడే అక్కడికొచ్చిన మాధవుడు కళ్లు విప్పార్చి సంభ్రమంగా చూస్తుండి పోయాడు.   “అన్నా! నీవు కూడ ఆశీర్వదించాలి.” వంగి నమస్కరించ బోతే, ఆపి, లేపి, తల మీద చెయ్యి పెట్టి దీవెనలందించాడు.                                                కం. “సిరి యొలుకు చుండు మోమున                               చిరునగవులతో మరిమరి శింజానముగా                               కరిముఖుడు నీకు నాసర                               నిరతము నొసగును మరింత నెరవు నిలుపగా.”     “ధన్యవాదాలన్నా! ఏనాటి బంధమో ఇది. మనిద్దరి తనువులున్నంత వరకూ నిలవాలని ఆ పరాశక్తిని కోరుతున్నాను.” మిలమిల మెరిసే కన్నులతో అంది పద్మావతి.   “ఆ జగన్నాధుని దయ ఉండాలి గానీ ఏదీ అసాధ్యం కాదు ఈ జగాన. అంతా సవ్యంగా జరుగుతుంది సోదరీ. చింత వద్దు.” మాధవుడు చిరునవ్వుతో అన్నాడు.   “అవును. వచ్చే రథయాత్రకి, సేవ చేస్తానని మొక్కుకోమ్మా! నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.” అనుకోకుండా సీతమ్మ అన్న మాటలకి ఉలిక్కి పడ్డారు, మాధవుడూ పద్మావతీ.   “నిజమే అమ్మమ్మా! ఆ విధంగా.. ఇప్పుడే మొక్కుకుంటాను.” పద్మావతి తేరుకుని, వెంటనే అంది.   మాధవుడు ప్రశంసా పూర్వకంగా చూశాడు.                                     ………………..     “అభినందనలు కుమారా!” కపిలేంద్రదేవుడు తన మందిరంలో, పురుషోత్తమదేవుని తో సమావేశమయ్యాడు.   “అంతా మీ ఆశీర్వాదమే, మీ సహకారమేగా తండ్రీ!” పురుషోత్తముడు వినమ్రంగా అన్నాడు.   “నా సహకారమే కాదు.. ఆ జగన్నాధుని దయ కూడా. అప్పుడు యుద్ధానికి సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నా కదా.. సరైన సమయానికి ఇరువురు అన్నదమ్ములు, యోధాను యోధులు.. పూరీ పట్టణం నుంచి వచ్చి సైన్యంలో స్వచ్ఛందంగా చేరారు. వారే, కాంచీపురం మీదికి సైన్యాన్ని తీసుకుని వెళ్లి, యుద్ధంలో పురుషోత్తమ రాకుమారునికి సహాయంగా వెళ్లెదమని అడిగారు. వారిని చూడగానే.. మన సైనికులకి ఎక్కడలేని జవ సత్వాలూ వచ్చేశాయి. అంతే.. ఆనతి నివ్వడమేమిటి.. కదం తొక్కుతూ బయలుదేరారు.” కపిలేంద్ర వర్మ సంతోషంగా అన్నాడు.   “వారిరువురూ సాక్షాత్ జగన్నాధ, బలభద్రులని నా అనుభవం చెప్తోంది తండ్రీ.”   “అంత కన్నా మనకి పెద్ద వరమేముంటుంది. ఈ సంతోష సమయంలో నాదొక కోరిక కుమారా!”   “ఆజ్ఞాపించండి తండ్రీ.”   “కాంచీ పురం రాజును విడుదల చేద్దాము. చెప్పుడు మాటలను విని అతడు అనాలోచితంగా ప్రవర్తించాడు. అతని రాజ్యాన్ని అతనికిచ్చేద్దాము. మన ప్రతీక్షని తిరిగి వచ్చెయ్య మందాం.”   “మీ చిత్తం తండ్రిగారూ!” కొద్దిగా ఖిన్నుడై అన్నాడు పురుషోత్తమ దేవుడు.   “కుమారా! మీరే రణ మందు గెలిచి కంచిరాజును బందీగా తెచ్చారు. మేము కాదనుట లేదు. కానీ.. రాజనీతి కొద్దిగా అర్ధం చేసుకోవాలి మీరు. ఇప్పుడు వారి రాజ్యం వారి కిస్తే భవిష్యత్తులో మనకి అనుకూలంగా ఉండగలరు కంచి రాజు. కావాలంటే కప్పం కట్టమని అడుగుదాము. నేను కావేరీ తీరం వరకూ మన రాజ్యాన్ని విస్తరింప వలెనని యోచిస్తున్నాను..”   “అంటే..”   “అవును. విజయనగర సామ్రాజ్యాన్ని కూడనూ జయించవలెనని నా వ్యూహం! మీది ఉడుకు రక్తం. కొంచెం ఆగి ఆలోచిస్తే మీకే అర్ధమవుతుంది.”   “సరే తండ్రీ! మీరే వెళ్లి వారిని విడిపించి పంపండి. కానీ.. ఆ మంత్రి వరదయ్యని మాత్రం..”   “ఎప్పటికీ వదలను. రోజూ కారాగరం అంతా ఆ వరదయ్య చేతనే చీపురుతో తుడిపించమని ఆజ్ఞ ఇస్తాను.” కపిలేంద్ర దేవుడు నవ్వుతూ అన్నాడు.   అప్పటికి పురుషోత్తమునికి కినుక తగ్గి, మోములో ముదము వచ్చింది.   “అమ్మయ్య. ఇప్పటికి నాకు చింత వదలినది. తక్షణమే కారాగారానికి విచ్చేస్తున్నామని కబురు పంపండి.” సేనానికి ఆదేశమిచ్చాడు ప్రభువు.   పురుషోత్తముడు తండ్రికి నమస్కరించి తన మందిరానికి వెళ్లి పోయాడు. తండ్రిగారి ప్రతిపాదనకి, మనస్ఫూర్తిగా అంగీకరించి. వారు పంపిన సైన్యమే లేకున్న, యుద్ధములో గెలిచే అవకాశమే లేదు కదా!                                      ………………………..     “సోదరా! మా పితృదేవులు క్షేమంగా ఉన్నారా?” సూర్యోదయానికి ముందే నిదుర లేచిన పద్మావతి, కాసేపు తోటలో మొక్కల సంరక్షణ చూసి, పూజకి పువ్వులు కోసి, మాలలు కడుతూ అడిగింది. అప్పుడే పశువుల దగ్గర పని ముగించుకుని వచ్చిన మాధవుడిని.   “కాంచీపుర రాజుగారిని బంధ విముక్తులని చేశారు రాకుమారీ! నిన్నటిరోజునే. వారిని కంచి రాజ్యానికే సామంతులుగా నియమించారు కపిలేంద్ర వర్మ. మీరు మీ రాజ్యానికి ఏగ వచ్చును.. హాయిగా.” మాధవుడు చిరు బాధాతప్తుడై అన్నాడు.   ఇంట్లో గలగల్లాడుతూ ఆడపిల్ల తిరుగుతుంటే ఆ అందమే వేరు అనుకుంటూ. .   పద్మావతి మౌనంగా ఉండిపోయింది.. అనేకానేక భావాలు మదిలో సుళ్లు తిరుగుతుండగా.   “అనగా.. కాంచీపురం రాజు ఓడిపోయిన రాజ్యాన్ని తీసుకుని ఏలుకుంటారా?” రాకుమారి పౌరుషంగా అడిగింది.   మాధవుడు నిలువుగా తల ఊపాడు.   “ఇప్పుడు నేను మా తండ్రితో వెళ్తే ఛండాలునితో పెండ్లి చేయించాలని శపధం పట్టిన పురుషోత్తమ దేవుల వారి మాట ఏమిటి? ఆ ఒప్పందాలలో నన్ను కూడా విడిచి పెట్టెదమని అని యుంటిరా మహారాజు?”   పద్మావతి ప్రశ్నలకి మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.   “సోదరీ! మీకు..”   “నాకు అన్నీ తెలుసు సోదరా! నేను ఇప్పుడు ఆత్మాభిమానము వదలి వెళ్లినా, పతిదేవునిగా భావించి మనసులో నిలుపుకున్న పురుషోత్తమదేవుని పౌరుషమునకు భంగము కలిగించిన దాననవుతాను. దానికి నేనొప్పలేను. పైగా..                      సీ.       కన్నకూతురి కూర్మి కానని నాతండ్రి                                     దుష్టబుధ్ది యయిన ధూర్తు నమ్మి                               కన్నుమిన్ను కనరాక యథార్ధ మెరుగక                                     విష్ణు భక్తు వివిధ విధములుగను                               హేళనము సలిపి హీనపరచుటను                                     సైపగ లేక నే శ్రమము పడితి                                తొందరపాటు యెంతో చేటు యౌనని                                      యెరుగని నా రాజు  యేద పోయె                    ఆ.వె.      బిచ్చముగ నొసగిన విషయము నేలను                               బిడియమును వదలిన పేద వాడు;                               స్వాభిమానము కల జవ్వని యెన్నడూ                               తిరిగి వెడలదుకద తిరిపెమునకు”     “మరి ఈ పేదవాని ఇంట నుండగలరా రాకుమారీ?”   “మా జనకునకు రాజ్యము లేనప్పుడు కలుగని సందేహము ఇప్పుడెందుకు కలిగింది అన్నా?”   “అంటే..” మాటలు దొరక్క ఆగిపోయాడు మాధవుడు.   “అర్ధమయింది. రాకుమారి అనగానే ఆ దూరం వచ్చేస్తుంది సహజంగా. అందుకే నేను ఆ పదవి వద్దనుకుంటున్నా సోదరా! నాకు మీ అందరితో బాంధవ్యం, మీ ఆప్యాయత కావాలి. పైపై మెరుగులే తప్ప ప్రేమలు లేని ఆ సౌధాలు, ఆ భోగ భాగ్యాలు నాకు వద్దు. పురుషోత్తమ దేవుల ఆజ్ఞానుసారమే నాకు సేవకుని వెదకండి. కానీ, కాస్త మంచివానిని చూడండి.”   మాధవుని గుండె కదిలి పోయింది పద్మావతి పలుకులు విని.   పక్కనే ఉండి అంతా వింటున్న నందుడు కన్నులు తుడుచుకుంటూ ముందుకు వచ్చాడు.   “మాధవా! సిరులొలుకు ఈ చిన్నారి మన ఇంటికి వచ్చినపుడే నా కూతురయింది. ఆ విధముగనే భావించి ఇచ్చట నుంచితిమి..   మానినీ వృత్తం.    మంజుల నాదము మా యెద నిండగ మప్పుగ నుండగ మన్ననతో                           రంజిలు నిల్లదె రమ్యముగా చిరు లాస్యము సవ్వడి రాజిలగా                           కంజజు సృష్టిన కన్నులు పండగ కానగ నుల్లము కంపితమౌ                           పంజన జవ్వని బంగరు తల్లిగ వచ్చెను గామన వాకిటకే.     మన ఇంటి సిరిని మంచివానికే ఇచ్చి కళ్యాణ మొనర్చెదము.”     “అంతే. మాధవుని వివాహముతోనే పద్మావతికి కూడా మంచి వరుని చూసి జరిపిద్దాము.” అప్పుడే అచటకు వచ్చిన గౌతమి అందుకుంది.   అంతకు ముందు జరిగిన సంభాషణ వినకున్ననూ, నందుని మాటలతో, పద్మావతికి ధైర్యం కలిగించడానికి అనేసింది.. సమయోచితంగా.   మాధవుని మనసులో కాదంబరీ దేవి మెదిలింది అసంకల్పితంగా.   “అసాధ్యమౌ నా కోరికని అణగ దొక్కెయ్యాలి..” అనుకుంటూ ముందుకు కదిలాడు రోజూ వారీ కార్యాలు నెరవేర్చడానికై.   వాకిలి దాటుతుండగానే ఎదురయ్యాడు, కోటలోని భటుడు.   “రాకుమారుడు పురుషోత్తములవారు మిమ్మల్ని పిలువనంపారు ప్రభూ!” రాకుమారునికి కుడి భుజం వలే నుండే మాధవుని కూడా ప్రభూ అని మన్నించడం ఎవరూ చెప్పకుండానే నేర్చుకున్నారు, కోటలోని పరివారం.   “అక్కడికే బయలుదేరాను. ఎక్కడున్నారు వారు?”   “ఉద్యానవనంలో. మాధవీలతా మంటపం వద్ద. మిమ్మల్ని అచ్చటికే రమ్మన్నారు.”   తన అశ్వం కళ్యాణిని అధిరోహించి భటుని వెంటే బయలుదేరాడు మాధవుడు.. పట్టణంలోని విశేషాలను విచారిస్తూ.   “నగరంలోని ప్రజలందరూ కుశలమేనా? కపిలేంద్ర ప్రభువు పాలనలో సంతుష్టులై ఉన్నారా?”   “ఉన్నారు ప్రభూ! యుద్ధాలు జరుగుతున్నా, పాడి పంటలకేమీ లోటు లేదు. సమరాలకి కూడా అలవాటు పడిపోయారు ప్రజలు.”   మాధవుడు గ్రహించాడు.. ఎప్పటికైనా ఈ యుద్ధాలు ముగిసేనా అని అడుగుతున్నాడతడని.   ఒక్కొక్క వంశం మారి కొత్త పాలన రాగానే జైత్ర యాత్రలు.. సామ్రాజ్య విస్తరణ. సామాన్య ప్రజ భీతితో కాలం గడపడం లో వింత లేదు. కానీ అది ఏ దేశంలో నైనా తప్పని స్థితే. వారు ఊరుకున్నా, పక్క రాజ్యం వారు ఊరుకోరు. ముష్కరుల దాడి సరే సరి. అది నిరంతరం సాగిపోయే ప్రక్రియే.   “రాకుమారుడు పురుషోత్తమ దేవుల వారి మీదే కొంత ఆశ ఉంది ప్రభూ! వారు మహరాజు అయే సరికి కళింగ రాజ్యం సుస్థిర మవుతుందని, జన సామాన్యం నిశ్చింతగా కాలం గడప గలరనీ అనుకుంటున్నారు.” ఎందుకైనా మంచిదని, భటుడు పొగిడాడు.. రాకుమారుని మిత్రుడాయె మరి.   మాధవుడు చిరునవ్వుతో తల పంకించాడు.   “అదిగో ప్రభూ.. మాధవీలతా మంటపం. రాకుమారులు ఏ క్షణంలో నైనా వచ్చేస్తారు.” భటుడు అభివాదం చేసి వెళ్లి పోయాడు.                                       మాధవుడు, గుర్రాన్ని కొంచె దూరంలో కట్టేసి రాగానే, పురుషోత్తమ దేవుడు కూడా వచ్చేసి, మిత్రుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు.   “మనం రోజూ, యుద్ధ విద్యని అభ్యాసం చెయ్యాలి మాధవా. గజ సమూహాలని పెంచాలి. తండ్రిగారు ఆనతిచ్చారు. రాబోయే కాలంలో, సామ్రాజ్య రక్షణకై, మనం తయారుగా ఉండాలి.”   “అవశ్యం రాకుమారా! రేపటి నుండే ఆరంభిద్దాం.”   “పద్మావతీ దేవి ఎక్కడుంది? ఆవిడ వివాహం ఏమయింది? ఆ కంచి రాజుతో వెళ్లి పోతోందా?” పురుషోత్తముడు, కించిత్ దర్పంగా అడిగాడు.   మాధవుడు తనని పిలిపించిన కారణం గ్రహించాడు.. యుద్ధం, అభ్యాసం.. అవన్నీ సాకులే.   “పద్మావతీదేవి క్షేమంగానే ఉన్నారు ప్రభూ! మా బంధువుల ఇంట ఉంచాను. వారందరితో బాగా కలివిడిగా ఉంటున్నారుట.”   “హూ.. మరి వివాహం..”   “తగిన వరుని కోసం వెతుకుతున్నాను.”   “ఇంకా ఏ ఛండాలుడూ దొరకలేదా? అంత కష్టమా?”   మాధవునికి అర్ధ మయింది. రాకుమారుడు తనకు జరిగిన అవమానం మరచి పోలేకుండా ఉన్నాడు. పద్మావతీ దేవి మీద మంచి అభిప్రాయం కలిగించుట తన ప్రధమ కర్తవ్యం.   “రాకుమారా! పద్మావతీ దేవి ఉత్తమురాలు. రాకుమారి అయిననూ కించిత్తు కూడా గర్వము లేదు. మేము వారిని చాలా మధ్యతరగతి కుటుంబంలో ఉంచాము. వారితో వారి కుమార్తె వలెనే కలిసి మెలసి మెలగుతున్నారు.”   పురుషోత్తమ దేవుడు, మాధవుని మాటల మీద పెద్ద ఆసక్తి లేనట్లు పరిసరాలని పరికించ సాగాడు.   “ప్రభూ! మీరు ఆనతి ఇచ్చినటులే రాకుమారిని మాలిన్యాన్ని తీసి, శుభ్ర పరచే వాని కే ఇచ్చి వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాను. విజ్ఞులు మీరు.. ఆలోచించండి.. రాకుమారి పద్మావతీ దేవి..                           సీ.   అభము శుభము తెలియని యమాయకురాలు                                        ఎండకన్నెరుగని ఇంతి యాపె                            నీ గుణగణముల నెటులనో విని యుండి                                       పేర్మిని యెంతయో పెంచు కొనెను                             పవలు రేయిను గడుప కడు కష్ట పడగ                                       క్షణమొక గడియగా గడుపు చుండె                             పరిచారిక వలెనే పనులు చేయుచునుండె                                       పదుగురి మెప్పునే బాగ పొందె                         ఆ.