బాలయ్య ‘నో ఛాన్స్‌’ అన్నాడు.. అతని అభిమాని మాత్రం ‘వెల్‌కమ్‌’ చెప్పాడు!

శ్రద్ధా శ్రీనాథ్‌.. కాశ్మీర్‌లో పుట్టిన కన్నడ భామ. 2015లో ఓ మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమెకు ‘యు టర్న్‌’ చిత్రం మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్‌, మలయాళ, కన్నడ సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రం నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. వెంకటేష్‌తో చేసిన ‘సైంధవ్‌’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయి డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ తెలుగులో ఛాన్స్‌ రాలేదు. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో, ఓ తమిళ్‌ సినిమాలో నటిస్తోంది. ఆమధ్య నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రద్ధ నటిస్తోందన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

నందమూరి బాలకృష్ణ అంటే మాస్‌ యాక్షన్‌ హీరో. అతని పక్కన హీరోయిన్‌గా శ్రద్ధ సూట్‌ అవుతుందా అనే సందేహం అందరికీ వచ్చింది. ఆమె అప్పియరెన్స్‌ గురించి అందరూ డిస్కస్‌ చేసుకున్నారు. ఫైనల్‌గా ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారు. తమ సినిమాలో అవకాశం లేదని సున్నితంగా చెప్పి పంపించారట. ఇక్కడ వినిపిస్తున్న మరో మాట ఏమిటంటే.. ఆమెతో కొన్ని షాట్స్‌ తీసిన తర్వాత సూట్‌ అవ్వక రిజెక్ట్‌ చేశారని చెప్పుకుంటున్నారు. ఇది బాలయ్య, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన విషయం. ఆమె స్థానంలో ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. 

ఈ విషయం జరిగిన కొన్ని రోజులకే మరో సినిమాలో శ్రద్ధకు అవకాశం వచ్చింది. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లకు హీరో విశ్వక్‌సేన్‌ అభిమాని. అంతేకాదు, వారితో సన్నిహితంగా మెలిగేంత చనువు అతనికి ఉంది. అతను హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రద్ధ సెలెక్ట్‌ అయిందట. ఆ సినిమా పేరు మెకానిక్‌ రాకీ. వాస్తవానికి ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌. మరో హీరోయిన్‌గా శ్రద్ధ నటిస్తోందా లేక మీనాక్షి స్థానంలో ఈమెను తీసుకున్నారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో శ్రద్ధ పోష్‌లుక్‌లో అదరగొడుతోంది. బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నా.. అతని అభిమాని ఆమెకు వెల్‌కమ్‌ చెప్పడం విశేషమే మరి.