బీజేపీ చీఫ్ తో పవన్ భేటీ... కేంద్రం మనసులో మాట తెలిసిపోయింది!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ ఎంపీ జీవీఎల్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. రాజధాని అమరావతి తరలింపుతో పాటు అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలను పవన్, నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు తనకు స్పష్టం చేశారని పవన్ చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అసత్య ప్రచారాన్ని.. జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని పవన్ ఆరోపించారు.