వె.   కన్న తండ్రి యేమొ కనడు వినడుమాట                                  బెదరి పోయినట్టి బేల సుమతి                                  తప్పు నొకరు చేయ దండన మొకరికా                                  ఏమి తర్క మిదియె ఎన్నగాను?     ఇంత కన్ననూ మీకు నేను చెప్పదగిన వాడను కాను.” మాధవుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.   పురుషోత్తమ దేవుడు సాలోచనగా చూశాడు మాధవుని. మంచి మిత్రుని లక్షణమే అది..   అంతలో..   “అన్నా! అన్నా.. కాపాడండి..” ఆర్తనాదం వినిపించింది..   పురుషోత్తమ మాధవులిద్దరూ ఆందోళనగా చుట్టూ చూశారు. మాధవీ లతా మంటపం వెనుక నున్న సెలయేరు దగ్గర నుంచి..   పరుగున వెళ్లారు ఇరువురూ.   సెలయేరులో కొట్టుకుని పోతూ కనిపించింది, రాకుమారి కాదంబరీ దేవి..                                ………………………. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 27వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 27వ భాగం  కాంచీపురంలో కోవెలలన్నిటిలోనూ పూజలు జరిపించి వచ్చాడు పురుషోత్తమ దేవుడు. చక్రవర్తికి జరిగే మర్యాదలన్నీ జరిగాయతడికి.   విజయోత్సాహంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు కళింగ సైనికులు. కాంచీ పురంలో తమ ‘ప్రతీక్ష’ నొకరిని పెట్టి, బంధించిన కంచిరాజుతో, పద్మావతితో, వరదయ్యతో. కంచి నుంచి భారీగా కప్పం వసూలు చేశాడు పురుషోత్తముడు.   ముఖ్యంగా.. కాంచీపురంలో ఉన్న గజబలాన్నంతటినీ గ్రహించి వేశాడు.                                      సీ.      ఇనుమడించిన యట్టి యిభ బలగమ్ముతో                                  కన్నుల వెలుగొంద కాంతులెన్నొ                       దేవుని యండనే దివ్యముగా నుండ                                  నాత్మవిశ్వాసమే నతిశ యింప                       కాంచీపురము యంత కైవశ మవగానె                                  ధీరత్వమున తాను దీటు గాను                       వీధులందు కవాతు సాధనమున చేయ                                  ఓఢ్ర వీరులు యంత నొలయ గాను              తే.గీ.       విజయ భేరిని మోగించి వెడలె నపుడు                         రమ్య పురుషోత్తముడతడు రాకొమరుడు                         మాధవుడతని వెనువెంటె మౌనముగను                         కదల సైన్యము తోడనే కటకమునకు.     కటకము చేరిన వెంటనే, మహరాజు నేనా కలవకుండా.. కంచిరాజునీ, వరదయ్యనీ కారాగారంలో పెట్టమని ఆజ్ఞ ఇచ్చి తన మందిరానికి వెళ్లిపోయాడు పురుషోత్తముడు. మహరాజుగారేమంటారో!   మరి పద్మావతి?   “మొదటగా కనిపించిన ఛండాలునకిచ్చి పెళ్లిచేసి పంపించు..” తన మందిరానికి వెళ్తూ పురుషోత్తమ దేవుడు, వెనుతిరిగి చూడకుండా అని వెళ్లి పోయాడు.   మాధవుడు నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.   ఏ పాపం ఎరుగని రాకుమారి ఏం చేసింది? రాజుల ఆగ్రహాలు ఇంత అర్ధంలేకుండా ఉంటాయా? కంచిలో ఏదో ఆవేశంలో అనేశాడనుకున్నాడు కానీ.. ఇంత లాగ మనసుకు పెట్టుకున్నాడా రాకుమారుడు?   ఏమైనా.. తనకి చేతనయింది చెయ్యాలి. రాకుమారునిది తాత్కాలికమైన కోపం. కొన్ని రోజులైతే మరచిపోతారు. అప్పటి వరకూ, తనే బాధ్యత వహించాలి.   పురషోత్తముడన్న మాటలు, పద్మావతి వరకూ వెళ్ల కూడదు. మరి ఆవిడనెక్కడ ఉంచాలి? రక్షణ ఏది?   ఒక నిశ్చయానికి వచ్చి, పద్మావతీ దేవి మేనా వద్దకు నడిచాడు మాధవుడు.                                      ………………   “మాధవా! వచ్చావా నాయనా! ఉండు.. దిష్టి తీసేస్తాను. అంత పెద్ద యుద్ధం చేసి గెలిచి వచ్చావంటే ఎంత మంది కళ్లు పడుంటాయో!” సీతమ్మ వాకిట్లోనే నిలిపేసి, చాటలో ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి, పెరటి లోపల, దూరంగా..  మూలగా ఉన్న పొయ్యిలో వేసింది.   ఎంత దూరమైతే మాత్రం, మిరపకాయలు పొయ్యిలో పడ్డాక ఊరుకుంటాయా… పొగ, గొట్రు ఇల్లంతా పాకి పోయాయి. వంట చేస్తున్న పని వాళ్లు, ఆజమాయిషీ చేస్తున్న నంద, గౌతమిలు.. అందరూ ఖళ్లు ఖళ్లున దగ్గుతూ, ముక్కుకు నోటికీ అంగోస్త్రాలు అడ్డు పెట్టుకుని వచ్చారు.   ఆ రోజు.. యుద్ధం నుంచి వచ్చే సైనికుల కోసం, అరవై మందికి పైగా భోజనం సిద్ధం చెయ్యమని నందునికి ఆదేశం వచ్చింది. అప్పుడే అనుకున్నారు గౌతమీ, సీతమ్మా, మాధవుడు వచ్చేస్తున్నాడని.   “ఈ రోజు మాధవునికి ఇష్టమైన సన్న బియ్యం పాయసం చేస్తా.. అందరికీ చేద్దామా నందా?” సీతమ్మ నందుడిని అడిగింది ఆత్రంగా.   “తప్పకుండా చేద్దామమ్మా! విజయోత్సాహంతో వస్తున్నారు సైనికులు. యుద్ధం అవగానే అఘ మేఘాల మీద చారులు వార్త తీసుకొచ్చేశారు. మరి ఆ సంబరాలు చేసుకోవాలి కదా!”  “అమ్మమ్మా! మన తూరుపు చావడిలో రెల్లిల్లు ఖాళీగానే ఉంది కదా!” సీతమ్మని దూరంగా తీసుకెళ్లి అడిగాడు మాధవుడు.   “ఉంది. కానీ.. దాని వెనుకే పశువుల పాక ఉంది. బాగుంటుందా?”   “ఫరవాలేదమ్మమ్మా! చుట్టూ పూల తోటుంది కదా.. కంచి నుంచి ఒక యువతిని తీసుకొచ్చాను..”   “యువతినా?” మాధవుని మాట పూర్తి కాకుండానే సీతమ్మ సంభ్రమంగా అంది.   “అబ్బెబ్బే.. ఏవో ఊహించుకోకు. ఆమె రాకుమారుని వరించింది. కొన్ని రోజులు, ఎవరికీ తెలియకుండా మన దగ్గర ఉంచుకోవలసిన పరిస్థితి. అక్కడైతే, ఏకాంతంగా ఉంటుందని. అటుపక్కకి ఎవరూ వెళ్లరుకద! అందుకే..”   “రాకుమారుని వరించిందా? కంచి రాకుమారి కాదు కద..” సీతమ్మ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేస్తుంది.   “అవునమ్మమ్మా! కానీ ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు. అమ్మకీ, నాయనగారికీ చెప్తాను. ఇంకొక రెండు ఘడియల్లో మేనా ఇక్కడికి వస్తుంది. కొంచెం శుభ్రం చేయించి, పానుపు వేయిస్తావా?”   “మరి.. రాకుమారి అంటే, ఎంతో సుకుమారంగా పెరిగి ఉంటుంది. ఈ పాకలో ఉండగలదా? గవాక్షాలు కూడా లేవు. హంసతూలికా తల్పాలు లేవు.. మెత్తని బూరుగు దూది పరుపుందనుకో. కానీ.. ఈ మట్టి ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది?” సీతమ్మకి సందేహాల పరంపర వచ్చేస్తోంది.   “తప్పదమ్మమ్మా! కొన్ని రోజులు.. దమయంతీ దేవి, సీతమ్మవారిలాగ ఉండాలి. మంచి రోజులు వచ్చాక మహారాణీ అవుతుంది. ఆ మహా తల్లులు కానల్లో ఉన్నట్లుగా, పద్మావతీ దేవి మన వద్ద ఉండాలి.”   “ఓ.. వనవాసమన్నమాట. ఘడియలో సదుపాయాలు చేయించెయ్యనూ..”     “ఇక్కడ ఏలోటూ ఉండదు కన్నయ్యా! వాల్మీకి ఆశ్రమంలో జానకమ్మని చూసుకున్నట్లుగా చూసుకుంటాము. రాకుమార్తెని మన ఇంటి ఆడపడుచుని చూసుకున్నట్లు గౌరవించుకుందాము.” నందుడు, గౌతమీ హామీ ఇచ్చారు, మాధవుడు విషయం వివరించగానే.   పద్మావతీ దేవిని తమ ఇంటికి తీసుకొని రావాలని, మాధవుడు ఎప్పడో నిర్ణయించుకున్నాడు. ఊరూ పేరూ తెలియని అనాధని తనని ఆదరించి, కన్న బిడ్డలాగ చూసుకుంటున్న నంద, గౌతమిలు పద్మావతీ దేవిని ఆదరించరేమోనన్న శంక అతనికే మాత్రమూ లేదు.   అయినా.. అవునని పించుకునే వరకూ అనుమానం తప్పదు కదా! తేలిక పడిన మనసుతో, రెల్లు గృహాన్ని శుభ్రంచెయ్యడంలో సీతమ్మకి సహాయం చేసి, మేనా కోసం ఎదురు చూడ సాగాడు.   మేనా వచ్చింది.   బోయీలు కిందికి దింపగానే, మాధవుడు పరుగెత్తినట్లుగా దగ్గరగా వెళ్లాడు.   తెరలు తప్పించి, పద్మావతీ దేవి కిందికి దిగింది. దాదాపు పది హేనురోజులు ప్రయాణం.. రాత్రిళ్లు మజిలీలు చేసినా, పగలంతా మేనాలో కూర్చొనుటే.   మొహం వాడిపోయి, వలువలు చెదిరి పోయి, ముంగురులు రేగి పోయి.. రాకుమారి అలసటగా నిలబడి చుట్టూ గమనించింది.   మాధవుడిని ఎరిగున్నదే కనుక సంకోచం పెట్టుకోలేదు.   తమ సభలో అతడు రాయబారిగా ఎంతటి ప్రజ్ఞ చూపించాడో స్వయంగా చూసింది. తమ విధి ఈ విధంగా ఉంటే, వరదయ్య రూపంలో దురదృష్టం వెన్నాడుటలో వింత ఏమి లేదు.   “అమ్మా! మీరు కొద్ది దినములు, ఈ పేదవాని ఆతిధ్యము స్వీకరించ వలసిందిగా కోరుతున్నాను.” మాధవుడు విధేయుడై అన్నాడు.   “అంత మాట వద్దు సోదరా! కారాగారము తప్పించి నీ ఇంటికి.. పుట్టింటికి తీసుకొని వచ్చావు. అంత కంటే ఏం కావాలి ఈ శాపగ్రస్తకి? అమ్మా, నాన్నలని చూపించవా?” మధుర స్వరంతో, హుందాగా అంది పద్మావతి.   “మడిలో ఉన్నారు. ఈ రోజు అతిధులు చాలా మంది వస్తున్నారు. మీరు లోనికి వచ్చి, స్నాన పానాదులు చేశాక, పలుకరిస్తారు. రండి రాకుమారీ!”   “నేనిప్పుడు రాకుమారిని కాదు సోదరా! మీ సోదరిని. ఆ విధంగానే సంబోధించండి.” పద్మావతి పలుకులను విని తలెత్తి చూశాడు మాధవుడు. కానీ.. ఆవిడ మోములో గాంభీర్యం ఏ మాత్రం సడలలేదు.   “ఇటు రండి సోదరీ!” మాధవుడు తూరుపు చావడి వైపుకి తీసుకెళ్లాడు.   అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వసతిగృహంలో వచ్చే పోయే వారికి అటు ప్రక్కకి ప్రవేశం లేదు.   రెల్లుగడ్డితో వేసిన పర్ణ కుటీరం.   పాలరాయి భవంతులలో నివసించిన సుకుమారి.. పేడతో అలికిన కుటీరంలో ఉండగలదా? రాకుమారికి చూపించడానికి మాధవుడు సంకోచించాడు. కానీ, పరుల కంట పడకుండా ఉండగలిగే చోటు అదే వారింట. అది కూడా, యాత్రలకు వచ్చే ఘోషా స్త్రీల కొరకు వేయించాడు నందుడు.   ఇంటి లోపల అన్ని సదుపాయాలూ ఉన్నాయి. అయినా.. గాలీ, వెలుతురూ తక్కువే అనుకోవచ్చు. ఐతే ఆరు బయట ఆహ్లాదమైన వనం.. చల్లని గాలి ఏ లోటున్నా తీర్చేస్తుంది.                                              పూలవనంలో వెలిసినట్లున్న ఆ ఇంటిని చూడగానే రాకుమారి పద్మావతి, చెంగు చెంగున పరుగెత్తి, ఇంటిలోకీ, వెలుపలికీ వెళ్లి, అంతా పరిశీలించింది.   “చాలా బాగుంది సోదరా! ఇంతకంటే ఇంకేమి కావాలీ? ప్రస్థుత పరిస్థితులలో నా అంత అదృష్టవంతులెవరూ ఉండరనుకుంటున్నాను.” కళ్ల నిండా నీళ్లతో, నవ్వుతూ అంది పద్మావతి.   మాధవుని మోము మ్లానమయింది. తనేదో తప్పు చేసినట్లు తల పక్కకి తిప్పాడు.   “నిజం అన్నా! వేరెవరి పాలైనా పడితే.. అంతఃపుర స్త్రీలని యే విధంగా అవమానిస్తారో కథలు కథలు వింటూనే ఉంటాము. మీరు నా గౌరవాన్ని కాపాడుతున్నారు. పిదప విధి నిర్ణయమేవిధంగా ఉందో అట్లే జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఆనంద భాష్పాలు.” బుగ్గల మీదుగా నీరు కారి పోతోంది.   “అయ్యో.. ఎందుకు తల్లీ ఆ కన్నీరు.. మంచే జరుగుతుంది. నేనిక్కడుండగా నిన్ను చీమ కూడా కుట్టదు.” అప్పుడే అక్కడి కొచ్చిన సీతమ్మ, తన కొంగుతో పద్మావతి కన్నీరు తుడిచి.. చటుక్కున వెనక్కి నడిచింది, సంకోచిస్తూ..   రాకుమారి.. తను తాకచ్చో లేదో! సహజ సిద్ధమైన మాతృ హృదయంతో ఓదార్చ బోయింది. పద్మావతి సంభ్రమంగా చూసింది సీతమ్మని.   “మా అమ్మమ్మ. సీతమ్మ.” మాధవుడు పరిచయం చేశాడు.   సీతమ్మ రెండడుగులు వెనక్కి వేసింది.   “అమ్మమ్మా! మరి ఆ తడబాటెందుకు?” పద్మావతి, చెంగున ముందుకొచ్చి గాఢంగా కౌగిలించుకుంది సీతమ్మని.   సీతమ్మ మురిసి పోతూ, పద్మాలతి వీపు మీద వాత్సల్యంగా రాసింది.   మాధవుడు నిట్టూర్చాడు, హృదయం తేలిక అవగా. రాకుమారి ఈ పరిసరాల్లో సర్దుకు పోగలదో లేదో అని సంశయించాడు అప్పటి వరకూ. భారమంతా దించేసినట్లయింది.   పది మాసములు పైగా పద్మావతిని కాపాడాలి. ఆ తరువాతే ఏమైనా చెయ్య గలుగుతే. పద్మావతి తమ గృహములో, తమ కుటుంబంలో కలిసి మెలసి తిరిగేటట్లే కనబడుతోంది. ఇంక భయం లేదు. మేనాలోని వస్తువులను కుటీరంలో పెట్టమని బోయీలకి చెప్పాడు మాధవుడు.   ఎక్కువేమీ లేవు.. ఐదు పావడాలు, వానికి సరిపోయే కంచుకము, వల్లెవాట్లు. అంతే. ఇంకేమీ లేవు.   “తేలికగానే తెచ్చాను.. మేనాలో బరువుంటే కష్టమని.. ఐనా ఇంక నేను సాధారణ యువతినే కదా!” పద్మావతీదేవి మాటలకి హృదయం కలచి వేసింది మాధవునికి.                                      ………………   పద్మావతీదేవి నందుని గృహంలో బాగా కలిసి పోయింది. తను కూడా వారికి వంట వద్ద సహాయం చేస్తుంది. చీని చీనాంబరాలు కట్టకుండా మామూలు వలువలే ధరిస్తోంది. వచ్చిన వెంటనే తన దగ్గరున్న నాణాలుపయోగించి పావడాలు, చోళీలు కుట్టించింది.   సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజకి పువ్వులు సమకూరుస్తుంది. మంచిరోజులు వస్తాయని ఆశతో నిరీక్షిస్తోంది.   