కడపలో మహానాడు.. పట్టు నిలుపుకోవడానికి టీడీపీ స్కెచ్

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని  కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడదే జిల్లాలో లోకేశ్ కనుసన్నల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 కడప జిల్లా రాజకీయాలంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు… అక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే… గడిచిన పాతికేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నామ మాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు.  ఇక 2019కి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ.  కానీ… ఆ తరువాత మాత్రం సీన్‌ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పుంజుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. 

కడప జిల్లాలో టిడిపి ఐదు,  బిజెపి ఒకటి, జనసేన ఒకటి చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మొట్ట మొదటిసారిగా జిల్లాలో బిజెపి, జనసేన బోణీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని,  ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారంట. అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో  నిర్వహించాలని నిర్ణయించారు. 

 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలోమహానాడు నిర్వహించడమే  కాకుండా… వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించడం వెనక రీజన్‌ ఇదేనని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో… స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి. 

కేడర్లో కూడా జోష్ నింపడానికి  కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. ఇప్పటికే వైసిపి అడ్డాలో పాగా వేసిన తెలుగుదేశం… మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసిపికి బిగ్ షాక్ ఇవ్వడంతోపాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టిడిపి ధ్యేయంగా చెప్పుకుంటున్నారు.