టిడిపి దీక్ష భగ్నం ... నిమ్స్ కు తరలింపు
posted on Mar 30, 2013 7:35AM
నాలుగు రోజులుగా టిడిపి ఎమ్మెల్యేలు కరెంట్ కోతలు, ఛార్జీల పెంపుదలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం అర్థరాత్రి ఒంటిగంటకు పోలీసులు టిడిపి దీక్షా శిబిరంపై ఆకస్మాత్తుగా దాడిచేసి ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్పీకర్ అనుమతితోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వివిధ ఆసుపత్రుల అంబులెన్స్ లలో వీరిని నిమ్స్ కు తరలించారు. ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వానికి విరుద్ధంగా చేపట్టిన నిరాహార దీక్షను ఇలా అర్థరాత్రి భగ్నం చేయడం ఎంతవరకు సబబు అని, హాస్పిటల్ కు తరలించిననంత మాత్రాన తాము దీక్ష విరబించబోమని ఆసుపత్రిలోనే దీక్షలను కొనసాగిస్తామని టిడిపి ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం అన్ని మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపడతామని కూడా వారు తెలిపారు.