పురుషోత్తమదేవుని మనసారా వరించింది.. ఒక రకంగా యుద్ధం జరగడం మంచిదే అనుకుంది. లేకున్న, స్వయంవరంలో వేరెవరినో వరునిగా ఎన్నుకోవాలి.. తండ్రిగారెలా ఉన్నారో? పూజకి పూలు కోస్తూ చింతిస్తుంది.   అప్పుడప్పుడు మనసంతా ఆందోళనతో తల్లడిల్లుతుంది. తలపుల నిండుగా పురుషోత్తమదేవుడు. ఎప్పటికైనా అతడి చెంతకి చేర గలుగుతానా అనుకుంటుంది.   మనసులోనే కామాక్షీదేవిని వేడుకుంటుంది.    మధ్యాక్కర..    “పరమశివుని పొంద నీవు పవలురేయి తపస్సు చేయ                          హరుడు కళ్లు తెరవడాయె అతివ వేదన నాపగాను                          విరివింటిదొర తానె వచ్చి విషధరుని పతిని సేయ                          పురహరుని ముదము మీర పొందితీవు, కృపను జూపు.     అమ్మా! నీకు అనంగుడు చేసినట్లే, నాకు మాధవుడు సాయపడ బోతున్నాడు. కానీ మన్మధునికి, నీ పతి చేసినట్లు ఇక్కడ జరుగకుండా చూడు. పురుషోత్తమదేవుడే.. మనసా వాచా కర్మణా, నా పతి కాగలడని నిన్నే నమ్మి యున్నానమ్మా! నన్ను, నన్నాదరించిన వారిని కాచుకొనుమమ్మా!”   చిన్ననాటి నుంచీ ప్రేమగా నన్ను పెంచుకున్న తండ్రి, వివాహం కోరుకున్న వానితో జరుపుటకు సంశయించడమా! అంతా విధి రాత కాకపోతే! పదేపదే వాపోతుంది, తను తెచ్చుకున్న చిన్న కామాక్షీదేవి విగ్రహం ముందు కూర్చుని.   ఎవరైనా పిలవగానే నవ్వుతూ పరుగెత్తి వెళ్తుంది.. తన విచారం లోలోనే దాచుకుని పైకి కనిపించనియ్యకుండా!   “మాకు ఆడపిల్లలలు లేని లోటు తీరుస్తున్నావమ్మా!” గౌతమి, దగ్గరకు తీసుకుని బుగ్గ మీద చిన్న ముద్దిస్తుంది.   “మరీ అంత ప్రేమ పెంచుకోవద్దు! ఆడపిల్ల మనింట్లో ఎంత కాలం ఉంటుందమ్మా? పెళ్లైతే అత్తగారింటికి వెళ్లిపోతుంది కద!” మాధవుడు వారించాడు.   “అత్తవారింటికి…” పద్మావతి గొంతు గద్గదమయింది.   “తప్పకుండా వెళ్తావు తల్లీ. నాదీ బాధ్యత.”   “పుట్టింటి ప్రేమనే ఆడపిల్లా మరువదన్నా!” పద్మావతి సర్దుకుని అంది. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 26వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 26వ భాగం మాధవుడు రాకుమారునికి కొద్దిగా వెనుకగా తన అశ్వాన్ని నడిపిస్తున్నాడు. సమరానికి సంసిద్ధమయ్యాక, వారం రోజులాగి వెళ్దామన్నాడు మాధవుడు. ఆ లోగా వైద్యులని పిలిపించి, దెబ్బలు తగిలిన, భటులకి, అశ్వాలకి, గజాలకీ వైద్యం చేయించాడు. బలమైన ఆహారం ఇప్పించాడు. రోజూ అభ్యాసాలు చేయించాడు.   అనుకూలమైన అటవీ ప్రాంతం లభ్యమయింది అదృష్టవశాత్తూ..   ఆ ప్రాంతం.. రెడ్డి, రాయల రాజ్యాల మధ్యలో.. అనామకంగా ఉంది. జన సంచారం కూడా ఎక్కువగా లేదు.   శన్యూషమందు వినాయకుడిని, జగన్నాధుడినీ అర్చించి బయలు దేరారు..  ఈసారి ఇంకా చిన్న గుంపులుగా..   అయినా.. విజయోత్సవాలలో మునిగి పోయిన కాంచీపురం రాజు, తిరిగి గజపతులు దండయాత్రకి వస్తారని ఊపించలేదు. ప్రమత్తంగా ఉన్నాడు.   చారులు కూడా, పురుషోత్తముడు వెనుతిరిగి వెళ్లపోయాడని చెప్పారు.   వరదయ్య మంత్రి మరల స్వయంవరం ఏర్పాట్లలో నిమగ్న మయ్యాడు. రాజులందరికీ వర్తమానాలు పంపించుట, రాబోయే వరులకి వసతి ఏర్పాట్లు.. ఎక్కడా ఏ లోటూ రాకూడదు కదా!   రాకుమారుని ముందుగా కొద్ది మంది భటులు, వెనుక గజాలు, అశ్వ దళం సాగుతోంది. కాంచీపురం రాజ్య సరిహద్దుల్లోకి వచ్చాక కనిపించిందొక గొల్ల వనిత.   అప్పటికి వేగం తగ్గించి జాగ్రత్తగా అటూ ఇటూ పరికిస్తూ వెళ్తున్నారు.. శతృరాజ్యం కదా..   కనిపించడమే కాదు.. చేతులూపి ఆగమని సైగ చేసింది.   ఆశ్చర్యంగా చూస్తూ ఆగాడు మాధవుడు. పురుషోత్తముడు కూడా.. అవాంఛనీయమైనదేదైనా అనిపిస్తే, గుర్రాలు దౌడు తీయడానికి వీలుగా కళ్లెం పట్ఠుకునే ఉన్నారు.   “స్వామీ! నా పేరు మాణమ్మ. పాలు పెరుగు అమ్ముకుని జీవిస్తుంటాను. మూడు నాలుగు ఘడియల క్రితం ఇద్దరు రౌతులు ఇటుగా.. కాంచీపురం వైపు వెళ్లారు. వారి వెనుక పెద్ద సైన్యం ఉంది. మీరు రాకుమారుడు పురుషోత్తమ దేవులే కదా?”   ఉలిక్కి పడ్డారు మాధవ, పురుషోత్తములు. శతృరాజుకు తాము వస్తున్నట్లు ముందుగానే తెలిసి పోయిందా?   ఆందోళనగా అటూ ఇటూ చూశారు.. ఒర లోనుంచి కత్తి తియ్యబోయారు.   “కత్తులు తియ్యకండి బాబూ! ఇక్కడ మీ శతృవులెవరూ లేరు. ఆ రౌతులు.. తమ పేర్లు బలభద్రుడు, జగన్నాధుడు అని చెప్పారు. పూరీ పట్టణంలో ఉంటారుట. అదెక్కడో పాలమ్ముకునే నాకెలా తెలుస్తుంది? దాహంగా ఉందని మజ్జిగ తాగారు. ఒకరు తెల్లగా, ఒకరు నీలంగా ఉన్నారు. తెల్ల గుర్రం మీద ఒకరు, నల్ల గుర్రం మీద ఒకరు వచ్చారు.” మాణమ్మ ఆగింది ఆయాసంతో. కత్తులు చూసి భయపడి పోయింది.   మాధవ, పురుషోత్తములు మొహాలు చూసుకున్నారు.   బలభద్ర, జగన్నాధులా?     “భయంలేదవ్వా! నిన్నేం చెయ్యము.” మాధవుడు గుర్రం దిగి, అవ్వని ఓదార్చాడు.   “వారిద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారయ్యా! రంగులు వేరుకానీ రూపులొక్కలాగే ఉన్నాయి. మజ్జిగ తాగి, ధనం లేదన్నారు. చేతికున్న ఉంగరం తీసిచ్చారు. కాసేపట్లో మీరొస్తారనీ, ఈ ఉంగరం మీకిచ్చి, రూకలు తీసుకొమ్మనీ చెప్పారు.” కొంగుకి కట్టిన ఉంగరం తీసిచ్చింది మాణమ్మ.   ఆ ఉంగరం చూడగానే మాధవుని కన్నులు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో.   అది, గజపతుల కోశాగారంలోని ఉంగరం. వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఉంగరం రాకుమారునికిచ్చాడు మాధవుడు.   అటూ ఇటూ తిప్పి చూశాడు పురుషోత్తముడు. తమ ఆస్థానంలోదే..   కానీ దేవదేవుడే స్వయంగా.. నమ్మ శక్యంగా లేదు.   “నిజమే నయ్యా! నా ధనం నాకిస్తే వెళ్లి పోతాను.” గొల్ల వనిత తొందర చేసింది.   ధనం ఇచ్చి ముందుకు కదిలారు రాకుమారుడూ, పరివారం.   పురుషోత్తమ దేవునికి ఒడలు పులకరించగా ఆశువుగా కవిత్వం వచ్చేసింది.         ఆ.వె.   “నమ్మ శక్య మేన నామీన కరుణను                   చూప గాను వచ్చె చొక్క గాను                   అన్న తోడు కొనియు నార్తినే బాపగా                   ఆదిదేవుడతడె నాదరమున.”        మాధవుడు దీటుగా జవాబిచ్చాడు..        ఆ.వె.     “తనదు భక్తులకును తానెపుడును రక్ష                  యొసగు చుండు నతడు యొద్దికగను                  మనసునంత నిలిపి మాధవు కొలిచిన                  మరి కలద యపజయమన్న పదము?”                     అనుకోకుండా అనేశాడు కానీ అంతలోనే బెదురుతూ చూశాడు. దేవదేవునికి అనంత నామములుండగా మాధవుడనే పేరే రావాలా? రాకుమారులేమనుకున్నారో?   పురుషోత్తమ దేవుడు ఫకాలున నవ్వాడు.. దైవబలం ఉందనిన ధీమా అతనికి ఉల్లాసాన్నిచ్చింది.   “నిక్కముగా నుడివావు మాధవా! అటు ఆ స్వామి, ఇటు ఈ మిత్రుడు కాచుకొను చుండగా.. ఇంక నాకు ఓటమి ఎక్కడిది?”   ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగారు.. సైనికులకు ప్రోత్సాహము అందిస్తూ!                                          ……………….     కాంచీ పుర సరిహద్దుల్లోనే ఎదురయింది పురుషోత్తమ దేవునికి సంభ్రమాశ్చర్యములు కలిగించే దృశ్యము.   గజదళం ముందుకు సాగుతుండగా, అశ్వముల మీది సైనికులు, పదాతి దళం.. కలిసి కాంచీ పురాన్ని ముట్టడిస్తున్నారు.   గజాల మీద కళింగ రాజ్య పతాకములు ఎగురు తున్నాయి.   కంచి సైన్యాలు వారి ధాటికి తట్టుకోలేక వెనుతిరుగు తున్నాయి.                                                                                                       సీ.    గజములన్నియును ఘీంకారముం జేయగా                                        భీతిల్లి నరిసేన వెను తిరిగెగ                              అశ్వదళములన్ని యబ్బురముగ కదం                                         తొక్కుతూ కడిమిని దూసు కెళ్లె                              కరవాలముల నన్ని కసమస తిప్పుతూ                                         యోధులందరు కూడి హోరు చేయ                              ఓఢ్ర సైనికులంత యుగ్రమూర్తులయిరి                                         కంచి శూరుల యొక్క గర్వ మడచ                    ఆ.వె.   సైన్యమే మెలపుతొ చాకచక్యమునను                             క్రమమున నడవగను గాఢముగను                             సాధనముగ నెంతొ సమరమే సలుపగా                             రాకుమారు నివ్వెఱ పడి నిలిచె.     గొల్ల వనిత చెప్పిన అన్నదమ్ములు ఎక్కడున్నారా అని వెతికాడు మాధవుడు. శతృసైన్యంలోకి చొచ్చుకుని పోయి వీర విహారం చేస్తూ కనిపించారు ఇద్దరూ.   తమ సైనికాధికారులకి కూడా ఆనతిచ్చి, తమ గజాలని ముందుకురికించారు పురుషోత్తమ దేవ, మాధవులు.   సైన్యం రెట్టింపవడంతో.. మహోత్సాహంతో ముందుకురికింది గజపతుల సైన్యం. సాధ్యమయినంత వరకూ జంతునష్టం, జన నష్టం అవకుండా చూడమని ఆదేశాలిచ్చారు బలభద్ర, జగన్నాధులు.   శతృ సైన్యాన్ని బెదరగొట్టి, వెను తిరిగేట్లు చెయ్యడమే తమ ముఖ్యోద్దేశ మని గట్టిగా చెప్పారు.   అదే విధంగా.. సైనికులు అలసిపోయే విధంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు, రణరంగంలో ఆరి తేరిన కళింగ సైనికులు.   చివరికి.. స్వయంగా కాంచీపుర పాలకుడు యుద్ధ రంగానికి రాక తప్పలేదు.   రాజు ఏనుగు పై రాగానే మహోగ్ర రూపం దాల్చి పురుషోత్తమ దేవుడు తన గజాన్ని ఎదురుగా నడిపించాడు. గజపతుల గజం కదా.. అందులో, పురుషోత్తమ మాధవులు ప్రాణాలు కాపాడిన గజం.. రణరంగంలో ఏ విధంగా చెలరేగి పోవాలో బాగా నేర్చిన గజం.. తన యజమాని మనో భావాలను బాగా ఆకళింపు చేసుకున్నది..                                   ఒక్క సారిగా.. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకారం చేసింది. కంచి రాజుకి ఏనుగు సవారీ అంతగా అనుభవం లేదు..   ఆ అరుపుకే హడలి పోయాడు.. ఐనా, సహజంగా వీరుడు కనుక, శత విధాల పోరాడాడు.   కాంచీ పుర సైనికులు అంతకు ముందు జరిగిన రణంలో అలసి పోయి ఉన్నారు.. గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుంటే యుద్ధానికి సన్నిద్ధమవాలన్నారు. గజపతుల సైన్యం సగం పైగా కొత్తగా వచ్చింది. పైగా వారి రోషం, ధ్యేయం ముందర ఎంతటి యోధులైనా బలహీన పడక తప్పటం లేదు.   మొదటి రోజు ముగిసిన యుద్ధంలో కంచి సైన్యానికి బాగా నష్టం వచ్చింది.   రెండవ రోజున దిగజారిన ఉత్సాహంతో వచ్చారు యుద్ధానికి.   గజపతుల సైన్యం మరీ రెచ్చిపోయింది.   చివరికి, పురుషోత్తముని పక్కనే ఉండి కాచుకుంటున్న మాధవుడు, కంచి రాజుని బంధించి తీసుకొచ్చాడు.   “ఆ వరదయ్యని కూడా బంధించండి.” పురుషోత్తముడు హుంకరించాడు.   సైనికులు వెళ్లి, తన గృహములో బిక్కుబిక్కు మంటూ కూర్చున్న వరదయ్యను తెచ్చి అప్పగించారు.   “అంతే కాదు.. పద్మావతిని కూడా బంధించి తీసుకు రండి.” ఆవేశం తగ్గని పురుషోత్తముడు ఆనతిచ్చాడు.   కంచి రాజు తల దించుకుని నిలుచున్నాడు.   “ప్రభూ! రాకుమారిని బంధించా?” మాధవుడు ఆశ్చర్యంగా అడిగాడు.   “ఇప్పుడామె రాకుమారి కాదు. ఒక సేవకుని కూతురు. ఆమెని, చీపురుతో మలినాలని శుభ్ర పరచే సేవకుని కిచ్చి వివాహం చేస్తాను. చెప్పిన పని చెయ్యి మాధవా!” ఆగ్రహంతో ఆదేశ మిచ్చాడు కాబోయే చక్రవర్తి.   మనసు చివుక్కు మన్నా, మొహంలో చూపించకుండా అక్కడి నుంచి కదిలాడు మాధవుడు.   యుద్ధం ముగిసింది.  “ప్రభూ! వారిరువురూ వెళ్లి పోతున్నారు.” చూపించాడు మాధవుడు.   అప్పటి వరకూ రణరంగంలో స్వైర విహారం చేసిన యువకులు.. బలభద్ర, జగన్నాధులు శరవేగంతో దూసుకెళ్తున్నారు.   “అరే! మాకు మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లి పోతున్నారే..” సంభ్రమంగా అన్నాడు పురుషోత్తముడు.   “మనకి చెప్పి రాలేదు కదా! వారు అనుకున్న కార్యం చేసి మరలి పోతున్నారు.” మాధవుడు భక్తిగా వారికి నమస్కరించాడు.   “ఎవరు వారు?” కాంచీపుర రాజు అడిగాడు, కళ్లు వెడల్పు చేసి. తన ఓటమికి వారే కారణము.. అనుకోని విధంగా, ప్రమత్తులై ఉన్న తన సైనికుల మీద దాడి చేశారు.. అదీ.. హఠాత్తుగా.   “మాక్కూడా తెలియదు. దైవ భక్తుని దూషించిన వారిని శిక్షించడానికి స్వయంగా వచ్చిన ఆ దైవ స్వరూపులని అనుకుంటున్నాం. మా మహారాజుగారు, కటకం నుండి పంపిన సైన్యానికి, ప్రధాన సైన్యాధికారుల వలే ప్రత్యక్షమయి, పని అవగానే వెడలి పోతున్నారు.                                                          