రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య.. 12 ఏళ్ళుగా సహజీవనం! 

సినిమా రంగంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, రెండో పెళ్లి, విడాకులు, సహజీవనం, మళ్లీ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి రావడం, కొన్నాళ్ళకు అవి సద్దుమణగడం మనం చూస్తుంటాం. కొంత మంది విషయంలో అది పోలీసుల వరకు, కోర్టు వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో 12 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న రాజ్‌ తరుణ్‌.. మరో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనని వదిలి వెళ్లిపోయాడని, మాల్వీ కుటుంబ సభ్యులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదు పేర్కొంది లావణ్య. అయితే రాజ్‌తరుణ్‌పై గతంలో కూడా ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా అతనిపై మరో కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సినిమారంగంలోకి రాక ముందు షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పేరు తెచ్చుకున్న రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అనుకోకుండానే ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో హీరోగా మంచి ఆఫర్స్‌ వచ్చాయి. కొన్ని సినిమాలు హిట్‌ అయినా, ఎక్కువ శాతం ఫ్లాప్స్‌ రావడంతో అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. 

రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య పూర్తి వివరాలు తెలియజేస్తూ ‘అతను షార్ట్‌ ఫిలింస్‌ చేస్తున్న సమయంలోనే నాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచే మేం ప్రేమించుకుంటున్నాం. ఒకరోజు గుడిలో నాకు తాళి కట్టాడు. ఆ విషయాన్ని మా ఇద్దరి కుటుంబసభ్యులకు చెప్పాము. వారి అంగీకారంతోనే మేం కలిసి ఉంటున్నాం. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌ మోజులో పడిన రాజ్‌తరుణ్‌ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయంలో మాల్వి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావాలంటే డబ్బు ఇస్తాము రాజ్‌ని వదిలెయ్యమని చెబుతున్నారు. నేను వినకపోవడంతో కావాలని నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారు. వాస్తవానికి నాకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను 45 రోజులు జైలులో ఉంచారు. ఆ సమయంలో కూడా రాజ్‌ నన్ను సపోర్ట్‌ చెయ్యలేదు. అతను నన్ను వదిలి వెళ్ళిపోయి 3 నెలలు అవుతోంది. ఇప్పటివరకు నా మొహం చూడలేదు. మాల్వీ బ్రదర్‌ మాత్రం నన్ను బెదిరిస్తున్నాడు. మేం చెప్పినట్టు వినకపోతే నిన్ను చంపి బాడీని కూడా మాయం చేస్తానని భయపెడుతున్నాడు. అందుకే రాజ్‌ తరుణ్‌పై, మాల్వీపై, ఆమె బ్రదర్‌పై కూడా కేసు పెట్టాను. నా డిమాండ్‌ ఒక్కటే. నాకు రాజ్‌ కావాలి. అతనే నా ప్రపంచం. నాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాను’ అని వివరించారు లావణ్య.