20 వేలకు అమ్ముడుబోయిన ఓటర్లు....
posted on Jan 5, 2018 4:29PM
గతకొద్దికాలంగా పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తూ కమల్ హాసన్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఆర్కేనగర్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం... ఇటీవలే ఆర్కే నగర్ ఉపఎన్నిక జరిగింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దినకరన్ గెలుపొందారు. ఇక ఈ ఫలితాలపై స్పందించిన కమల్ హాసన్.. అక్కడ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయి తమ జీవితాన్ని తామే సమస్యల్లో నెట్టుకున్నారని కమల్ వ్యాఖ్యానించారు. ఈ ఓట్ల కొనుగోలుతో ఓ సారి ఎన్నికలు ఆగిపోయినా రెండోసారి కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదని... అధికార పార్టీ ఒక్కో ఓటుకి 6 వేల రూపాయలు ఇస్తే , స్వతంత్ర అభ్యర్థి 20 వేలు ఇచ్చాడని కమల్ చెప్పుకొచ్చారు. ఆ 20 వేలకు అమ్ముడుబోయిన ఓటర్లు బిక్షమెత్తినట్టే అని కమల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి నీచమైన సంఘటన ఇంకెక్కడైనా చూడగలమా అంటూ కమల్ ప్రశ్నించారు. ఇక కమల్ చేసిన వ్యాఖ్యలు ఒక్క తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.