దైవ భక్తుని హీన పర్చడం, దైవాన్ని దూషించిన కంటే పాపం.. అదే భాగవతం మనకు నేర్పిన పాఠం. అందుకే పాప ఫలం అనుభవించక తప్పదు. కన్య నివ్వమని.. వివాహం చేసుకుని ముత్యాల పల్లకిలో తీసుకుని వెళ్తామని కోరితే ఆనందంగా ఇవ్వ వలసింది. కానీ.. తాము, దుష్ట శక్తుల ప్రభావంతో జగన్నాధుని భక్తుని దూషించారు. అనుభవించక తప్పదు.” మాధవుడు వివరించాడు.   కంచిరాజు, తన పక్కనే బంధింపబడి యున్న వరదయ్యని చూశాడు. ఇతని వల్లనే కదా.. ఇంత నాశనం అయింది.   ప్రతీ యుద్ధానికీ ఇటువంటివారు ఒకరు ఉంటూనే ఉంటారు. తన వివేకం ఏమయింది?                                         ……………………. ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 25వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 25వ భాగం కపిలేంద్ర వర్మ కటకం వచ్చి నాలుగు రోజులయింది. ఈశాన్య సరిహద్దులో కలకలం సృష్టిస్తున్న జానుపూర్ సుల్తాను, మహమద్ షాని వెళ్లగొట్టడమే కాక, అతని రాజ్యం లోని కొన్నిపట్టణాలను ఆక్రమించుకుని విజయోత్సాహలతో వచ్చిన రాజు, తన రాజ్యం లోని పరిస్థితులనవగాహన చేసుకుంటున్నాడు.    పురుషోత్తమ దేవుని పరిపాలనతో సంతుష్టుడయ్యాడు. మాధవుడతడికి చేదోడు వాదోడుగా ఉండటం మరింత తృప్తినిచ్చింది.    గత మూడు రోజుల నుంచీ అశ్వ, గజ దళాల అభ్యాసాల గురించి కూడా వింటున్నాడు. రాకుమారుడు, సైనికులనందరినీ కత్తి యుద్దంలోనూ, విలు విద్యలోనూ అభ్యాసం చేయిస్తున్న విన్యాసాలని కూడా విన్నాడు.    కటకం పట్టణ రక్షణకై ఉంచిన సైన్యాన్ని కూడా అప్రమత్తంగా ఉంచుతున్నందుకు పురుషోత్తమ రాకుమారుడిని మనసులో మెచ్చుకున్నాడు.    కంచి విశేషాలు తెలుసు కోవడానికి ఆరోజు కుదిరింది కపిలేంద్రవర్మకి.    కుమారుడుని, మాధవుడిని తన మందిరానికి పిలిపించాడు.    “కుమారా! కాంచీపుర విశేషాలేమి? వరదరాజ స్వామిని అర్చించి వచ్చారా? శివ కేశవులకు భేదము లేదు. ఏకాంబరేశ్వరునికి అభిషేకము చేసి వచ్చితిరి గాదా! జగములనేలు అమ్మ కామాక్షదేవిని కళింగదేశమును చల్లగా కాచుకొమ్మని వేడినారు కదా! మార్గ మధ్యమున నే అవరోధములనూ ఎదుర్కొన లేదుగా?”    “మార్గాయాసము ఏమీ లేకుండా చల్లగా వెళ్లి వచ్చాము ప్రభూ. మధ్య మజిలీలు కూడా ఆహ్లాదంగా గడిచాయి. కంచిలో అన్ని ఆలయాలలోనూ అర్చిత సేవలు చేసుకున్నాము.” మాధవుడు వివరించాడు.    “కుమారుని మోమెందుకో ఉదాసీనంగా ఉంది మరి. కారణమేమి?”   పురుషోత్తమదేవుడు మాట్లాడకుండా ప్రక్కకి చూశాడు.    మాధవుడు మౌనంగా ఉండిపోయాడు.    “కుమారుని వరించెనని చారులు చెప్పిన యతివ యనుకూలమనపించలేదా? వ్యాకులతకు కారణం ఏమి? కాంచీపుర రాజుని కలవలేదా? వివరం తెలియజెయ్యి మాధవా!” మహరాజు ఆజ్ఞాపించాడు.    మాధవుడు తాము కంచి వెళ్లినప్పటి నుండి జరిగిన సంగతులన్నీ వివరించాడు.    “అక్కడ కొలువులో ఉన్న వరదయ్య మంత్రి మన మీద కక్ష కట్టినట్లు అనిపించింది ప్రభూ! అతడే.. నేను అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుగుని సరే అన బోయిన కంచి రాజుకి అడ్డు కట్ట వేశాడు. ఆ తరువాత జగన్నాధుని రథయాత్రకి విచ్చేశాడు.”    కపిలేంద్రుడు తల పంకించాడు.    “ఐతే.. ఆ వరదయ్య తిరిగి వెళ్లి ఆ రాజుకు ఏం చెప్పాడో..” మాధవుని మాట పూర్తి చెయ్యలేదు..    “రాయబారిగా వచ్చినవాడు అపభ్రంశంగా వదరుతే సరిదిద్ద వలసిన ధర్మము రాజు దేకదా! అంతటి అవమానకరమైన లేఖ రాస్తాడా? ఇది మన పరువుకీ, మన శక్తికీ సంబంధించిన విషయం తండ్రీ!                      కం.     పరమాత్ము సేవ నగడుగ                               పరిహాసము సల్పు వారు పాతకులె కదా                               హరికి విరోధులగుదురుగ                               మరి యరి భంజనము సేయ పరగెద తండ్రీ!”    పురుషోత్తమ దేవుడు ముక్కు పుటాలదురు తుండగా, ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకొనుటకు ప్రయత్నించాడు.    “అటులనే చేద్దాం కుమారా! మరికొంత శిక్షణ ఇవ్వాలి సైనికులకూ, అశ్వ గజములకూ కూడా. మన సైన్యాధ్యక్షునికి చెప్తాను. యుద్ధానికి సన్నిద్ధం కమ్మని. కానీ.. ఉత్తర దండయాత్ర నుంచి వచ్చి నాలుగు దినములు కూడానూ అవలేదు. సైనికులంతా అలసి సొలసి ఉంటారు. కొన్ని రోజులు వారి వారి కుటుంబాలతో గడవనిద్దాం. పిదప.. సడి చెయ్యకుండా బయలుదేరి ఆకస్మాత్తుగా మీద పడాలి. అదే మన వ్యూహం.” మహారాజు అనుభవంతో చెప్తున్న మాటలు..    అక్కడ విజయనగరం దేవరాయలి అండ ఉంది. నెమ్మదిగా.. తెలియకుండా కొద్ది కొద్దిగా సైన్యాన్ని సరిహద్దులకి చేరుస్తుండాలి. మధ్యలో రెడ్డిరాజుల పాలన.. ఎంత అసమర్ధులైనా.. ఇంకా వారి రాజ్యం స్వాధీనమవలేదు.. కపిలేంద్ర వర్మ ఆలోచిస్తున్నాడు.    పురుషోత్తముడిని త్వరపడద్దని బాగా హెచ్చరించాలి.    “దగ్గరగా రా కుమారా! పరిష్వంగ సుఖం మా కందించు.” తండ్రి మాటను మన్నించి పురుషోత్తమ దేవుడు, అతడి కౌగిలిలో ఒదిగాడు.    కానీ.. ఇంకనూ ముఖమంతా కందగడ్డలా ఎర్రగానే ఉంది, భావోద్వేగాలతో.    “ఒక్క రెండు నెలలు కుమారా.. యుద్ధానుభవాలింకనూ మెదలుతూ ఉంటాయి సైనికులకి. అవి కాస్త మరపుకి రానివ్వాలి. ఈ లోగా మీరు మీ అభ్యాసాలు, శిక్షణలూ బాగుగా చేస్తూ ఉండండి. మీ కోరిక తప్పక తీర్చగలను. ఇదే నా వాగ్దానము. ఇంక మీమీ పనుల మీద నిమగ్నమవ్వండి.” చేతిలో చెయ్యేసి, భుజం మీద నొక్కి వదిలాడు మహారాజు.                                          …………………    పురుషోత్తమ దేవునికి ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. ఇంకా రెండు మాసములా! ఆ లోగా కంచి రాజు స్వయంవరం చాటింపు వేశాడని చారులు చెప్పారు.    తను సైన్యాన్ని సమాయత్తం చేశాడు కదా.. ఎందుకు ఆగాలి అన్ని రోజులు?    కంచి రాజు వద్ద సైన్యం అంత యెక్కువ ఉన్నట్లు లేదు.    రేపే తండ్రికి చెప్పి సమరానికి తరలి వెళ్లాలి..    ఒక నిర్ణయానికి వచ్చి నిదుర కొరిగాడు.    కపిలేంద్ర వర్మ.. చెట్టంత ఎదిగిన కొడుకుని ఏమనలేక పోయాడు.    “సరే.. మీకంత తొందరగా ఉంటే.. తప్పదనుకుంటే, మీరు తయారు చేసుకున్న సైన్యంతో వెళ్లండి” అన్యమనస్కంగానే అనుమతి ఇచ్చాడు.    కానీ.. మనసులోనే ఏదో ప్రణాలిక వేసుకుంటున్నాడు. పైగా..చెప్తే వినేట్లు లేడని.. స్వయంగా అనుభవంతో నేర్చుకుంటాడని అనుమతిచ్చినట్లున్నాడు. తండ్రి ప్రేమ అంటే అంతే మరి..                           కొడుకుల మాటల కాదన                           కడిమిని చూపగ నరగొనుగ జనకులు యిలన్                           బడిమిని సేయుట నైనను                           తడబడకను చేసెదరుగ తప్పుల నెన్నో.      కానీ.. కపిలేంద్ర దేవుడు అంత తెలివి తక్కువగా తప్పులు చేయు వాడు కాదు. ఎంతటి మేధ లేక పోతే.. రాజ్యంలోపలి, వెలుపలి శత్రువులను మెలకువతో నియంత్రించ గలుగుతున్నాడు?    పురుషోత్తముడు మరునాటి నుంచే సైన్యాన్ని సమాయుత్తం చేయుట ఆరంభించాడు.   మంచి ముహుర్తం చూసుకుని నూటపది ఏనుగులతో, రెండువందల అశ్వాలతో బయలుదేరాడు.. ఆరు విడతలుగా.    మరీ ఎక్కువమంది ఒకేసారి కదుల్తే చారులు వార్తని చేరేస్తారు. మధ్యలో రెడ్డి, విజయనగర రాజ్యాల మీదుగా వెళ్లాలి. ఏనుగులకి అడవుల్లో వెళ్లడం తెలుసు కనుక అటవీ మార్గంలో పయనం సాగించారు. ఎదురవుతున్న ఆటంకాలని తొలగిస్తూ, సాగుతున్నారు.    రాత్రి సమయాలలో తమ శిబిరాల వద్ద, నెగడులు, మంటలు పెట్టుకుని జంతువుల నుండి రక్షించుకుంటున్నారు.    కాంచీపురం సరిహద్దుల వద్ద, అడవి మధ్యకు చేరి, శిబిరాలను నిర్మించుకుని రణానికి సన్నిద్ధులయ్యేసరికి పక్షం రోజులు పట్టింది.    పద్మావతీ దేవి స్వయంవర సన్నాహాలలో ఉన్న కంచిరాజుకి వార్త చేరనే చేరంది. వేగులు అప్రమత్తులై అన్ని ప్రాంతాలలోనూ తిరుగుతూనే ఉంటారు.    స్వయంవరం నిలిపి వేసి, తానుకూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు.    నాలుగు రోజుల సమరం తరువాత, పురుషోత్తముని సైనికులను, వెళ్లగొట్టి విజయ భేరి మోగించాడు కంచి రాజు.    ఏనుగులకి గాయాలు మాత్రమే అయ్యాయి కానీ.. అశ్వాలు ఇరవై, సైనికులు పదిమంది మరణించారు. తాను చేపట్టిన తొలి యుద్ధంలో ఓడిపోయి వెనుతిరిగాడు పురుషోత్తమ దేవుడు.    అప్పుడు అర్ధ మయింది.. అనుభవజ్ఞుడైన తండ్రి చెప్పిన మాటలలోని సత్యం. తొందరపాటుతనం ఎంత చేటో కూడా తెలియవచ్చింది.    అవమాన భారంతో.. నెమ్మదిగా వెనుతిరిగి వెళ్తున్న పురుషోత్తముడ్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మాధవుడు. ఆశాభంగం ఎంతటి పని నైనా చేయిస్తుంది. రాకుమారుడు ధ్యాన యోగాదులతో కొంత తేరుకుంటున్నాడు. దారిలో రంగనాధ స్వామి ఆలయ దాపుల్లో విడిది చేశారు సైనిక బృందం.                     సంధ్యావందనాది కార్యక్రమాలయ్యాక, పురుషోత్తమ దేవుడు వంటరిగా ఆలయంలో గడుపుతానని చెప్పాడు. స్వామి దర్శనం, పూజ అయిన పిదప చీకట్లు ఆవరించుకోవడంతో గర్భగుడి తలుపులు మూసి వెళ్లిపోయాడు అర్చక స్వామి.                                    “స్వామీ మేమీ రాత్రికి ఇచ్చట విశ్రమించ వచ్చా?” మాధవుడు అడిగాడు.    “కొద్దిమంది ఫరవాలేదు సామీ.. కానీ.. జాగ్రత. దోపిడీ దొంగలుంటారు. బాట సారులని దోచుకుంటారు.” హెచ్చరించి వెళ్లిపోయాడు అర్చకుడు.    రాకుమారునికి, తనకీ ఆహారం అక్కడికే తెప్పించి, ఇద్దరు సైనికులని మాత్రం ఉండమని అందరినీ తమ సత్రాలకి వెళ్లమని చెప్పాడు. ఏనుగులూ, అశ్వాలూ వాటి వాటి శాలల్లో సేద తీరుతున్నాయి.    గర్భగుడిలో వెలుగుతున్న దీప కాంతులు తప్ప ఏ వెలుతురూ లేదు.    సైనికులిద్దరినీ వంతుల వారీగా ప్రధాన ద్వారం వద్ద కాపలా కాయుమని, తను మండపం అరుగు మీద, రాకుమారు దృష్టికి ఆనేట్లుగా కూర్చున్నాడు.    ఏ క్షణమైనా, కత్తి ఒరలోనుండి లాగడానికి సిద్ధంగా..    ఒక ఝాము గడిచింది.    పురుషోత్తముడు కన్నులు మూసుకుని ప్రార్ధిస్తున్నాడు.               ఉ.  “చేసిన నేరమేమి యది? చీకిలితో నొక తీరుగా నదే                   వాసిగ తేరునూడిచితి భక్తిన, రాజను దృష్టి చూపకే                   చేసితి నేనహర్నిశము సేవను శ్రద్ధగ నీదయం గొనన్,                   భాసమునే కటాక్షమును బాసిల రావదె నన్ను బ్రోవగా.”    కన్నుల వెంట నీరు కారి పోతోంది ధారగా.    “జగన్నాధా! దీన బాంధవా.. బుద్ధి తెలిసిన నాటి నుంచీ నీ సేవ చేసుకుంటున్నాను. ఆసేవనే పరిహసిస్తుంటే సహించలేక సమరానికి సంసిద్ధమై వెడలితిని. చెడు మాటలన్నవారిని శిక్షింపక యుండుట న్యాయమా? నా పక్షమున నిలచి చేదోడుగా ఉండి గెలిపించక పోతివా పరంధామా!”    మనసంతా జగన్నాధుని మీద ఉంచి ప్రార్ధిస్తున్నాడు రాకుమారుడు.    ఆదిదేవుని రూపు తప్ప మరి ఏదీ కాన రావట్లేదు.    ఆ విధంగా రెండు ఘడియలు కూర్చుని ఉంటాడు.. స్పష్టంగా, గంభీమైన కంఠస్వరం విన వచ్చింది..    “రాకుమారా విచారము మాని వెనుకకు మరలు. కాంచీపుర రాజుతో మరల యుద్ధం చెయ్యి. ఈ మారు తప్పక గెలుస్తావు. నా ఆభయం, సహకారం ఉంటుంది. నీ సైనికులకు కూడా తగిన శక్తి లభ్యమవుతుంది.”    “నిజంగానా! ఆ పరాత్పరుడు నాకు సందేశ మిచ్చాడా?” నమ్మలేని పురుషోత్తమదేవుడు కన్నులు తెరిచాడు.    రెండు ఘడియలనుకున్నాడు కానీ.. తెల్లవార వచ్చింది. అయినా అలసటనేది లేదు. రాత్రంతా విశ్రమించినట్లే అనిపించింది.    రాకుమారుడు కన్నులు తెరవగానే, మాధవుడు వచ్చేశాడు.    “ప్రభూ! కుశలమేనా?” ఆందోళనగా అడిగాడు. రాత్రంతా మెలకువతో ఉన్నా, కించిత్తుకూడా సోలిపోకుండా కళకళ్లాడుతూ కనిపించాడు మాధవుడు.    “కుశలమే మాధవా! నాకు జగన్నాధుడు ఆదేశమిచ్చాడు.. వెనుకకు మరలి సమరం సాగించమని. తాను సహకారం అందిస్తానన్నాడు. మన సైనికాధికారులకు విషయం తెలియ పరచండి.”    “అట్లే చేద్దాం దేవా! అధికారులతో మాట్లాడుతాను.”    మాధవుడు, పురుషోత్తముడు, పినాకినీ నదికి వెళ్లి స్నాన పానాదులనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలి వచ్చారు.    వారు తిరిగి వచ్చేసరికి, సైనికులు కాలకృత్యాలు తీర్తుకుని, ఫలహారాలు చేసేసి తయారుగా ఉన్నారు. ఆహార పదార్ధాలు, వంటవారు కూడా వారి వెంట ఉంటారు. అనువైన చోటు చూసుకుంటే రెండు ఘడియల్లో భోజనం తయారై పోతుంది.    