అగ్రిగోల్డ్ బాధితుల సంగతేంటీ! జగన్ కు రఘురామ ఐదో లేఖ..
posted on Jun 14, 2021 11:37AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై పోరాటం కొనసాగిస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. కొన్ని రోజులుగా రోజుకో సమస్యపై సర్కార్ ను నిలదీస్తున్న రఘురామ... సీఎం జగన్ కు ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1,100 కోట్లను వెంటనే విడుదల చేయాలని రఘురామ ఆ లేఖ ద్వారా కోరారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలన్నారు రఘురామ రాజు.
అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని ఎంపీ రఘురామ రాజు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితులను ఆదుకునేందుకు రూ.1,100 కోట్లు విడుదల చేస్తామని జగన్ అప్పట్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇటీవలే ఆయన వరుసగా వృద్ధాప్య పింఛన్లు, ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ విధానం రద్దు, పెళ్లి కానుక, షాదీ ముబారక్, ఉద్యోగాల క్యాలెండర్ వంటి అంశాలను ప్రస్తావించి ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.