వైఎస్ జగన్ కాన్వాయ్ కు అడ్డుపడిన మహిళ
posted on May 29, 2019 12:44PM

వైసీపీ అధినేత, కాబోయే సీఎం జగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద జగన్ కాన్వాయ్కు ఓ మహిళ అడ్డుపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్ వాహనం ఆపి వెంటనే ఆమెను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి.. ఆమెకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.