సైన్యాధికారులు తయారుగా ఉన్నారు.    రాకుమారుని, మాధవుని చూడగానే దగ్గరగా వచ్చారు.    “ప్రభూ! మన సైనికులు కూడా ఓడిపోయి వెనుకకు మరలడాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. మరల యుద్ధం చెయ్యడానికే ఆటంకమూ లేదు. మనం ఇప్పుడే.. తక్షణమే మరలచ్చు.” ముఖ్య సైనికాధికారి వచ్చి సెలవిచ్చాడు.    మాధవుడు పురుషోత్తముడిని ఉత్సాహ పరచి, ఫలహార శిబిరానికి తీసుకెళ్లాడు.    “మాధవా! నేను చేస్తున్నది మంచి పనేనంటావా? అలసి సొలసిన సైనికులను, అశ్వాలనూ మరల యుద్ధం చెయ్యమనడం అమానుషం అవుతుందా? మనం మరింత నష్ట పోతామా?”    మాధవుడు చిరునవ్వు నవ్వాడు.    భృకుటి ముడిచి వింతగా చూశాడు పురుషోత్తముడు. తనెంతో వేదనలో ఉంటే నవ్వడం.. అదేమి పద్ధతి..    “అపార్ధం చేసుకోకు మిత్రమా! కురుక్షేత్ర సంగ్రామం ముందు అర్జునుడి మాటల్లాగ అనిపించి నవ్వొచ్చింది. ఆరంభంలో నిర్వేదం ఆ మహానుభావునికే తప్పలేదు మనమెంత? కృష్ణ పరమాత్మ చెప్పింది మననం చేసుకోవడమే మనం చెయ్యవలసింది.            * ఆ.వె      చేయదగినదియును, చేయరాదనెడిది                      నీదు కరమునందు నేది లేదు                      పాత కర్మ కెపుడు పాశ బద్ధుడ నీవు                      కనుక కదలవయ్య కదనమునకు. ఇంకా..        * ఆ.వె.  పురుష శ్రేష్ఠ! నీకు పూర్తి గోప్యమునైన                    జ్ఞానమిచ్చినాను జ్ఞాని కమ్ము                    బుద్ధిమంతుడ వీవు పూర్తిగా యోచించి                    సబబు నైనదొకటె సాగనిమ్ము.                                                    (*ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోపీనాథ్ పిన్నలిగారు అందరికీ అర్ధమయే రీతిగా భగవద్గీత    అధ్యాయలను తెనిగించారు. వారి సౌజన్యంతో.. అందులోని పద్యాలు.. రచయిత్రి.)    పై విధంగా చెప్పి భగవానుడు అర్జనుడి నిర్ణయానికే వదిలేశాడు. కానీ.. ధర్మమునకు కట్టుబడిన అర్జనుడు కదనానికి కదిలాడు.. పరమాత్మ బోధించినట్లుగా.    అదే విధముగా, పరాత్పరుని సేవలో లీనమయిన భక్తులను అవమానించడం, భగవంతుని దూషించడం కన్నా ఘోరమైన నేరం. ఆ నేరాన్ని కంచి రాజు చేశాడు. అందుకు శిక్ష పడాలిసిందే. భగవానుడి ఆనతి కూడా అయిన పిదప ఆలోచించ వలసిన పని లేదు. అయిననూ.. మరొకమారు యోచించి..” మాధవుని మాట మధ్యలో ఆపేసి ఫక్కున నవ్వాడు పురుషోత్తముడు.    “నిర్ణయం తీసుకోవాలి. అంతేగా! ఆ శ్రీకృష్ణులవారి లౌక్యము కన్ననూ మిక్కుటముగా మించిపోయావయ్యా మాధవా! అదే పేరు కదా మరీ.. రణ భేరి మోగిద్దాం.. పద.”                                      ………………… ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 24వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 24వ భాగం ఎప్పుడెప్పుడా అని పద్మావతి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వరదయ్య మంత్రి కాంచీపురం వచ్చేశాడు.   ఏ వార్త తెచ్చారో.. తండ్రిగారు తన మనోహరునికిచ్చి ఎప్పుడు పరిణయం చేస్తారో! పురుషోత్తమ దేవుని తలచుకుని ఊహలలో తేలిపో సాగింది.   సభలో..   వరదయ్య వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు.   తెర చాటునుండి చూస్తున్న రాకుమారికి కుడి కన్ను అదిరింది. ఈ అశుభ సూచన లెందుకో.. కలవర పడుతూ చూసింది. వరదయ్యగారి మోము ప్రసన్నంగా లేదెందుకనో!   “వరదయ్య గారూ! సంతృప్తులయ్యారా మీరు గజపతుల రాకుమారుని సమర్ధతతో, రాచ కుటుంబపు వివరములతో? పురుషోత్తమ రాకుమారుని గురించి ఇప్పటి వరకూ మంచి మాటలే విన్నాము. మీ యాత్రా విశేషములేమి? మీ అనుభవమ్మెట్టిది?”   రాకుమారి ముందుకు వంగింది, ఉత్సుకతతో.   “ప్రభూ! గజపతుల ఐశ్వర్యమ్మునకూ, వారి గుణగణాలకూ సాటి ఎవరూ లేరు. ఎన్న దగిన వంశమే. కానీ..” సందేహముతో ఆగి పోయాడు వరదయ్య.   “ఏం జరిగింది వరదయ్య మంత్రీ.. నిస్సంకోచంగా చెప్పండి. పురుషోత్తముడు పిరికి వాడా? చదువులు నేర్వలేదా? కోపతాపముల నియంత్రించుకోలేడా? స్త్రీ లోలుడా? మదిర మత్తులో తేలుతుంటాడా? భయం లేదు.. చెప్పండి.” మహరాజు మరీ మరీ అభయ మివ్వగా మొదలు పెట్టాడు వరదయ్య.   “రాకుమారునికి ఎటువంటి అవలక్షణాలూ లేవు.. ఐతే..                         సీ.   ఇన వంశమున నెంతొ యింపుగా జనియించి                               గజపతి పేరుతో గణుతి కెక్కె                     పురుషోత్తముడనుచు పురజను పేర్మిని                               కూర్మిని గ్రహియించె కోరి తాను                     నారాయణు రథము నడిపించు సమయాన                                మిన్నంటె సంబరం మేలు గాను                     వంశ మర్యాదయే పాటించ లేకనే                                ఛండాలుని వలెతా జాడు చేసె              ఆ.వె.     క్షత్రియుడతడేను గాని పౌరుషమేమి                        చేవ లేక తాను చిదియు పోయె                        పరువు తక్కువైన పనిచేసి నదెగాక                        భక్తి యనుచు నెంతొ బాగ నుడివె.     ఇదే ప్రభూ, నేను వీక్షించి సిగ్గుతో తలదించుకుని తిరిగి వచ్చేశాను. ఇంక మన ఆడపడుచుని ఆ ఛండాల కార్యము చేసిన వాని చేతికిచ్చెదరో లేదో.. మీ చిత్తము.” వరదయ్య తాను చెప్పదలచినది చెప్పేసి, ఏదో భారం దించుకున్నట్లు తేలిగ్గా కూర్చున్నాడు.   రాకుమారి పద్మావతికి గుండె దడగడలాడ సాగింది.   అయి పోయింది.. తన కలలన్నీ కల్లలై పోయాయి.   “ఏ విషయమైననూ విశ్లేషించే వారి చాతుర్యము మీద ఆధారపడి మంచో చెడో నిర్ణయింపబడుతుంది. పోయి పోయి ఈ నిత్యశంకితుడి చేత పడింది తన కళ్యాణం జరిపించడం. భగవంతుని సేవకు కూడ ఇంత వక్ర భాష్యం చెప్పగలవాడు ఇతడే ఈ జగాన.. తండ్రిగారే విధంగా స్పందిస్తారో! జగన్నాధా నీవే దిక్కు.” పద్మావతీదేవి మనసులో వేయి మొక్కులు మొక్కుకుంది. రాజును అనుకూలంగా ఆలోచించేలా చెయ్యమని.   కానీ.. జగన్నాధుని సంకల్పం వేరుగా ఉంది.   రాజు స్పందన ప్రతికూలంగా ఉంది. కన్నులు ఎర్రవారాయి. ముక్కుపుటాలు అదురుతున్నాయి. చెయ్యి కత్తిపిడి మీదికి చేరింది.   ఎంత ధైర్యం.. ఛండాలురి పని చెసే రాజు, తన కుమార్తెను కోరడమా!   “వెంటనే కటకం రాజుకి వర్తమానం పంపండి. మా రాకుమారిని అటువంటి వారికివ్వడానికి ఇష్టం లేదని. పెండ్లి అయ్యాక మా ఆడపడుచుని కూడా చీపురు పట్టుకుని రహదారిని ఊడవమంటారేమో! ఆ రాకుమారునికి, సేవకుల కూతురైతే సరి పోతుంది.” రాజు లేచి విసవిసా నడిచి వెళ్లి పోయాడు.   పెనుముప్పు సంభవించ బోతోంది. ఏ విధంగా ఆపగలుగుతుంది తాను?   మరి పురుషోత్తమ రాకుమారుని మీద పెంచుకున్న మమత? తన మదినిండుగా అతని రూపే.. అతడే యరుదెంచి సమస్యని పరిష్కరించవలె కాదా..               కం.        తలకించెను మది నిన్నే                          తలచి తలచి యేమరగను తలపున నీవే                          తలవాకిట నీవే కద                          తలరారగ వచ్చి నా వెతల మాన్పనుగా.     కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన మందిరానికి చేరుకుంది పద్మావతి.   తన వలపు సఫలమవకపోయినా ఫరవాలేదు.. ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండి పోగలదు. ఆ వరదయ్య సంకుచితత్వం అంతా పదాలలో తెలుపుతూ లేఖ పంపుతే ఎంత ప్రమాదం?   అసలు, ఆలయాలకి కాణాచి యైన కాంచీపురంలో నివసిస్తూ, జగన్నాధుని సేవలో రాజూ, పేదల తారతమ్యాలుండవని.. ఆ మాత్రం గ్రహింపు ఆ మంత్రికి కానీ, ఈ రాజుకి కానీ లేకపోవడం ఎంత ఆశ్చర్యం? ఆవేదనలో తండ్రినే పరాయివానిగా భావన వచ్చింది పద్మావతికి. అది సహజమే.. తన వారనేది ఎవరయ్యా అంటే ఆ పరాత్పరుడే కద..   ఎంతటి పుణ్యం చేసుకుంటే, ఆదివిష్ణువు సేవ లభ్యమవుతుంది. ఆ పుణ్యాత్మునికి ఇల్లాలుగా వెళ్లి అటువంటి సేవలో పాలు పంచుకొనగలగడం ఎంతటి అదృష్టం?   తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు తండ్రి.   పద్మావతీదేవి భయాందోళనలు నిజం చేస్తూ, కళింగదేశానికి రాయబారి లేఖను తీసుకుని వెళ్లిపోవడం జరిగి పోయింది.      కాంచీపురంనుంచి మంచి వార్త కోసం ఎదురు చూస్తున్న మాధవునికి ఆశాభంగం కలిగించిందా లేఖ. వార్తాహరుడు మాధవునే కలిశాడు కటకం రాగానే. అతడే కద మరి కంచి రాజు సభకి రాయబారిగా వెళ్లిన వాడు.   ఈ లేఖ చదివి పురుషోత్తముడే విధంగా స్పందిస్తాడో తలచుకుంటే వెన్నులోంచీ చలి వేసింది మాధవునికి. రాకుమారుడు అంత కోపిష్టి కాదు. పోన్లే అని వదిలేసినా వదిలెయ్య వచ్చు. అలా అని పట్టించుకోకుండా ఉండగలిగేటట్లు లేదు ఆ లేఖ.   వరదయ్య చాలా అవమానం కలిగించేట్లు రాశాడు.   కంచి రాజుగారి సభలో చెప్పిన పద్యం లాగే.. అంతకంటే ఇంకా కఠినంగా.. జుగుప్స కలిగించే పదాలని వాడాడు. ఎందుకో గానీ వరదయ్య మంత్రికి గజపతుల మీద ఆగ్రహం ఉందేమో అనిపించేలాగ ఉంది ఆ లేఖ.   అది నిజమే కూడా.. గాంగేయరాజు భానుదత్తుడి ఆస్థానంలో ఉండి అతడి పరివారంతో పాటుగా, కపిలేంద్రుడిచే వెళ్లగొట్టబడ్డాడు వరదయ్య. రాజ్యం కోల్పోయి, అజ్ఞాతంగా కాలగడుపుతున్న రాజు దగ్గర ఉండలేక, కాంచీపురం రాజు ఆస్థానంలో, తన తెలివితేటలతో స్థానం సంపాదించి నిలదొక్కుకున్నాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా గజపతుల పతనాగ్నికి ఆజ్యం పొయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.   ఈసంగతులేమీ తెలియని మాధవునికి ఆలేఖనీ, అది తెచ్చిన వార్తాహరునీ ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.    కానీ మిత్రునికి ఇవ్వకుండా ఉండలేడు. ఇస్తే ఫలితమెట్లుండునో. రాకుమారుడు కూడా వార్త కోసం ఆతృతగా యెదురు చూస్తున్నాడు. తప్పదు..   గుండె చిక్క బట్టుకుని పురుషోత్తమదేవుని మందిరానికి వెళ్లాడు.   “మాధవా రా..రా. ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి. వార్తేమైనా వచ్చిందా?”   వచ్చిందన్నట్లుగా నిలువుగా తలాడించాడు మాధవుడు.   “ఏదీ లేఖ?” చెయ్యి చాచాడు రాకుమారుడు.   నెమ్మదిగా పత్రం విప్పి చేత పెట్టాడు మాధవుడు.   ఉత్సాహంగా చదవడం ఆరంభించిన పురుషోత్తముడి కన్నులు నెమ్మదిగా ఎర్రవారడం మొదలయ్యాయి. పూర్తిగా పఠించిన పిదప, ఆగ్రహావేశాలతో లేచి నిలుచున్నాడు.          సీ.       ఘనుడా యతడు లేక గార్దభ జన్మము                        నెత్తిన మూర్ఖుడా నేమి తలతు                  ఆది దేవుని సేవ యందులీన మగుట                        యంత హీనమగునా యకట, నేమి                  యీ కండ కావరం, యే మహరాజుని                        ఛండాలు డననెంత జాడ్య మౌగ                  నుచ్ఛము నీచమును రవంతయును లేదు                        నాలుక తిరిగన నట్ల నుటయె            తే.గీ.  ఇచ్చటను నే ప్రతిన పూని యీక్షణమును                   చెప్పు చున్నాడ వినుమదే చేకొనియెద                   సమరమున రాకుమారిని సాధనమున                   పెండ్లి చేయ ఛండాలుతో పెంపు గాను.     మాధవుడు భయపడినంతా అయింది. ఏం చెయ్యాలిప్పుడు..   “రాకుమారా! తెలియక రాసిన లేఖ అయుంటుంది. నేను వెళ్లి విషయం వివరించి వస్తాను. మీ పైననే అనురాగం పెంచుకుని, ఆశలు పెట్టుకున్న రాకుమారిని మధ్యలో శిక్షించ వద్దు. చేతులు పట్టి ప్రాధేయ పడుతున్నా దేవా. కనీసం తండ్రిగారు వచ్చే వరకూ ఆగండి.” బ్రతిమాలాడు పురుషోత్తముని.   “అదేమీ తెలియక రాసిన పత్రం కాదు. ఒడలంతా పొగరు పట్టి రాసినది. అటువంటి తండ్రికి జన్మించినందుకు పద్మావతి అనుభవించ వలసిందే. నువ్వు చెప్పినట్లు తండ్రిగారు వచ్చు వరకూ ఆగెదను. వారైననూ ఉపేక్షించెదరనుకోను. ఇది ఘోరమైన అవమానం. కోరి వధువు నడుగుతే.. ఇటువంటి లేఖయా”   “దేవా! ఊరట చెందండి. జరిగేది జరుగక మానదు. మనం మహానదీ తీరమునకు వెళ్లి కాసింత ధ్యాన మగ్నుల మవుదాము. నేను వెళ్లి అశ్వములను తీసుకుని వచ్చెదను.” మాధవుడు నమస్కరించి, మందిరం వెలుపలికి వచ్చి, కాంచీ పురం నుంచి వచ్చి వార్తా హరుని పంపి వేశాడు.   “ప్రభూ! మీరేమీ లేఖ ఇవ్వరా?” వార్తాహరుడు అడిగాడు. కనీసం ఆహారం సదుపాయం కూడా చెయ్యకుండా పంపేస్తున్నారని కినుకగా ఉందతడికి.   “త్వరలో జాబుకి ఎదురు చూడమని మీ రాజుకి మనవి చెయ్యి.”   