హరికృష్ణకు ఇదీ పాయే..!

 

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ పదవిపై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పదవిలో ఎవరిని నియమించాలో తెలియక తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ రేసులో పలువురు పేర్లు వినిపించినా.. ఆఖరికి ఈ పదవి నందమూరి హరికృష్ణకే దక్కనుందని... చంద్రబాబు కూడా ఆయనకే ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాదన కూడా వినిపించింది.. త‌న త‌న‌యుడు లోకేష్ భ‌విష్య‌త్ కోసం చంద్ర‌బాబు వేస్తున్న ఎత్తుగడల్లో ఇది ఒకటని.. నందమూరి కుటుంబాన్ని మ‌ళ్లీ త‌న‌వైపు తిప్పుకునేందుకు ఇలాంటి ఎత్తుగ‌డులు వేస్తున్నారని అనుకున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా  హరికృష్ణ‌కు కట్టబెట్టేందుకు సిద్దమయ్యారని రాజకీయ వర్గాల టాక్. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ... ఇప్పుడు ఈరేసులో మరో కొత్త పేరు వచ్చి చేరింది. వ్యాపారవేత్త రవిశంకర్ నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో ఈ నియామకానికి సంబంధించిన జీవో జారీకానున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ ఓ బడా పారిశ్రామికవేత్త. టీటీడీ ఛైర్మన్ గా ఆయన ఎంపికైతే... ఏడాది కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. దీంతో ఈ పదవిపై ఎంతో ఆశ పెట్టుకున్న హరికృష్ణకు నిరాశే ఎదురుకానుంది. మరి ఇప్పటికే చంద్రబాబు, హరికృష్ణ మధ్య సంబంధాలు కాస్త దూరంగా ఉన్నాయి... ఇప్పుడు ఈ నిర్ణయంతో ఇంకెంత దూరమవుతాయో...