కేటీఆర్ ఫామ్‌హౌస్.. ఈరోజు కూల్చడం ఖాయం..!

హైదరాబాద్‌లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువుల ఉనికినే దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. గత వారం పది రోజులుగా హైడ్రా ధాటికి వందల కొద్దీ భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్నా చితకా భవనాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద అపార్టమెంట్ల వరకు దేనినీ వదలడం లేదు. అన్నిటినీ చితమంటల్లోకి నెట్టేస్తోంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా... నిబంధనల అతిక్రమణ జరిగిందా.. అయితే కూల్చేయ్.. ఇదీ హైడ్రా వరస. హైదరాబాద్‌లో ఇంతవరకు కనీ వినీ ఎరుగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనసులో ఇంకా ఏయే ఆలోచనలు వున్నాయో.. ఇంకా ఏ రేంజ్‌లో కూల్చివేతలు జరగబోతున్నాయో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. 

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ని హైడ్రా కూల్చేయడంతో ఇక హైడ్రా ఎంతవారి ఆస్తులనైనా కూల్చేయడం ఖాయమన్న సందేశం అందర్లోకి వెళ్లింది. దాంతో చాలామంది ప్రముఖల గుండెలు దడదడలాడుతున్నాన్నాయి. నాగార్జున కన్వెన్షన్‌ని కూల్చిన తర్వాత హైడ్రా రెండు రోజులపాటు నిశ్శబ్దంగా వుంది. మొన్న ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్‌ని కూల్చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. సోమ, మంగళవారాల్లో కూడా హైడ్రా నిశ్శబ్దంగా వుంది. 

ఈ నేపథ్యంలో బుధవారం నాడు కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదేళ్ళు అధికారం చెలాయించిన పార్టీకి చెందిన నాయకుడి ఫామ్ హౌస్ కాబట్టి బీఆర్ఎస్‌కి చెందిన నాయకులు నిరసన కార్యక్రమాలు జరిపే అవకాశం వుంది కాబట్టి, పూర్తిగా పోలీసు బలగాలతో ఆ ప్రాంతం మొత్తాన్నీ కట్టడి చేసి, కూల్చివేతలు నిర్వహించాలన్నది హైడ్రా ప్లాన్‌గా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లోని జంట జాలాశయాల పరిధిలో 111 జీవో అమలులో వుంది. అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్‌లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ఇక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్‌హౌస్‌ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ప్రారంభం కాలేదు.. ఆ ఒక్కదానితో ముగిసేదీ కాదు.. ఏది ఏమైనప్పటికీ ఈ బుధవారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారనే అనుమానాలు అయితే బలంగా వున్నాయి.

ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా ఫ్రెండ్‌ది.. నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏవైనా అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా ప్రకటించారు. దానితోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధలకు వ్యతిరేకంగా వుంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్‌దిగా భావిస్తున్న ఫామ్‌హౌస్‌ని కూల్చేయాలని పలువుని నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూలగొట్టవద్దు అని చెప్పలేదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందువల్ల లైన్ మొత్తం క్లియర్‌గా వుంది.. ఇక కూలగొట్టడమే మిగిలి వుందని, ఆ కార్యక్రమం బుధవారం నాడు పూర్తి అవబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కూల్చివేతలు నిర్వహించే వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, ఫామ్‌హౌస్ కూలగొట్టకుండా ఆపే పరిస్థితి లేకపోవడంతో సదరు ఫామ్‌హౌస్‌లోని సామాను మొత్తాన్నీ కేటీఆర్ అక్కడ నుంచి తరలించినట్టు సమాచారం. లోపల ఇంద్రభవనంలా వుండే ఫామ్‌హౌస్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన చాలా సామాను వుంది. ఆ సామాను మొత్తాన్నీ అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్‌లో పూచిక పుల్ల కూడా లేకుండా మొత్తం తరలించేశారు. కూల్చివేతకు కేటీఆర్ మానసికంగా సిద్ధపడే ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాకి లైన్ క్లియర్‌గా వుంది. కూల్చేయడమే మిగిలివుంది.