వింతగా చూస్తూ వెను తిరిగాడు వచ్చినవాడు. వానికి అక్షరాలు చదవడం రాదు. తమ రాజుగారిని మన్నించకుండా సంబోధిస్తుంటే ఆశ్చర్యం కలిగింది.. లేఖలో ఏముందో తెలియని రాయబారికి. కావాలనే అటువంటి వానిని పంపాడు, వరదయ్య మంత్రి.                                       …………………                                  “కొత్త మార్గాన తీసుకొస్తున్నావు మాధవా?”   పురుషోత్తమ దేవుడు ఉదాసీనంగా అడిగాడు.   “అవును ప్రభూ! కాస్త ఎక్కువ దూరం సవారీ చేస్తే మనసు స్థిమిత పడుతుందని. చుట్టు తిరిగి గుట్టల దారిలో తిప్పాను అశ్వాన్ని.”   “చూశావా! మన మనోగతంలాగే ఉంది ప్రకృతి కూడా. ఎక్కడా పచ్చదనం లేదు.” నిర్వేదంగా అన్నాడు రాకుమారుడు.   “దాందేముంది ప్రభూ.. ఒక క్రోసు వెళ్లామంటే పచ్చదనం వచ్చేస్తుంది. ఓరిమి వహించాలంతే.”   హూ.. ఓరిమి. ఎంత కష్టం.. అనుకున్నాడు పురుషోత్తమదేవుడు! పడ్డవాడికి తెలుస్తుంది బాధ.. పక్కనున్నవాడికేమి? ఎన్నైనా నీతులు చెప్పగలడు.   మాధవుడికి అర్ధమయింది. కానీ ఏమి చేయగలడు? కాస్త గుడ్డిలో మెల్ల.. కపిలేంద్ర దేవులు త్వరలో రానున్నారు.. అదీ, కొంత వంగ దేశాన్ని స్వాధీనం చేసుకుని. వారు అనుభవజ్ఞులు. ఏనిర్ణయం తీసుకున్నా సరైనదే అవుతుంది.   “మాధవా!”   “ప్రభూ..”   “కత్తి యుద్ధం చేద్దామా? ఆవిధంగా ఆవేశం తగ్గించుకోవచ్చేమో!”   “అవశ్యం ప్రభూ. ఇక్కడే.. దగ్గర్లో మైదానం ఉంది. అక్కడ చేద్దాం. చాలా రోజులయింది మనిద్దరం చేసి.”   ఇద్దరూ, మహానది ఒడ్డునే.. ఇసకలో ఉన్న మైదానం లోకి వెళ్లారు. గుర్రం దిగి, సర్దుకుని కత్తి ఝళిపిస్తున్న రాకుమారుని చూసి మాధవుడికి గుండె దిగజారి పోయింది. అంతటి రౌద్రం ఆ మొహంలో.. ఆ విదిలింపులో..   సంధ్య కాంతిలో మరింత.. ప్రళయకాల రుద్రుడి లాగనే ఉన్నాడు.   “ప్రభూ! భయం వేస్తోంది మిమ్ము చూస్తుంటే..”                                                                                                                    “ఫర్లేదు మాధవా! గురుకులంలో అభ్యాసం చేసినట్లే.. కాకపోతే కాస్త ఆవేశం జోడించి..”   మాధవుడు కూడా కిందికి ఉరికి కత్తి పట్టాడు.   మొదట్లో ఆటలాగ మొదలైన యుద్ధం.. పోను పోను భీకరంగా సాగుతోంది.   మాధవుడు, రాకమారుని విసుర్లని తప్పించుకుంటూనే దీటుగా చేస్తున్నాడు. రెండు ఘడియలు పోరాటం అయ్యాక.. రాకుమారుడు కంఠం మీదికి విసిరిన వేటు అతి కష్టం మీద తప్పించుకుని, కిందికి పడిపోయి దండం పెట్టాడు.   “ప్రభూ! ఇంక చాలు.”   కత్తి కింద పడేసి, పురుషోత్తముడు కూడా, నేల మీదికి వాలి పోయాడు.   “రేపటి నుంచీ, ఇదే అభ్యాసం. గజసైన్యం, అశ్వ దళం.. అందరినీ అప్రమత్తులని చేసి, యుద్ధానికి సన్నిద్ధులని చెయ్యాలి. గురుకులాలలో మిగిలిన విద్యార్ధులనందరినీ సైన్యంలోనికి తీసుకోవాలి. అందరం అదే పని మీదుందాం.”   “నదికి వెళ్లి అర్ఘ్యం సమర్పిద్దామా దేవా?” మాధవుడు వినమ్రంగా అడిగాడు.   పురుషోత్తముడు నవ్వుతూ లేచి, మాధవునికి చెయ్యందించాడు.   కానీ.. ఆ నవ్వు పేలవంగా ఉంది.                                           ……………..     ......మంథా భానుమతి  

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 23వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 23వ భాగం   పురుషోత్తమదేవుడు, పరివారంతో పూరీ  పట్టణం చేరే సరికి జ్యేష్ఠ బహుళ చతుర్దశి వచ్చింది.    మరునాడే అమావాస్య.. నూతన దేవతా మూర్తుల నేత్రోత్సవం జరిగే రోజు. పూజలు మామూలుగా జరుగుతాయి. మరునాడు ప్రజలకు నవయవ్వన దర్శనం.   ఆలయంలో పూజల ఏర్పాట్లు జరుగుతుండగానే రాచ పరివారం వారి వారి వసతి గృహాలలో కుదురు కున్నారు.   పూరీ పట్టణం అంతా జన సందోహంతో కళకళ లాడుతోంది. ఎక్కడెక్కడి వారూ, బళ్లలో, గుర్రాల మీద, కాలి నడకన వస్తున్నారు. ప్రధాన రహదారి అంతా మామిడాకులతో, పూల తోరణాలతో అలంకరించారు. నగరంలోని అన్ని ధర్మ సత్రాలు, పూటకూళ్ల ఇళ్లు నిండి పోయి, ఖాళీ ప్రదేశాలలో డేరాలు వేసుకుని స్థిర పడ్డారు.   అంత మంది జనం ఉన్నా.. ‘మనిమా’ (జగన్నాధా) అంటూ క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ సదుపాయాలు చూడడానికి సేవా సమితి ఉంది. అందులోని స్వచ్ఛంద సేవకులు నిరంతరం తిరుగుతూనే ఉంటారు. ఆలయంలోనే ప్రజలందరికీ భోజన ఏర్పాట్లు జరుగుతాయి.   పాడ్యమి రోజున కాంచీపురం నుంచి మంత్రి వరదయ్య వచ్చారు. వస్తూనే అక్కడి కోలాహలాన్ని చూసి సంభ్రమంతో కన్నులు తిప్పుకో లేకపోయారు.   వరదయ్యగారికి, మాధవుడి కుటుంబం ఉన్న దగ్గరే విడిది ఏర్పాటు చేశారు.   జనంలో కలిసి పోయి, పురుషోత్తముడు ఎటువంటివాడో కనుక్కుంటున్నాడు వరదయ్య.   తృప్తిగా రాత్రి నిదురించాడు.. రథయాత్ర సంబరాలు చూడడానికి సంసిద్ధ మౌతూ.                             ఆషాఢ శుక్ల విదియ.. ఏడాదిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.   పాండాలు సూర్యోదయానికి ముందే లేచి పూజలు నిర్వహించారు. ‘మనీమా..’ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలని కదిలించారు. పహండీ ఉత్సవం ఆరంభమయింది.   ప్రధాన రహదారి వద్దకు తీసుకుని వచ్చి, రథాల వెనుక భాగం నుంచి అలంకరించిన రత్న పీఠముల మీద సుభద్ర, బలభద్ర, జగన్నాధులని ఆసీనులని చేశారు.   ఆదిదేవుడు రథారూఢుడయ్యాడు. ఇరు ప్రక్కలా నున్న రథాలలో భగినీ, అగ్రజులు..      ఒక్క సారిగా కోలాహలం మొదలయింది. మనీమా అని అరుస్తూ భక్తులు ఆవేశంతో ఆనంద తాండవం చేస్తున్నారు.   ఆనవాయితీగా వచ్చే రాజుగారి బదులుగా సాక్షత్ విష్ణు స్వరూపులైన రాకుమారులు పల్లకీలో, పరివారంతో వచ్చేశారు.,బాజా భజంత్రీలు మారు మ్రోగాయి. ప్రజల సంభ్రమం పెచ్చు పెరిగింది.   రాచకుటుంబం ముందుకు నడిచింది, ప్రజలంతా దారి నివ్వగా. మాధవుడు, పురుషోత్తముని వెనుకే ఉన్నాడు అప్రమత్తుడై. నంద, గౌతమిలు, సీతమ్మతో సహా ఆ పరివారంలోనే ఉన్నారు.   కాంచీపురం నుంచి వచ్చిన వరదయ్య మంత్రి మాధవుని వెనుకనే ఉన్నాడు.. కన్నుల పండువగా జరుగుతున్న ఉత్సవాన్ని వీక్షిస్తూ.   సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇంత దగ్గరగా జగన్నాధుని వీక్షించ గలగడం.. జన్మ ధన్య మయిందనుకుంది. భక్తులందరూ, కులమత భేదాల్లేకుండా వినమ్రతతో రథాలకి ఇరు ప్రక్కలా, రహదారి మీద వేచి ఉన్నారు... జయజయ ధ్వానాలతో.    రాకుమారుడు పురుషోత్తమ దేవుడు పల్లకీ దిగి, భక్తులందరికీ అభివాదం చేశాడు.   పదహారు కళలతో వెలుగొందుతూ, ఆదిదేవుని ప్రతిరూపంలాగే, విష్ణు స్వరూపుని వలెనే ఉన్నాడు. కాకుంటే ఇతడు పచ్చని పసిమి.. నీల మాధవుడు నల్లన.   పూజారులు వేద మంత్రాలుచ్ఛరిస్తూ ఉండగా, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా పురుషోత్తమ దేవుడు స్వామి రథం వద్దకు నడిచాడు.                                                           లోకాలనేలే పరమాత్మునికి, దేశాన్నేలే రాజు సేవకుడైనాడు. రథాన్ని అదిరోహించి, బంగరు పిడిగల చీపురు నందుకున్నాడు. స్వయంగా రథం లోపల జాగ్రత్తగా, ఎక్కడా దుమ్ము ధూళి కనబడకుండా తుడిచాడు.. మరీ మరీ. సవినయంగా, భక్తి ప్రపత్తులతో.   అదే.. ‘చెరా పహారా’ సేవ.   భక్తుల సందడి మిన్నంటింది.   కాంచీపుర రాయబారి వరదయ్యకి మాత్రం ఒడలంతా కారం రాచుకున్నట్లయింది.   రాకుమారుడు, కాబోయే మహారాజు, చీపురు పట్టుకుని ఊడవడమా! ఎక్కడయినా, ఎన్నడయినా. ఎవరైనా కన్నారా? కనగలరా? చిరచిర లాడుతూ పక్కకి జరిగి తలతిప్పుకున్నాడు.   ఆ హడావుడిలో ఎవరు పట్టించుకుంటారు అతడినీ, అతడి భావాలనీ..   కన్నుల పండువలా జరుగుతున్న ఉత్సవాన్ని తిలకించడంలో మునిగి పోయారు.   జగన్నాధ రథయాత్ర ప్రారంభ మయింది.   జగన్నాధుని రథం పేరు ‘నందిఘోష’, సారధి దారుకుడు.   బలభద్రుని రధం ‘తాళ ధ్వజం’.   సుభద్రాదేవి రధం ‘దేవదళం’.             సీ.      నగరి యా యది మరి నడచుచున్న నగమా                           యని భ్రాంతి తోడనే అందరు కన                    జగమేలు సామియే జనుల మనమునందు                            నాల్కలందును కూడ నాను తుండ                    సొగసైన సోదరి, సోదరు కూడియు                            తాదాత్మ్య మొందుచూ తరలి రాగ                    అటునిటు నడయాడ యవె రెండు రథములు,                             నందిఘోష యనెడి నరద మొకటి          ఆ.వె.     ఆది విష్ణు తాను యధిరోహణము చేసె                    అన్న చెల్లి కలసి యంత గాను                    జయజయ ధ్వనులవె ఝంపె తాళము తోను                    వెనుక రమని వదలి వెడలె తాను.     ఈ యాత్రలో లక్ష్మీ దేవిని పాల్గొన నియ్యరు. దానికి ఒక కమ్మని కథ చెప్తారు. రథయాత్ర అరకోసు దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకూ సాగుతుంది. గుండీచా ఆలయం జగన్నాధుని, తోట విడిది. అరటి, కొబ్బరి మొదలైన చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది.                                       గుండీచా ఆలయంలో, ప్రధాన ఆలయంలో లాగ బ్రాహ్మణేతరులు కాకుండా బ్రాహ్మణ పూజారులు పూజలు సల్పుతారు. దేవదాసీలు తమ నాట్యాలతో స్వామిని అలరిస్తారు. తాము గోపికలై గీతగోవిందంలోఅష్ట పదులు పాడుతూ నాట్యం ఆడుతూ ఉంటారు.   మూడవ రోజును హీరా పంచమి అంటారు. ఆ రోజున, తనని ఇంట్లో వదిలేశారని కోపగించిన లక్ష్మీదేవి, సువర్ణ లక్ష్మిగా వస్తుంది గుండీచా గుడికి. అలంకరించిన పల్లకీలో భక్తులు తీసుకు వస్తారు ఆది లక్ష్మిని. అక్కడి పూజారులు అమ్మవారిని పూజించి, జగన్నాధుని వద్దకు గుడిలోనికి తీసుకెళ్తారు. ఆది దంపతులిరువురినీ ఎదురెదురుగా కూర్చో పెడతారు.   ఈ ముచ్చట మనసారా ఆస్వాదించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు.   పదుగురిలోనూ స్వామిని తమ నివాసానికి రమ్మని అర్ధిస్తుంది లోక మాత. అంగీకారాన్ని తెలిపి పూల హారాన్ని.. జ్ఞాన మాలని ప్రసాదిస్తాడు స్వామి. గుండీచా గుడినుండి బైటికి వచ్చి, తన అసహనాన్ని, “రథ భంగం” చేయడంలో.. నందఘోషని కొద్దిగా విరగ కొట్టడంలో చూపించి, చింత చెట్టు చాటున దాగుతుంది రమ. వచ్చిన దారి లో కాకుండా, హీరా ఘోరీ బాటలో వెను తిరుగుతుంది మహాలక్ష్మి.. తన కోపానికి స్వామి ఏ విధంగా స్పందిస్తాడో అని భయపడుతూ.   ఈ విన్యాసాలన్నీ పూజారులు పరమానందంతో చేస్తుంటారు.   మరునాడు.. షష్ఠి రోజున రథాలని పడమటి దిక్కు నుంచి దక్షిణం వైపుకి బహుదా యాత్రకి అనుకూలంగా తిప్పుతారు. దీనిని దక్షిణ మోడా సేవ అంటారు.   సప్తమి రోజునుంచి మూడు రోజులు, రాసలీల జరుగుతుంది. జగన్నాధుని రసమండపానికి తీసుకొస్తారు. గీత గోవిందం నుంచి గీతాలు గానం చేస్తూ నాట్యం చేస్తారు దేవదాసీలు, గోపికల వలె అలంకరించుకుని.   కవిరాజవిరాజితం (హంసగీతి)              1.          మురళియె మోగెను మోదము కల్గగ                                  ముద్దుగ నర్తనముం సలిపే                         కురికొని వచ్చిరి కోరిక చెప్పిరి                                  గోపిక లందరు ఘోష్టిగనే                         గిరికొను చుండగ కేళినొనర్చగ                                  కీర్తనలూ సరి గీతములూ                         సిరులొలికించుచు చేరిరిగా మరి                                  సేవలు బాగుగ చేయగనే            2.          విరులను కూర్చిరి వేడుకగానదె                                  వెల్లువగా నిడె ప్రేమగనే                         హరి చిరునవ్వుతొ యానతి నిచ్చెను                                  నాటలకే సిరి హాసముతో                         మరులను గొల్పగ మానస మంతయు                                  మన్నన సేయగ మప్పిడెనే                          చరణము లన్నియు జాలము సేయగ                                  చక్కగ నాట్యము సల్పగనే.      మామూలుగా నిశ్శబ్దంగా ఉండే గుండీచా ఆలయంలో ఆ ఏడు రోజులూ శ్రవణాభరణంగా సాగుతుంటాయి గీత నర్తనాలు.     “జగన్నాధా.. పరాత్పరా, మనీమా..” భక్తులు పారశ్యంతో అరుస్తూ ఉండగా, మేళతాళాలతో మొదలయింది జగన్నాధ రథయాత్ర. ఆ రథాలను లాగడానికి పోటీపడి వస్తున్నారు భక్తులు. అరకోసు దూరం.. కానీ, ఒక రోజంతా పడుతుంది గుండీచా గుడికి చేరడానికి.   