తాజా రాజకీయాలపై హరీష్ రావు స్పందన

 

ముందస్తుతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తెరాస, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తెరాస సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేయడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెరాసకు 100 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కూటమిలు కట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కోతలు, ఎరువుల కొరత తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గెలవమని తెలిసి ఆపద మొక్కులు మొక్కుతున్నారని అన్నారు. ఓడిపోయే నాయకులే మాటలెక్కువ మాట్లాడుతారని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గం.. దేశానికే రోల్ మోడల్ అవుతుందని అన్నారు. కేసీఆర్ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటూ కొనియాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశామని హరీష్‌‌రావు అన్నారు. మరి హరీష్ రావు 100 సీట్ల ధీమా నిజమవుతుందో లేదో చూడాలి.