ఠాక్రే కుటుంబ రాజకీయం... ఉద్ధవ్ ఠాక్రే ప్రస్థానం

 

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తిగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చరిత్రకెక్కనున్నారు. నిజానికి బాల్ ఠాక్రే కాని.. ఆయన తమ్ముడు కొడుకు రాజ్ ఠాక్రే కానీ.. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు శివసేన నేతలైన మనోహర్ జోషి, నారాయణ్ రాణె సీఎంలు అయ్యారు. ఇప్పటి వరకూ ఉద్ధవ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి పోటీ చేసి గెలిచి ఠాక్రే కుటుంబం నుంచి చట్ట సభలో అడుగు పెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్ రానున్న 6 నెలల్లో అసెంబ్లీకి కానీ, శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంది. తండ్రి కోసం వర్లీ స్థానాన్ని వదులుకునేందుకు ఆదిత్య సిద్ధంగా ఉన్నారు. 

మహారాష్ట్ర అధికార పీఠం ఉద్ధవ్ ఠాక్రే కు రాత్రికి రాత్రి సంక్రమించింది కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల తెర వెనుక కృషి ఫలితమిది. తండ్రి బాల్ ఠాక్రే మాదిరిగా ఆయన దూకుడు స్వభావం వున్న వ్యక్తి కాదు. మృదుస్వభావి, మితభాషి, మౌనంగానే పనులు చక్కబెట్టే నేర్పరి. అతివాద హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉన్న శివసేనను.. వ్యవస్థాగత రాజకీయ పార్టీగా కొంత మితవాదంగా మార్చిన ఘనత ఉద్ధవ్ కే దక్కింది. అసలు బాల్ ఠాక్రే కు ఈయన రాజకీయ వారసుడు కాదని అంత చాలా యేళ్ళ పాటు భావించారు. రాజ్ ఠాక్రే తదుపరి నేత అని అనుకున్నారు. కానీ ఉద్ధవ్ చాప కింద నీరులా విస్తరించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు ఉన్న దూకుడు.. జగడాల మారితనం, వివిధ వర్గాల వారితో విరోధం మొదలైన వాటిని తన ఎదుగుదలలో కూడా వాడుకున్నారు ఉద్దవ్. 1985 బృహన్ ముంబై ఎన్నికల్లో శివసేన విజయంలో కీలక పాత్ర పోషించారు. 1990,2005 మధ్య రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డంకిగా నిలిచిన రాజ్ ఠాక్రే, నారాయణ రాణేలను వ్యూహాత్మకంగా దెబ్బ తీశారు. 2002 లో బీఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో శివసేన విజయ ఢంకా మోగించినట్లు చెయ్యగలిగారు. దాంతో 2003 లో బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2004 లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. 

2014 ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ నేతృత్వంలో స్వతంత్రంగా పోటీ చేసింది. 63 స్థానాల్లో నెగ్గి బిజెపి అనివార్యంగా తన మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఉద్ధవ్ ఠాక్రే ముద్దుపేరు డింగా జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్డ్ లో గ్రాడ్యుయేషన్ చదివారు. తండ్రి మాదిరిగానే కార్టూనిస్ట్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా పేరు. వాటిని ప్రతి ఏటా ముంబైలో ప్రదర్శిస్తారు. 1986 లో స్నేహితులతో కలిసి యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ఠాక్రే 1989 లో రాజకీయ పత్రిక సామ్నా ప్రారంభంలో కీలక భూమిక పోషించారు. రాజకీయ మెళకువలు తెలిసిన రశ్మిని వివాహం చేసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఇద్దరు కుమారులు ఆదిత్య, తేజాస్.