అనంత జిల్లాలో డబుల్ మర్డర్.. మళ్లీ ఫ్యాక్షన్ పడగలో సీమ? 

మొన్న కడప... నిన్న కర్నూల్.. ఇవాళ అనంతపురం జిల్లా... రాయలసీమలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. మూడు జిల్లాల్లో ఆరుగురు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ మళ్లీ పడగ విప్పిందా అన్న ఆందోళన నెలకొంది.అనంతపురం జిల్లాలో మరోసారి వర్గ కక్షలు భగ్గుమన్నాయి.  శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు. భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్, నారాయణప్పలను దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.

దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా సమయం కోసం ఎదురు చూస్తున్న  ప్రత్యర్థులు మాటు వేసి ఇద్దరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు.జంట హత్యలతో గ్రామంలో పరిస్థితి నివురు గప్పినా నిప్పులా మారింది.  పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డిని ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం దారుణంగా చంపేశారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌విత్‌ 149) కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే కడప జిల్లాలోనూ ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు.