తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక.. ఎన్టీఆర్
posted on Jan 18, 2026 11:59AM

తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది .ఆ గర్జన దావానలంలా వ్యాపించి, తెలుగు వాడి వాడి, వేడి, పౌరుష ప్రతాపాలు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ఎన్టీఆర్ ఒక సైన్యం. ఎన్టీఆర్ ఒక ప్రేరణ. ఎన్టీఆర్ మాటే వేదం, ఎన్టీఆర్ పిలుపే ప్రభంజనం. ఆయన తెలుగు జాతి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ.. సంక్షేమ రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఆరు దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు సైతం పోషించి మెప్పించారు. ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి వాటికి జీవం పోశారు. ఎన్టీఆర్ శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రదాత ఎన్టీఆర్. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు.
కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే ఎన్టీఆర్ ఆశయం. నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడితే... తెలుగు జాతి ఖ్యాతిని పునర్జీవింప చేయడానికి తన 60 వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారు ఎన్టీఆర్. 9 నెలల కాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగుదేశం బావుటాను ఎగురవేశారు.
అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ను గద్దెదింపినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆయన విజయం సాధించిన తీరు నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. నాడు ఆయన చూపిన ధైర్య సాహసాలు రాజకీయ రంగలోనూ ఆయనను రారాజుగా నిలిపాయి. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, సామాజిక పింఛన్లు వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆది గురువు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ, అదే నీటితో చెన్నై వాసుల దాహార్తి తీర్చడం, మహిళా విశ్వవిద్యాలయం, ప్రజా సదస్సులు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, అధికార వికేంద్రీకరణ, ప్రజల వద్దకే పాల, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు, స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునుపు అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. తెలుగుశం పార్టీ ఆవిర్బావంతో ఆ పరిస్థితి మారిపోయింది. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలవారికి పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. అన్ని వర్గాలలో యువతరానికి చెందిన సామాన్యులకు, విద్యావంతులకు, మహిళల పార్టీ టికెట్లు కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించారు. ఎందరో కొత్తవారిని, విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజా నాయకుడిలా చరిత్రలో నిలిచారు. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచిలా నిలిచారు ఎన్టీఆర్.
జాతీయ పార్టీల నాయకులు వారి ఇలాకాలకే పరిమితమైన వేళ, ఎన్టీఆర్ తన చరిష్మాతో జాతీయ నేతగా ఎదిగారు. ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలను తన సమర స్ఫూర్తితో అధిగమించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విజయ దుందుభి మ్రోగేలా చేశారు. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాల్లో 35 గెలిచి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదా సాధించింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు నిర్వహించారు. ఉప్పు నిప్పులా ఉండే వామపక్షాలు, భారతీయ జనతా పార్టీల మద్ధతును ఎన్టీఆర్ కూడ గట్టారు. జాతీయ రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.
పార్టీ ఆవిర్భావం నుండి స్పష్టమైన సిద్దాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. దేశ రాజకీయాలలో ఎన్టీఆర్ వంటి ప్రజా నాయకుడు మరొకరులేరు, ఉండబోరు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం.