జగన్ కొత్త ఇంట్లో కేసీఆర్ అడుగు
posted on Jan 17, 2019 10:26AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫెడరల్ ఫ్రెంట్ పై చర్చించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో లోటస్ పాండ్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. భవిషత్తులో కేసీఆర్ సైతం జగన్ తో సమావేశం అవ్వనున్నట్లు ఇరువురు నేతలు స్పష్టం చేశారు. కాగా ఆ భేటీ ఎప్పుడు,ఎక్కడ ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ భేటీకి దాదాపు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కేసీఆర్ వచ్చే నెల 14వ తేదీన అమరావతి రానున్నట్టు తెలుస్తోంది. అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తాను గృహప్రవేశం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావాలని జగన్.. కేసీఆర్ను ఆహ్వానించినట్టు సమాచారం. చర్చల సారాంశాన్ని కేటీఆర్..జగన్ సమక్షంలోనే కేసీఆర్కు ఫోన్లో వివరించారు. కేసీఆర్ జగన్తోనూ ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలోనే కేసీఆర్ ను జగన్ ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరై.. ఫెడరల్ ఫ్రంట్పై అక్కడే చర్చించాలని కేసీఆర్ కూడా నిర్ణయించినట్టు సమాచారం.