కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. కారును లాక్కెళ్లిన రైలు

కడప జిల్లాలో కారును రైలు లాక్కెళ్లిన ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వైకోడూరు దగ్గర చోటుచేసుకుంది. వైకోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్‌కు వెళ్లే రైల్వే ట్రాకులో ఎల్సీ 3 వద్ద ఓ కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్‌ మధ్యలో ఆగిపోయింది. అదే సమయంలో, భారతీ సిమెంట్స్ నుంచి రెండు రైలింజన్లు వస్తున్నాయి. దీంతో కారును రైలు 200 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని.. తీవ్ర గాయాలైన వారిని సమీపంలోని ప్రొద్దుటూరు ఆస్పత్రి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. రైలు కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో రావడంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయిందని, లేదంటే ఇంకా ఎక్కువగా దెబ్బతినేదని, స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందేవారని తెలుస్తోంది. కాగా, కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. మరోవైపు, రైల్వే క్రాస్‌కు ఎవరూ కాపలా లేకపోవడంతో.. రైళ్లు రావనుకుని ముందుకి వెళ్లుంటారని అనుమానిస్తున్నారు.