ఈనెల 7న ఆర్టీసీ సమ్మె.. జేఏసీ నిరసన కవాతు
posted on May 5, 2025 6:05PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోంది. ఈనెల 7 నుంచి సమ్మె నేపధ్యంలో భారీ ఎత్తున కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న వాపోయారు.
సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్ భవన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.