అంబర్పేట, బీహెచ్ఈఎల్ ఫైవంతెను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
posted on May 5, 2025 8:34PM
.webp)
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట, బీహెచ్ఈఎల్ కూడలిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని గడ్కరీ అన్నారు. రహదారుల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగా జరగడం లేదన్నారు. అందుకే పనులు వేగంగా చేసేలా కొత్త కాంట్రాక్టర్ను మార్చామని, పది నెలల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పారు.‘‘హైదరాబాద్లో ఐటీతోపాటు ఫార్మా రంగం కూడా పెద్దదే. దేశంలోని ఎన్నో నగరాల నుంచి హైదరాబాద్కు వస్తుంటారు.
అన్ని ప్రధాన నగరాలను హైదరాబాద్కు కనెక్ట్ చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ నేతృత్వంలో మేమంతా కట్టుబడి ఉన్నాం. ఇండోర్- హైదరాబాద్ కారిడార్ తెలంగాణ పనులు పూర్తి చేశాం. మహారాష్ట్రలో కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ కారిడార్ పూర్తయితే 20 గంటల ప్రయాణం 10 గంటల్లోనే చేయొచ్చు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ - విజయవాడ 4 లైన్ల రోడ్డును 6 లైన్లుగా మారుస్తామన్నారు. గడ్కరీ కృషి వల్ల దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా జాతీయ రహదారులు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాటి ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయన్నారు. ‘‘అమెరికాను తలదన్నేలా భారత్లో జాతీయ రహదారులు ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గరకు ఏ పార్టీ ఎంపీ వెళ్లి అడిగినా కాదనకుండా ఇస్తారు. ఆయన్ను ఫ్లై ఓవర్ల మంత్రి అని కూడా పిలుస్తుంటారు. అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించుకున్నప్పటికీ సర్వీస్ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడంతో సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆయా ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి చేయాలి’’ అని కిషన్రెడ్డి సూచించారు.