జనవరి 5న వైజాగ్ లో ఐ.ఐ.యం. ప్రారంభోత్సవం
posted on Dec 27, 2014 8:42PM
.jpg)
రాష్ట్ర విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు కూడా ఒకటి. దీనిని వైజాగ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. వైజాగ్ లో ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్న మధురవాడకు అతి సమీపంలో గల గంభీరం అనే ప్రాంతంలో ఈ సుప్రసిద్ధ ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటుకి ప్రభుత్వం భూమిని కేటాయించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర బృందం దీనిని పరిశీలించి వెళ్ళింది. అయితే అక్కడ శాశ్విత భవనాలు నిర్మించేందుకు కనీసం ఒకటి రెండు సం.లు పడుతుంది. కనుక అంతవరకు ఆగకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండే ఐఐఎం కోర్సులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉండటంతో, వైజాగ్ ఆంధ్రాయూనివర్సిటీలో గల సువిశాలమయిన ఆంద్ర బ్యాంక్ మేనేజ్ మెంట్ భవన సముదాయాన్ని ఐఐఎం సంస్థకు కేటాయించారు. దానిని ప్రారంభించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ వచ్చేనెల 5న వైజాగ్ కి వస్తున్నారు. ఐఐఎంకు శాశ్విత భవనాలు నిర్మింపబడే వరకు అక్కడే తరగతులు నిర్వహించబడతాయి.