రాకుమారుడు కొద్దిదూరం రథం లాగి, పక్కకి తప్పుకున్నాడు. అతడి వెనుకే మాధవుడూ, మిగిలిన పరివారమూ. గుండీచా ఆలయానికి చేరాక, సాయం సంధ్యా పూజలకి వెళ్లి, మరునాడు తిరుగు ప్రయాణం చెయ్యాలని కార్యక్రమం నిర్ణయం జరిగింది. ఎక్కువ రోజులు రాజధానిని వదిలి ఉండరాదు. ఏ క్షణంలో ఏ పక్కనుంచి దాడి జరుగుతుందో చెప్పలేరు.. మహారాజు, మిగిలిన కుమారులు మూడు సరిహద్దులలోనూ దండయాత్రలు చేస్తున్నా కూడా!      సంధ్యా పూజలు పూర్తయాక రాకుమారుని వసతికి వచ్చాడు మాధవుడు.   “నీ పరివారంతో విశ్రాంతి తీసుకో మాధవా, సూర్యోదయాన్నే బయల్దేరదాం.”   “మీకు రక్షణ..”   “ఇక్కడి సైనికాధికారి చూస్తాడు. నమ్మకస్తుడే.”   “ప్రభూ! రాయబారి, మంత్రి వరదయ్య ఇక్కడి నుంచే తీర మార్గాన వెళ్లిపోతానంటున్నారు కాంచీపురానికి.”   “అదేమిటి? కొన్ని రోజులు మా ఆతిధ్యమో, లేదా బహుద యాత్ర (జగన్నాధుని తిరుగు ప్రయాణం) అయే వరకూ ఇచ్చటనో ఉంటారనుకున్నానే..” పురుషోత్తముడు ప్రశ్నార్ధకంగా చూశాడు.   “కాంచీపురం రాజు, వీరి రాకకై చూస్తుంటారు కదా దేవా! రాకుమారి కూడా..”   “అవునవును. వలసిన ఏర్పాట్లు చూడండి. దారిలో ఆహారానికి సమృద్ధిగా ఉండే టట్లు చూడండి.”   “రాజుగారికి ఏమయినా పత్రం రాసిద్దామా? అదే.. మన రథయాత్ర గురించి, అందులో రాచ కుటుంబం, రాజుగారు వహించే పాత్ర..” మాధవుడు అడిగాడు. అతనికి వరదయ్య అసంతృప్తత  తెలిసి పోయింది, అతడి హావభావాలతో..   “అక్కర లేదు. వారు దగ్గరుండి చూశారు కదా! మన భక్తి భావాలు జగద్విదితమే. ఆ పరాత్పరుని సేవలో మనకి కులమత భేదాలు లేవని తెలిసి పోతుంది బాగా. అంత కన్ననూ ఏం కావాలి ఎవరి కైనా!”   పురుషోత్తమ దేవునికి చాలా తృప్తిగా ఉంది, మహారాజుగారు తనచేత జగన్నాధుని సేవ చేయించి నందుకు. ఈ జన్మమునకు అవకాశం దొరుకుతుందనుకోలేదు, తనకి కళింగ సింహాసనం దక్కుతుందనికూడా ఎన్నడూ ఆశించ లేదు.. అంతమంది సోదరులుండగా. మహారాజుగారి మనోగతం అవగతమయింది కూడా మొన్న మొన్ననే కదా! వారు దండయాత్ర కెళ్లడం, తనకి జగన్నాధుని సేవ దొరకడం అదృష్టమే!   మాధవుడు కించిత్ ఆందోళనగా వెను తిరిగాడు.   రాకుమారుడు, కాంచీపురం రాజుకి పత్రం రాసిస్తే ఎంతో సౌకర్యంగా ఉండేది.. తన మనసుకి.   ఇప్పుడు ఈ వరదయ్య ఏం ప్రమాదం తెస్తాడో..   ఏదో అనిర్వచనీయమైన భావం అస్థిమితతకి లోనయ్యేలాగ చేస్తోంది మాధవుని.   పెను ముప్పు రానున్నదా? వేచి చూడవలసిందే!                                    ………………..   ......మంథా భానుమతి    

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 22వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 22వ భాగం          “అబ్బా! ఎంత సుందరంగా ఉందో జగన్నాధుని ఆలయం.” మాధవుడు గట్టిగా అరిచాడు. మేనా లోంచి గౌతమీ, సీతమ్మలు తొంగి చూశారు.   రాజుగారి పరివారంతో వెళ్తున్నారు నంద మహా పాత్రుని కుటుంబం. నంద, మాధవులు గుర్రాల మీద, గౌతమి, సీతమ్మలు మేనాలో. ఒక బిడారులా సాగుతున్నారు.   సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. కళింగదేశంలో ప్రతీ ఒక్కరికీ పూరీ జగన్నాధుని దర్శనం జీవితంలో ఒక్క సారైనా చేసుకోవాలనే కోరిక ఉంటుంది. సీతమ్మ వంటి వారికి అది తీరని కోరికే.   “మాధవుని ధర్మమా అని నా కన్నులు పుణ్యం చేసుకో బోతున్నాయి” కనిపించిన వారందరికీ చెప్పి మురిసిపోయింది.   నెమ్మదిగా సాగుతోంది ప్రయాణం. పది మందితో ప్రయాణం కద! ఆడవారు వృద్ధులు మేనాలలో, సైనికులు అశ్వాల మీద, రాకుమారుడు, బంధువులు, అంతఃపుర స్త్రీలతో రధాల మీది, నడవగలిగిన ప్రజలు కాలి నడకన వెడలుతున్నారు.   ఎంత ప్రయత్నించిననూ మహారాజు, ఇతర రాకుమారులూ రధయాత్ర సమయమునకు చేరుకో లేక పోయారు. ఉత్తరాన ముసల్మానులు, దక్షీణాన రెడ్డిరాజులు, పశ్చిమాన బహమనీ సుల్తానులు పోరు సల్పుతున్నారు.   రధయాత్రలో రాచ కుటుంబం, రాజుగారు చేయవలసిన సేవలన్నింటినీ పురుషోత్తమ రాకుమారుని చెయ్యవలసినదిగా ఆదేశం ఇచ్చారు కపిలేంద్రుడు.   “అయ్యవారూ! ఈ జగన్నాధ స్వామి, ఇక్కడ వెలిసిన స్థల పురాణం చెప్పరా? చాలా మందికి తెలియదు. కాలక్షేపంగా కూడా ఉంటుంది.” నందుడిని అడిగాడు రాచ పరివారంలోని ఒక సైనికుడు.   “అవునవును..” అందరూ ఏక కంఠంతో పలికారు.   నందుడు కొంచెం మొహమాటంగా నోరు విప్పాడు. అతడికి వివరాలు బాగా తెలుసును, కానీ ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. ఐతే, భక్తి భావంతో మొదలు పెట్టాడేమో, ధార అలవోకగా సాగి పోయింది.   “స్కంద పురాణంలో, పురుషోత్తమ మహాత్ముడు చెప్పిన వివరం ఇది. సత్య యుగంలో, ఈ ఆది దేవుడు, నీలమాధవుడనే పేరుతో అడవిలో ఆదివాసీల పూజలు అందుకుంటుండే వాడు.   ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాధుడిని, సవరులను పాలించే రాజు, విశ్వావసు ఎవరికీ తెలియకుండా వెళ్లి పూజలు చేసుకుని వస్తుండే వాడట.   ఆ సమయంలో, అవంతీ నగరం రాజధానిగా కళింగ నేలే చంద్రవంశ రాజు ఇంద్రద్యుమ్నుడికి, అడవిలో వెలిసిన నీల మాధవుని గురించి ఒక యాత్రికుడు చెప్పాడు. ఇంకా వివరాలు అడుగుదామంటే, ఆ యాత్రికుడు కనిపించకుండా మాయమయ్యాడు.   ఇంద్రద్యుమ్నుడు తన పురోహితుడైన విశ్వపతిని పిలిచి నీలమాధవుని ఆలయం దర్శించి, తెలుసుకుని రమ్మని పంపాడు.   విశ్వపతి మహానది ఒడ్డున ఉన్న సవరద్వీపవనం వెళ్లి విశ్వావసుని కలిశాడు. విశ్వావసు కుమార్తె లలితని వలచి వివాహం చేసుకున్నాడు.   ఒక రోజు మామగారిని, తనకి నీలమాధవుడిని చూపించమని అడిగాడు. అల్లుని మాట కాదనలేక, తన ఉనికిని రహస్యంగా ఉంచమన్న దేవుని ఆనతి ఉల్లంఘించలేక, విశ్వావసు, అల్లుని కళ్లకి గంతలు కట్టి తీసుకెళ్లాడు. విశ్వపతి తెలివిగా దారిలో ఆవాలు చల్లుకుంటూ వెళ్లాడు.   దైవదర్శనం అయాక, ఉపవాస దీక్ష తీసుకుని, రోహిణీ కుండంలో స్నానం చేసి కల్ప వృక్షం కింద కూర్చుని తపస్సు చేశాడు. అప్పుడతనికి ఒక అపురూప దృశ్యం కనిపించింది.                               సీ.  నింగినుండి విడియ నేలకొక వెలుగు                                     దివినుండి వచ్చిరి దివిజు లందు                  నారదాది మునులు నలువరాణి సిరియు                            పరమేశ్వరుడు బ్రహ్మ పార్వతియును                  ఇంద్రాది సురులును యీప్సితముల కోరి                            రంభాది యచ్చరల సహితముగ                  శ్వేతాంబరములను చిన్నిదపు నగల                            ధరియించి వచ్చిరి ధరకు నంత.                      భక్తినంత మదిని బాగుగా నిలిపియు                    వినయముగ శిరముల వెలది నుంచి                    నామము నిరతముగ నాలుక కదలాడ                    నీల మాధవుని యనిశము కొలువ.     ఆ దృశ్యం కనిన వెను వెంటనే విద్యాపతి అవంతీ నగరానికి వేగిరం వెళ్లి, ఇంద్రద్యుమ్నునికి నీలమాధవుని మహత్యమును వివరించాడు.   సంభ్రమాశ్చర్యములతో విద్యాపతి చెప్పింది విని, మరికొందరు పరివారం వెంటరాగా సవర వనానికి బయలుదేరాడు రాజు, దైవదర్శనానికై.   అతడికి మరింత ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది అంతలోనే..   గోప్యతా వాంఛితుడైన నీలమాధవుడు, విద్యాపతి అవంతికి పయనమవగానే మాయమయ్యాడు.                                    మొలిచిన ఆవ మొక్కల సహాయంతో త్రోవ చూసుకుంటూ ఆలయానికి రాగానే, విగ్రహాలు లేని గుడి కనిపించింది.   ఐతే ఆ తీరమంతా బంగరు ఇసుకతో కప్పబడి ఉంది.   ఇంద్రద్యుమ్నుడు నిరాశగా నిరాహార దీక్ష మొదలుపెట్టి, అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద గుడి కట్టించి నరసింహ స్వామిని ప్రతిష్ట చేస్తాడు.   ఆలయంలోనే నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి సముద్ర తీరానికి వెళ్లమని ఆదేశిస్తాడు. చాంకీనది ముఖద్వారం దరికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ, వాటితో, జగన్నాదుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శన చక్ర విగ్రహాలను తయారు చేసి ప్రతిష్టించమని చెప్తాడు.   దుంగలైతే కొట్టుకొచ్చాయి కానీ, వాటిని విగ్రహాలుగా చెక్కే వాళ్లు కనిపించలేదు.   రాజ్యంలోని శిల్పులని అందరినీ పిలిపించాడు రాజు. ఎవరికి వారే మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పుకున్నారు.   కలతతో ఆ మారాజు, మాధవుడినే స్మరిస్తూ ధ్యానం లోనికి వెళ్లాడు. కళ్ల ముదు నారాయణుడు ప్రత్యక్షమై యజ్ఞం నిర్వహించమని చెప్పాడు.   ఇంద్రద్యుమ్న మహారాజు, దేశంలోని ఋత్విక్కులను ఆహ్వానించి అద్భుతమైన యజ్ఞం చేశాడు.   శాస్త్రోక్తంగా జరిగిన ఆ యజ్ఞానికి దేవతలందరూ సంతోషించారు.   యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవునిలాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమాయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శనం వలె నిర్మించమన్నాడు.     ఆ నిర్మాణానికి శిల్పి త్వరలో రాగలడని చెప్పాడు.                   కం.   సాక్షాత్తు సుర స్థపతియె                         యీక్షేత్రము న యడుగిడగ నేమర రాడా                         వీక్షా సారించి మరీ                         మాక్షీకముగ విగ్రహముల మలచుట కొరకై.     యజ్ఞనరసింహరాజు చెప్పినట్లే దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ బ్రాహ్మణుని వలె ఇంద్రద్యుమ్నుని వద్దకు వచ్చి తాను విగ్రహాలను చెక్కగలనని అన్నాడు.   కానీ కొన్ని షరతులు విధించాడు.   తాను ఒక్కడే ఏకాంతంలో పనిచేసుకుంటానన్నాడు.  ఎట్టి పరిస్థితులలోనూ, ఎవరూ తలుపులు తీసి లోపలికి రాకూడదన్నాడు.   ఆహారాది విషయాలకి కూడా తన వద్దకు రావద్దన్నాడు.   అన్నింటికీ ఒప్పుకుని రాజు, ఆ చిత్రకారునికి పని ఇచ్చాడు. ఆలయం లోపలికి వెళ్లి తలుపులు బంధించమన్నాడతడు.   ప్రజలతో సహా, రాచ పరివార మంతా కుతూహలంగా ద్వారాల వెలుపల వేచి చూస్తున్నారు. అప్పుడప్పుడు రాజు కూడా, రాణీ తో సహా వచ్చి చూస్తున్నాడు.   కొన్ని రోజులు లోపలి నుంచి శబ్దాలు వినిపించాయి.   తరువాత ఆ శబ్దాలు ఆగిపోయాయి. అందరూ ఆందోళనగా, ప్రాకారం బైట నిలబడి వేచి ఉన్నారు.   మరి కొన్ని రోజులు గడిచాయి.   రాజుగారు, రాణీగారు వచ్చి సంగతి విచారించారు.   “ప్రభూ! ఆ శిల్పికి లోపల ఏదయినా అస్వస్థత కలిగిందంటే.. లేదా ప్రాణాపాయం కలిగినా, ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. శిల్పాలు చెక్కుతుంటే శబ్దం రావాలి కదా?” రాణీగారి మాట విని రాజుకూడా వ్యాకులత చెంది. తలుపులు తెరవమని ఆజ్ఞాపించాడు.   తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించగానే ఎదురు పడ్డ దృశ్యం రాజుని, రాణీని కలవర పరచింది.   తన షరతుని అతిక్రమించిన ఇంద్రద్యుమ్నునికి కనిపించడం ఇష్టం లేక విశ్వకర్మ మాయమయ్యాడు. జగన్నాధ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు, చేతులు, కాళ్లు లేకుండా ఉండి పోయాయి.   వ్యాకులతతో వెనుతిరిగిన రాజుని, కలలో జగన్నాధుడే ఓదార్చి, అదే ఆకారములతో ఈ ఆలయంలో ఉండదలచుకున్నానని చెప్పాడు.   “రాజా! అందుకనే శిల్పాలు ఆ స్థితిలో ఉండగా మిమ్మల్ని తలుపులు తెరిచేట్లు ప్రేరేపించాను. ఇదంతా నా సంకల్పమే. నువ్వు కలత చెందవద్దు. ఈ విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు సలుపు?”   ఇంద్రద్యుమ్న మహారాజు, అవే విగ్రహాలని ప్రతిష్టించాడు. పూరీ జగన్నాధ ఆలయం ఆ విధంగా ప్రసిద్ధి చెంది భక్తుల సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది.”   నందుడు పూరీ ఆలయం గురించి వివరించగానే అందరి మనసుల్లోనూ భక్తి పెల్లుబికింది. ఉత్సాహంతో, ఎప్పడెప్పుడు జగన్నాధుని చూద్దామా అని ముందుకు నడవసాగారు.. ఆ స్వామిని మనసారా కొలుస్తూ.. పాటలు పాడుతూ.                      కవిరాజవిరాజితము:                 1.    పదపద ముందుకు పాటలు పాడుచు                            పాదము లన్నియు బాగుగనే                  తదిగిణ తోం తకతాం తకతోం యని                            తప్పెట తాళము దంచగనే                  ముదముగ నెంతను మోకరిలంగను                            ముచ్చట గొల్పగ మోదమునే                  సదమలమౌ మన సామిని కొల్వగ                            సామముగా చన సారమునే           2.    