గుడివాడలో కొడాలి నాని గెలుపు ఆశలు ఆవిరి?!
posted on Apr 4, 2024 11:41AM
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీతో పాటు కూటమి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో పల్లెలు, పట్టణాల్లో ఎన్నికల కొలాహలం నెలకొంది. ఈ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం హాట్ సీట్లలో ఒకటిగా ఉందనడంలో సందేహం లేదు. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని మరోసారి బరిలోకి దిగారు. కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థిగా వెనిగండ్ల రాము బరిలో ఉన్నారు. కాడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తాజా సర్వేలో గుడివాడలో కొడాలినానికి ఈసారి ఓటమి తప్పదని తేలింది. దీనికితోడు నియోజకవర్గంలో కొడాలి నానిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐదు రోజుల క్రితం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కొడాలి నాని.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నానికి ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. తమ సమస్యలపై ప్రజలు నాని ని నిలదీస్తున్నారు.
ఏపీ రాజకీయాలపై అవగాహనఉన్న ప్రతిఒక్కరికి కొడాలి నాని పేరు చెప్పగా ముందుగా గుర్తుకొచ్చేది బూతుల ఎమ్మెల్యే అనే. నాని గుడివాడ నియోజకవర్గంలో వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కొడాలి నానిని క్యాబినెట్లోకి తీసుకున్నాడు. అప్పటి నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్తో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులపైన అభ్యంతరకర వ్యాఖ్యలతో కొడాలి నాని విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో నారా, నందమూరి కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొడాలి విజయాల పరంపరకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కొడాలి నానికి పోటీగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా వెనిగండ్ల రాము బరిలో నిలిచాడు. రాము నియోకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచిసైతం మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం అభ్యర్థికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. దీంతో గుడివాడలో కొడాలి నానికి ఈసారి ఓటమి తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా సర్వే సైతం అదే చెప్పింది.
గుడివాడలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల ప్రచారంలో సమస్యలపై కొడాలిని ప్రజలు నిలదీస్తున్నారు. అడుగడుగునా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. తాజాగా గుడ్మాన్పేట మహిళలు కొడాలి నానిని సమస్యలపై నిలదీశారు. తాగునీటి సమస్య, ఇండ్ల పట్టాలపై మహిళలు నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని, ఎందుకు అలా చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొడాలి నాని ఆర్డీవోకు ఫోన్ చేసి మహిళలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సూచించాడు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది.. సాధ్యం కాదని ఆర్డీవో చెప్పారు. మహిళల నుంచి ఎదురవుతున్న నిరసనను తప్పించుకునేందుకు కోడ్ అమల్లో ఉందని తెలిసినా ఆర్డీవోకు నాని ఫోన్ చేశారని, కోడ్ లో ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వరని తెలియదా కొడాలి నానికి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొడాలి నానికి గుణపాఠం చెబుతామని, ఓటు ద్వారా బుద్దిచెబుతామని వారు హెచ్చరించారు. నియోకవర్గంలో ప్రతీ గ్రామంలోనూ కొడాలికి గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దీంతో కొడాలి వర్గీయులు సైతం ఆందోళనలో ఉన్నారు.
వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి నాని.. ఐదోసారి విజేతగా నిలవాలని భావిస్తున్నాడు. అయితే, ఈ సారి కొడాలికి భారీ షాకిచ్చేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పలు సర్వేల ఫలితాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పేరున్న సంస్థల సర్వేలు విడుదల చేసిన ఫలితాల్లో గుడివాడ నియోకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థి వెనిగడ్ల రాము విజయం సాధించబోతున్నారని పేర్కొన్నాయి. గత 20ఏళ్లుగా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా కొడాలి నాని కొనసాగుతున్నప్పటికీ.. అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని, దీనికితోడు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైందని అంటున్నారు. మొత్తానికి బూతుల ఎమ్మెల్యేగా పేరుగడించిన కొడాలి నానికి ఈసారి గుడివాడ ప్రజలు బిగ్ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.