మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు!
posted on Dec 1, 2025 10:11AM

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పోలీసులకు ఇప్పుడు మంత్రుల వ్యక్తిగత సహాయకుల నేరాల దర్యాప్తు, విచారణ అదనపు భారంగా మారుతోంది.
గతంలో హోం మంత్రి అనిత పిఏ జగదీశ్ ఆగడాలపై ఏకంగా కూటమి నేతలే ఫిర్యాదు చేశారు అతగా డి సెటిల్మెంట్ల వ్యవహారం చూసి తెలుగు తమ్ముళ్లే విస్తుపోయారు. ఏకంగా మంత్రి పీఏగా ఉంటూ.. వైసీపీ లీడర్లలకు పనులు చేసి పెట్టడంపై అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. హోం మంత్రి అనిత అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
తాజాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార వ్యక్తిగత సహాయకుడు సతీష్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య మెసేజీలతో వేధింపులకు గురి చేసిన ఉదంతం కలకలం రేపింది. అతడి వైధింపులు భరించలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన సీఎంవో.. అతడిని తొలగించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే ఈ వ్యవహారంపై గుమ్మడి సంధ్యారాణి లక్ష్యంగా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి అయితే.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న సంధ్యారాణి ఒక మహిళ ఆవేదన అర్ధం చేసుకోక పోగా.. తన పీఏకి వంతపాడుతున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి సంధ్యారాణికి తన గోడు వెళ్లబోసుకుంటే, ఆమె రివర్స్ లో తనపైనే దుర్భాష లాడారని బాధితురాలు వాపోయిన సంగతిని పుష్ప శ్రీవాణి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదనీ, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.