జగన్కు కులపిచ్చి ఉందా? పోసాని సవాల్కు సమాధానం ఇదేనా!
posted on Sep 28, 2021 6:24PM
పోసాని కృష్ణమురళి.. జనసేన అధినేత పవన్కల్యాణ్ను కార్నర్ చేసే ప్రయత్నంలో సీఎం జగన్ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి చాలా మంచోడంటూ భజన చేసే కార్యక్రమంలో.. జగన్కు కుల పిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ ప్రశ్నించారు. పోసాని ప్రశ్న విన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎవరిని పట్టుకొని ఏమని ప్రశ్నిస్తున్నారంటూ అవాక్కయ్యారు. జగన్కు కుల పిచ్చి లేదా? ఆ విషయం ఆయన వీరాభిమాని పోసానికి తెలియదా? లేక, తెలీనట్టు నటిస్తున్నారా? అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ జగన్కు కులపిచ్చి ఉందా? లేదా? అనే అంశంపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
చంద్రబాబు-కమ్మ.. జగన్ నోటి నుంచి పదే పదే వచ్చే మాట. జగన్-రెడ్డి.. పవన్కల్యాణ్ పదే పదే విమర్శించే డైలాగ్. చంద్రబాబుకు నిమ్మగడ్డకు.. చంద్రబాబుకు రామోజీరావుకు.. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి మీడియాకు.. చంద్రబాబుకు కొవాగ్జిన్కు.. కమ్మ బంధంతో ధృడమైన సంబంధం అంటగట్టి.. రాజకీయ పబ్బం గడుపుకుంటున ఘనుడు జగన్మోహన్రెడ్డి అనే విమర్శ ఉంది. ఇక తనకు మరో ప్రత్యర్థి అయిన పవన్కల్యాణ్ను.. కాపు కులంతో ఫెవికాల్ బంధంతో అతికించిందీ జగనే. ఇలా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. కమ్మ-కాపు రాజకీయం చేస్తున్న పాలకుడు జగన్ అంటారు. అలాంటి జగన్కు.. రెడ్లపై కులపిచ్చి ఉందా? అని పోసాని అమాయకంగా ప్రశ్నించడం విచిత్రంగా ఉందనే టాక్ వస్తోంది. దీనికి పవన్కల్యాణే సరైన సమాధానం చెప్పగల సమర్థుడని, జగన్ పేరును జగన్రెడ్డి అని ఫిక్స్ చేసిన పోటుగాడు పవర్స్టార్ అంటున్నారు.
ఇక, జగన్కు రెడ్లపై కులపిచ్చి ఉందా లేదా అనేది అసలు క్వశ్చన్. జగన్కు కుడి-ఎడమ భుజాల్లా ఉంటున్న విజయసాయి, సజ్జల ఇద్దరూ రెడ్లే. ఆర్థికమంత్రి బుగ్గనా రెడ్డే. ఇక పెద్దిరెడ్డి నుంచి రోజారెడ్డి వరకూ అనేక మందికి కీలక మంత్రిపదవులు, కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది జగన్రెడ్డీనే. ఏపీవ్యాప్తంగా ఇసుక మైనింగ్ అంతా అయోధ్యరామిరెడ్డికే. ఇక మెఘా కృష్ణారెడ్డితో ఆయన బంధం చెప్పనవసరమే లేదు. ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టులు.. ఆఖరికి ఏపీలో మాత్రమే లభ్యమయ్యే లిక్కర్ బ్రాండ్ల సరఫరాలో రెడ్లదే అధిపత్యం. ప్రభుత్వ సలహాదారులు, కీలక పదవుల్లో ఉన్న అధికారులు, పవర్సెంటర్లు.. ఇలా అంతటా రెడ్డి..రెడ్డి..రెడ్డినే. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రొ.కొలికపుడి శ్రీనివాసరావు లెక్కల ప్రకారం.. జగన్రెడ్డి ప్రభుత్వంలో 950 మంది రెడ్లకు పదవులు దక్కాయంటే నమ్మాల్సిందే.
మరి, రెడ్లపై ఇంతటి స్వాభిమానమున్న జగన్రెడ్డికి.. చంద్రబాబు-కమ్మ, పవన్కల్యాణ్-కాపు అంటూ కుల రాజకీయం చేయడం గురివింద గింజ తనకింద ఉన్న నలుపు ఎరగదనే సామెతలా ఉందంటున్నారు. అందరికీ తెలిసిన ఈ విషయం పోసాని కృష్ణమురళికి మాత్రం తెలీదను కోవాలా? లేక, తన సహచర కమెడియన్ పృథ్వీరాజ్కు గతంలో ఇచ్చినట్టు తనకూ ఏ ఎస్వీబీసీ ఛైర్మన్ పోస్టో.. మరేదైనా పదవో ఇవ్వాలనే తాపత్రయంతోనే జగన్కు కులపిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ పోసాని కావాలనే ఇలా జగన్రెడ్డికి వంత పాడుతున్నారని అంటున్నారు.