పాట పాడిన ఎంపీ...రాజ్యసభ లో చర్చ వాయిదా.!!
posted on Jul 23, 2018 2:14PM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ మరోసారి తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య వేషంలో పార్లమెంటు ఆవరణలో కనిపించిన ఆయన తిరుమలేశుని సాక్షిగా ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
’అదిగో అల్లదిగో పార్లమెంటు భవనం...మోసాల దిగ్గజం మోదీ ఉన్న స్థలమూ...అదిగో అల్లదిగో’ అంటూ పాటపాడుతూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు.రెండు రోజుల విరామం తర్వాత పార్లమంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి.లోక్సభ ప్రారంభమయ్యాక సభలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు టీడీపీ ఎంపీలు.ప్లకార్డులు పట్టుకుని తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తంచేస్తున్నారు.రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. అయితే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని, ఈ తీర్మానంపై రేపు చర్చ జరుపుతామని వెల్లడించారు.దీంతో రాజ్యసభలో విభజన సమస్యలపై చర్చ రేపటికి వాయిదా పడింది.