పది కుక్కలు.. బాలికను చంపేశాయి

 

గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామంలో ఘోరం జరిగింది. షేక్ కౌషర అనే ఆరేళ్ళ బాలిక మీద పది కుక్కలు ఒకేసారి దాడిచేసి చంపేశాయి. ఈ పాప తన ఇంటి ముందే ఆడుకుంటూ వుండగా ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలో ఇటీవలి కాలంలో పిచ్చికుక్కల బెడద పెరిగిపోయింది. జనం ఇళ్ళలోంచి బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. కుక్కల దాడి కారణంగా బాలిక మరణించడంతో ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలిక మృతదేహంతో గుంటూరు - కాకుమాను రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలికను కుక్కలు చంపిన ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో, రాష్ట్రంలో పిచ్చికుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.