రామజన్మభూమి ట్రస్ట్ చీఫ్కు కరోనా
posted on Aug 13, 2020 2:20PM
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ కరోనా బారినపడ్డారు. రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన వారం రోజులకే ఆయనకు కరోనా సోకింది. మొదట ఆయనకు శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడటంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు మథుర వెళ్లిన ఆయన.. ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.
నృత్యగోపాల్ దాస్ కు కరోనా సోకిన విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నృత్య గోపాల్ దాస్కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే ఆయనకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా మేజిస్ట్రేట్ తో పాటు వైద్యులను సీఎం యోగి ప్రత్యేకంగా ఆదేశించారు.