రైతన్నా.. ఇదిగో ఐప్యాడ్!

 

తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇచ్చిన ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థుల నుంచి జేజేలు అందుకుంటున్నారు. అదే బాటలో నడుస్తూ అందరికీ అన్నం పెట్టే అన్నదాతకి ఐప్యాడ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవడానికి ఈ ఐప్యాడ్‌లు ఎంతో ఉపయోగపడే అవకాశం వున్న నేపథ్యంలో ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఉపగ్రహం నుంచి రైతుల ఐప్యాడ్‌లకు నేరుగా సమాచారం అందేలా కూడా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి, భూసార పరీక్షలు, విత్తనాల సమాచారం, ఎరువులు, పంట మార్కెటింగ్... ఇలాంటి విషయాలన్నిటిలో ఐప్యాడ్‌లు రైతుకు చేదోడు వాదోడుగా వుంటాయని భావిస్తున్నారు.