ఇవాంకా ట్రంప్ కు కేసీఆర్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల 28న హైదరాబాద్ కు రానున్న సంగతి తెలిసిందే. హైదరాబాదు వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకుగాను ఈమె రానున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు హైదరాబాద్ కు రానున్న ఇవాంకాకు కేసీఆర్ ఏం బహుమతి ఇవ్వనున్నారబ్బా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ఉన్న పాత సంప్రదాయానికి సరికొత్త హంగులు అద్దనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా... గతంలో విదేశీ ప్రముఖులు హైదరాబాదుకు వచ్చినప్పుడు వారికి గత ముఖ్యమంత్రులు జ్ఞాపికగా చార్మినార్ ప్రతిమను అందజేసేవారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల హయాంలో బిల్ క్లింటన్, జార్జ్‌ బుష్ లు హైదరాబాదు పర్యటనకు రాగా, వారికి చార్మినార్ మెమొంటోను అందజేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇవాంకాకు చార్మినార్ మెమొంటోనే అందిచనున్నారు. దానితో పాటు హైదరాబాద్ స్వర్ణకారులు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు నగలు, గద్వాల, సిరిసిల్ల నేతన్నలు ప్రత్యేకంగా రూపొందించిన చేనేత చీరలను కూడా ఇవాంకాకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. గోల్కొండ కోటలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందు సందర్భంగా ఇవాంకాకు కేసీఆర్ ఈ గిఫ్ట్ బాక్సును అందజేస్తారట.