ప్రభుత్వ ఏర్పాటుకు మాకే అవకాశం ఇవ్వండి
posted on Dec 10, 2018 4:17PM
గవర్నర్ నరసింహన్తో ప్రజాకూటమి నేతలు భేటీ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా తమదే అధికారం అని టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు తెరవెనుక మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీర్ఎస్కు మద్దతునిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడంతో ప్రజాకూటమి నేతలు అప్రమత్తమయ్యారు. గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు చేరుకున్నారు. అత్యధిక స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి నేతలు గవర్నర్ ను కోరారు.
కూటమి భాగస్వామ్య పక్షాలను ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతలు గవర్నన్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలు పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి కామన్ మినిమ్ ప్రోగ్రామ్ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి, షబ్బీర్అలీ, భట్టి విక్రమార్క, మధుయాష్కి, అజారుద్దీన్, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.