మది తలచేముగ మాదొరనే మరి                            మాటికి నామము మాధవునే                  కదడుకొనంగను కాలిడి సాగగ                            ఖంగు మనే తమ గజ్జెలనే                  వదలకనే నడవంగ మనం మధు                            పమ్ముల సవ్వడి వాడిగనే                  కదలెదమే మరి గట్టిగ సేయగ                            గానము నంతను ఖాసమునే||     ముందుగా నడుస్తున్న వారిలో ఒకతను పెద్దగా పాడడం మొదలుపెట్టాడు.   ఎక్కడి నుంచి తీశారో.. డప్పులు, బూరాలు చేతుల్లోకి వచ్చేశాయి. ఒక చరణం సూత్రధారి పాడగానే మిగిలిన వారు అదే అందుకుని పాడుతున్నారు.   రథయాత్రకై, కటకం నుంచి పూరీ వరకూ రాచ పరివారం యాత్ర సాగింది.      మాధవుడు, పురుషోత్తమదేవుని రథం పక్కగా గుర్రాన్నినడిపిస్తున్నాడు.   పూరీ నగరం దగ్గర పడుతోందనగా, రథం ఆపి, మాధవుని తన రధం మీదకి ఎక్కంచుకున్నాడు రాకుమారుడు. మాధవుని గుర్రాన్ని, కాలినడకనున్న ఒక సైనికుడు అందుకున్నాడు.   “మాధవా! కాంచీపురం నుండి రాయబారి వస్తున్నాడు కదా?”   “అవును ప్రభూ! వారి మంత్రులలో ఒకరు వచ్చి ఉంటారు. వారికి సరైన వసతి గృహం ఏర్పాటు చెయ్యమని చెప్పాము.”   “ఈ కోలాహలంలో వారికి సరైన మర్యాద జరుగక పోవచ్చును. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సుమా!”   “అలాగే దేవా! నేను స్వయంగా ఆ ఏర్పాట్లు చూస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి.” ముందు రథం మీదనున్న కాదంబరీ దేవిని ఓరకంట చూస్తూ అన్నాడు మాధవుడు.   “ఈ రథయాత్ర మనిద్దరికీ ఒక పరీక్షయే. ఫలితాలు ఎవ్విధంగా ఉంటాయో వేచి చూడ వలసినదే!” సాలోచనగా అన్నాడు పురుషోత్తముడు.                                        ……………….   ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 21వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 21వ భాగం  “రాకుమారా! నేను మంత్రినా?”   “అవును మాధవా! మంత్రివవకూడదా? ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన ఒక బృహత్ కార్యం ఉంది. పద్మావతీ దేవికి నేను మాట ఇచ్చాను. మా ఇద్దరి కళ్యాణం తప్పక జరుగుతుందని. ఆ వాగ్దానం నెరవేర్చ వలసిన బాధ్యత నీదే. ఏ రీతిగా చేస్తావో మరి.”   నది ఒడ్డున కలిసిన రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాడు పురుషోత్తముడు. త్వరలో రాయబారిని పంపి రాజుగారితో విషయం చెప్తానని మాట ఇచ్చాడు.   తన తండ్రికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని చెప్పింది పద్మావతీ దేవి.   “కాంచీపురం రాజుగారి వద్దకు కళింగ రాయబారిగా వెళ్లాలి. మా కళ్యాణం జరిపించాలి.”   ఇరవై సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండలేదు. లౌక్య సంభాషణ రాదు. అందునా రాజుగారి వద్దకు..   “రాకుమారా! నేనేమిటి.. రాయబారం ఏమిటి? నా కసలు సరిగ్గా మాటలాడడం రాదు. ఏదో మా పూటకూళ్ల ఇంటికి వచ్చినవాళ్లతో నాలుగు కబుర్లు చెప్పడం తప్ప.” మాధవుడు బెదురు కన్నులతో అటునిటు చూస్తూ అన్నాడు.   ముద్దుమోముతో ముచ్చటగా కనిపించాడు మాధవుడు. తనకి ఒక అనుజుడుంటే ఈ బాలుని వలెనే ఉండే వాడేమో! కానీ తప్పదు. రాజుగారి వద్దకు పంపాలిసిందే. పురుషోత్తముడు తప్పదన్నట్లు తల నిలువుగా ఊపాడు.   మాధవునికి ఒకింత ఉత్సాహము, ఒకింత సందేహము..   అందుకే అన్నాడు..                    కం.  “ఆనతి మీరను సాధ్యమ                           యేను హితుడ నదియు కాక భృత్యుడ గాదా                           కానగ కళ్యాణమునకు                           నేను ప్రయత్నము సలిపెద నిక్కము మిత్రమా!”       “రేపే వారి సభలోనికి అనుమతి సంపాదించెదము.”  చిరునవ్వుతో అన్నాడు పురుషోత్తముడు.   వారితో వచ్చిన అనుచరులిరువురికి ఆపని అప్పజెప్పి, స్నేహితులిద్దరూ, తమతమ అశ్వాల మీద కాంచీపురం అందాలు చూడడానికి బయలుదేరారు. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం పల్లవరాజులు తమ రాజధానిని చేసుకుని, అనేక ఆలయాలు నిర్మించిన పట్టణం.   విద్యా బోధనలో, విద్వాంసులను తయారు చెయ్యడంలో కాశీ పట్టణమంత ప్రాముఖ్యతను పొందింది.   ఏకాంబరేశ్వరుని ఆలయంలో గాలిగోపురం, వెయ్యి స్తంభాల మండపం నిర్మితమౌతున్నాయి. విజయనగరరాజుల సామంతులు కూడా ఆలయనిర్మాణాల మీద శ్రద్ధ వహిస్తున్నారు.   కామాక్షీ దేవి కంచిని కాపాడుతూ ఉంటుందని అంటారు. అందుకే పల్లవులనుంచి, చోళులకి, చోళుల నుంచి రాయలుకీ రాజ్యం మారినా, ఆలయాలు చెక్కు చెదరలేదు.             అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా           పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా!    భారత దేశంలోని సప్త మోక్షపురులలో కంచి ఒకటి. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం.  మాధవ, పురుషోత్తములు ఆలయాలను దర్శించుకుని, తమ వసతిగృహానికి చేరుకున్నారు.   భోజనానంతరం, రాజ్య సభలో వినిపించవలసిన వివరాలను పత్రం మీద రాసుకుని, విశ్రాంతి కుపక్రమించారు.                                         ……………….     “రాకుమారా! ఉద్యానవనమునకా? సాయం సంధ్య వీక్షణకా?” అశ్వాలనెక్కుతూ అడిగాడు మాధవుడు.   “రెంటికీ..”   “రాకుమారి వస్తున్నారా?”   చిరునవ్వే సమాధానమయింది.   “కొద్ది పరిచయంలోనే సన్నిహితులైనట్లున్నారే.. నేను మీ వద్దనే ఉండాలి మరి. రక్షకునిగా. చెవులు మూసుకుని కన్నులు బాగుగా తెరుస్తా.” మేలమాడాడు మాధవుడు.   మాటల్లోనే ఉద్యానవనం వద్దకు చేరారు.   రాకుమారి, చెలికత్తెలు వటవృక్షం కింద ఆసనాల వలే పేర్చిన రాళ్ల మీద కూర్చున్ని ఉన్నారప్పటికే.   ఆకుపచ్చని చీని చీనాంబరాలలో వనలక్ష్మివలే మెరిసిపోతోంది రాకుమారి.   పురుషోత్తమదేవుని రాక చూసి, చెలికత్తెలు తప్పుకున్నారు పక్కకి. పద్మావతీదేవి, లేచి నిలుచుని అభివాదం చేసింది. మాధవుడు, రాకుమారుడు కనిపించేటట్లుగా కొద్ది దూరంలో అప్రమత్తుడై నిలుచున్నాడు.   పురుషోత్తముడు తన ఆలోచనని పద్మావతికి చెప్పాడు.   “మీ తండ్రిగారే మందురో చూసి, మేము ఎల్లుండి తిరుగు ప్రయాణం సాగించెదము.”   “మరి నా మాటేమిటి రాకుమారా” వణుకుతున్న కంఠంతో అడిగింది పద్మావతి.   “రాజుగారి స్పందన మీద ఆధారపడి ఉంది. వారు సరేనంటే పెళ్లి వారమై వస్తాము. మిమ్మల్ని తోడ్కొని వెళ్తాము.”   “కాదంటే..” రాకుమారి కన్నుల నిండా నీరు..   “సమరమే!”   “వద్దు రాకుమారా! నన్నొక్కదాన్నీ తీసుకెళ్లండి. సమరమంటే మళ్లీ జన నష్టం.. ఇక్కట్లు. శ్రీకృష్ణుల వారివలే తీసుకెళ్లండి. ఎవరేనా అడ్డు వస్తే వారితో యుద్ధం..” సిగ్గుపడి ఆపేసింది పద్మావతి, పురుషోత్తముని అనురాగపు చూపుల కని.   “అటులనే.. దేవిగారి ఆనతి”                                  …………………                            “రాకుమారా! మన కర్తవ్యం?” మాధవుని వంక సాలోచనగా చూశాడు పురుషోత్తముడు.   “రాజుగారి రాయబారిని ఆహ్వానిద్దాము. పత్రం రాశాను. మన అనుచరుని చేత పంపుదాము.”   మాధవుడు, పురుషోత్తమ దేవుడు తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందు రోజు, రాజ్య సభలో మాధవుడు, పురుషోత్తముని గురించి చెప్పి, రాకుమారి పద్మావతికి తగిన వరుడని వివరించి, వివాహమునకు అంగీకరించ వలసినదిగా కోరాడు.   పురుషోత్తమదేవుని ప్రతిభ గురించి విని ఉన్న రాజు అంగీకారం తెలిపే లోపుగానే, మంత్రి సమూహంలోని ఒక మంత్రి లేచాడు..   జరగబోయే సంఘటనలకి.. అవి మంచి అవనీ, చెడు అవనీ, ఎవరో ఒకరే కారణ భూతులవుతారు. దాని ఫలితం అనేక మంది అనుభవిస్తారు. రావణాసురిడి వధకి, లంక నాశనానికీ శూర్ఫణఖ లాగా.   “రాజా! వినికిడి మాటలని బట్టి కన్యని ఇచ్చుట అంత సమంజసనీయం కాదు. మనలో ఎవరైనా కళింగదేశం వెళ్లి, అక్కడి స్థితి గతులని చూసి నిర్ణయించాలి. వివాహముల యందు తొందరపాటు పనికిరాదు.”   రాజుకి ఆ సలహా నచ్చింది.   “సరే మంత్రి వర్యా! ఈ మాటే వారికి అందజేయండి. కపిలేంద్ర దేవులు ఆహ్వానం పంపుతే, మీరే వెళ్లి రండి. ఆ పిదపనే వివాహం చేద్దాము.”   సభలో జరిగినదంతా మాధవుడు పురుషోత్తమునికి చెప్పాడు. ఆ సమయానికి.. చెప్పినప్పుడు  కిమ్మనకుండా, ప్రయాణమౌతున్న రాకుమారుని చూసి ఆ ప్రశ్న అడిగాడు మాధవుడు.   “ఐతే. జగన్నాధుని ఉత్సవాలప్పుడు రమ్మందాము రాకుమారా! అప్పుడు మన వైభవం కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది.” అనాలోచితంగా, అడక్కుండా సలహా ఇచ్చాడు మాధవుడు.   పురుషోత్తమునికి మంచి సలహా వలెనే అనిపించింది. తన పత్రంలో ఆ సంగతి కలిపి, అనుచరునికి ఇచ్చి, మహారాజుకి అందజేసి రమ్మని ముందుకు కదిలాడు, మాధవునితో.   తిరుగు ప్రయాణంలో అతి తక్కువ మజిలీలతో, వారంరోజుల లోగానే చేరుకున్నారు కటకం. చేరిన వెంటనే జగన్నాధుని రథయాత్ర ఉత్సవాలకి సన్నాహాలు మొదలయ్యాయి.   కపిలేంద్ర దేవుని ఆనందానికి హద్దుల్లేవు.   అనుకున్న విధంగా కాంచీపుర రాజుతో సంబంధం కలుస్తోంది. విజయనగర దేవరాయల్ని ఓడించడానికి, రాజ్యం ఆక్రమించడానికి చిన్నదైనా అవకాశం దొరుకుతుంది.      “ఈ జగన్నాధుని రధయాత్ర ప్రాముఖ్యమేమిటి తండ్రీ? ఈ సారి రాకుమారినితో నేను కూడా వెళ్తున్నాను పూరీ.”   “పూరీ జగన్నాధుని ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను, తొమ్మిది రోజులు గుండీచా ఆలయానికి ఆ తరువాత మౌసీమా దగ్గరకి, తీసుకెళ్తారు, మూడు రధాల్లో. ఈ రధాలను భక్తులు లాగుతారు. రధం లాగడం ప్రధాన సేవ కింద.. అది లాగడం అదృష్టం అన్నట్లు భావిస్తారు. ఆ భక్తులని జగన్నాధుడు కరుణతో చూస్తాడని నమ్మకం.   ఏ ఆలయం లో నైనా మూల విరాట్టుల విగ్రహాలు రాతితో చేస్తారు. జగన్నాధుని ఆలయంలో చెక్కతో చేసి ఉంటాయి. విష్ణుమూర్తి పక్కన అన్ని ఆలయాల లో  శ్రీదేవి, భూదేవి ఉంటారు. కానీ ఆది విష్ణువు ఇక్కడ కృష్ణుడై, బలరామ, సుభద్రలతో కొలువై ఉన్నాడు.ఆ విగ్రహాలను స్వయంగా విశ్వకర్మే చెక్కాడట.   ఈ గుడిలో సుదర్శన చక్రాన్ని పూజించడం మరొక ప్రత్యేకత.                                                                         అన్నా చెల్లెలి బంధం                                 కన్నార కనగ బలభద్ర కన్నయ్య లనూ                                 చెన్నారు సుభద్ర నడుమను                                 పొన్నారిగ విశ్వకర్మ పొడమెను బాగా.           జగన్నాధుని గురించి వేదాలలో చెప్పలేదంటారు. దశావతారాలలో చేర్చ లేదు. అవతారాల అవతరణకే కారణ భూతుడని అంటారు. కానీ.. కొన్ని ఒరియా గ్రంధాలలో తొమ్మిదవ అవతారం కింద వర్ణించారు. అందుకనే నేమో.. బౌద్ధులు కూడా జగన్నాధుని కొలుస్తారు. హిందూ విధి విధానుసరణ ప్రకారం పూజలు కూడా జరగవు. బ్రాహ్మణేతరులు పూజలు నిర్వహిస్తారు. కొందరు ఆదివాసీల ఆరాధ్య దైవమని కూడా  చెప్తారు.   విగ్రహాలు రత్న వేదిక మీద వెలసి ఉంటాయి. ఆ మూర్తులని ఆరడుగుల వేప కొయ్యలతో చేశారు. చతురశ్రాకారంలో ఉన్న మోములు, త్రికోణాకారపు తల. పెద్ద కన్నులు. జగన్నాధుని మోము నలుపు, బలభద్రుడు తెలుపు, సుభద్ర పసుపు పచ్చ రంగుల్లో ఉంటారు.”   మాధవుడు అడిగిన ప్రశ్నకి నందుడు సమాధానం చెప్పాడు.   “శిలలతో చేసినవి, లోహంతో చేసినవి చూశాం కానీ కొయ్య విగ్రహాలని ఆలయాలలో ఎక్కడా చూసినట్లు లేదు కదా నాయనగారూ?”   “అవును. అడవులలో కోయదొరలు పెద్ద పెద్ద విగ్రహాలను చేసి వాళ్ల గూడేల మధ్యలో పెట్టుకుని పాటలు, నృత్యాలతో పూజిస్తారని విన్నాం. కానీ నాగరిక పట్టణాలలో పూరీ ఆలయమే ప్రసిద్ధమయింది.. ఇటువంటి ఆగమ శాస్త్రంతో.”   “ఏది ఏమైనా కళింగ ప్రజల ఆరాధ్య దైవం పూరీ జగన్నాధుడు. రాజుగారితో రధయాత్రకు వెళ్లబోతున్నావు. ఎంతటి అదృష్టమో కన్నయ్యా!” సీతమ్మ మురిసిపోతూ అంది.   “మనం అందరం వెళ్దాం అమ్మమ్మా! రాకుమారుడిని అనుమతి అడుగుతాను. రెండు రోజులు వసతి గృహానికి సెలవు ప్రకటిద్దాము.”   “సెలవు అవసరం లేదు. సంభారాలు బయట పెట్టి సేవకులని చూసుకోమందాము. గత కొన్ని సంవత్సరాలుగా వారికి నేర్పించాము కదా!” నందుడు ఉత్సాహంగా అన్నాడు. రాజుగారి పరివారంతో రధ యాత్రకి అంటే.. మాటలా మరి..                                          ……………….     ......మంథా భానుమతి