తుది అంకానికి కర్నాటకం...ప్రభుత్వ మార్పు తప్పదా ?
posted on Jul 9, 2019 9:51AM

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు గంటగంటకూ మారుతున్నాయి. బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ముందు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ, శాసనసభాపక్ష సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్, కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కుమారస్వామి రాజీనామాను ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక కర్ణాటక మాజీ ముుఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యలు చూస్తోంటే కర్ణాటక రాజకీయం తుది అంకానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. తన చేతిలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు గవర్నర్ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తామని లేఖలు ఇచ్చారని, దీంతో తమ బలం 107కు చేరుకుందని పేర్కోన్నారు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దామని సవాల్ విసిరినట్టుగా వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, సమస్య పరిష్కారమైందని, ఇక చింతించాల్సిన పనిలేదని, ప్రభుత్వం సాఫీగా సాగిపోతుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన కాసేపటికే యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కుప్పకూలచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ నేడు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. రాజీనామాలు సరైన ఫార్మాట్లో ఇవ్వలేదని భావిస్తే విచారణను వాయిదా వేసే అవకాశం ఉంది.